[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


ప్రేమంటే ఏంటంటే?
ఒక అయిదేళ్ల కుర్రాడు వాళ్ల ఇంటి ముందు మెట్ల మీద కూర్చుని ‘నిన్నిడిసి నేనెళితే నువ్వుండలేవు.. ఇది నా గొప్ప నా గొప్ప కాదు పిల్లాడా, ప్రేమంటే అంతేరా పిచ్చివాడా..’ అని పాడుతున్నాడు. అంత చిన్న వయసులోనే వాడికి జ్ఞానోదయం అయిందని సంతోషించాల్సిందే.
విశ్వవ్యాప్తమైన ప్రేమ గురించి ఎందరెందరో మహానుభావులు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. కానీ ఏవీ సమగ్రంగా లేవు. ప్రేమ తత్వాన్ని ఒకొక్కరు ఒకొక్క దృక్పథంలో నుంచి చూసి చెప్పారు. యుగయుగాలుగా జీవన స్రవంతిలో అంతర్లీనంగా సాగుతున్నది ప్రేమ స్వరూపమే. నిజానికి ప్రేమ అనే బ్రహ్మ పదార్థం కేవలం అనుభవేకవేద్యమైనది మాత్రమే. అందుచేత అనిర్వచనీయమైనది.
తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు అని అంటుంటారు. కానీ అది నిజం కాదు. తొలి చూపులో కలిగేది బాహ్య సౌందర్యాకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణ మరి కొంచెం ముందుకు సాగితే ఏర్పడేది ఇష్టం. ఆ ఇష్టం పెరిగితే ఆరాధన మొదలవుతుంది. ఆ ఆరాధన ముదిరితే ఏర్పడేది ప్రేమ. ఈ ప్రేమ తారాస్థాయికి చేసినప్పుడు, ఆ మనిషి మీద తట్టుకోలేని వ్యామోహం ఏర్పడుతుంది. అందుచేత ఇన్ని దశలు దాటితేగాని ప్రేమ నిలవదు. స్థిరపడదు, బలపడదు. కొందరి విషయంలో ప్రేమ నిలబడినా, స్థిరపడినా, బలపడినా, ఆ వ్యక్తి పైనే కుదురుగా ఉంటుందన్న నమ్మకమూ లేదు.
ప్రతివాడూ పెళ్లి చేసుకోవటానికి ‘అందమైన అమ్మాయి’ కావాలంటాడు. అందమైన అమ్మాయికి నిర్వచనం ఏమీ లేదు. ‘తావలాచింది రంభ’ అన్నారు. ఒకక్కడికి ఒక్కో సమయంలో ఒక్కో పిల్ల ఒక్కో చోట తారసపడుతుంది. అప్పుడు అదే వాడి కంటికి అతిలోక సౌందర్యరాశిలాగా కనిపిస్తుంది. ఆ ఆడదాని కోసం ఎంతకు తెగిస్తాడో చెప్పలేం. గంతకు తగ్గ బొంత అని ఎవరికి తగ్గవాళ్లు వాళ్లకి దొరుకుతుంటారు.
ప్రేమకు పరమావధి పెళ్లి. అయితే ఏ కొలబద్దకీ అందని ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రాధాకృష్ణులు జగమెరిగిన ప్రేమికులు. ఏ స్త్రీ ఏ పురుషుడినీ ప్రేమించినంత ఉదాత్తంగా రాధ కృష్ణుడిని ప్రేమించింది. కానీ తనని వివాహం చేసుకుంటాడని ఆశించలేదు. అడగలేదు. వివాహబంధం లేకపోయినా తన ప్రేమ బంధమే బలమైనదని ఆమె నమ్మింది. కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలున్నారు. వాళ్ల మధ్య కోపాలు, ద్వేషాలూ ఉన్నయి – కృష్ణుడు తనకు మాత్రకు సొంతము కావాలనీ, పంతాలకు పొయినారు. నా వాడు అంటే నా వాడు అని వాదులాడుకున్నారు. కానీ రాధ ఈ చక్రబంధంలోకి రాలేదు. ఏళ్ల తరబడి యమునా తీరంలో ప్రియుని రాక కోసం ఒక తపస్వినిలా ఎదురు చూస్తూ గడిపింది. “నీవు శాసిస్తే, నీ కాళ్ల దగ్గరే శాశ్వతంగా పడి ఉంటాను” అని కృష్ణుడు అంటే, ఆమె చిరునవ్వుతో అంటుంది – “నీవు లోక కళ్యాణం కోసం అవతరించిన యుగ పురుషుడివి. నీవు నా సొంతం అని ఏనాడూ ఆనుకోలేదు, నువ్వు చేయవల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. వెళ్లు కృష్ణా” అని తెల్లవారకుండానే సాగనంపుతుంది. అయినా కృష్ణుడు తన పేరును రాధతో మమైకం చేసుకున్నాడు. రాధ లేని కృష్ణుడు లేదు. కృష్ణుడు లేని రాధ లేదు. తరగని, చెరగని ప్రేమకీ, ఆరాధనకీ వాళ్లు నిలువెత్తు నిదర్శనం. రాధకి ఇటో అక్షరం, అటో అక్షరం చేరిస్తే ఆరాధన అవుతుంది.
