[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల బ్రహ్మశ్రీ డా. కట్టమూరి చంద్రశేఖరమ్ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
గురువందనమ్..
తిరుపతి వెంకటేశ్వరులవధానంపు
మందిరంబును కట్టె సుందరముగ
కొప్పరపు కవులు గొప్పగా నందున
రామకృష్ణుని నిలిపె రమ్యముగను
సాధన సేసి ప్రసాదరాయ కులప
తీశ్వరుల్ మంత్రాల తీరు గూర్చె
బులుసపర్ణయు రమ్య పుల్లభొట్ల స్వరూప
దీపముల్ పెట్టుచు దీప్తినింప
శివరామశర్మయు శివదీక్ష పెంపంగ
వేంకట శేషయ్య విందుకూర్ప
రాజశేఖర కవి రమ్యమౌసూక్తుల
పద్య పుష్పాలతో పదములంట
మోహనరాగాన మోహనుడతివేగ
సంరంభమున పద్య సంపదిడగ
రాగాల ఖనియైన నాగఫణీశుండు
ముదుముద్దు పద్యాల ముత్యమీయ
గరికపాటింటియౌ నరసింహ రాయుండు
పగడాల పద్య సంపదలనిడగ
వద్దిపర్తియుకడిమెళ్ళ భవ్యమతులు
రాళ్ళబండి యాశావాది రమ్యగుణులు
దివ్య శిష్యులతో మహదేవమణియు
కంచు కంఠంబు మోగించు కట్టమూరి
ఇంక నెందరు నెందరో యిట్టి వారు
అందమైనట్టి యవధాన మందిరమున
నిత్య సేవలు సేయంగ నిలిచినారు
అమ్మ అవధానమాత! జోహారులివియె
~
(శ్రీ కట్టమూరి చంద్రశేఖరమ్ గారు)
ఈనాటి మన వందే గురు పరంపరామ్ లోని గురుదేవులు అవధాన భారతి; అవధాని శేఖర; శత సహస్రావధాన సామ్రాట్టు; ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత; మహా కామేశ్వరి పురస్కార గ్రహీత; సువర్ణకంకణ, గండపెండెర సన్మానితులు; బ్రహ్మశ్రీ డా. కట్టమూరి చంద్రశేఖరమ్ గారు శ్రీ సూర్యసదన ఆస్థాన పండితులు, గరివిడి, విజయనగరం జిల్లా.
అవధానము-ఒక పరిచయము
తెలుగుభాషలో అనేక సాహితీ ప్రక్రియలు ఉన్నాయి అందులో అవధాన ప్రక్రియ ఒకటి. ఏ భాషలోనూ లేని ప్రత్యేక ప్రక్రియ మన ఆంధ్రభాషలో ఉండడం మన తెలుగువారి అదృష్టం. దీనిని ఒక సాహిత్య క్రీడగా భావించి కృషి చేసి పేరుపొందిన వారు ఎందరో మహనీయులు ఉన్నారు. ఈ ప్రక్రియ మరుగున పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేసిన వారిలో సుప్రసిద్ధ పండితవంశంలో జన్మించిన అవధానభారతి; అవధానశేఖర డా.కట్టమూరి చంద్రశేఖరమ్ గారు ప్రముఖులు. చంద్రశేఖరమ్ గారు ‘నందన’నామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి నాడు సాలూరు తాలూకా శివరామపురం గ్రామంలో జన్మించారు.
డా. కట్టమూరి చంద్రశేఖరమ్ గారు
కట్టమూరి చంద్రశేఖరమ్ గారి ఆశయము – లక్ష్యము
డా. కట్టమూరి చంద్రశేఖరమ్ గారి జీవితం త్రిభిన్నంగా గంగా, యమునా, సరస్వతి సంగమ ఝరి లాగా వృత్తి, ప్రవృత్తి, ఆధ్యాత్మికత ముప్పేటలా కలగలిపి మూడు రంగాలను ఎంతో ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లి తన వంశానికి పేరు ప్రతిష్టలు తేవడమే కాకుండా తనకు తన కుటుంబానికి ఎంతో తృప్తిని, సంతృప్తిని మిగిల్చారు.
బాల్యము- కుటుంబ నేపథ్యము
కట్టమూరి చంద్రశేఖరమ్ గారి తండ్రి కట్టమూరి లక్ష్మీనారాయణ కొండలరావుగారు భాషాప్రవీణ; సాహిత్య విద్యాప్రవీణ సంస్కృత మరియు తెలుగు పండితులుగా పనిచేశారు. తల్లి శ్రీమతి వెంకటసుబ్బలక్ష్మి ఆమె కూడా భాషా ప్రవీణ చదివారు. తెలుగు పండితురాలుగా పనిచేశారు.
తల్లిదండ్రులు శ్రీమద్వాల్మీకి విరచిత ‘సుందరకాండ’ కు అర్థ తాత్పర్య విశేషములతో ‘సుందరార్ధ ప్రకాశిక’ అనుగ్రంధం వ్రాశారు.
మాతామహులు శ్రీమతి సత్యనారాయణమ్మ విద్వాన్ శ్రీ ఆకెళ్ళ అరుణాచలశాస్త్రిగారు మహారాజా సంస్కృత కళాశాల విజయనగరంలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
పితామహులు వైదిక ఆచార సంపన్నులు. స్మార్త పౌరాణికులు. ఉపన్యాసకులు.
ఈ విధంగా కట్టమూరి, ఆకెళ్ళ ఇరువైపులా సంస్కృతపండితులు కావడంతో వీరికి వంశపారంపర్యంగా అవధానము; పురాణపఠనము; ప్రవచనము; కవిత్వము; పాండిత్యము రావడం జరిగింది.
తల్లిదండ్రులు తల్లి శ్రీమతి వెంకటసుబ్బలక్ష్మి తండ్రి కట్టమూరి లక్ష్మీనారాయణ కొండలరావుగారు. వీరికి ఏడుగురు సంతానము.
డా. కట్టమూరి చంద్రశేఖరం గారి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ కొండలరావు, వెంకటలక్ష్మి గారు
పెద్దకుమారుడైన శ్యామలరావు 19 సంవత్సరముల వయసులో ఎం.ఎ. గణితము చదువుతుండగా అకాల మరణం చెందినాడు. చంద్రశేఖరమ్ గారు రెండవవారు. మూడవవారు అరుణాచలం స్టెనోగా ఉద్యోగం ప్రారంభించి, అకౌంట్ ఆఫీస్ లో సెంట్రల్ ఆఫ్రికాలోని మలాలిలో పనిచేస్తున్నారు. అక్కడే స్థిరపడినారు. నాలుగవ సోదరుడు సత్యనారాయణమూర్తి స్టేట్ బ్యాంకు ఉద్యోగస్తుడు. అయిదవ సోదరుడు సూర్యనారాయణమూర్తి అనేక ప్రైవేటు సంస్థలలో పనిచేసి, పదవీవిరమణ అనంతరం ప్రస్తుతము పౌరోహిత్యము చేస్తున్నారు. తర్వాత సోదరి కామేశ్వరి గృహిణి మరియొక సోదరి విజయలక్ష్మి పాలకొండలో ఆర్.సి.యం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
విద్య
చంద్రశేఖరమ్ గారు అక్షరాభ్యాసం చేసినది ఒరిస్సా రాష్ట్రంలోని గురండి అనే ప్రదేశం. రెండవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు రాజమండ్రిలో. ఏడు ఎనిమిది తరగతులు మరడాం హైస్కూల్లో. తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు బొబ్బిలి సంస్థానం హైస్కూలులో చదివారు.
