[సూర్యదీప్తి గారు రచించిన ‘వసివాడని కుసుమం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
వసంతం ఆగమించేవేళ
మనోనందనవనంలో
ఆకాంక్షల పూరెమ్మ మొగ్గతొడిగింది.
కొత్త ఆశలతో కొంగొత్త రంగుల్ని పులుముకుంది.
దానికి వర్ణ వైషమ్యాలు లేవు.
కులమత మర్మాలూ, భాషాభేదాలు లేవు
లింగవివక్ష ఊపే తెలియదు
అంటరానితనాన్ని ఆశ్రయించదు,
అరాచకాల్ని సహించదు..
వర్ణాలు, వాంఛలు దాని దరిదాపుల్లోకి రావు
పేద ధనిక భేదం లేదు
ఈ లోకంలో పూయాల్సిన పువ్వు కాదు
ఈ శోకసముద్రంలో అది నిలబడగా నిలువలేదు.
అయినా ఆవిర్భవించింది
అది మనోనందనవనంలో విరబూసింది
మానవత్వాన్ని ముద్దాడుతుంది
మానని గాయాల్ని మాయం చేస్తుంది
నిష్కల్మషమైన తోటమాలి సంరక్షణలో
నిండుగా నవ్వుతుంది.
బాధావేదనల నిశీధికి
వెన్నెల వెలుగుల్ని అద్దుతుంది
ఉషోదయపు ఉత్తేస్తుంలో
మంచుకిరీటం ధరిస్తూ,
సహనమనే సహజ అందంతో
ప్రతి సాయంత్రాన్ని శోభాయమానం చేస్తూ
అది మనోనందనవనంలో విరబూసింది
అది మనోనందనవనంలో విరబూసింది.
ఆరారు కాలాలు అలాగే పుష్పించాలని కోరుకుంటుంది.
స్వచ్ఛత దాని రంగు
నిస్వార్థత దాని పరిమళం..
దేవుని చెంతన చేరాలనుకోవడం లేదు ఆ పువ్వు
సాటి మనిషిలో దైవాన్ని చూసే
జీవునికి అలంకరించబడాలనుకుంటుంది.
అదే దాని అభిలాష అంటుంది.
అది మాలిన్యం అంటుకొని
ఓ మనోనందనవనంలో పూసింది.
అది వసివాడని కుసుమం.
ఆదే నిత్యనూతన వాసంతం..