[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
తే.గీ.
అవునొ? .. అదియెల్ల నిజమొ? మే మసలు తల్లి
దండ్రులమె కామొ! “దేవకి తల్లియు, వసు
దేవుడే తండ్రి”గా నెంచి, దీనుల మము
విస్మరించితివో నాదు ప్రియ కుమార! (26)
ఉ.
నాకును నీకునున్ నడుమ నాటుక పోయిన ప్రేమ పాశమే
ఆకును చెట్టు కొమ్మ కొస యందున నుండియు త్రెంపినట్లుగాన్ –
మేకును కుడ్యమందు విరమించుట కోసము పీకినట్లుగాన్ –
నీ కనిపించునా తనయ? నేనటులన్ తలపోయజాలరా! (27)
కం.
కుందితి నే నెంతగ పసి
కందగు నిను నాడు నాదు కరములలో నుం
డందుకొని పోయి పూతన
మ్రందించగ జూచినపుడు – మరచితి వేమో!/ (28)
కం.
శకటంబై యసురుం డొక
డొకపరి నీ పైకి వేగ మురుకగ, కని నే
కకవికలైనట్టి విషయ
మొక కొంతైన మదిని గురుతున్నదొ నీకున్? ( 29)
కం.
అత్తకు కోడలికి నడుమ
జుత్తులు ముడివైచి, వెన్న జుర్రెద వని – దు
మ్మెత్తుచు పొరుగిళ్ళ సతులు
వత్తురు చాడీలు జెప్ప, వారిని బంపన్ – (30)
ఉ.
“అల్లరి జేతువే?” యనుచు నాగ్రహమున్ నటియించి నేను నిన్
మెల్లగ కొట్ట రాగ, నను మించు రయంబున పర్గులెత్తి, న
న్నిల్లు నదెల్ల ద్రిప్పుచును నెంతకు జిక్కక – నీరసంబుతో
నుల్లము చేతబట్టి నిలుచుండెడి నన్నపు డల్లుకొంటివో! (31)
కం.
రోలుకు బంధింపగ, నా
రోలునె నీవీడ్చి వెడలి రొప్పుచు గ్రుద్దన్ –
కూలిన మ్రానులు నీపై
వ్రాలెనొ యని నాదు గుండె పగులు టెరుగవే? (32)
సీ.
“కాళింది మడుగులో కాళీయు డుగ్రుడై
కబళించగా నిన్ను కక్షబూని,
అటు పడగల విప్పి, ఇటు తోకతో కప్పి,
నిలువెల్ల మేనితో నిన్ను జుట్ట,
జలము లోలోతులన్ తలమున్క లీవౌచు
వీరోచితంబుగా పోరుచుంటి”
వనుచు నాందోళన నరిగి నాదు కడకు
గోపబాలురు పూస గుచ్చి జెప్ప –
తే.గీ.
చేయుచున్న పనిని యట్లె చేత విడిచి,
నెత్తి, నోరును లబలబ మొత్తుకొనుచు
పరుగు పరుగున నీ చెంత వ్రాలినట్టి
మాతృ హృదయమ్మునే నీవు మరచినావొ? (33)
సీ.
ఘోరాతిఘోరమై కురియ వర్షమ్ము, నా
బీభత్సమున కెల్ల భీతిలంగ –
గోవులున్, గోపికల్, గోపాలురును గూడు
యాదవ కులకోటి కభయమిడగ,
బాలుండ వీవైన భయమన్నదే లేక
గోవర్ధనాద్రిని గొడుగు వోలె
కుడిచేయి చివరలో కొలువైన చిటికెన
వ్రేలితో పైకెత్తి, పిలువ జనుల –
తే.గీ.
చేరినారెల్ల గిరి క్రింద చిత్తమలర!
కాచినావంచు పొగిడె లోకంబు, కాని –
“చితికిపోవునేమొ మరి నీ చిన్ని వ్రేలు”
నంచు నలిగి పోయెనయ – యీ యమ్మ మనసు! (34)
ఉ.
ఎన్నియొ గొప్ప కార్యముల నిట్టుల సల్పుచు నిన్ని నాళ్ళుగా –
నన్నును, నెల్ల వారలను నవ్య విచిత్ర విశేష భ్రాంతిలో
కన్నులు తేలవేయునటుగా పలుమారులు చేసి తీవు! ఆ
మిన్నుల పుష్ప వర్షములు మేనులపై బడె గర్వమొందగాన్! (35)
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.