[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘వెన్నెల బాట’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అలసిన మనస్సును సేదదీర్చే అద్భుతం
నిరాశ చీకటల్లే కమ్మేస్తుంటే
వెలుగుల కిరణమై కాంతిరేఖలు ప్రజ్వలింపజేసే దివ్యత్వం
ఆనందాల వేడుకలని పరిచయం చేసే సమ్మోహనం
ఒంటరితనం హృదయన్ని ఆక్రమిస్తుంటే
అలవోకగా ఒంటరితనాన్ని పారద్రోలే జ్ఞాపకం
ఆశయాల సంకల్పాలను నయనాల ముందు నిలిపి
బ్రతుకు బాటకి దిక్సుచిలా నిలిచే ప్రేరణ..
..ఆమె చిరునవ్వు!
గెలుపు జీవితపు లక్ష్యమయ్యేలా నిలిచే స్ఫూర్తి ఆమె!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.