కవిచంద్రునికి రచయితల నూలుపోగు- అలరించిన ‘కన్యాశుల్కం’ కైమోడ్పు – వార్త
[విశాఖపట్టణంలో జరిగిన ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన వార్తని అందిస్తున్నారు మల్లాప్రగడ రామారావు.]
“సాయంకాలమైంది” అన్న గిరీశం మాటలు ప్రస్తావిస్తూ, రావిశాస్త్రి, “మానవమాత్రుడు ఇలా రాయగలడా?” అన్నారని విన్నాను. ఈ వాక్యం తోటే మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’ ప్రారంభమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నాటకం ఎన్నాళ్ళకీ నిత్యనూతనమే.
కన్యాశుల్క దురాచారం వరకట్నం పిశాచంగా మారినందుకు కాదు. ఈ దయ్యమూ వదిలినా ‘కన్యాశుల్కం’ నాటకం నవనవోన్మేషమే. ఎందుకంటే మానవలోకంలో ఎల్లప్పుడూ గిరీశాలూ, లుబ్దావధాన్లూ, పూటకూళ్ళమ్మలూ, సుబ్బమ్మలూ మాత్రమే కాదు హెడ్ కానిస్టీబుల్లూ, బైరాగులూ, కన్యాశుల్కం స్త్రీ పురుషులందరూ కాలానుగుణమైన వేషభాషలతో అన్నియుగాలలోనూ సంచరిస్తూనే ఉంటారు.
సకృత్తుగా మధురవాణిలూ, సౌజన్యారావు పంతుళ్ళూ అవతరిస్తూ ఉంటారు. ఈ స్పృహతో, విశాఖపట్నం రచయితలు కొందరు ఈ సజీవ నాటకాన్ని కుదించైనా ప్రదర్శించాలని కంటున్న కల పది సంవత్సరాల తర్వాత, మహాకవి 109 వర్థంతికి రెండు రోజులు ముందుగా, నవంబర్ 28న నిజమైంది. కారణాంతరాల వల్ల ఇందుకు వేదికైన విశాఖ పౌర గ్రంథాలయం సమావేశమందిరం ప్రేక్షకుల ఒత్తిడికి ఉక్కిరి బిక్కిరయింది.
ఈ సంకల్పం చెప్పుకున్న కవి, విమర్శకుడు రామతీర్థ, రంగస్థల ప్రయోక్త బాదంగీర్ సాయి ఇద్దరూ కీర్తిశేషులయినప్పటికీ, మిగిలిన నేస్తులు రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి. రమణమూర్తి సౌజన్యతో, పేరి రవికుమార్ సారథ్యంలో, మూల నాటకంలోని మాటలను మార్చకుండా గంటకు కుదించిన “కన్యాశుల్కం” ప్రదర్శించి రసజ్ఞుల ప్రశంసలకు పాత్రులైనారు.


కరటక శాస్త్రులు (సి.హెచ్.చిన సూర్యనారాయణ), వెంకమ్మ (రాధా రాణి), వెంకటేశం (ఓలేటి శంకర్), అగ్నిహోత్రావధానులు (పిళ్ళా రమణమూర్తి), గిరీశం (రాంభట్ల నృసింహ శర్మ)
రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందిన రాంభట్ల నృసింహశర్మ రచించగా, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గురజాడ అప్పారావు గేయాన్ని వినిపించిన తర్వాత, డా.డి.వి.సూర్యారావు గురజాడ రూపుదాల్చి, నాటక రచనలో కవి ఆంతర్యాన్ని ప్రకటించిన అనంతరం నాటక ప్రదర్శన మొదలయ్యింది.
ఆరు పర్యాయాలు రిహార్సల్స్ చేసి పురుష పాత్రధారులుగా రూపాంతరం చెందిన రచయితలు నటులుగానూ ఔననిపించుకున్నారు.
గిరీశం పాత్రలో రాంభట్ల నృసింహశర్మ, వెంకటేశం పాత్రలో ఓలేటి శంకర్, రామప్పపంతులు పాత్రలో పేరి రవికుమార్, అగ్నిహోత్రావధాన్లుగా పిల్లా రమణమూర్తి, కరకటశాస్త్రి పాత్రలో సిహెచ్.చిన సూర్యనారాయణ, లుబ్ధావధాన్లు పాత్రలో వి.వి.రమణమూర్తి, సౌజన్యారావు పంతులుగా కొచ్చర్లకోట సత్యనారాయణమూర్తి, నటించారు.