మాతామహులు విజయనగరంలో పదవీ విరమణ పొందిన తర్వాత రాజమహేంద్రవరంలో విద్యాపీఠంలో చేరారు. అదే సమయంలో వీరి నాన్నగారు కూడా సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రవేశించినారు.
1969 మధ్య కాలంలో మరనూతులు ఉండేవి. వీరు ఉన్న ప్రాంతమంతా మంచి తోటలతో కూడినది. అక్కడే ఆటలు పాటలు సాగించారు. తాతగారితో కలిసి ఆశ్రమ పాఠశాలకు వెళ్లడం జరిగింది. సాధుస్త్రీల మఠం అంటే వీరభద్రపురం అచలాశ్రమం ఆల్కట్ గార్డెన్స్ పెద్ద స్టేషన్ ఎదురుగా సందు. బహుశా ఈ వారసత్వము సంస్కారము వలన శేఖరంగారి మనుమలు ఇప్పుడు వీరితో పాటు తిరగడం జరుగుతోంది. అమ్మమ్మగారితో కార్తీకమాసంలో తెల్లవారుజామున స్నానాలకు వెళ్లడం అదో అనుభవం. తాతగారితో సాయంకాలం రెండు మూడు కిలోమీటర్ల దూరం అప్పటికి రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన నడిచి వెళ్లడమే జరిగేది.
తీర్చిదిద్దిన గురువులు
చిన్ననాటి నుండి పాఠాలు చెప్పిన గురువులు ఎందరో! భాషాప్రవీణ చదివే రోజుల్లో ఖాళీగా ఉన్నప్పుడు శ్రీ తాత సూర్యనారాయణమూర్తి అప్పటికి ఆయన వయస్సు 80/90 సం.లు వారి వద్ద జ్యోతిష్యం నేర్చుకున్నారు. శ్రీ సామవేదుల రామగోపాలశాస్త్రిగారు చదువు విషయంలో అవధానం విషయంలో ప్రోత్సాహపరచారు.
భాషాప్రవీణతో విద్యాభ్యాసం ప్రారంభించి క్రమంగా ఎం.ఎ.తెలుగు మరియు ఎం.ఎ.సంస్కృతములో కూడా చేసారు.
1992లో ‘శ్రీ ముఖలింగక్షేత్ర మహాత్మ్య కావ్యానుశీలనము’ అనే అంశముపై ఎం.ఫిల్. చేసిన సమయంలో శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారితో పరిచయం ఏర్పడింది. నాటినుండి నేటివరకు వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతోంది. వారి సూచన మేరకు పి.హెచ్.డి. ‘ఆంధ్రమహాభారతము-మానవసంబంధాలు’ అనేఅంశముపై పరిశోధనచేసి, పట్టా పుచ్చుకోవడం జరిగింది.
వీటితోపాటుగా తల్లిదండ్రులు మాతామహుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన సంస్కృత, ఆంధ్రభాషాపాండిత్యం, ప్రాచీన సాహిత్యంపై అభిరుచి కలిగింది. అందువలన అవధానాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని ఈ కళ మరుగున పడిపోకుండా తనవంతు ఏదో చేయాలనుకుని మొదలుపెట్టి 50 సంవత్సరాలు నిర్విరామంగా అవధానాలు చేస్తున్న అవధాన శిరోమణి, సద్గురువుల కృపతో వారి సాంగత్యంతో ఆధ్యాత్మికతలో పురాణ ప్రవచనాలు, రామాయణము, సుందరకాండ, మైథిలి, మొల్ల మొదలగు ఎన్నోకావ్యాలను రచించి, సాహితీరంగంలో తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఎందరో విద్వాంసులు వారి రచనలను చదివి “సూక్ష్మంలో మోక్షముగా వారు చెప్పిన ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఎందరికో మార్గదర్శకాలు” అన్నారు.
సాధారణంగా వ్యక్తులు ఏదో ఒక రంగంలో విశేషమైన కృషిని చేసి అత్యున్నతస్థానాన్ని అందుకుంటారు. కానీ వీరు బహుముఖంగా తనకు గల పాండిత్యాన్ని విద్యార్ధులకూ, యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా మలచుకుని ‘భువనవిజయం’ లాంటి నాటకాలు వేసినా ‘అవధానయజ్ఞాలు’ చేసినా వారినే లక్ష్యంగా దృష్టిలో ఉంచుకొని రచనలు చేశారు.
అవధానంపై ఆసక్తి
1970నుండి బొబ్బిలిలో ప్రతి సం.ము ఇంట్లోనే దసరా ఉత్సవాలు, నవరాత్రులు పూజలు జరిగేవి.
బొబ్బిలిలో చదువుకునే రోజుల్లో శ్రీ బుర్రా రామ్మూర్తిగారు అనేక ప్రాంతాలలో అవధానం చేసేవారు. చంద్రశేఖరమ్ గారు చదువుతున్న సంస్థానం హైస్కూలులో కూడా చేసారు. అయితే ఆ రోజు అనారోగ్యం వలన చంద్రశేఖరమ్ గారు పాఠశాలకు వెళ్లలేకపోయారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లాలో సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చదివేటప్పుడు ప్రప్రథమంగా శ్రీ పేరాల భరతశర్మగారి అవధానం చూసారు. అది చూసాక అవధానము చెయ్యాలనే సంకల్పం కలిగింది. మిత్రులతో కలిసి 01-11-1973 న నమూనా అవధానం మిత్రబృందం మధ్య చేశారు. కానీ అది వారికి సంతృప్తిని ఇవ్వలేదు. ఆ ప్రయాణం తాత్కాలికముగా విరమించుకున్నారు. సంపూర్ణంగా భాషాప్రవీణ పూర్తి చేసిన తర్వాత 1975 ఆగస్టులో ఉద్యోగంలో ప్రవేశించారు.
1975సం. దసరాల్లో అవధానం చేయడానికి ముందుగా తల్లి అనుజ్ఞ తీసుకున్నారు.
తండ్రితో “నేను అష్టావధానం చేయాలనుకుంటున్నాను” అని అడిగారు. వీరి నాన్నగారు మొదట అనుమతించలేదు. రెండు కారణాలు ఒకటి వీరి వంశంలో తండ్రిగారికి ముందు మూడవ తరంలో లక్ష్మణశాస్త్రిగారు ‘రామప్రభ’ శతకం రాసారట. అందులో ఆరవ పద్యంలో ఇంట.. ట అనే అక్షరం పడిందట. దాని వలన వారు మరణించారట. అందుకని అప్పటినుండి ఏవో పద్యాలు వ్రాయడమే కానీ పెద్దగా గ్రంథాలు వ్రాసిన వారు లేరు. కాబట్టి వారు కవిత్వం మీద మక్కువ చూపించలేదు.
రెండవ కారణం వీరి తండ్రిగారు పండితులుగా పేరు తెచ్చుకున్నవారు. ఒకవేళ శేఖరంగారు అవధానం సరిగా చేయకపోతే వారికి చెడ్డపేరు వస్తుందని భయం. ఏమైనా ఈ విషయంలో వీరిని నడిపించినది వీరి ఇలవేల్పు లలితాదేవి.
