లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం, రామసముద్రం
ఇక్కడ అర్చక స్వామి చెప్పినదాని ప్రకారం క్రీ.శ.1580 హేవిళంబి, మాఘ శుధ్ధ సప్తమినాడు ఈ స్వామి ప్రతిష్ఠ జరిగింది. విజయనగర సామ్రాజ్యాధీశులైన అచ్యుతరాయల కుమారులు బొమ్మరాయలు, తిమ్మరాయలు, ఒకసారి చంద్రగిరికి వెళ్తూ దోవలో ఈ ప్రాంతంలో విశ్రమించారుట. అపుడు వీరి కలలో స్వామి కనుపించి తానక్కడ బావిలో వున్నానని, తీసి వారి రథంలో పెట్టుకుని వెళ్తుండగా, రథం ఇరుసు విరిగిన చోట ఆలయం కట్టించి, చెరువు తవ్వించమని చెప్పాడుట. ఇక్కడ ఇరుసు విరిగినదని ఆలయం కట్టించి, చెరువు తవ్వించారు.
అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి. అప్పటిదాకా అక్కడ ఊరు లేదు. ఆలయం కట్టాక చుట్టూ ఊరు వచ్చింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత జరిగిన ప్రతిష్ఠ ఇది. ఆ సమయంలో వారు కొంతకాలం చంద్రగిరిని కూడా పాలించారు.
ఆలయ పరిరక్షణ కోసం హరిహర రాయలు, బుక్క రాయలు అక్కడే తమ పేరిట ఒక కోట నిర్మించినట్లు తెలుస్తోంది. కోట ఆలయం చుట్టూ వృత్తాకారంలో వుండి నాలుగు బురుజులు, ఒక సింహ ద్వారం కలిగి వుండేది. ప్రస్తుతానికి వీటి జాడ లేదుగానీ ఇదివరకు వీటి శిధిలాలను చూసిన పెద్దలున్నారు.
ఆలయం పెద్దదే. గర్భాలయంలో చతుర్భుజుడైన జనార్దనస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా విరాజిల్లుతున్నాడు.
విజయనగర రాజుల చిహ్నం వారు కట్టించిన అన్ని దేవాలయాల మీద వుంటుందని ప్రత్యేకించి చూపించారు. ఆ చిహ్నంలో వరాహం (విష్ణు అవతారం), పైన భూమి, పక్కన చంద్రుడు వున్నాయి. దాని అర్థం ఆ చంద్ర తారార్కం భూమి వున్నంతవరకు విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లాలి.
ఈ ఊరుకి రామసముద్రం అనే పేరు రావటానికి ఒక కథ వున్నది. విజయనగర రాజులైన పెనుగొండ పాలకులు రామసముద్రం సమీపంలోని అగ్రహారం వద్ద కరువు పనిలో భాగంగా ఒక పెద్ద చెరువు నిర్మిస్తున్నారు. అగ్రహారంలోని రామలింగేశ్వర, చెన్న కేశవాలయాలు, రామసముద్రంలోని జనార్దనాలయాల్లో నాట్యం చేసే దేవదాసి రామక్క చెరువు చూడటానికి వెళ్ళిందట. చెరువు నిర్మించే పాలకులు రామక్కను ఎగతాళిగా ఇక్కడ ఓ నాట్యం చేసిపోరాదూ… అలసిపోయిన కూలీలు నిన్ను చూసి కష్టం మరచిపోనీ పాపం అన్నారుట. అయితే ఈ రోజు మీరెక్కడా చూడని నృత్యం చేసి చూపిస్తాను అని రామక్క ఏడు పచ్చి కుండలను తెమ్మన్నదట. ఏడు పచ్చి కుండలపై నాట్యం చేస్తూ కుండలు పగిలిపోకుండా తన నాట్యంతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరచిందట. బదులుగా ఏమి కావాలో కోరుకోమని నాట్యకత్తె రామక్కను పాలకులు అడిగారుట. అందుకు రామక్క తన పేరు శాశ్వతంగా వుండేటట్లు ఏమైనా చెయ్యమన్నదిట. ఆ రాజు ఆ గ్ర్రామానికి రమాసుందరి గ్రామం అనే పేరుపెట్టారు. ఆవిడని రామక్కఅని కూడా పిలిచేవారు కనుక రామక్కూరు, తర్వాత వాడుకలో రమాసుందరి గ్రామం కాస్తా రామసముద్రం అయింది. ఇదీ కథ.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్గా వచ్చింది.