[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘యాచన’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నిద్రాణ విచక్షణను
ఇక నైనా మేల్కొల్పి
నీచ యుద్ధ నిర్ణయాలను
నివారించమంటూ
విశ్వ దేశాధినేతలకు
వినతి పత్రాన్నౌతున్నాను!
నిజ లాభార్జన ఉద్దేశంతో
దానవావేశంతో
పచ్చని జీవన క్షేత్రాలను
ప్రేత భూములుగా
రక్కసి రాబందుల సీమలుగా
పరిణమింప చేయ వద్దని
ప్రార్థనా గాత్రాన్నౌతున్నాను!
సత్యమైన
నిత్య సంతృప్తిని కూర్చని
సమరాలూ, సంహారాలూ
విపరీత బుద్ధుల
విషపూరిత ప్రతి రూపాలనీ,
వినాశ కాలానికి వేదికలయ్యే
దుష్కృతులనీ
సూటిగా బోధిస్తూ
చాటుగా హెచ్చరించే
సూనృత సూచనల
సూత్రాన్నౌతున్నాను!
మహా సంగ్రామాల
విలయాల వలయాలలో చిక్కి
విల విలలాడుతూ మట్టిపాలైన
నాటి మేటి నాగరికతలూ,
సమాధుల పాలైన
క్రూర జగజ్జేతల
మదోన్మత్త పాలనల కతలూ,
ధ్వంసమై
మాసి
నిర్మానుష్య నిబిడాంధకార నిలయాలై
గబ్బిళాల స్థావరాలైన
గగన చుంబిత రాజ మందిరాల
చరితలూ,
శిథిలమై విలపిస్తూ
విధ్వంసకారులను శపిస్తున్న
అద్భుత శిల్పాకృతులూ
వ్యక్త పరచే దారుణాలను
అంతర్నేత్రాలతో అవలోకించి,
హననాల వలన,
దహనాల వలన,
హరణాల మూలంగా,
మరణాల కారణంగా
అల్లల్లాడిన ఆ ప్రదేశాల
హాహాకారాలను
ఆత్మతో ఆలకించి
కయ్యాలను
విరమించే దారులనూ,
నెయ్యలను
విరచించే తీరులనూ
శోధించమనీ
సాధించమనీ
అధినేతలందరిముందూ
వినమ్ర అభ్యర్థననౌతున్నాను!
ఒక్కగా నొక్క జీవ ధాత్రి భద్రతకై..
ఒప్పైన భవిష్యత్కాల నిర్మాణానికై
ప్రమాణమాచరించమనీ
ప్రయాణమారంభించమనీ
యావత్తూ ప్రాణికోటి పక్షాన
ప్రాధేయపూర్వక
యాచన నౌతున్నాను!