[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘ఎద్దుమొహం తొడుగు’.]


ఒక ఊరిలో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఎప్పుడూ మంచం మీద పడి నిద్రపోవడం, మూడు పూటలా కడుపునిండా తినడం, వచ్చీపోయే జనాలతో పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ గడపడం తప్ప ఒళ్ళు వంచి ఒక్క పనీ చేసేవాడు కాదు. చుట్టుపక్కల జనాలు పొద్దున కోడి కూసినప్పటినుంచీ, రాత్రి మంచం ఎక్కేంత వరకు ఏదో ఒక పని చేస్తున్నా చూసికూడా అస్సలు పట్టించుకోడు. పెళ్లయి పిల్లలు పుట్టినా వానిలో చీమంత మార్పు కూడా రాలేదు.
ఊరంతా వాన్ని చూసి నవ్వుతా వుంటే తట్టుకోలేక ఒకరోజు వాని పెళ్ళాం “ఇదీ ఒక బతుకేనా.. ఆడదాన్ని కష్టపడతా వుంటే మీదపడి తినడానికి సిగ్గుగా లేదు. రెండు ఎద్దులు కలసి లాగితేనే కదా బండి నడిచేది. ఊర్లో పసిపిల్లల నుండి పండు ముసలోళ్లదాక ఎవరికి చేతనైన పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ నీ అంత సోమరిపోతును లోకంలో ఎక్కడా చూడలేదు. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న బిడ్డల్ని, కనిపెంచిన తల్లిదండ్రుల్ని కష్టపెట్టి నువ్వేం సుఖపడతావు.. లే లేచి చేయి కలుపు” అంది.
కానీ వాడు ఆమె మాటలు అస్సలు పట్టించుకోకపోగా కస్సుమని ఆమె మీదకే లేచాడు. “ఈ జనాలు ఎవరైనా హాయిగా వుంటే అస్సలు తట్టుకోలేరు. కుళ్ళు అందరికీ. ఇంకోసారి నా వద్దకు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. పో ఇక్కన్నుంచి” అంటూ అరిచాడు. ఆమె ఈ సోమరిపోతుకు చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే అనుకుంది. వస్తా వున్న కన్నీళ్లను ఆపుకుంటూ పొలానికి బయలుదేరింది.
ఆమె పోయిన కాసేపటికి ఆ సోమరిపోతు మంచం మీద నుండి లేచాడు. “ఛ.. ఛ.. ఈ ఇంట్లో వుంటే ఎప్పుడూ ఇంతే. పని పని అంటూ సంపుకుతింటారు. అందరికీ దూరంగా ఎవరూ పట్టించుకోని చోటుకు వెళ్లిపోవాలి” అనుకున్నాడు. ఇంట్లో ఉన్న పెట్టెలన్నీ వెదికాడు. ఒక పెట్టెలో చీరల కింద పెళ్ళాం కష్టపడి తినీ తినక భద్రంగా దాచిపెట్టుకున్న డబ్బుల మూట కనపడింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని తీసుకొని సంబరంగా జేబులో పెట్టుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు.
ఊరి పొలిమేర దాటుకొని పోతూవుంటే కుడి వైపు ఒక చిన్న గుడిసె కనబడింది. దాని ముందు ఒక ముసలోడు కూర్చొని ఏదో తయారు చేస్తా ఉన్నాడు. ఆ దారిలో అంతకుముందు ఎప్పుడూ ఆ గుడిసెను గానీ, ఆ ముసలోడిని గానీ అతను చూడలేదు. ‘ఎవరబ్బా ఇతను.. ఏమి చేస్తా ఉన్నాడు’ అనుకుంటా దగ్గరికి వచ్చాడు. “ఏం ముసలోడా.. హాయిగా కాలు మీద కాలేసుకోని పడుకోక ఇంత వయసులో కూడా పనిచేస్తా ఉన్నావు. ఏందది. ఏదో వింతగా వుందే..” అన్నాడు.
