[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘అమ్మాయి కలలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


తెలిమంచు కురిసిన తరుణాన పుడమి తల్లి పులకరించి పరవశించింది
చెట్లు చిగురించాయి పచ్చిక బయళ్లు పూల రంగుల తివాచీలు పరిచాయి
పచ్చబారిన కొండలు ఒళ్ళువిరుచుకుంటూ అందాలు ఆరబోసుకున్నాయి
ఉదయ భానుడు అప్పుడప్పుడు తన కిరణాలను సంధించే ప్రయత్నం చేస్తున్నాడు
సీతాకోక చిలుకలు రెక్కలు అల్లార్చుకుంటూ ఎండ కోసం తహతహలాడుతున్నాయి!
కలలుకనే నిశిరాతిరిలో నను మేలుకొలిపింది చెలికాని వలపు పిలుపు
అదిరిపడిలేచి నా గది కిటికీ నుంచి ఒదిగిన రాత్రి రాణిని వివరమడిగాను
పక్కున నవ్వినరాణి సన్నజాజి పందిరివైపు సైగచేసింది పరుగునపోయి వెదికాను
నన్ను ఆటపట్టించిందని తెలిసి అలిగి పూలన్నీ తుంపి వేసాను
అప్పుడు చెప్పింది మల్లిపొదల నీడలో వేచివున్నాడు నీవాడని!
కలయో నిజమో రాత్రిరాణి పరిహాసమొ తెలియని గందరగోళంలో
పొదలనీడలో కలయ చూడగా కుందేళ్ళ జంట వచ్చి నా ఒడిలో వొదిగింది
వాటిని లాలించి ముద్దుచేసి మురిసిపోయాను నా కలను మరిచాను
సెలయేటి అలల సంగీతం వింటూ వెన్నెలవెలుగులో పరవశించిపోయాను
కొలనులోఈదులాడు రాయంచల సోయగాలు వివరిస్తూ నీకు ప్రణయలేఖ రాసాను!
మేఘసందేశాలు రాయంచల రాయబారాలు ప్రణయలేఖలు కలలుగన్న కొత్త ఆశలు
సాగరతీరాన కట్టుకున్న బొమ్మరిల్లు ఇష్టమైన పాటలు అలరించిన కవితలు
కవుల కల్పనలోని కథలు అనంతమైన అన్వేషణలు కష్టం ఏమిటో తెలియని ఊహలు
ప్రకృతిలోని అందాల పరిశీలనలు చిలకా- గోరింకల ప్రణయ దృశ్యాలు ఎగిసిపడే కోరికలు
కోయిల గొంతులో పొంగి పొరలిన తీయని భావాలు యౌవనాల నవ్వుల పూవులు!

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.