తొలి అవధానానికి శ్రీకారం
కట్టమూరివారి ఇలవేల్పు లలితాదేవి కృపాకటాక్షాలతో 1975 సంవత్సరం విజయదశమినాడు బొబ్బిలిలోని వారి నివాస గృహంలో పండితుల సమక్షంలో తొలి అవధానం ప్రారంభించారు. శ్రీ పేరాల భరతశర్మగారి ప్రేరణతో, అమ్మవారి ఆశీస్సులతో, పండితులకు నిలయమైన బొబ్బిలి పట్టణంలో, విద్యాదానం చేసిన గురువులు, ఉద్దండ పండితుల ఎదుట అవధానం సామాన్యం కాదు. అయినా సాహసంతో చేయగా వారంతా అంగీకారముద్ర వేశారు.
చంద్రశేఖరమ్ గారు తాను చదువుకున్న పాఠశాలలోనే అవధానం చేయడమనే బంగారు అవకాశాన్ని 24సం.ల వయసులోనే అందిపుచ్చుకున్నారు.
ఆనాటి సంస్థానం హైస్కూల్ కు జిల్లాలోనే ప్రత్యేకస్థానం ఉండేది. పాఠశాల హెడ్మాస్టర్ డి.రాజముని స్వామినాయుడుగారు, శేఖరంగారి అవధానాన్ని గురించి విని, “మన స్కూలులో కూడా మా శిష్యుని అవధానం ఏర్పాటు చేస్తాను.” అన్నారు. బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యారణ్యవారి అధ్యక్షతన అవధానం ఏర్పాటు చేసారు. సంస్థానం హైస్కూలు రాజా కళాశాలలో పనిచేస్తున్న పండితులు నాటి సభలో ప్రేక్షకులు. అది 1975లో జరిగింది.అవధాన యాత్ర ప్రారంభం అయింది.
1978లో బొబ్బిలిలో ‘శ్రీ కళాభారతి’ సంస్థ కొత్తగా స్థాపించబడింది. వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వేణుగోపాల స్వామి వారి పిలిపించి ఆ సంస్థ ద్వారా అవధానం చేయించారు.
‘ఇంట గెలిచి రచ్చ గెలవాలని’ కదా సామెత ఈ విధంగా మూడుసార్లు బొబ్బిలిలో అవధానం జరిగింది.
వృత్తి:
ఉద్యోగ జీవితంలో ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా అడుగుపెట్టి జూనియర్ కళాశాలలో ఉపన్యాసకునిగా క్రమంగా కళాశాల అధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు.
ఉద్యోగ విజయాలు 1975 ఆగస్టులో విశాఖ సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో తెలుగు పండితునిగా పనిచేశారు. 1975 నుండి 1982వరకు. ఈ ఏడు సంవత్సరాలు వారి ఉద్యోగ యాత్రలో స్వర్ణ యుగంగా భావిస్తారు. అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి ప్రణాళికాబద్ధంగా పాఠాలు పూర్తి చేయడం ఒక వంతు. కానీ విద్యార్థుల్ని అనేక సంస్థలకు వక్తృత్వ, వ్యాసరచన, ఏకాంకిక నాటికలకు పోటీలకు పంపడం బహుమతులు పొందడం జరిగేది. ఆ రోజులలో బాలల అకాడమీ ఉండేది. దానికి కూడా పిల్లల్ని పోటీకి పంపడం జరిగింది. ఆ ఏడు సంవత్సరాలు పాఠశాల వార్షికోత్సవానికి సాంఘిక, చారిత్రాత్మక నాటకాలు వ్రాసారు. కొన్నింటిలో నటించారు. అన్నింటికీ దర్శకత్వం బాధ్యత వారిదే! చంద్రశేఖరమ్ గారి పేరును సీతారామరాజుగా మార్చిన నాటకం అల్లూరి సీతారామరాజు. సామాన్య తెలుగు పండితులకు ఆ రోజులలో ఇలాంటి నాటకాలు ఖర్చుతో కూడుకున్నవి. దానికి పెట్టుబడి రెవరెండ్ ఫాదర్ హెచ్.జోజిబాబుగారు చూసేవారు. తాను చేసే అన్ని కార్యక్రమాలకు ఎంతో ఆదరణ, ఆత్మీయత, ప్రోత్సాహాన్ని అందించే వారిని ‘గాడ్ ఫాదర్’ గా చంద్రశేఖరమ్ గారు భావించేవారు. ఆ సమయం లోనే పిల్లలు కోసం సుమారుగా 15 బాలల నాటికలు రాసారు.
అంచెలంచెలుగా ప్రమోషన్లు వచ్చి జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరరుగా బారువ, పాలకొండ, రాజాం, ఎలమంచిలి, బలిజపేట, గజపతినగరంలలో పని చేశారు.
2006 వరకు ఎంతో ఇష్టంగా చాలా విరివిగా చేసే అవధానాలను తగ్గించారు. తర్వాత ప్రిన్సిపల్ అయిన తర్వాత బాధ్యతల వలన అవధానాలు చేయడం తగ్గించుకోవడం జరిగింది.
ప్రిన్సిపాల్ గా ప్రభుత్వ జూనియర్ కళాశాల బలిజపేట మరియు నెల్లిమర్ల లో చేశారు.
నెల్లిమర్లలో పనిచేసినప్పుడు ‘కళాజాత’ నిర్వహించడం, రెండు సం.లు ఉత్తీర్ణతా శాతం పెంచి, జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రథమస్థానంలో నిలపడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
తెలుగుభాష గొప్పదనాన్ని విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రోజులలోనే దేశభక్తి, చరిత్ర, నీతిదాయకమైన నాటకములు, నాటికలు రాసి పిల్లలతో వేయించేవారు. లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్, గ్రంథాలయ సంస్థలు ఇతర సంస్థలు నిర్వహించే పోటీలకు తమ పాఠశాల నుండి పిల్లలకు శిక్షణనిచ్చి పంపించేవారు. కళాశాలలో ఆర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి పిల్లలలో సాహిత్యం పై అభిలాష కలిగించేవారు.
వివాహము- సంతానము
డా. కట్టమూరి చంద్రశేఖరం రాజరాజేశ్వరి దంపతులు
చంద్రశేఖరమ్ గారి వివాహం 09-12-1976లో దర్భా వేంకటసుబ్బారావు, సీతారాఘవమ్మల రెండవ కుమార్తె 02-01-1962లో జన్మించిన రాజరాజేశ్వరితో జరిగింది.
డా. కట్టమూరి చంద్రశేఖరం గారి అత్తమామలు కీ.శే. దర్భా వేంకట సుబ్బారావు, శ్రీమతి సీతారాఘవమ్మ
వీరు కృష్ణాజిల్లా గుడివాడకు చెందినవారు. అతను పోస్ట్ మాస్టరుగా పనిచేశారు. ఎక్కువ కాలం అనకాపల్లిలోనే పనిచేయడం వలన అక్కడే స్థిరపడిపోయారు. వివాహసమయానికి ఆమె పదవ తరగతి చదువుతోంది. అప్పటికి ఆమె చదువుకు వివాహం ఆటంకం అయింది. కానీ ఆ తర్వాత ఆమె దూరవిద్య ద్వారా ప్రైవేటుగా బి.ఏ. పాసై ఎం.ఏ. తెలుగు చేయడం జరిగింది. సాధారణ గృహిణిగా ఇంట్లోని అందరికీ తలలో నాలుకగా అందరి అవసరాలూ చూసుకుంటూ ఉండడం అలవాటు చేసుకున్నారు.