ఆ ముసలోడు చిరునవ్వు నవ్వి “ఈ లోకంలో బ్రతకాలంటే చిన్న పురుగు నుంచి పెద్ద ఏనుగు దాకా దేనికి చేతనైన పని అది చేయాల్సిందే. సృష్టి ధర్మం అదే కదా. పని చేయనోడు సచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే. అందుకే ఈ ఎద్దు మొహం తొడుగు చేస్తా ఉన్నా” అన్నాడు.
సోమరిపోతు ఆ విచిత్రమైన తొడుగు వంక చూస్తూ “భలే చెప్పొచ్చినావు గానీ ఏం పనికొస్తాదిది. చిన్నపిల్లలు మూతికి తగిలించుకొని ఎగిరి గంతులు వేయడానికా. పనికిరాని తొడుగు.. పనికిరాని మాటలు..” అంటూ అక్కన్నుంచి వెళ్లిపోవడానికి నాలుగు అడుగులు ముందుకు వేశాడు.
అంతలో ముసలోడు “అయ్యా.. ఇది మామూలు తొడుగు కాదు. పని అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరన్నా దీన్ని మొహానికి తగిలించుకుంటే చాలు.. వాళ్ళ జీవితం అరక్షణంలో మారిపోతుంది. సమస్యలన్నీ దూరమైపోతాయి. హాయిగా కాలు మీద కాలేసుకుని చచ్చేదాకా బ్రతికేయవచ్చు” అన్నాడు.
ఆ మాటలు వింటూనే సోమరిపోతు పోతున్నవాడల్లా ఆగి మరలా వెనక్కు వచ్చాడు. “నువ్వు చెప్పేది నిజమేనా.. ఏదీ ఒకసారి చూడనీ” అంటూ ఆ ఎద్దు మొహం తొడుగు తీసుకొని తన మొహానికి తగిలించుకున్నాడు.
అంతే.. అంతవరకు ఊరికే గమ్మున కూర్చున్న ముసలోడు తన పక్కనున్న ఎద్దు చర్మం తీసి కన్ను మూసి తెరిచేంతలోగా సర్రున వాని మీదికి విసిరేశాడు. మరుక్షణంలో అది వాని శరీరానికి అతుక్కుపోయి సరసరసర ఒళ్ళంతా ఆక్రమించుకోసాగింది. ఆ సోమరిపోతు తొడుగు పీకేద్దాం అని ప్రయత్నిస్తా ఉన్నాడు గానీ అది పీకినకొద్దీ మరింత బిగుసుకు పోసాగింది. గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. చూస్తుండగానే శరీరమంతా ఎద్దు చర్మంతో నిండిపోయింది. తొడుగు మొహానికి అతుక్కుపోయింది. ఆ సోమరిపోతు అచ్చం ఎద్దులాగా మారిపోయాడు. గట్టిగా అరిచాడు. నోట్లోంచి ‘అంబా’ అని అరిపే తప్ప వేరే మాటలు రావడం లేదు. లేచి నిలబడాలనుకున్నాడు కానీ చేతకావడం లేదు. నాలుగు కాళ్ల మీద అచ్చం జంతువులా నడుస్తూ ఉన్నాడు.
ఆ ముసలోడు తాడు తీసుకొని మెడకు కట్టాడు. “నువ్వు ఎన్ని అరుపులు అరిచినా ఎవరికీ నీ మాటలు అర్థం కావు. ఇప్పుడు నువ్వు పూర్తిగా ఎద్దులా మారిపోయావు. నోరు మూసుకుని గమ్మున నా వెంట రా” అన్నాడు.
సోమరిపోతు కోపంగా తల అటూ ఇటూ విదిలిస్తూ ముసలోన్ని పొడవడానికి మీదికి పోయాడు. వెంటనే ముసలోడు పక్కకు జరిగి ఒక కట్టె తీసుకొని కొట్టిన చోట కొట్టకుండా.. ఆపకుండా అరగంట కొట్టాడు. ఆ దెబ్బలకు వాడు అదిరిపోయాడు. ఒళ్ళంతా వాతలు పడ్డాయి. అక్కడే కూలబడిపోయాడు. “చూడు.. ఇప్పుడు నువ్వు మనిషివి కాదు. ఎద్దువి. నేను చెప్పినట్టు వింటే సరి. లేకుంటే కడుపుకి మేత దొరకదు. వీపుకి వాత తప్పదు. జాగ్రత్త” అని హెచ్చరించాడు. పారిపోకుండా ముందు కాలికి అడ్డంగా మెడలో ఒక లావు కట్టె కట్టాడు. దాన్ని తోలుకొని సాయంత్రానికంతా ఒక పశువుల సంతకు చేరుకున్నాడు.
