Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తమ స్థాయి సాహిత్య విశ్లేషణలు – ‘వ్యాస రత్నాకరము’ సంపుటాలు

[శ్రీ తురగా కృష్ణ కుమార్ సంకలనం చేసిన ‘వ్యాస రత్నాకరము’ అనే మూడు భాగాల పుస్తకం సమీక్ష అందిస్తున్నాము.]

కప్పుడు తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య సంస్థలు, యూనివర్సిటీలు – ప్రముఖ విద్వాంసులు, పండితులతో సాహిత్య ఉపన్యాసాలిప్పించేవి. ప్రసిధ్ధ రచనలపై విశ్లేషణాత్మకమైన ఉపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించేవి. తద్వారా, సామాన్య పాఠకుడికి సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలతో పరిచయమయ్యేది. ఔత్సాహిక రచయితలకు మార్గదర్శనం లభించేది. సాహిత్యంలో విమర్శ అనే ప్రక్రియ సజీవంగా నిలిచేది. కానీ, ప్రస్తుతం వివిధ సాహిత్య సంస్థలు ముఠాల మఠాలుగా మారేయి. సాహిత్య ఉపన్యాసాల సంగతి అటుంచి భజన బృందాల వికృత గానాలకు వేదికలయ్యాయి. అకాడమీలు, యూనివర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలయి సాహిత్య రాజకీయాలాటలలో మునిగేయి. దాంతో, సామాన్య పాఠకుడి సాహిత్య తృష్ణ తీరే మార్గం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లోటును పూడ్చి ప్రామాణికమైన సాహిత్య  విమర్శనాత్మక వ్యాసాలను పాఠకుడికి చేర్చే బాధ్యతను సాహిత్య ప్రియులు తమ భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేకపోతే మనకు ప్రాచీన సాహిత్యం అంటూ ఒకటి వున్నదని, దాని అధ్యయనం, తమ సృజనను మెరుగు దిద్దుకోవటంలో తోడ్పడుతుందన్న స్పృహ కూడా లేకుండానే సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు, పేర్లు సంపాదించేసి తమకు తెలియందిలేదని భ్రమలో వుంటున్నారు యువ కవి రచయితలు. సాహిత్యం తమతోటే ఆరంభమవుతోందన్న భ్రమలో ఎదుగుతున్నారు. తమ కన్నా ముందు సాహిత్యమే లేదన్న అహం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో, కాల ప్రవాహానికి ఎదురీదుతూ ప్రాచీన కవితా వైశిష్ట్య పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చే వ్యాసాలను ప్రముఖుల వ్యాసాలను మూడు సంకలనాలుగా ప్రచురించి అందిస్తున్న తురగా కృష్ణ కుమార్ అభినందనీయులు.

“సారస్వతంగా భారతీయులు ఆపేక్షించేది సహృదయత. విమర్శ భారతీయం కాదు. కావ్యానుశీలనానికి చరమ ప్రయోజనమే సహృదయత. దాని ద్వారా రసానందాన్ని పొందటాన్ని ప్రాచీనాలంకారికులు సంభావించారు” అంటూ ఈ పుస్తకాల పరంపరకు ముందుమాటను ఆరంభించారు శలాక రఘునాథ శర్మగారు. అంతే కాదు, “భారతీయునికి పాశ్చాత్య ధోరణుల దాస్యం చేసే దుర్గతి ఎప్పుడు కొట్టుకోని పోతుందా?” అన్న ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ముందుమాట రాసిన డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారు “నేటి యువ జనాలు మంచి వక్తలుగాను, పండితులుగాను తయారయ్యేందుకు వీలుగా మార్గదర్శనం లాంటి ఒక చక్కని గ్రంథ సంకలనం” ఇది అని అభిప్రాయపడ్డారు.

“ఈ వ్యాస రత్నాకరము నూరు శాతమూ సమాజానికి ఉపయోగించేదే. ఇది చదివిన వారికి నిస్సందేహంగా చదివినంత ప్రయోజనం వుంటుంది” అని వ్యాఖ్యానించారు ధూళిపాళ మహాదేవమణి గారు.

“వాఙ్మయంలో వేల యేళ్ళుగా రాజనాలు పండించి రాశి పోసిన దిట్టలు-రసరాట్టులు ఎందరో ఉన్నారు. ఆ రాశిలో మేలు కీళ్ళను వింగడించుకుని నేటికి ఫలం రేపటికి బలం పొందగలగటమే ధ్యేయంగా ఆ దిట్టలు – రసరాట్టులు కలం చేసికొన్న సాహిత్యాన్ని వ్యాసాలుగా పరిచయం చేయాలని సంకల్పించి ఈ ప్రయత్నంమొదలుపెట్టినాము” అని ఈ పుస్తకాల పరంపర ప్రచురణ లక్ష్యాన్ని తురగా కృష్ణ కుమార్ తమ ముందుమాటలో వివరించారు.

మొదటి సంపుటిలో మొత్తం పది వ్యాసాలున్నాయి. ప్రథమ వ్యాసం ‘వాల్మీకి హృదయం’ రాసినది డా.కప్పగంతు రామకృష్ణ.

“కాగడా పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించకుండా సధర్మం అంతరించిపోతున్న నేటి తరుణంలో, మనం చూడాల్సింది ధర్మ సంస్థాపనకు మార్గమే తప్ప వాల్మీకి కులం కాదు. మా కులం వాడని, మా జాతి వాడని, మా మతం వాడని వాల్మీకిని కులమతాల కుమ్ములాటలోకి దింపటం మన అమానుష ఆలోచనాధోరణికి నిదర్శనం.” అంటారీ వ్యాసం ముగింపుగా.