డా. కట్టమూరి చంద్రశేఖరం గారి కుటుంబం
వీరికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి బాలా త్రిపురసుందరి సాహిత్యరత్న; ఎం.ఏ. హిందీ చేసి జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు సూర్యతేజ
రెండవ అమ్మాయి నాగజ్యోతి ఎంఎస్సీ;బి.ఇడి.; చేశారు. నాగపూర్ణచందర్రావు భర్త. వీరికి వైష్ణవిఅపర్ణ, అమృతవర్షిణి అని ఇద్దరు అమ్మాయిలు.
సద్గురు పరిచయము
స్కాంధపురాణంలోని ఉత్తరఖండములో గల శ్లోకమును మనందరం చిన్నప్పటినుండి పఠిస్తూ ఉంటాము.
“గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః”
అని పూజించడానికి మనం సిద్ధంగా ఉంటాం. అటువంటి గురువు ఎవరు?? అని వెతుక్కుంటూ ఉంటాము. అదేవిధంగా గురువులు కూడా తనకున్న సర్వవిజ్ఞానాన్ని అందించడానికి సరియైన శిష్యులను వెతుక్కుంటూ ఉంటారు. వారు మన ఎదురుగా నిలబడినా కూడా మన కర్మ పరిపక్వం అయ్యేవరకు మనం వారిని పోల్చుకోలేము. దానికి ఉదాహరణ గురుదేవులతో చంద్రశేఖరమ్ గారికి కలిగిన మొదటి పరిచయం. 1991వ సంవత్సరంలో రేగిడి ఆమదాలవలసలో మాజీమంత్రి శ్రీ కళావెంకట్రావుగారి ఆధ్వర్యంలో జరుగుతున్న యజ్ఞం సమయంలో అవధానం చేయడానికి ఆహ్వానించారు. అవధానం పూర్తికాగానే ఒకపెద్దాయన ఒక చిన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం బహుకరించారు. వారు ఎవరో తెలియదు. అతడే తనను చేయిపెట్టి నడిపించే గురుదేవుడైన బ్రహ్మశ్రీ వేమకోటి కృష్ణయాజిగారు అని వారికి తెలియలేదు.
1994-95లో గురుదేవులు పార్వతీపురం సూర్యసదనంలో సంవత్సరకాలం జరిగిన సత్రయాగంలో చంద్రశేఖరమ్ గారితో అవధానం చేయించాలని మిత్రులకు చెప్పారు. 05-02-1995న శ్రీ సూర్యపీఠంలో అవధానం జరిగినప్పుడు గురువుగారితో పరిచయం ఏర్పడింది. కానీ అప్పటికి కూడా వారే తన ఆధ్యాత్మిక గురుదేవులని తెలియలేదు.
ఆపై వారు గరివిడిలో శ్రీ సూర్య సదనం నిర్మించారు నాటి నుండి నేటి వరకు చంద్రశేఖరమ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ సూర్య సదనంతో ప్రత్యేక అనుబంధం ఉంది.
కృష్ణయాజిగారు- శ్రీ సూర్య సదనం
వేమకోటి కృష్ణయాజిగారు 1941లో జన్మించారు. పార్వతీపురం వీరి జన్మస్థానం. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి కుమారులు ఇరువురు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ఆధ్యాత్మిక బాటలోనే నడుస్తున్నారు. కృష్ణయాజిగారు 1978లో పార్వతీపురంలో స్థాపించిన సూర్యాసదనం వీరి పెద్ద కుమారుడైన వేమకోటి నరహరిశాస్త్రి 1995లో గరివిడిలో స్థాపించిన సూర్యసదనం వేమకోటి సూర్యనారాయణ శర్మ చూసుకుంటారు.
సద్గురువులు వేమకోటి కృష్ణ యాజి గారు గురుపత్ని వేమకోటి శుభలక్ష్మి గారు
కట్టమూరి చంద్రశేఖరమ్ గారు శ్రీ సూర్యసదనానికి ఆస్థానపండితులు. 2010-2011 సం.లో సత్రయాగము ఒక ఏడాదిపాటు జరిపించారు. తరువాత 2017సం.లో 12 సం.లు జరిగే బృహత్ సత్రయాగమును ప్రారంభించారు. దీని యొక్క ఆశయం లోకశాంతి విశ్వకళ్యాణం అందువలన ఈ సూర్యసదనాన్ని, సత్రయాగాన్ని దర్శించి, ఆశీస్సులు అందజేయడానికి శ్రీ శంకరాచార్యులు, నిశ్చలానంద సరస్వతీ మహారాజ్, శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి, భారతీతీర్థ స్వామివారు, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి మొదలగు అనేక పీఠాధిపతులు దర్శించి ఆశీస్సులు అందజేశారు.
గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా, గురుపుత్రులు బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ, శ్రీ విద్య దంపతులను సత్కరిస్తున్న కట్టమూరి దంపతులు
కృష్ణయాజిగారు సౌరదీక్ష సార్వభౌమ; దత్తపీఠబంధు; కర్మయోగి; హరిహరానంద స్మృతి పురస్కార గ్రహీత; తిరుపతి రాష్ట్రీయ సంస్కృతి పీఠం నుంచి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు; భారత ప్రభుత్వం రాష్ట్రపతి పురస్కార గ్రహీత. 19-06-2017న పరమపదించారు.
గురుకృప:కర్మ ఫలితం:
బలిజపేటలో కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నపుడు గురుకృప వలన తరచూ సూర్య పీఠానికి వెళ్లడం చుట్టుపక్కల గ్రామాలలో అనేక కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగేది.
ఎవరైనా కర్మను అనుభవించే తీరాలి. తప్పించుకోవడం కుదరదు అనేదానికి ఒక ఉదాహరణ- ఒకసారి గురువుగారు వేరొకరి సాయంతో కార్లో కాలేజీకి వచ్చారు. కానీ ఆ సమయంలో శేఖరంగారు జిల్లావిద్యాశాఖాధికారిని కలవడానికి వెళ్లిపోయి వారిని చూడలేకపోయారు. చంద్రశేఖరమ్ గారికి చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందని తెలిసి వారొక యంత్రాన్ని పూజలో పెట్టి తీసుకుని వారి దగ్గరకు వచ్చారు. అయినప్పటికీ కర్మ ఫలితంగా గురువుని కలవలేకపోయారు.
ఆ రోజు ఉదయం గురువుగారు ఫోన్ చేసి “ఇవాళ మనం కలుసుకోవాలి.” అన్నారు. ఎక్కడ? ఎన్ని గంటలకు? అని అడగలేదు. ఉద్యోగపరంగా పని ఒత్తిడిలో వారిని కలుసుకోవడం జరగలేదు.
“నగురో రధికం, నగురో రధికం, నగురో రధికం, నగురో రధికం
శివ శాసనత శ్శివ శాసనత శ్శివ శాసనత శ్శివ శాసనత.”
శివుని శాసనం గురువు కంటే అధికుడు లేడు,లేడు,లేడు,లేడు అని. శివశాసనమే గురుపూజ.
