[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


వయసు మళ్ళాక..!!
మనిషి అన్నవాడు పుట్టాక, మరణించే వరకూ జీవితంలో ఎన్నో మార్పులూ చేర్పులూ సంభవిస్తుంటాయి. ఎవరికైనా ఇది తప్పదు. ఇందులో బాల్యం నుండి యవ్వన దశ వచ్చి, చదువుసంధ్యలు పూర్తి చేసుకుని, ఉద్యోగమూ పెళ్లి అనేవి జరిగేవరకూ తప్పనిసరిగా తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. కొంతమంది జీవితంలో స్థిరపడకపోయిన, ఉద్యోగం సద్యోగం లేకున్నా పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేదా తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసేసాం అని చేతులు దులిపేసుకోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి.
పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి వారి పద్ధతుల్లో వాళ్ళు స్థిరపడిపోయాక, తల్లిదందుల పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు ఎలా వున్నా, ఇప్పుడు తల్లిదండ్రులది ఏకాంత జీవితమే. అంటే పిల్లలు ఇతర జిల్లాలలోనో, ఇతర రాష్ట్రాలలోనూ, లేదా ఇతర దేశాలలోనూ, ఉద్యోగరీత్యానో, ఇతర కారణాల వల్లనో, ఆయా ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ స్థిరపడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇంటిదగ్గర తల్లిదండ్రులది ఒంటరి జీవితమే అవుతున్నది. ఆ తల్లిదండ్రులు ఉద్యోగస్థులైతే, పదవీ విరమణ తర్వాత ఇలాంటి ఒంటరి జీవితం ఏర్పడుతుంది. మిగతా వారికి పిల్లలు, వారిని వదిలి వెళ్ళినప్పటినుండీ ఒంటరి జీవితమే!
ఈ వంటరి జీవితాలు వారిలో జవసత్వాలు ఉన్నంతవరకూ సాఫీగానే సాగిపోతుంది. తర్వాత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు అనుకూలం వున్నలేదా హృదయమున్న పిల్లలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని చనిపోయేవరకు తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకునే పిల్లలు వున్నారు. అలా కాకుండా పెద్దలకు ఇష్టం లేకపోయినా, వృద్ధాశ్రమాలకు నెట్టివేసే పిల్లలూ మన సమాజంలో మెండుగా కనిపిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు తల్లిదండ్రులు, ఒకరు పొతే మరొకరు భరించలేని సున్నిత హృదయులు, నేను ముందు చనిపోవాలంటే, నేను ముందని వాదులాడుకోవడమూ గమనిస్తుంటాం. కొందరు స్త్రీలు తాము సుమంగళి గానే ముందుపోవాలని, వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ వుంటారు. పూర్తిగా భార్య మీదనే అన్నింటికీ ఆధారపడడం అలవాటైన భర్తలు తామే ముందుపోవాలని కోరుకుంటారు. ఇవన్నీ ప్రతిచోటా కనిపంచేవే అయితే, భర్త పోయిన భార్య కొంతకాలం బాధపడినా, తర్వాత మామూలు జీవితానికి అలవడే ప్రయత్నం చేస్తారు. కానీ, భార్యను కోల్పోయిన భర్తలు చాలామట్టుకు ఎక్కువకాలం బ్రతకరు.
