శ్రీ మల్లీశ్వర ఆలయం, కొట్రకోన
మర్నాడు (5-2-2019) ఉదయం ఫలహారం అయ్యాక 9 గంటలకు బయల్దేరి 9-25 కి కొట్రకోన చేరాము. చిత్తూరునుంచి 8 కి.మీ.ల దూరంలో గంగాధర నెల్లూరు మండలంలో వున్నది ఈ ఆలయం. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గాలి గోపురం ముందు భాగమున తమిళంలో శాసనాలున్నాయి. నీవా నదీ తీరాన నిర్మింపబడి పూర్వం అత్యంత వైభవంగా వెలిగిన ఆలయాల్లో ఇది ఒకటి.
ఆలయం చుట్టూ ప్రహరీ వుంది. ప్రవేశ ద్వారం దక్షిణం వైపు వుంది. ప్రదక్షిణ మండపం వృత్తాకార స్తంభాల పైవుంది. లోపల ప్రదక్షిణ మండపాన్ని వేరు చేస్తూ 60 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పుతో గర్భాలయం నిర్మించారు. ప్రదక్షిణ మండపం నుండి గర్భాలయం వేరుపడిన చోట వెలుతురు మండపంలోకి వచ్చేటట్లు నిర్మించారు. అలాగే వర్షపునీరు వస్తే బయటకి పోవటానికి వీలుగా కింద కాలువలు నిర్మించారు.
గర్భాలయంలో స్వామి తూర్పుకభిముఖంగా వుంటారు. ఎదురుగా గోడలకున్న కిటికీలనుంచి ఉషోదయంలో సూర్య కిరణాలు స్వామివారిని తాకేటట్లు నిర్మించారు.
గుడి చుట్టూ అతి చిన్న కందకంలా వుంది. చిన్న గుడే. తాళం వేసి వుంది. తాళం చెవులు తెచ్చారు. ఆలయం పునర్నిర్మిస్తున్నారు. బయట గణపతి, దక్షిణామూర్తి, ఇంకా గోడలకి చిన్న శిల్పాలున్నాయి. వెనక మహావిష్ణు, బ్రహ్మ, శివ దుర్గ, కత్తి యుధ్ధం, యుధ్ధ సేన వగైరా బొమ్మలున్నాయి. పునర్నిర్మాణం జరుగుతోందికదా. రాళ్ళ గుట్టలు వగైరా నిర్మాణం జరుగుతున్న స్ధలంలాగే వుంది.
పూర్వం సమస్త పూజలతో ఈ ఆలయం భూలోక వైకుంఠంగా వుండేది. ఈ ఆలయానికి చోళరాజులు విశేష భూ మాన్యాలిచ్చారు. ఆలయార్చనలకుగాను బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చారు. చోళ రాజులు నీవా నదీ తీరం పవిత్రమైనదని ఇక్కడ నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతున్నది.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్గా వచ్చింది.