లుబ్దావధాన్లు (వి.వి. రమణమూర్తి, సంపాదకుడు ‘లీడర్’ దినపత్రిక), మధురవాణి( సుప్రియ)
వృత్తి రీత్యా నటులైన సుప్రియ, శివజ్యోతి మధురవాణిగా పూటకూళ్ళమ్మగా మెప్పించారు.
రాంభట్ల రచించిన ఉపక్రమణికను, సన్నివేశాల మధ్య వచ్చే పేరి రవికుమార్ రచించిన కథానుసంధానాన్ని శ్రీ మేడా మస్తాన్రెడ్డి తన బాణిలో వినిపించారు.
రంగాలంకరణను, నటుల అలంకరణను నవరసమూర్తి సమకూర్చారు. పి.రాజు సంగీతాన్ని అందించారు.
ప్రదర్శనానంతరం ఎవరూ అడగకుండానే మ్రోగిన చప్పట్లే నట రచయితల కృషి సఫలతకు నిదర్శనం.
3 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది శ్రీకంఠ స్ఫూర్తి గారి వ్యాఖ్య: *బహు బాగు బాగు.. కన్యాశుల్కం నాటక ప్రదర్శన వార్తా కథనం.. అభినందన వందనం! – శ్రీకంఠ స్ఫూర్తి.*
కొల్లూరి సోమ శంకర్
ఇది ద్విభాష్యం రాజేశ్వరరావు గారి స్పందన: *






– ద్విభాష్యం రాజేశ్వరరావు*.
శాంతారామ్
విశాఖపట్నంలో ప్రదర్శింపబడిన కన్యాశుల్కం నాటకం పైన మల్లాప్రగడ రామారావు గారు పంపిన వార్తపై నా స్పందన:
కన్యాశుల్కం నాటకం పైన మీ విహంగవీక్షణం అద్భుతంగా అలరింది నాటి మాట, అదిరింది నేటి మాట.
వివరణ:
ఏనాటకమైన చూస్తున్నప్పుడు పాత్రల నటన, వాచకం (డైలాగ్ డెలివరీ) మొదలైనవి, మనల్ని (ప్రేక్షకులను) మైమరిపించి, అద్భుతంగా వుంది నాటకం అని ప్రశంసలు కురిపించడం సహజం.
కాని అంత హృద్యమైన ప్రదర్శనకు నేపథ్యంలో (తెరవెనుక) కృషిచేసిన కృషీవలులు, రచయిత, మేకప్ మేన్, రంగన్థలాన్ని అలంకరణ చేసిన వారు ఇలా వివిధ రంగాల్లో ప్రావీణ్యం వున్నవారి పూనిక, సహకారంతో మాత్రమే ప్రదర్శన రక్తి కడుతుంది అన్నది అరుదుగా పరిగణనలోకి తీసుకుంటారు అని భావిస్తున్నాను.
అయితే రామారావు గారు ఈ విహంగ వీక్షణలో వాటికి కూడా ప్రాధాన్యతని ఇవ్వడం, ముదావహం.
అలాగే విశ్వ విఖ్యాత నాటక రచయిత “శ్రీ గురజాడ”
వారికి ‘కవిచంద్రునికి రచయితల నూలుపోగు” అని హృదయ పూర్వకంగా ఆవిష్కరించడం, “చంద్రునికొక నూలు పోగు” అనే నానుడి ని ఇనుమడింశజేస్తూ, ఆ చంద్ర తారార్కం నిలుస్తుంది అని ధ్వనించే విధంగా సంబోధించడం ప్రశంసనీయం.
ఇంక అలరించిన ‘కన్యాశుల్కం’ కైమోడ్పు’ ఈ పదం “కన్యాశుల్కం” నాటకాన్ని వివిధ కోణాల్లో, మదిలో, మధించగా వచ్చిన నవనీతంగా భావిస్తున్నాను.
కారణం ఏకకాలంలో (భూయాత్, భవిష్యత్, వర్తమానాల లో నైనా) ఈ నాటకం చదివినా, దర్శించినా నవ్యతను సంతరించుకుని, వర్తమానానికి వర్తించే విధంగా ప్రేక్షకుల మదిలో నర్తిస్తుంది అన్నది నిర్వివాదాంశం.
నా ప్రత్యక్ష అనుభవం:
ఈ నాటకాన్ని 50 సంవత్సరాల కిందట అఫీషియల్ కాలనీలో ఉన్నప్పుడు, కలెక్టర్ ఆఫీస్ లో వేదిక అప్పుడు దానికి “గురజాడ కళా వేదిక” అని పేరు ఉండేదని జ్ఞాపకం. అందులో కీర్తిశేషులు జె. వి. సోమయాజులు గారు, రమణమూర్తి గారు, మెదలైన వారు నటించినది చూసే అదృష్టం కలిగినది.
అలాగే నేను ఉద్యోగం చేసినా విశాఖపట్నం పోర్ట్ వారి నిర్వహణలో జరిగిన, ఇంటర్ డిపార్ట్మెంట్ నాటక పోటీల్లో వేసింది చూశాను.
కన్యాశుల్కం సినిమా కూడా చూశాను.
సినిమా కంటే నాటకమే అద్భుతంగా వుంది అని మాత్రం చెప్పగలను.
ఏదైనా, ఒక మంచి నాటకం గూర్చి చర్చించుకొనుట కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
శుభం భూయాత్
శాంతారామ్