పిల్లలు తమ జీవితాలలో స్థిరపడిపోయాక, ఏకాంత జీవితం గడిపే, తల్లి గానీ తండ్రి గానీ, పునర్వివాహంకోసం ప్రయత్నించేవాళ్లూ లేకపోలేదు. కొందరికి చివరి దశలో ఒక తోడు ఉండాలనే కోరిక అయితే, మరికొందరు,అప్పటికీ ఇగిరిపోని శృంగార జీవితాన్ని కొనసాగించాలనే దిశలో కొందరు ఆత్రుత పడుతుంటారు. 60 ఏళ్ళు దాటిన తర్వాత శృంగార జీవితాన్ని కోరుకునే స్త్రీలు బహుతక్కువ. అలాంటి వారు తొందరపడి పునర్వివాహం చేసుకుంటే, పెళ్లి చేసుకున్న ఆనందం బహు స్వల్పకాలంలోనే ఆవిరి అయిపోతుంది. భర్తలు చనిపోయినా, విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధ మహిళలు కొందరు, తమను ప్రేమగా చూసుకుని, ఎలాంటి శారీరక సుఖాలను ఆశించకుండా, తమకు సేవచేసే పురుషులను కోరుకుంటారట. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. ఏమో, ఎక్కడైనా వెదికితే కొన్ని ఉదాహరణలు దొరుకుతాయేమో! ఇలా ప్రతి స్త్రీ జీవితమూ, మరణించే వరకూ వివిధ రూపాల్లో విశ్రాంతి దొరకని శ్రామికురాలిగా ముగిసిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, వృద్ధాప్యం వచ్చిన తల్లి గానీ, తండ్రి గానీ, పునర్వివాహం చేసుకోవడానికి ఎంతమంది పిల్లలు అనుమతి ముద్ర వేస్తారు? కొంతమంది పిల్లలు తమ స్వార్థం కోసం సేవ చేయించుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. మరి కొందరు, సంస్కృతి, సాంప్రదాయాలూ చట్టుబండలూ అంటూ వాటిని పట్టుకుని వ్రేలాడే చాదస్తులూ ఉండవచ్చు. అలా కొందరు అసంతృప్తికి లోనై అతిత్వరగా జీవితాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తే, మరికొందరు పిల్లలతో మనుమలతో, మునిమనుమలతో బ్రతికినంత కాలం సంతోషకరమైన జీవితాన్ని గడిపినవారు వున్నారు. వృద్ధాప్యం వచ్చినా, ఆ లక్షణాలు కనిపించక నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా, చలాకీగా వుండే ఒంటరి స్త్రీ/పురుషులకే ఇది ఒక సవాలుగా మిగిలిపోతుంది. యవ్వనంలో ఉండగానే విడాకుల వల్ల గాని, ప్రమాదాల వల్ల గానీ భర్తలను కోల్పోయిన ఒంటరి స్త్రీల జీవితమూ, పిల్లలు ఉండగా పునర్వివాహం చేసుకున్న వనితల జీవితం ఎన్నెన్ని సమస్యలను దాటుకుపోవాలో చెప్పలేము, అది వేరే విషయం అనుకోండి.
నేనూ, వృద్ధాప్యంలో అడుగు పెట్టినవాడినే కనుక, నేనూ నా భార్య కంటే ముందు చనిపోవాలని మనసులో అనుకునుంటాను. ఒకసారి నా భార్యకు ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, తాను ఒక రోజు చాలా డల్గా ఉంటే, ఎందుకు అలా వున్నావని అడిగినప్పుడు, “నేను పొతే మిమ్మల్ని ఎవరు చూస్తారు?” అన్న మాట, నాకు కన్నీళ్లు తెప్పించింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు వికలమై పోతుంది. ఇవన్నీ వయసు మళ్ళాక వచ్చే ఆలోచనలూ, సమస్యలూను.
మా ఇంటి విషయానికి వస్తే, మా అమ్మ చనిపోయిన కొద్దికాలానికే, మా నాయన చనిపోయారు. మా అమ్మ వండిన వంట తప్ప వేరే వాళ్ళ వంటలు ఆయన అసలు ముట్టుకునేవారు కాదు. మా అన్నయ్య చనిపోయి చాలా కాలం అయినా, మా వదిన గారు ఆరోగ్యంగా, ఆనందంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. మా పెదనాన్న మనవరాలు భర్త చనిపోయి చాలా సంవత్సరాలు, అయినా, పిల్లలతో మనుమలతో హాయిగా తన జీవితాన్ని గడపగలుగుతున్నది. మా చిన్నక్క గతించి చాలా కాలమైనా, మా బావగారు జీవితం బాగానే వుంది.
