[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘అడుగుజాడలు..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


స్ఫూర్తి అనే పదానికి
అర్థం తామై నిలుస్తూ
నిరంతరం శ్రమించే మహనీయులు
ఎందరో ఉన్నారు!
వినూత్నమైన ఆవిష్కరణలతో శాస్త్రవేత్తలు..
ఆధునిక వైద్య పద్ధతులను
సమాజానికి అందిస్తూ
ప్రాణదాతలై వైద్యులు..
నూతన కట్టడాలకు రూపమిస్తూ
అభినవ విశ్వకర్మలై వర్ధిల్లుతూ ఇంజనీర్స్..
సువిశాల పాఠశాల మైదానాన్నే
ఒలంపిక్స్ గ్రౌండ్స్గా మారుస్తూ,
విశ్వవిజేతలుగా
రేపటితరాలని తయారుచేస్తూ,
క్లాస్ నాలుగు గోడల మధ్య వున్న
నల్లని బోర్డు పై తెల్లని అక్షరాలను రాస్తూ,
విద్యార్థుల తలరాతల్ని మారుస్తూ..
నేటి బ్రహ్మలై ఉపాధ్యాయులు..
ఆకలితో అలమటిస్తున్న
పేదలకు అన్నదానం చేస్తూ
అన్నపూర్ణ దేవి వరప్రసాదకులు
మానస పుత్రులు సంఘ సేవకులు..
ఆశలెన్నో హృదయంలో చిగురిస్తున్నా
చాలీచాలని జీతాలతో జీవితాలని వెళ్లదీస్తూ
దీనంగా బతుకీడుస్తున్న అభాగ్యుల
కలలని నిజం చేయాలని
తపించే నవ్య నాయకులు..
అందమైన రేపటి భవిష్యత్తుకి
పునాదులు వేసే నవసమాజ నిర్మాతలు..
స్ఫూర్తి అనే పదానికి అర్థం తామై
నిలుస్తున్న వారి అడుగుజాడలు
సదా అనుసరణీయం!
మహనీయుల స్వర్ణసంకల్పాలు
రేపటి తరాల ఉజ్వల భవితకు నిదర్శనాలు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.