[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘యువశక్తి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఏ దేశ అభ్యున్నతికైనా
యువత భాగస్వామ్యం తప్పనిసరి!
ప్రతి దేశ అభివృద్ధి ఆ దేశ
యువత శక్తి పై ఆధారపడి ఉంటుంది!
కొండల్ని పిండి చేయగల సత్తా..
ఎటువంటి కఠోరమైన పరీక్షలనైనా
ఎదుర్కోగల ధైర్యం యువతకే సాధ్యం!
చదువుకున్న విద్యతో పాటు
శ్రమించ గల పట్టుదల పౌరుషం యువత స్వభావం!
జాతిపిత గాంధీజీ,
పోరాట యోధుడు నేతాజీ,
నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ దేవి,
మిస్సైల్ మ్యాన్ ఎ.పి.జె అబ్దుల్ కలాం వంటి మహనీయులు
యవ్వనంలోనే విజయయాత్ర ప్రారంభించారు!
తాము నిర్దేశించుకున్న లక్ష్యాల
వైపు నిర్భయంగా కదిలారు!
నేడు దేశమంతా వారిని స్మరిస్తుందంటే
ఒకప్పుడు యువతగా వారున్నప్పుడు
అందుకున్న జయాలు
వారి చిరునామాగా మారడమే కారణం!
ఏనాడైనా చిరు ఓటమి ఎదురైనా..
ఎదురుదెబ్బ తగిలినా చలించవద్దు ..
ధైర్యంగా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో
ముందుకు సాగాలన్నదే నాటి మహనీయులు
మనకి ప్రభోదించిన పాఠాలు..
యువశక్తి కి తిరుగేలేదు!
నేటి యువతే రేపటి
భారత ఘనతకు సాక్షమవ్వాలి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.