నా మిత్రుడు ఒకాయన ఇన్స్పెక్టర్ స్థాయిలో పదవీ విరమణ చేసాడు. భార్యను ఎప్పుడూ హింసించేవాడు. ఆవిడ చనిపోగానే అతను పునర్వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె అతనిని హింసిస్తున్నది. ఈ వివాహం వల్ల అతనికి సుఖశాంతులు కరువైనాయి. హిట్లరులా వుండే మనిషి ఆమెకు బానిసగా తయారయ్యాడు. నా వియ్యంకుడు, భార్య అనారోగ్యంతో (ఆమెకు చాలా సేవ చేసాడు) చనిపోవడంతో, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఆయనకు దక్కలేదు. ఆయన ఆరోగ్యకరమైన, జీవితాన్ని, పిల్లలతో, మనుమలతో వెళ్లదీస్తున్నారు. చెప్పడానికి ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, వృద్దాప్యం వచ్చాక తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు, తొందరపడి చేసేవిగా వుండకూడదు. ఇష్టంగా చేసే కొన్ని త్యాగాలు తప్పవు, ఇష్టం లేకపోయినా, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోనకా తప్పదు. సుఖం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం అన్నీ మన చేతిలోనే వున్నా, కొన్నింటికి సమాధాన పడక తప్పదు. వయసు మళ్ళాక వృద్ధాప్యం వచ్చాక, శుభకరమైన శేషజీవితానికి, కొంత కలిసి రావాలి, కొంత అదృష్టం వుండాలని అనిపిస్తుంటుంది.
వయసు మళ్ళాక:
శరీరానికి సుఖాన్ని ఇవ్వకూడదు. ప్రతిరోజూ 30-40 నిమిషాలు నడక అవసరం. నిలబడడానికి, కూర్చోడానికి ప్రయత్నించాలి గాని అస్తమానం పడుకుని ఉండకూడదు. దీనివల్ల వయసు పెరిగేకొద్దీ కండలు కరిగిపోయే ప్రక్రియను కొంతవరకూ అరికట్టవచ్చు. ఎముక చిల్లులు పడడం (ఆస్టియో పోరోసిస్) కంటే, కండలు కరిగిపోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
27 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
డా కె.ఎల్.వి.ప్రసాద్
Old age and the psychological and sociological patterns…That was the reality and you have discussed and described in a very settle way.Thank you for enlightening.
—prof.Ravi kumar
NIT-WARANGAL.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you brother
sagar
వృద్ధాప్య జీవితాన్ని చాలా చక్కగా విశదీకరించారు సర్. పునర్వివాహం అనేది వయసు మళ్ళినవారికి ఇప్పుడు కూడ ఎక్కువభాగం ఆహ్వానించలేరు. కాబట్టి వారి పరిస్ధితిని బట్టి చేసుకోవడం మంచిది. ఇక వృద్ధాప్యం అనేది వచ్చాక పరిస్ధితులతో రాజీ పడడం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సుఖమయ జీవితాన్ని అందించె మార్గం అదే కాబట్టి. అలాగే పిల్లలకు కూడ ప్రశాంతంగ పెద్దల గురించి అనవసర ఆలోచన ఉండదు. ఇక వృద్ధాశ్రమాలు తప్పని వారికైతే తప్ప భలవంతంగా చేర్పించడం చాలా తప్పు. మంచి వ్యాసాన్ని అందించిన మీకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
కృత జ్ఞత లు.
సుగుణ అల్లాణి
మంచి అంశం సర్! ఇప్పుడు సమాజంలో ఎన్నో జంటలు ఇలాంటి ఆలోచనలతో సతమతమౌతున్నారు!చక్కగా విశ్లేషించార
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా సుగుణ గారూ
ధన్యోస్మి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
వృద్ధాప్యం లో గల ఇబ్బందులను
తెలియజేసారు.
ఎవరు ఎప్పుడు తనువు చాలించేది ఎవరికీ తెలియదు సర్
మీరు రాసినట్టుగానే మేము అదే మాట్లాడుకుంటాము….
నేను ముందు పోవాలని నేను….
కాదు నేనే ముందు పోవాలని మా వారు…. వయసు మళ్ళాక ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే కావొచ్చు.
మంచి వ్యాసం అందించిన మీకు
ధన్యవాదములు
—కె.కళా వతి
అమెరికా.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
బాగారాసారు
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Mi sanchika super Doctor garu. Kallaku kattinatluga rasaru. Miru chepidanta nijame sir at present Prather kutunbam lo jaruguthundi sir. CONGRATS SIR. Prof. K. David.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అనుభవ సత్యాలు చెప్పారు మహాశయా!
—ప్రొ.జనార్ధన రాప్
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞత లు సర్
Shyamkumar Chagal. Nizamabad
వయసు మళ్లిన తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యను ఈ వారం మన ముందుకు తెచ్చిన రచయిత గారి విశ్లేషణ అత్యద్భుతం. అందులోనూ భార్యాభర్తలలో ఒకరు మరణించితే కలిగి దురవస్థలను లేదా విడాకుల వలన, ఆ తర్వాత కలిగే దుష్పరిణామాలను ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ళ ముందు ఉంచారు.