ఫలితం అదే రోజు కనిపించింది. ఒక పెద్ద ప్రమాదం జరిగి తృటిలో తప్పించుకోగలిగారు. ఎందుకంటే మన సంచితకర్మ పుణ్యమైనా, పాపమైనా అనుభవించాలి కదా! అయితే గురుకృప ఉండడం వలన అది స్వల్పంగా జరిగింది. (కొండ విరిగి మీద పడవలసిన ప్రమాదం చిన్న రాయి తగిలి తప్పిపోయినట్టుగా అయింది.)
“మనసా, వాచా, కర్మణా, మన ధన, ప్రాణములను గురుపాద పద్మముల చెంత నుంచి నీవే తప్ప నితః పరంబెరుంగ” అని శరణాగతితో గురువును ప్రార్థించిననాడు ఆ గురువు మనకు సచ్చిదానంద మార్గమును చూపగలడు. ఆ విధముగా ఈ జన్మలో శేఖరంగారికి లభించిన సద్గురువులు పరమ పూజ్య వేమకోటి కృష్ణయాజిగారు
1996లో కృష్ణయాజిగారు కొంతమంది మిత్రులతో కబురు పంపించారు. “శ్రీశ్రీశ్రీ కృష్ణయాజి గురువుగారు మిమ్మల్ని సుందరకాండ గేయకృతిగా వ్రాయమని ఆదేశించారు.” అని చెప్పారు. అప్పటికి శేఖరంగారి తండ్రిగారు సుందరకాండ కోరిన వారి ఇండ్లలో పారాయణ చేస్తున్నారు. అటువంటిది వీరిని ఈ పనికి ఆదేశించడం ‘గురుకృప’ తప్ప మరేమీ కాదని అర్థమైంది.
వెంటనే గురువుగారి దర్శనం చేసుకుంటే “అందరికీ అర్థమయ్యే రీతిలో సుందరకాండను గేయ కావ్యంగా రాయండి.” అని ఆశీస్సులు అందించారు.
1997లోనే సద్గురువులు శ్రీ వేమకోటి కృష్ణయాజిగారి ఆశీస్సులతో వారు కోరిన విధంగా కొద్ది నెలల వ్యవధిలోనే సుందరకాండను పాటల రూపములో రాసి, వారికి సమర్పించడం జరిగింది. దానికి ‘సుందర గీతామృతం’ అని పేరు పెట్టారు. సంగీత పరిచయం ఏమాత్రం లేని వీరిని సుమారు 100 గ్రామాలలో కుటుంబ సమేతంగా పాడుతూ, ప్రచారము చేయమని ఆదేశించారు. భవిష్యత్తులో జరిగే ఏవో సంఘటనలు వారికి ముందే తెలుస్తాయేమో!
కష్టాలలో, ఆపదలలో తరింప చేసేది ‘సుందరకాండ’ అని ఆధ్యాత్మిక సంపన్నులు అంటారు. అందుకే గురువులు చెప్పినవిధంగా ఇప్పటికీ కట్టమూరివారి కుటుంబములో అందరూ ‘సుందరకాండ గానామృతం’ అన్నిచోట్లా చేస్తున్నారు. ఈ గానామృతాన్ని చాలా ప్రాంతాల్లో ఎంతోమంది విని, వారు కూడా నేర్చుకొని చేస్తున్నారు.
“మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్
యత్కృపా తమహం వందే పరమానందం మాధవమ్!”
శ్లోకం గుర్తు వచ్చింది. వెంటనే ఆ కావ్యాన్ని వారి షష్ట్యబ్ది మహోత్సవం సందర్భంగా గురుదేవులకు అంకితం ఇవ్వడం జరిగింది.
వృత్తి-ప్రవృత్తి రెండు కళ్ళుగా భావించేవారు.
వృత్తికి సంబంధించిన ఏ విద్యార్థులైతే నిత్యము తనతో కలిసి మెలసి ఉంటారు వారిని భాషాభిమానులుగా చేయడం కోసం అను నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు.
ప్రవృత్తిపరంగా అష్టావధానాలు చేయడం, గీతామృతం గానం చేయడం, ధార్మిక ప్రసంగాలు, సాహిత్య ప్రసంగాలు, నాటకాలు రచించడం, వేయడం, వేయించడం, నేటి సమాజంలో జరుగుతున్న అనేకమైన సంఘటనలపై సందర్భానుసారంగా స్పందించి పద్యాలు కవితలు రాయడం అనేక పత్రికలకు కాలమిస్టుగా వ్యవహరించడం, అనుభవాలు. శ్రీ సూర్య సదనంలో సంవత్సర కాలం జరిగిన సత్రయాగంలో 30-05-2010 నుండి 17-05-2011 వరకు ఈ యజ్ఞంలో రామాయణ పారాయణ చేయండి.” అని గురువుగారు ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒక పక్షం కాగానే పూర్ణాహుతి జరిగేది. ఈ విధంగా సంవత్సర కాలంలో 24 పారాయణలు పూర్తి చేయడం అనేది గురువు ఇచ్చిన బలమే!
2011 అక్టోబరు 9,10 &11 తేదీలలో చంద్రశేఖరమ్ గారికి షష్ట్యబ్ది ఉత్సవం వారి శ్రీమతి రాజేశ్వరిగారు లక్షవర్తి మహోత్సవం 60 సం.ల అభినందన సంచిక ‘హరివిల్లు’ విడుదల; ఆకాశంలో చంద్రుని చుట్టూ హరివిల్లు ఆవిష్కృతమవడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తర్వాత వారి ఇంటిలో ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు.
2013 ఆగస్టు నెలలో ధన్వంతరి యాగశాలలో సుందరకాండ పారాయణ చేస్తున్న సమయంలో “సుందరకాండ 108 రోజులు పారాయణం చేయమని ఎవరో చెవిలో చెప్పారు.” విషయం కనుక్కుందికి గురువుగారి సన్నిధికి వెళ్ళారు. ఒక కార్యక్రమం కోసం హైదరాబాదు టికెట్లు రిజర్వ్ చేయించుకున్న కట్టమూరి దంపతులతో “శ్రీరాముని కృప మీపై పడినది కనుక దీక్ష తీసుకోమని” తెలిపారు. గురువుగారి ఆదేశం మేరకు దీక్షాబద్ధులై 30-08-2013 నుండి 11-12-2013 వరకూ 108 రోజులు హనుమద్దీక్ష చేపట్టి సుందరకాండ పారాయణలు; నిత్యపూజ; ప్రత్యేక తిథులలో ప్రత్యేక పూజలు; సుందరకాండ హవనం; జపాలు, తర్పణాలు శ్రీ సీతారామ సువర్చలాంజనేయ కళ్యాణ, పట్టాభిషేకాలు జరిగాయి.
గురువుగారు చంద్రశేఖరమ్ గారికి కుండలాలు, సువర్ణకంకణం, గండపెండెరం వేయడం ‘శత అష్టావధాన సామ్రాట్’ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. చంద్రశేఖరమ్ గారు అప్పుడప్పుడు గురువుగారి వద్దకు వెళ్ళినప్పుడు అనేక విషయాలపై చేసిన ప్రసంగాలలోని ముఖ్య విషయాలను పుస్తకాలలో కొన్ని, మస్తకంలో కొన్ని దాచుకొని తాను వ్రాసిన గ్రంథాలలో వాటిని పొందుపరచారు.
