వెన్నెలకాసే రాత్రులలో హాయిగొలుపు చల్లగాలిలో
ఆ గాలి మోసుకొచ్చిన సుగంధ పరిమళాలు
ఏ వయసువారిని అయినా మురిపిస్తాయి.
కవితలు పుట్టుకువస్తాయి కలలో వింతలూ కనిపిస్తాయి
మనసును మురిపించి మదిలో వీణలు మ్రోగిస్తాయి
అందమైన ఈ ప్రకృతి మైకంలో మనలను ముంచుతాయి.
పచ్చని చెట్ల ఆకులపై తళ తళ లాడే వెన్నెల
అరవిరిసిన పూలసోయగాలను కూడా మైమరిపిస్తోంది
గాలితో కలిసి విరులతో మురిసి ఊయల లూగుతుంది.
మదిలో వీణలు మ్రోగించి ప్రేమగీతాలు ఆలపిస్తుంది
చిలిపి అల్లరి చేసిన గాలి -పయ్యెదతో ఆడుకుంటూ పరువు తీస్తుంటే
సిగ్గుపడిన కన్నె వదనం వెన్నెల రేనికి కనులవిందు చేస్తుంది.
చీకటి రాత్రులలో దేశ సంచారం చేస్తూ ప్రేమ జీవులపై నిఘా వేస్తాడు
వెన్నెల కాసే రోజుల్లో చెలియ మనసుకు గాలం వేస్తాడు
ఎమెరుగని నంగనాచి వెన్నెలరేడు వాడు.
చందమామకు వెన్నెల ఆయుధం విరులకు మకరందం ఆకర్షణ
వెన్నెల కురిపించి పూలలోన తేనే నింపు పోకిరివాడు
మధుపములతో మంతనాలు చేయు టక్కరి దొంగ అతడు.
మేఘరాజుతో కలిసి వర్ష ఋతువులో కుట్రలు చేస్తాడు
సరోవరాన విరియు కన్నె కలువల వలువలు వర్షంతో తడిపేస్తాడు
అయ్యో పాపం! అంటూ సానుభూతి చూపుతాడు ఆ కొంటె గాడు.
ఒక పిలుపేదో గాలి తరంగాలపై తేలి వచ్చెను
అనురాగాగీతమై నా మదిని కదిలించేను
ఆ అలజడిలో నీరూపమే కనిపించును చందమామలో .
నీ చూపులు నాకనులలో వెలిగించును కోటి దీపాలు
ఇక వెన్నెలెందుకు తారల తళుకులెందుకు
చందమామకు నాతో పరిహాసమెందుకు!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.