అవన్నీ చదువుతుంటే ఆ వయసు వారందరికీ మనసు అల్లకల్లోలం అయిపోవడం తథ్యం.
ముఖ్యంగా జీవితపు ఆఖరి దశలో భార్య లేకుండా మన లేరు అన్నది నూటికి నూరుపాళ్ల సత్యం. రచయితగారు ఉటంకించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, భార్య లేని భర్త చాలా కాలం పాటు జీవించలేరు అన్న చేదు నిజం.
భర్త పోయిన తర్వాత స్త్రీలు జీవితంలో కలిగే ఎన్నో ఒడిదుడుకులకు, పిల్లలకు అనుగుణంగా తమ ని తాము మార్చుకుంటూ, జీవితాన్ని పూర్తి చేసుకుంటారు. ఆ జీవితం సంతోషంగా ముగుస్తుందా లేదా అన్నది సంతానం వారి పట్ల చూపించే ప్రేమాభిమానాల మీద ఆధారపడి ఉంటుంది.
వృద్ధాశ్రమంలో గడిపే వారి జీవితం చాలా వరకు నరక ప్రయాణం, నరకప్రాయం అని చెప్పాలి.
మలిదశలో జరిగే రెండవ వివాహం యొక్క పరిణామాలు ఆ తర్వాత జీవితపు సుఖదుఃఖాలు ఎలా ఉంటాయన్నది ఎవరు చెప్పలేరు.
అది ముక్క చెక్కలు అయిన కుండను అధికించడంతో సమానం అని చెప్పాలి.
వృద్ధాప్యంలో చేసుకున్న వివాహపు ఫలితాలు కొందరికి మంచి చేస్తే మరికొందరికి నిరాశ కలిగించాయి అన్నది నేను గమనించాను .
రచయిత ఈసారి తీసుకున్న శీర్షిక చాలా సున్నితమైన అంశం . కొన్ని విషయాలు మనసును పిండేసి వి గా ఉన్నాయి.
కొన్ని సంవత్సరాల కిందట కొందరు వృద్ధులు నేను ముందు పోతాను అంటే కాదు కాదు నేను ముందు పోతాను అని అనుకోవడం విన్నాను కానీ దాన్లో ఉండే భయానకమైన నిజం గురించి అప్పట్లో అర్థం కాలేదు. మేము కూడా ఆ వయసు వచ్చేటప్పటికి ప్రస్తుతం అలాగే, అనుకోవడం జరుగుతోంది. ఏదేమైనా వృద్ధాప్యంలో భార్య లేని జీవితాన్ని ఊహించుకోవడం భయానకం.
ఇటువంటి విషయాలను తెర వెనక్కి నెట్టి జీవితం గడుపుతున్న మనందరికీ వాటి ప్రాముఖ్యతను ఆ చేదు నిజాలను వడగట్టి సారం అందించిన రచయిత డాక్టర్ కే ఎల్ వీ ప్రసాద్ ఈసారి మన హృదయాలను క రి గించారటంలో ఎటువంటి సందేహం లేదు. వారికి నా అభినందనలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డియర్ ఫ్రెండ్
నీ విశ్లేషణ సూపర్బ్.
నీ స్పందనకు ధన్యవాదాలు .
sunianu6688@gmail.com
రచయిత శ్రీ KLV prasad గారు వ్రాసిన అంశం బాగుంది. నిజమే భార్య వున్నప్పుడు భర్త నీ బాగా చూసుకోవడం వల్ల చాలా మంది కి కనీసం కాఫీ పెట్టుకోవడం కూడా చేతకాదు. ఆమె లేని తర్వాత ఇంటిలో కూతుళ్ళని, కోడళ్ళనీ అడగటానికి కూడా చాలా మొహమాట పడతారు. ఆడవారి పరిస్తితి అలా కాదు. ఏది ఏమైనా ఎవరికైనా ఒంటరి జీవితం, నా అనే మనిషి లేకుండా జీవించడం చాలా దుర్భరం. Dr KLV prasad గారికి హృదయపూర్వక అభినందనలు

డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
డేవి గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
వయసు మళ్ళినవారు తప్పకుండా మాట్లాడుకునే సున్నితమైన అంశాన్ని అతి సున్నితంగా చెప్పిన వ్యాసమిది. బాగుంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు.