గత 25 సంవత్సరాలుగా అవధానాలు అసంఖ్యాకంగా చేస్తున్నచంద్రశేఖరమ్ గారికి అవి ఆపేయాలని ఉద్దేశం కలిగింది. 2000సం.లో ఒక సెలవురోజు గురువుగారిని దర్శించుకుని వద్దామని అవధానవిద్యను వారి పాదాల చెంత సమర్పించి వచ్చేద్దామని వెళ్లారు. గురువుగారు కృష్ణయాజీగారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ రోజు శ్రీ ఆంజనేయస్వామి వారి పుట్టినరోజు. మారుతీ వ్రతము చేస్తున్న సమయము. వారి ముందు కూర్చున్నాక “ఈరోజు మారుతి పుట్టినరోజున మీరు వచ్చారు. ఇంకా ముందు ముందు అవధానాల్లో మంచి స్థాయిని పొందుతారు.” అని దీవించారు. సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి ఆ రీతిగా పలికించిందని అనుకుని మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసారు. అప్పటినుండి అమ్మవారు, గురువుగారు ఇరువురి దీవెనలతో ద్విగుణీకృత ఉత్సాహంతో అవధానాలు జరుగుతూనే ఉన్నాయి.
తొలి ద్విగుణిత అష్టావధానం గజపతినగరం శ్రీ చైతన్య భారతి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆలోచన ఇచ్చిందే తడవుగా ద్విగుణిత అష్టావధానాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు సరసుడు సహృదయుడు పల్లి తిరుపతిరావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేద్దామంటే అందర్నీ విడిచి అందని లోకాలకు వెళ్లిపోయాడు. డాక్టర్ పిలకా శాంతమ్మగారు లైన్స్ క్లబ్ విజయనగరం శాఖకు అధ్యక్షురాలు ఆమె త్రిగుణ అష్టావధానాన్ని ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు.
ఒకేరోజు రెండు అవధానాలు-రెండు బిరుదులు
1994 ఉగాది రోజు విజయనగరంలోని ‘విజయభావన’ సంస్థ వారు ఆచార్య భావన గారు అవధానం ఏర్పాటు చేశారు. ఆ రోజుకో ప్రాధాన్యం ఉంది ఒకే రోజు రెండు చోట్ల అవధానం జరగడం అది ఒకటి తల్లితండ్రిగారి ఊరు విజయనగరంలోని తండ్రితండ్రిగారి ఊరు సాలూరులోనూ జరగడం ఒక విశేషం. విజయభావన వారు ఫోటోలు పంపుతూ అవధాని గారి పేరు ముందు ‘అవధాన శేఖర’ అని బిరుదు చేర్చి పంపించారు. బొబ్బిలి శ్రీ కళాభారతి వారు ‘అవధాన భారతి’ బిరుదుతో సత్కరించారు. ఈ రెండు ఒకేసారి జరగడం విశేషం.
అభినవ శతావధానము 2009వ సం.లో ఉద్యోగంలో రిటైర్ అయ్యాక 2010 సంవత్సరం నుండి పాఠశాలలో పిల్లలకు పద్యం పై మక్కువ కలిగించాలని పద్య ప్రచారానికి అనువుగా ‘అభినవ శతావధానము’ అనే నూతన ప్రక్రియను తయారుచేసి తొలి ప్రదర్శనను శ్రీ సూర్య సదనములో ఇచ్చారు. అనేక ప్రాంతములలో సుమారు 20 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. ఇది అవధానం కాదు కానీ ప్రాచీన గ్రంథాలలో ఉన్న మంచి పద్యాలను ప్రచారం చేయాలని ఇది ముఖ్య ఉద్దేశం ఇందులో ధారణ ప్రధాన అంశం.
సంకల్పం మనదైతే ఎలా చేయించాలో అమ్మ చూసుకోగలరు అన్నదానికి ఉదాహరణ 40 సంవత్సరాలలో 70 అవధానాలు చేశారు.
తర్వాత వివిధ ప్రాంతాలలో అవధానాలు జరిగాయి.బొబ్బిలిలోనే మరో ఐదు సార్లు జరగడమే కాక రాష్ట్ర ప్రాంతాల్లో కూడా అవధానాలు జరిగాయి. మధ్యలో రెండేసి సంవత్సరాలు ఖాళీ కూడా ఏర్పడేది. అయినా అమ్మదీవెనతో అవధానాలు అత్యంత రసవత్తరంగా సాగిపోయేవి. విశేషమేమిటంటే ఇలాంటి విద్యలు గురుముఖత నేర్చుకోవాలి ‘శాస్త్రమాచార్య సన్నిధి చదవడేని’ అని శ్రీనాథ వాణి నేర్చుకోకపోతే రాణింపు ఉండదు కానీ వారికి ఎవరు ఈ విద్యలో గురువు లేరు అంతా ఆ తల్లే ఆ అమ్మదయతోనే ఎన్నో ప్రాంతాలు తిరిగివచ్చే అవకాశం లభించింది. ఎన్నో ప్రాంతాల్లో సత్కారాలు లభించాయి.
డా. కట్టమూరి చంద్రశేఖరం దంపతులు అందరూ మహిళలతో అష్టావధానం చేసిన దృశ్యం
అవధాన యజ్ఞం:
అవధాన ప్రక్రియ నిలబడాలంటే వృక్షాలకు కాదు చెట్లకు నీళ్లు పోయాలని తలంపు కలిగి ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో తెలుగు పద్యం బాగా చదివేవారు తెలుగు పాఠం చక్కగా చెప్పగలిగేవారు తెలుగుభాషపై పట్టు కలిగినవారు తగ్గుతున్న తరుణంలో ఈ ప్రక్రియను విద్యాసంస్థలలో చేయాలని సంకల్పంతో వాటిని లక్ష్యంగా చేసుకొన్నారు.
ఒక్క సంవత్సరంలో 40 అవధానాలు చేయాలనుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో దీనికి అవధానయజ్ఞం అని పేరుపెట్టి సంవత్సరకాలం యజ్ఞదీక్షకు కాలపరిమితిని వారే నిర్ణయించుకున్నారు. 2015 నుండి 2016 వరకు 40 అవధానాలు లేదా సంవత్సరకాలం ఏది ముందైతే అది అనుకుంటే చంద్రశేఖర అవధానిగారికి పరమగురువులైన శ్రీ కృష్ణయాజిగారు ఆశీస్సులతో ప్రారంభించిన ఈ యజ్ఞం ఎన్నో అవాంతరాల మధ్య సం.కాలంలో 35 అవధానాలు చేయగలిగారు. అవధాన యజ్ఞం పూర్తి అయింది.
64 ఏళ్ళ వయస్సులో అవధాన యజ్ఞమును ప్రారంభించి ఒకసం.కాలంలో 35ప్రాంతములలో అవధానములు చేయుట అనన్య సామాన్యమైన విషయం. అంతేకాక ఆ 35 ప్రాంతంలోని అవధాన విషయములను ధారణలో ఉంచుకొని దానిని గ్రంథస్తం చేసి ప్రజలకు అందించవలెనని వీరి సంకల్పము ప్రశంసనీయము. ఇందులో తెలుగు మాధ్యమిక పాఠశాలలు 14 ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు 6 కళాశాలలు 6 వివిధ సంస్థలు 5 ఉత్సవాలు 4.
04-12-2016 మార్గశిర శుద్ధ పంచమి ఆదివారం నాడు అవధానాల విజయం అనే పేరుతో పుస్తకముగా ప్రచురణ చేసి ఉచితంగా పంచి భారతమాత పాదపద్మములకు అంకితమిస్తూ ఇలా అంటారు.