ప్రపంచానికి ఆదర్శంగా నిలబడవచ్చిన వాళ్లంతా మరి అలా ఉండగలుగుతున్నారా – అంటే లేదనే చెప్పాలి. ప్రేమ పిచ్చీ రెండూ ఒకటే అనేవాళ్లే ఎక్కడ చూసినా కనిపిస్తారు. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా కీర్తింపబడతాడు. ఇంతటి అత్యున్నత పదవులలో ఉన్నవారూ, ప్రేమ వ్యవహారాల్లో ఎంత బలహీనులో తెలిస్తే విస్తుపోవాల్సి వస్తుంది. అప్పటికీ ఇప్పటికీ మోస్ట్ గ్లామరస్ అధ్యక్షుడు జాన్ కెన్నడీ. జాక్విలిన్ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితేనేం కెన్నెడీ స్త్రీలోలుడు అనే అపవాదు ఉంది. కనిపించిన అందమైన స్త్రీలను వదిలేవాడు కాదుట, తన దగ్గర పని చేస్తే వారి దగ్గర నుంచీ, సుప్రసిద్ధ నటీమణుల దాకా ఎవరినైనా సరే రప్పించుకునే వాడట. డాక్టర్లు, నర్సుల వేషాల్లో వ్యభిచారుణులను తెప్పించునేవాడట. ఓసారి మార్లిన్ మన్రో -జాక్విలిన్కు ఫోన్ చేసి “మీ ఆయన నేనంటే పడి చస్తాడు తెల్సా?” అన్నదిట. “ఇంకేం? నేను విడాకులు ఇస్తాను, నువ్వొచ్చి పెళ్ళి చేసుకో” అన్నదిట జాక్విలిన్. ఈ బాధ ధరించలేక నిజంగానే విడాకులు ఇవ్వటానికి సిద్ధపడితే, కుటుంబ సభ్యులు సర్ది చెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపచేశారు. అయినా ఆమె భర్తను ప్రేమిస్తూనే ఉంది. డల్లాస్ వీధుల్లో ఆమె ఒడిలోనే తల పెట్టుకుని చనిపోయిన కెన్నెడీని చూస్తూ బోరున ఏడ్చింది. కెన్నడీ హత్యకు కారణం ఏమిటో -ఈనాటికీ వీడని మిస్టరీగానే ముగిలి పోయింది. అయితే అంత ప్రేమ ఏమైందో తెలియడు. ముసలివాడు, అనాకారి అయిన ఒనాసిస్ను జాక్విలిన్ రెండో పెళ్లి చేసుకుంది. ఒనాసిస్ చనిపోతున్నప్పుడు ఆమె ఏడవలేదు. వికృతంగా నవ్వుకుంది. అది ప్రేమా? ద్వేషమా?
బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా నుండగా మోనికా లీవెన్స్కీ అనే ఉద్యోగినితో జరిపిన ప్రేమ వ్యవహారం అప్పట్లో అమెరికాను ఒక ఊపు ఊపింది.
ఇక కవులు రాసే ప్రేమ కవిత్వాలను ఒక చోట చేర్చి తూకం వేస్తే ఎన్ని ఎన్నుల బరువు తూగుతాయో తెలియదు. కవులందరిలోకీ శ్రీనాథుడు మంచి రసికుడుగా కూడా పేరు పొందాడు. గోదావరిలో స్నానం చేసి వస్తుంటే ఒక పడుచు మీద ఆయన కన్ను పడింది. “నాకు పెళ్లి అయింది. పిల్లలున్నారు. నాకు ఇంకేం కోరికలు ఉంటాయి” అని అన్నది. “నీకు కోరికలు లేకపోయినా, నాకు ఉండొచ్చు గదా?” అని అన్నాడు. ‘నీ అంతటి పండితుడు మనసు పడితే కాదంటానా? నడి రేయి వస్తా’నని చెప్పింది. అమ్మవారి మీద అన అని చెప్పి వెళ్ళింది. ఈ పండితుడు రాత్రంతా నది ఒడ్డున జాగారం చేసినా ఆమె రాలేదు. ఆయనకు కోపం వచ్చింది. తిడుతూ పద్యం చెప్పాడు. ఆమెను కాదు. ఆన వేసిన అమ్మవారిని. అలా ఉంటాయి ప్రేమ కథలు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.