[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
కం.
“మధురా నగరికి రాజౌ!
బుధజను లందరు సతతము పొగడగ, గ్రోలున్
మధు పంచ భక్ష్యము లెపుడు –
విధి నట నుండుటె నయ”మని వెర్రిగ పలుకున్! (76)
కం.
బృందావనికిని రాజై
అందరి మెప్పులను బొంది, యందరి తోడన్
విందుగ పాల్, వెన్న, పెరుగు
పొందిన నది చాలదొక్కొ పుడమిని పుత్రా! (77)
మత్తకోకిల.
మారిపోయితి వేమొ కన్నయ! మారిపోవుచు నీవిటున్
జారిపోయెద వంచు నెప్పుడు జన్మలో తలపోసెడిన్
భారమైన దరిద్ర కాలము వచ్చునం చనుకొంటినా?
దూరమైతివి! నేను చేసిన దోష మేమిటి? చెప్పుమా! (78)
ఉ.
తక్కువ యేమి సేసితిని, దక్కక నీ విటు దూరమౌటకున్?
మిక్కట మాయెనా జనని మిక్కిలి ప్రేమము జూప నీకు? ఇం
కెక్కడొ ఎవ్వరో యొకతె యేదొ వినూత్న విధాన ప్రేమమున్
తక్కెడ తోడ తూచి యిడ – దానికి లోబడిపోతివా సుతా! (79)
చం.
ఒకపరి వచ్చి చూడు! మన యూరును! ఊరి జనమ్ము, జంతువుల్,
వికటము గాను తోచు మన వీధులు, మొక్కలు, చెట్టు చేమలున్,
కకవికలైన పుష్పములు, గందరగోళములైన దృశ్యముల్ –
సకలము కోలుపోయినటు సాక్షిగ నిల్చెడు, నీకు దూరమై! (80)
కం.
మందారమ్ములు పూయవు –
సిందూరమ్ములు విరియవు – చినబోయిన దీ
బృందావన మెల్లయు – గో
విందా! నీ వేణుగీతి వినిపించనిచో! (81)
చం.
నిను గనకున్న గోవు లిట నిక్కిన క్రోధము తోడ మా యుర
మ్మున తమ కొమ్ములన్ విసురు – ముత్తెమునంతయు పాల నీవు – పె
ట్టిన తినబోవు మేతను – పటిష్ఠముగా బలపడ్డ వాని యా
తనువులు బక్క జిక్కె – ఎటు తండ్రి ! సహింతుము మూగ వేదనన్? (82)
చం.
వల వల యేడ్చుచున్నవి దివా నిశలందున , కాన రాని నిన్
తలపుల యందు నిల్పుకొని – తాండవమాడవు – ప్రీతి ధాన్యపుం
బలుకులనైన ముట్టవు – ప్రభాసిత కేశ విభూష గాగ నీ
తలను ధరించు పింఛముల తామిడు నట్టి మయూర జాలముల్! (83)
కం.
ఓయమ్మ! నీ కుమారుడు
మా యిండ్లను పాలు, పెరుగు మననీడంచు
న్నీ యమ్మలు, నా యమ్మలు,
నా యా పొరుగమ్మ లిప్పు డరుదెంచరయా! (84)
ఉ.
తోచదు వారికిన్, మరియు తోచదు నాకును – వార లట్టులన్
పాచియు నూడ్చు వేళ, మరి పట్టపగళ్ళును, రాత్రులందునన్
నీ చిన చిన్న తప్పులను నిందలు వేయుచు చెప్పి, యూగుచున్
పేచిని పెట్టుకోని యెడ! వింతగ నంతయు చిన్నబోయెరా! (85)
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.