సోమరిపోతు చుట్టూ చూశాడు. చాలా ఎద్దులు, ఆవులు, గాడిదలు, మేకలు, కోళ్లు అక్కడ ఉన్నాయి. ‘ఈ ముసలోడు తనని అమ్మడానికి తెచ్చాడు’ అని అర్థమైంది. కాసేపటికి ఒక రైతు వచ్చాడు. ఆ ఎద్దును పట్టి పట్టి చూస్తా.. దాని కాలి గిట్టలు, నోట్లో పళ్ళు పరిశీలించి ముసలోడు అడిగిన ధర చెల్లించాడు. ముసలోడు తాడు రైతుకు అప్పగిస్తా “చూడు.. ఇది చాలా మొండిది. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా అడ్డం తిరుగుతుంది. చెప్పిన మాట అస్సలు వినదు. అందుకే ఇంత బలంగా వున్నా చాలా తక్కువ ధరకు ఇస్తావున్నా. జాగ్రత్త. అలాగే ఇంకో సంగతి.. దీనికి తినడానికి ఏమన్నా పెట్టుగానీ సొరకాయలు మాత్రం పెట్టొద్దు. అవి తింటే మాత్రం అక్కడికక్కడే గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాది” అని చెప్పాడు.
“ఇట్లాంటి మొండి ఎద్దుల్ని ఎట్లా లొంగదీసుకోవాల్నో నాకు బాగా తెలుసులే. నాలుగు రోజులు గడ్డి పెట్టకుండా మాడిస్తే పెద్దపులి కూడా గంగిగోవులా గారడీలు చేస్తుంది. నేను చూసుకుంటాలే” అంటూ దాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆ రోజునుంచీ పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పండుకునే దాకా ఒకటే పని. పొలం దున్నడం, బండి లాగడం, బరువులు మోయడం. పని చేసీ చేసీ అలసిపోసాగాడు. అడ్డం తిరిగినా, ఆగిపోయినా తిండి పెట్టకుండా తన్నేవాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చెప్పిన పని చెప్పినట్టు చేయడం మొదలుపెట్టాడు. “నేను ఎద్దును కాదురా.. మీలాంటి మనిషినే. నన్ను వదిలిపెట్టండి” అని గొంతు చించుకొని ఎంత అరిచినా వాళ్లకు ‘అంబా’ అని మాత్రమే వినపడేది.
“ఛ.. ఛ.. నా సోమరితనమే నన్నీ స్థితికి తీసుకువచ్చింది. అందరూ పనులు చేసుకుంటూ, సంపాదించుకుంటూ గౌరవంగా తలెత్తుకొని బతుకుతావున్నారు. కానీ నేను మాత్రం పొద్దున లేచినప్పటి నుండీ ఈ పశువుల కొట్టంలో గడ్డి తింటూ, రొచ్చులో పడుకుంటూ, తన్నులు తింటూ.. ఛఛ.. ఇదీ ఒక బతుకేనా. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం మేలు” అనుకున్నాడు.
కళ్ళ ముందు పెళ్ళాం బిడ్డలు మెదిలారు. “పాపం ఇంటి భారమంతా ఒక్కతే మోస్తుంది. నోరెత్తి ఏ రోజు ఒక్క మాట అనలేదు. ఎట్లా భరిస్తుందో ఏమో” అనుకున్నాడు.