మెట్టు మురళీధర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్ మీకు శుభోదయం
అల్లూరి Gouri Lakshmi
మీరు చేసిన చర్చ..సూచనలు వయసు మళ్ళిన అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి Prasad jee..
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు మే డం.
Rajendra Prasad
Your examples show that remarriage at elderly age invites problems తన favors. Ederly women remarriage is not applicable in India. Even the men need to accept the loss and better live single
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you ji.
పుట్టి నాగలక్ష్మి
మీరు ఈ భాగంలో స్పృశించిన అంశం అందరి జీవితాలకు వర్తిస్తుంది.సాధారణంగా భర్త ముందు మరణిస్తే భార్యలు బతకగలుగుతారు. భర్తలు అలా కాదు. ఇది చాలావరకు జరిగేదే!కాని ఒక విషయాన్ని గుర్తుచేసుకుంటున్నా.. నేను.
మా పెద్దమ్మ మరణించాక పెద నాన్నగారు సుమారు 30 సంవత్సరాలు 94 ఏళ్లు జీవించారు. (ఆయన రిటైరయ్యాకే పెద్దమ్మ చనిపోయారు) కోడళ్లు వండిపెట్టినంతకాలం వండి పెట్టారు. ఐదుగురు కోడళ్లు ఎవరి బతుకు వారి బతకడానికి వెళ్లిపోయారు కొన్నేళ్ల తర్వాత. అయినా ఆయన కుంగిపోలేదు.వంటమ్మాయి తో వండించుకుని తినేవారు.రేడియో, పేపర్లు, టి. వి,లతో కాలక్షేపం. ప్రశాంతంగా బతికారు.ఇవేళ ఆయన గుర్తుకొచ్చారు. మా ఇద్దరిదీ స్నేహబంధం. ఆయన Oka Encyclopedia.
మన తరానికి అవసరమైన విషయాన్ని ప్రస్తావించారు. అభినందనలు, ధన్యవాదాలు మీకు.
shankar.devalaraju@gmail.com
చాలా సున్నితమైన ప్రతి దంపతులు ఎదుర్కొనే సమస్యను జీవిత సత్యాన్ని కడు హృద్యంగా ప్రస్తావించారు డాక్టరుగారూ. మీకు నా ధన్యవాదాలు.
N.Bhujanaga Rao
వృధాప్య జీవితాన్ని ఎలా మలచుకోవాలో చక్కగా చెప్పారు సర్.ఇక పునర్వివాహం విషయంలో ఉన్న పరిస్థితుల కనుగుణంగా చేసుకోవడం ఉత్తమం.వృద్ధాప్యంలో ఉన్నవారు కొంత సమయం వ్యాయాయం చేయడం ఉత్తమమని మరియు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ కనీసం గంటపాటు వ్యాయామం తప్పనిసరి అని డాక్టర్లు ఎపుడు చెబుతుంటారు.ఆరోగ్యకరమైన మంచి విషయాలు అందిస్తున్న డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు
Jogeswararao Pallempaati
అనుభవంతో చెప్పిన విషయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం, డాక్టర్ గారూ!
కుటుంబంలో సమస్యలు లేని వారికి ఓకే కానీ సమస్యలు ఉన్నా ఇంట్లో ఇమడలేనివారు నేటి సమాజంలో సహజీవనం చేస్తున్నారు!
సెక్స్ కోసమే కాకుండా స్నేహంగా ఉండేవారే బాగుంటున్నారు! కలిసి పోయాక కావాలని అనుకుంటే సెక్స్ కి అభ్యంతరం దేనికి హాయిగా కలిసి ఉంటారు! ఆరోగ్య సమస్యలు లేనివారు సెక్స్ చేసుకోవడం మంచిదే! బంధం మరింత బలపడుతుంది! ఇప్పుడు ఖరీదైన ఓల్డ్ ఏజ్ హోం లో కొన్నాళ్ళు పరిచయం అయ్యాక ఏ ఇద్దరు ఇష్టపడి కలిసి ఉందామని అనుకుంటే అందరి సమక్షంలో దండలు మార్చుకుని ఇద్దరు ఉండగలిగే రూమ్ లు కేటాయించడం తెలుసు!
అవసరం అన్ని అవకాశాలను కల్పిస్తుంది!
కలిసి ఉంటే కలదు సుఖం!