అవధానయజ్ఞంబు నాత్మలోనెందుకు
సృజియించినావొ!నీకృపయెకాదె
ఈ వయస్సున కల్గెనింత సాహసం
బన్నచో నీ దయలున్న మాటె
నలుబది వత్సరాల్ నడిపించి తవధాన
బాటలోనన్న నీ భవ్య మహిమె
బిరుదులుసన్మానపెండెరసత్కర
ములవెల్ల కల్గెనీ కలిమివలన
నలువరాణి!యుపాసనబలమె యింత
చలము కలిమియు బలము వాగ్బలము గూర్చె
కాన ‘అవధానయజ్ఞమన్’ గ్రంథమిదియు
అంకితముగా నిచ్చెదనందుకొనుమ
యోగా యొక్క అష్టాంగయోగములలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మరియు సమాధి. ఆరవది ధారణ చెప్పిన విషయమును లేదా పద్యమును ధారణలో ఉంచుకొనుట సామాన్యమైన విషయము కాదు. అవధాన ప్రక్రియకు ధార, ధారణ, సమయస్ఫూర్తి అవసరము హృద్యంగా పద్యం చదివి శ్రోతలను ఆకట్టుకోవడం వీరి ప్రత్యేకత. అవధానములో క్లిష్టమైన నిషిద్ధాక్షరి. ప్రతి అక్షర నిషేధంతో నిషిద్ధాక్షరీ నడక నల్లేరుపై బండిలా అవధానంతో సాగడం వీరి ప్రజ్ఞ పాటవాలకు నిదర్శనం.
మామూలుగా చేసే యజ్ఞాలకు ఆధ్వర్యంలో ద్రష్ట, ఉపద్రృష్ట మొదలైనవారు ఎందరో ఉండాలి. అదేవిధంగా అవధాన యజ్ఞానికి పృచ్ఛకులు ఉండాలి. పృచ్ఛకుడు అడిగే విషయాన్ని బట్టి మంచి పద్యాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా పాఠశాలలో ఎనిమిది మంది పృచ్ఛకులు దొరకడం కష్టం. అందుకోసం కొందరు విశ్రాంత తెలుగు పండితులను అవధానం పై అభిమానం కలిగిన వారిని ఎంపిక చేసుకుని ఒక బృందంగా ఏర్పాటు చేసి దానికి అవధాన యజ్ఞం బృందం అని పేరు పెట్టి అవసరమైనప్పుడు ఇందులోని సభ్యులను అవధాన యజ్ఞంలో వాడుకోవడం జరిగింది. ఈ యజ్ఞానికి శ్రీ సరిపల్లి సోమేశ్వరరావు గారు ద్రష్టగా పనిచేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఉపాధ్యాయులతో మాట్లాడటం, పృచ్ఛకులను సిద్ధపరచడం, వారికి కావలసిన ఏర్పాట్లు చూడడం అందరూ కలిసి ప్రయాణం చేసి వెళ్ళేవారు. యజ్ఞం బృందంలో సుమారు అందరూ ఉభయభాషా ప్రవీణులు. పాఠశాలలతో అనుబంధం ఉన్నవారు. తెలుగు పండితులుగా, ప్రధానోపాధ్యాయులుగా భాషపట్ల అభిమానము మెండుగా కలవారే!
శ్రీ మేడూరి సూర్యసత్యనారాయణమూర్తిగారు ఎంతో నిశితంగా పద్యాలను వినేవారు. అపశృతి దొర్లినా అడిగేవారు. ఒక ఉదాహరణ పెద్ద మేడపల్లిలో జరిగిన అవధానంలో ప్రార్థనలో ఒక అపశృతి కలిగింది. వారు అడిగారు. శేఖరంగారికి ఇంటికి వచ్చాక తెలిసింది. నాన్నగారు అస్వస్థులైనారని మూడు రోజులు తర్వాత పరమపదించారు.
అవధానయజ్ఞంలో ప్రాత రాజేశ్వరరావు గారు, పంతుల దక్షిణామూర్తి ప్రసాదు గారు, కాకరపర్తి మార్కండేయులు గారు, దశగ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యం గారు, కాకరపర్తి మురళీప్రసాద్ గారు, డా. జక్కు రామకృష్ణ గారు, ఆర్.ఎం.ఎస్.శాస్త్రి గారు, రాళ్లపల్లి రామసుబ్బారావు గారు, కాకరపర్తి పద్మనాభశర్మ గారు, బల్లమూడి శంకర్రావు గారు, రామమడుగు వెంకటసుబ్రహ్మణ్యం గారు మొదలగు ప్రముఖులు విశేషపృచ్ఛకులుగా పాల్గొన్నారు.
తెలుగు పండితునిగా పనిచేస్తున్న జి.రామయ్యరెడ్డి గారు అన్నమాచార్య సంగీత పీఠానికి కార్యదర్శిగా ఉన్నారు. వారు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామాలలో అక్కడివారికి సాహిత్యంపై అభినివేశం కల్పించడానికి అవధానం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఉపాధ్యాయ మిత్రులను తెచ్చారు. వినాయక నవరాత్రుల్లో జరగడం వలన అనేకమంది ప్రేక్షకులు హాజరైనారు. ఈ అవధానం రాత్రి 9:30 కు ప్రారంభమై పదిన్నరకు ముగిసింది. రాత్రి 12:30 వరకు గ్రామస్తులు అడిగిన అనేక సందేహాలను నివృత్తి చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.
పృచ్ఛకులుగా వ్యవహరించిన పండితవరేణ్యుల బృందం ఈ విధంగా అంటారు.
“తక్కువ సమయంలో, పొందికైన నూతన పదాలతో పూర్తిచేయడం ఆయన అనుభవ పరిణతికి నిదర్శనం. అన్ని అవధానాలను ధైర్యంగా నిర్వహించడం. అప్రస్తుత ప్రసంగంలో కూడా అసహనంగాని, అశ్లీలతగాని, అవహేళనగాని లేకుండా నిర్వహించడం ఆయన ప్రియభాషణ సౌజన్యానికి నిదర్శనం. వాగ్దేవి కటాక్ష సంపన్నులైన శ్రీ చంద్రశేఖరమ్ గారు శబ్దప్రసార యంత్రాల అవసరం లేకుండానే సభలో చివరనున్నవారికి కూడా స్పష్టంగా వినపడేలా పలుకగలిగే కంచుకంఠధ్వని అమ్మ ఇచ్చిన వరం. 65 సంవత్సరాల వయసులో కూడా మానసిక, శారీరక, దృఢత్వాన్ని కలిగి ఉండడం తల్లిదండ్రులు ఇచ్చిన వరం. పట్టుదల ఆయన ప్రత్యేకత. అందుకే గురువుల అనుగ్రహంతో 100 అవధానాలు పూర్తిచేసి సూర్యసదన ఆస్థాన పండితులుగా ఆస్థానాన్ని అందుకొని శత అష్టావధాన బిరుదాంకితులై రెండవసారి కూడా గండపెండెరాన్ని ‘అవధానసామ్రాట్’ బిరుదును పొందగలిగారు. సరస్వతీమాత సేవలో ధరించి మరెన్నో అవధానాలను చేయాలని కోరుకుంటున్నాము. చక్కగా సమయస్ఫూర్తితో ఆయన అవధానాలలో చేసిన సమస్యలు, పూరణలు, దత్తపదులు, వర్ణనలు ప్రత్యేకించి నిషిద్ధాక్షరులు వారి కూలంకషప్రజ్ఞకు తార్కాణాలు. పురాణపఠనంలో భారత, భాగవత, రామాయణాది ప్రాచీన గ్రంథాలలో ఏ విషయం అడిగినా ఎంత అవలీలగా చెప్పగలరో ఆధునిక సాహిత్యం (గడియారం వారి శివ భారతం) నుంచి అడిగిన ప్రశ్నలకు కూడా అంతే చక్కగా సమాధానం చెప్పడం సామాన్య విషయం కాదు.