కళ్ళలో నీళ్లు వచ్చాయి. బ్రతుకు మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. అంతలో వానికి ‘సొరకాయలు పెట్టొద్దు.. తింటే చస్తుంది..’ అని ముసలోడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
సాయంత్రం పని పూర్తికాగానే పొలం నుండి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒకచోట పొలం గట్టుమీద సొరకాయలు కనపడ్డాయి. అంతే.. ఒక్కుదుటున బలమంతా ఉపయోగించి ఒక్క గుంజు గుంజాడు. రైతు చేతిలో పట్టుకున్న తాడు ఊడిపోయింది. కాళ్లకు కట్టె అడ్డం పడుతున్నా, అతివేగంతో ఎగిరి దుంకుతూ, పొలం గట్టు మీదికి పోయి సొరకాయను పట్టుకొని కసకస నమిలి తినడం మొదలుపెట్టాడు. అది చూసి రైతు అదిరిపడ్డాడు. ‘అయ్యో ఇది చచ్చిపోతుందో ఏమో’ అనుకుంటూ ఉరుక్కుంటా వచ్చాడు. కానీ అప్పటికే అది సొరకాయ మొత్తం తినేసింది.
మరుక్షణంలో వాని ఒళ్లంతా ఏదో మార్పు రావడం మొదలైంది. రెండు కాళ్లపై లేచి నిటారుగా నిలబడ్డాడు. ఒక్కసారి ఒళ్లంతా విదిలించాడు. అంతే.. ఒంటి పైనున్న ఎద్దు చర్మం ఎగిరి పక్కన పడింది. మొహం మీద వున్న తొడుగును పట్టుకుని గట్టిగా లాగడు. చేతికి ఊడి వచ్చింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కిందికీ మీదికీ చూసుకున్నాడు. ఎద్దు రూపం పూర్తిగా తొలగిపోయి మరలా మామూలు మనిషిగా మారిపోయాడు. లావుగా ఉన్న పొట్ట కాస్తా మాయమై పోయింది. పని చేసీ చేసీ ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి బలిష్టంగా తయారయ్యాడు. ఇదంతా చూస్తున్న రైతు ఆశ్చర్యంతో తన కళ్ళను తానే నమ్మలేక, ఏం జరుగుతుందో అర్థం కాక, నోరు తెరచుకొని గమ్మున అయోమయంగా చూస్తా ఉన్నాడు.
సోమరిపోతు రైతుకు జరిగిందంతా చెప్పి “అయ్యా నన్ను కొనడానికి నీవు ఇచ్చిన సొమ్ముని ఇంటికి పోగానే కొద్ది రోజుల్లో తిరిగి చెల్లించేస్తాను. నన్ను నమ్ము” అన్నాడు. రైతు చిరునవ్వు నవ్వి “ఇన్ని రోజులు నువ్వు చేసిన పనికి, నేను ఖర్చుపెట్టిన సొమ్ముకి లెక్క సరిపోయిందిలే. ఇకనైనా సోమరితనాన్ని వదిలివేసి నిజమైన మనుషిలా బాధ్యతగా బ్రతుకు” అన్నాడు.
సోమరిపోతు తిరిగి ఇంటికి బయలుదేరాడు. పోలిమేరలో ముసిలోని కోసం, వాని గుడిసె కోసం వెదికాడు. ఎక్కడా కనపడలేదు. గుడిసె ఉండాల్సిన చోటులో ఒక రాయి వుంది. దాని మీద తాను ఇంటిని వదిలి వచ్చేటప్పుడు దొంగతనంగా తెచ్చిన సొమ్ము భద్రంగా వుంది. దాన్ని తీసుకున్నాడు. ఆకాశం వంక చూసి వినయంగా భక్తిగా మొక్కుకొని ఇంటికి చేరుకున్నాడు. వాన్ని చూసి పెళ్ళాం బిడ్డలు చాలా సంబరపడ్డారు. జరిగింది చెబితే ఎవరూ నమ్మరు. అందుకే ఎవరికీ ఏమీ చెప్పలేదు. తరువాతరోజు పొద్దున్నే పెళ్ళాంతో పాటు లేచి చిరునవ్వుతో పొలం కేసి నడిచాడు. మారిపోయిన ఆ సోమరిపోతును చూసి ఊరు ఊరంతా సంబరపడింది.

వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212