Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంయమనం నేర్పే యోగా

[21 జూన్ 2025న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు.]

భారతీయ విజ్ఞానం అతి ప్రాచీనమైనది, కడు విస్తారమైనది. కానీ స్వలాభాపేక్ష లేని మన ప్రాచీనులు ఆ విజ్ఞానాన్ని అందరికీ ఉపయోగపడాలని ఆశించి అందరికీ అందుబాటులోనే ఉంచారు. కానీ ఆ ‘సమస్తా సుఖినోభవంతు’ సిద్ధాంతం భారతీయతకు అశించిన ప్రయోజనం సిద్ధింప చేయలేదు. ఆశించకపోవడం మంచిదే కానీ పరిరక్షించక పోవడం ఉపేక్షించడం మంచిది కాదు కదా. విద్య నిగూఢ గుప్తము అంటారు కానీ మనదైన ధన కనక వస్తు వాహన సంపదలతో పాటు మన విజ్ఞాన సర్వస్వం కూడా దోచుకోబడింది.. దోచుకోబడిన సంపదలను వెనుక తీసుకురావడం కుదురుతుందా లేదా అని పక్కన పెడితే మనదైన విజ్ఞానాన్ని కాపాడుకోవచ్చు.. ఎలా అంటే ఆ విజ్ఞానం మనదే అని చాటి చెప్పడం ద్వారా. మన గొప్పలు మనం చెప్పుకోనక్కర్లేదు కానీ మనదైన దాన్ని మనది కాదు అంటే నిరసించడంలో ఉదాసీనత పనికిరాదు.

పసుపు ఓ గొప్ప యాంటీబయటిక్ అని మారు మూల గ్రామంలో కాటికి కాలు దాచిన ముసలమ్మకి కూడా తెలుసు. యాంటీ బయాటిక్ అనే పేరు మాత్రం తెలియదు అంతే. అలాగే వేప గురించి.. ఎవరికైనా గాయం తగిలితే పసుపు అద్దమని చెప్పడం చేస్తారు కానీ మేధో హక్కులు పొందటానికి కావలిసిన రీతిలో పరిశోదనలు జరుపటం ఫలితాలు గ్రంథస్తం చేయడం అంతగా జరగవు.. నిజానికి మన ‘వస్తు గుణ దీపిక’లు అలాంటివే. వాటిని క్రోడీకరించి మన ఘనత చాటుకోవడం మన పూర్వీకులు చేయలేదు. మరింతగా పరిశోదించటానికి ప్రభుత్వాల చేయూత కూడా అంతంత మాత్రమే.

విజ్ఞానం లక్ష్యం మానవత్వం విరాజిల్లటమే.. మానవత్వం ఉండాల్సింది మనిషి దగ్గరే కదా. అయితే మనిషి మానవుడిగా ఎలా బతకాలి.. మానవీయ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి? మంచి ఆలోచనలు ఇంటా బయట మంచి వాతావరణం వుంటే కలుగుతాయి. బయట వాతావరణం మనిషి చేతిలో లేదు. మనిషి లోపలి వాతావరణం మనిషి చేతిలోనే ఉంది. అంటే అవే సరైన ఆలోచనలు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నారు. అంటే మానసిక ఆరోగ్యం శారీరిక దారుఢ్యం మీద ఆధారపడి ఉందన్నమాట. నిజమే కదా నీకు మంచి పనులు చేయాలని ఉంది, కానీ నువ్వు కదిలితే కాలు నొప్పి, ఆలోచిస్తే తల నొప్పి వస్తే ఏం చేయగలవు?

అందుకే మనిషికి అన్నింటికన్నా ముందు కావలసిన ‘మహాభాగ్యం’ ఆరోగ్యమేనని గ్రహించి ఆ దిశగా బ్రతకడానికి కావలిసిన మార్గదర్శకాలన్నింటిని మన యోగ విద్యలో పొందుపరిచారు మన సనాతనులు.. ఏమాట కా మాటే చెప్పుకోవాలి.. ఏ మంచి విషయాన్నైనా గ్రహించడంలోనూ పరిశోదనలు చేసి కూలంకుషంగా అర్థం చేసుకొని సిద్ధాంతీకరించడంలో విదేశీయులు ముందుంటారు. మనవాళ్ళు చాలామంది “మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి” అనే బాపతే.

వేలాది సంవత్సరాల నాటి మన మహత్తరమైన యోగ శాస్త్రం మీద మేధో హక్కలు తమ ఖాతాలో వేసుకోవడానికి అమెరికాలో యోగ శిక్షణ లో నిమగ్న మైన యోగ గురువులు ప్రయత్నం చేసారు.. చిత్రంగా వారు అక్కడ స్థిరపాడిన ఇక్కడి యోగ గురూజీలే.. దాదాపుగా పేటెంట్ రైట్స్ పొందగలిగేరు. కానీ పెటేంంట్ రైట్స్ కేవలం నూతనమైన పరికరానికి లేదా సేవకి మాత్రమే కేటాయించాలని వేలాది సంవత్సరాలుగా చలామణీలో వున్నయోగా అభ్యాసాలలో కొద్దిపాటి మార్పులు చేసినంత మాత్రాన అవి నూతన ఆవిష్కరణల క్రిందకి రావని తెలియ చెప్పటంతో అడ్డుకట్ట పడింది. యోగ అభ్యాసాలకు పేటెంట్ రైట్స్ ఇవ్వలేదని కేవలం యోగ ఉత్పత్తులకి మాత్రమే పేటెంట్ రైట్స్ జారీ చేశామని అమెరికా సర్దుకొంది.