ఈ సంకలనంలోని ప్రతి వ్యాసంలో ఇది కనిపిస్తుంది. ఉత్తమ స్థాయి సాహిత్య విశ్లేషణ చేస్తూ, ఆ విశ్లేషణ ఆధారంగా సమకాలీన సాహిత్య ప్రపంచానికి సూచనలందిస్తాయీ వ్యాసాలు.

‘శంకరరమణీయకవిత’ వ్యాసం,  హేతూత్ప్రేక్ష అలంకార వివరణతో సహా, అనేక అలంకారాలు, ప్రయోగాల వివరణలతో అత్యంత హృద్యంగా సాగింది. ముందుమాటలో శలాక వారన్న సహృదయ కావ్యానుశీలనానికి చక్కని ఉదాహరణ ఈ వ్యాసం. కాళిదాసు కావ్యాల గురించి, భవభూతి గురించి, భాస, బాణ, భారవి, దిగ్నాగుడి కావ్యాల గురించిన వ్యాసాలూ ఉత్తమ స్థాయిలో ప్రామాణికంగా ఉన్నాయి.

రెండవ సంకలనానికి ముందుమాటలో డా. కడిమెళ్ళ వరప్రసాద్ గారు “ఈ పుస్తకం ఆసాంతం చదవండి. కాళిదాసు అంటే ఏమిటో తెలిసిపోతుంది. వారి కవితా వైభవం అర్థమవుతుంది” అన్నారు. అది నిజం. ఈ రెండవ పుస్తకం పూర్తిగా కాళిదాసుకే అంకితం. మొదటి వ్యాసం కాళిదాసు చాటువుల గురించి. రెండవ వ్యాసం కాళిదాసు చరిత్ర, ఆయన కవితా వైభవం గురించి సమగ్రమైన సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా అందిస్తుంది. మూడవ వ్యాసం కాళిదాసు శైవోపాసన గురించి. ఈ మూడు వ్యాసాలు ఒకదానివెంట ఒకటి చదవటం ఒక అపూర్వమైన అనుభవం. సాహిత్య విమర్శ ఉత్తమత్వానికి ఈ వ్యాసాలు తార్కాణాలు.

మూడవ పుస్తకంలో అయిదు వ్యాసాలున్నాయి. “అత్యంత ప్రధానమైన రచనా వైశిష్ట్య నిరూపణ విషయంలో ఈ వ్యాసకర్తలందరూ సాఫల్యం సాధించారు” అన్నారు శలాక వారు.

“మన ప్రాచీన భారతీయ సంస్కృతిని పట్టి యిచ్చే సాహిత్య వరివస్య ఈ వ్యాస సంకలన ప్రయత్నం” అని ప్రశంసించారు పొన్నపల్లి శ్రీరామారావు గారు.

అసలు సిసలయిన సాహిత్య విమర్శ పట్ల, ప్రాచీన సాహిత్య పరిచయం పట్ల ఆసక్తివున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన వ్యాసాలీ పుస్తకాలలో వున్నాయి. ఈ వ్యాసాలు చదువుతూంటే, హ్రస్వ దృష్టితో, పాతను నిరాకరించటమే అభ్యుదయం అనుకుని, ప్రాచీన వారసత్వాన్ని తిరస్కరించటమే అభివృద్ధి అన్న అపోహతో, మణిమాణిక్యాలను మట్టి బెడ్డలనుకుని పారవేసుకున్న మూర్ఖజాతి ఎంతెంత,  ఏమేమి నష్టపోతుందో బోధపడుతుంది. ముఖ్యంగా సాహిత్యం ఆత్మగా ఎదిగిన సంస్కృతి తన సాహిత్య వారసత్వాన్ని వదలుకుని బికారీల్లా ప్రేరణకు పరాయి దేశాలవైపు ఆశగా చూసే దౌర్భాగ్యస్థితి బోధపడి తీవ్రమైన ఆవేదన కలుగుతుంది. ఆ ఆవేదన నుంచి మన అత్యద్భుతమైన సాహిత్య వారసత్వాన్ని మనం కాపాడుకోవలన్న నిశ్చయం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని పుస్తకాలు వస్తే ఈ నిశ్చయం ఆచరణలోకి వచ్చేరోజు ఎంతో దూరంలో వుండదన్న భావన కలుగుతుంది. ఈ విషయంలో తురగా కృష్ణ కుమార్ అభినందనీయులు. వారి ఈ కృషి కొనసాగాలనీ, విజయవంతమవాలని సరస్వతీమాతను ప్రార్థిస్తుంది ‘సంచిక’. సాహిత్యాభిమానులు ఈ పుస్తకాలను ఆదరించటం ద్వారా ఉత్తమ విమర్శకు ఊపునివ్వటమే కాదు, ప్రాచీన సాహిత్య ప్రాధాన్యాన్ని ప్రదర్శించినట్టవుతుంది.

***

వ్యాస రత్నాకరము (సాహిత్య వ్యాస సంకలనం)
మూడు సంపుటాలు.
సంకలనకర్తః తురగా కృష్ణ కుమార్
మొదటి సంపుటం పేజీలు: -120, వెల: ₹ 150/-
రెండవ సంపుటం పేజీలు:101, వెల: ₹ 140/-
మూడవ సంపుటం పేజీలు: 92, వెల: ₹ 130/-
ప్రతులకు:
టీ వీ ఎస్ ఎస్ కృష్ణ కుమార్
ఎస్ బీ సీ ప్రిస్టైన్  ప్లేస్ అపార్ట్మెంట్
శ్రీ బాలాజీ లే ఔట్, గాజులరామారమ్
షాపుర్ నగర్, హైదరాబాద్-500055.
Ph: 9908572598.
vssturaga@gmail.com

~

శ్రీ తురగా కృష్ణ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mr-turaga-krishna-kumar/

Exit mobile version