కానీ యోగా మీద పేటెంట్ రైట్స్ విదేశీయులు ఎప్పటికైనా పొందే ప్రమాదం ఉంది.. గతంలో రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. కానీ స్వతహాగా యోగ విద్యలో ఆరితేరిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ చూపించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలా చేసి యోగా అనేది సమస్త మానవాళి మానసిక శారీరిక ఆరోగ్యాలకు సంబంధించినదని దీనిని ఎవరు పేటెంట్ చేయకూడదని భారతీయ ‘సర్వేజనా సుఖినోభవంతు’ దృక్పథాన్ని చాటిచెప్పారు. యోగాని ఒక ఉద్యమంగా తీర్చిదిద్దారు. నేడు దేశ విదేశాల్లో యోగా బహు ప్రచుర్యం లోకి వచ్చింది. నిజానికి వివేకానందుల వారు 1890 లలో మన ఔనత్యాన్ని చెప్పి నప్పటి నుంచి అక్కడ మన వ్యవహారాల పట్ల ఆసక్తి ఉంది.. తలచుకొంటే వాళ్ళు మనకన్నా లోతుగా తెలుసుకొంటారు.. ఆ క్రమంలో అమెరికాలో కొన్ని వేల యోగా స్టూడియోలు( యోగా నేర్పే కేంద్రాన్ని అక్కడ స్టూడియో అంటారు) వెలిసాయి. యోగ సాధన శిక్షణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. కానీ అడ్డంకులు విమర్శకులు సహజమే కదా. యోగా అనేది ఒక ఒక హిందూ మత కార్యక్రమమని ఇక్కడ పాటించడం చెల్లదు అని ముఖ్యంగా అరబ్ దేశాలలో వ్యతిరేకత వెల్లడయింది. యోగా అనేది ఒక రకమైన వైద్య శాస్త్రము అని దాని ద్వారా మానసిక శారీరిక ఆరోగ్యాలు సాధ్యమని విదేశీయ మేధావులు గ్రహించి ప్రచారం చేయడం వలన యోగా సాధన సమయంలో ఓంకారం, సూర్య నమస్కారాలు వంటి హిందూ మతచిహ్నలని మినహాయించి యోగ సాధన చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంతో సౌదీ అరేబియా వండి దేశాల్లో యోగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చినది. కార్దియాక్ రిహబిలిటేషన్ వంటి సెంటర్లో యోగ ఒక సబ్జెక్ట్.

చిత్రం ఏంటంటే 60 – 70 ఏళ్ల క్రితం మహిళలు యోగా శిక్షణకు వచ్ఛే వారు కాదు. కానీ ఇప్పుడు యోగా శిక్షకులలో 72 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. మరొక చిత్రం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత చిన్న వయసు గల యోగా శిక్షకులిగా ఏడు సంవత్సరాల బాలిక ప్రణవి గుప్తా, 9 సంవత్సరాల రేయాన్ సురానీ లను గిన్నిస్ బుక్ గుర్తించింది. వీరు ఇరువురు భారతీయులే. 2026 సంవత్సరం ఏషియన్ గేమ్స్‌లో యోగాని చేర్చడం జరిగింది 2036 సంవత్సరం ఒలింపిక్స్ లో మన కబాడీ, కోకో ఆటలతోపాటు యోగాని కూడా చేర్చే ప్రయత్నం జరుగుతోంది..

ఈ నెల 21 న విశాఖపట్నం ఆర్. కే. బీచ్ లో భీమిలి నుంచి భోగాపురం, శ్రీకాకుళం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపుచిచ్చారు. ‘ఒకే భూమి ఒకే ఆరోగ్యం’ సందేశంతో ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కనుంది.

యోగా అనేది ఆసనాలు వేయడం మాత్రమే కాదు. ఆ ఆసనాలు మామూలు కసరత్తులు కావు.. శారీరక ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం అటునుంచి ఆధ్యాత్మిక పురోగతి తద్వారా నాలుగో పురుషార్థం వైపుకి దారి చూపేది యోగా.

A sound mind in a sound body.. అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా గందరగోళంగా వుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద బాంబు వేస్తారో తెలియదు. యుద్ధ విరమణ మీద సంతకం చేసి అదే పెన్నుతో ప్రత్యర్థి గుండెల్లో పొడుస్తున్నారు. కొంతమంది అగ్ర నాయకులు ఏ రోజు ఎం మాట్లాడతారో తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఇంటా బయటా సమస్యలతో సతమతమవుతున్న అనేక మంది నాయకుల కన్నా మిన్నగా సంయమనం పాటించడం యోగా నిపుణుడైన నాయకుడికే చెల్లుతుంది.. చెల్లుతోంది.

యోగా చేస్తే మనకీ చెల్లుతుంది..

Exit mobile version