అలాగే మిత్రుల కోరికపై కూడా కొన్ని అవధానాలు చేయడం జరిగింది మైత్రి మీడియా ద్వారా జరిగింది. మిత్రులు బొంబాయి వారి కోరికపై ఆన్లైన్ లో 01-09-2024 నాడు అవధానం చేయడం జరిగింది. శిష్యుని కోరిక మీద రాచకిండాంలో 16-11-2024 జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది.
అవధాన స్వర్ణోత్సవం
అవధానములో 50 సంవత్సరాల కృషికి కౌముది పరిషత్ వారు సాహితీ సార్వభౌమ బిరుదుతో సత్కారం చేస్తున్న దృశ్యం
విజయనగరం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సాహితీ సంస్థ కౌముది పరిషత్ సాహితీసంస్థ.
కౌముది పరిషత్ 80 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా కూడా శ్రీ చంద్రశేఖరమ్ గారు అవధానం చేయడం జరిగింది.
50 సంవత్సరాల నుండి అనేక అవధానాలు చేశారు. పాఠశాల విద్యార్థులకు ఆంధ్రభాషపై స్ఫూర్తిని కలిగించే విధంగా విద్యాసంస్థలలో అవధానం చేయడం ఇందులో కొన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు కూడా ఉండడం వీరి కృషికి నిదర్శనం. అవధానయాత్ర కొనసాగుతూ ఉన్నందున ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తించిన కౌముది సాహిత్యపరిషత్తు సంస్థవారు ‘సాహితీ సార్వభౌమ’ అనే బిరుదుతో సత్కరించారు. చంద్రశేఖరమ్ గారు కూడా చంద్రునికో నూలుపోవుగా 50మంది సాహితీవేత్తలను చిరు సత్కారం చేసుకోవడం జరిగింది.
కట్టమూరి చంద్రశేఖరం గారికి సూర్య సదనములో కాలికి గండపెండెరం తొడుగుతున్న దృశ్యం
ధార్మిక కార్యక్రమాలు:
ధార్మిక కార్యాలు చేయాలంటే పెద్ద ధనపురాశి కాదు కావలసినది పెద్ద మనసు. అది మన అవధానిగారికి మెండుగా ఉందని ఆయన తన కష్టార్జిత ధనముతో చేసిన ధార్మిక కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది..
- 2000 సం.లో వివాహరజతోత్సవం సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం
- 2013లో లోక రక్షణ కొరకు 108 రోజుల దీక్ష తీసుకొని ధర్మరక్షణకు వినియోగించడం
- 2015- 16 లో అవధాన యజ్ఞం
- 2017లో అష్టోత్తర కలశములతో సీతారామ పట్టాభిషేకం సందర్భంగా అన్ని కులముల వారిచే స్వామికి అభిషేకం
- 2018 ‘నందనవనం’ అనే ఖండకావ్యమును వ్రాసి సైనికులకు అంకితం ఇచ్చి, 40 వేల రూపాయలు సైనిక నిధికి అందజేయడం
- 2019లో అయోధ్యలో రామాలయ నిర్మాణమునకు దీక్ష తీసుకుని 151 రోజులలో 24 పారాయణలు పూర్తి చేసి 24 మంది పండితులను రప్పించి వారిచే పారాయణం చేయించి ఉచిత భోజన వసతులతో శ్రీశ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకమును చేయటం
- 2021 జనవరిలో శ్రీమతికి షష్టిపూర్తి సందర్భంగా 72 మంది దంపతులతో ఉగ్రరథ భీమరథ శాంతులను చేయించడం అప్పుడు చేయాలని బుద్ధి పుట్టడం దైవ ఘటన
ఉగాది నాడు సప్తగిరి చానల్ లో ప్రసారమైన దేవసభ
ధర్మో రక్షతి రక్షితః
08-01-2021లో గరివిడిలో కుమార్తె ఇంటి శంకుస్థాపన సమయంలో చంద్రశేఖరమ్ గారి భార్య రాజేశ్వరిగారికి పొలమారి కొంచెం దగ్గు వచ్చింది ఎంతసేపు తగ్గలేదు. ఫిబ్రవరిలో గొంతు పక్కన చిన్నవాపు వచ్చి క్రమంగా నొప్పి పెట్టడం డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు తీసుకుంటే తగ్గినట్టే తగ్గి, మళ్లీ ఎక్కువైంది. డా.పి.వి.ఎస్.కుమార్ గారు అన్ని పరీక్షలు చేయించి, ‘థైరాయిడ్ క్యాన్సర్’ అన్నారు. టెస్టులన్నీ చేసి “మే నెలలో ఆపరేషన్ చేయాలి” అని చెప్పారు. అప్పటికే స్కాన్లు, ఎక్స్-రేలు, రేడియేషన్ వీటి కోసం కాగితాలు పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫున అప్లికేషన్ పెట్టారు.
‘ఆపన్నులకు దేవుడే రక్ష’ అంటారు. గవర్నమెంట్కి కాగితాలు పంపించడంతో పాటు మూడుచోట్ల ఆమె పేరు మీద జపాలు చేయించడం జరిగింది. ప్రభుత్వము అంగీకరించిన కాగితాలు వచ్చాయి. డాక్టర్ రేడియేషన్కి రమ్మన్నారు. అంతకుముందు కొంచెం పెద్ద దోసకాయసైజులో ఉండే క్యాన్సర్ కంతి నిమ్మకాయ సైజుకి మారింది. అందువలన రేడియేషన్ అవసరం లేదని డాక్టరు అన్నారు. తర్వాత ఆపరేషన్ చేయాలని సిద్ధం చేశారు. మేజర్ ఆపరేషన్ అని అనుకున్నారు ఆపరేషన్ చేస్తే గొంతు రాకపోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్లు ముందుగానే చెప్పారు. మే నెలలో ఆపరేషన్ అయింది. తర్వాత కొంత జపం చేసి ధార పోయడం వలన కొంత సులభంగా ఆపరేషన్ అయింది. గొంతు కూడా బాగుంది. డిసెంబర్ వరకు ఆరు కీమోలు చేశారు. తర్వాత ఆమె తేరుకుని మామూలు మనిషి అయ్యారు. కానీ వారిచ్చిన మందుల్లో ఒకదాని వలన ఆమెకు ‘హార్ట్ ఎటాక్’ వచ్చింది. అందువలన 2022 డిసెంబర్లో హాస్పిటల్లో చేర్చారు. 3 వాల్వులు బ్లాక్ అయ్యాయని చెప్పి బైపాస్ ఆపరేషన్ చేశారు. విశాఖ కేర్ హాస్పిటల్ లో 2023 ఫిబ్రవరి నెల ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆమె బాగున్నారు. దేవికృప వలన మంత్రజపం యొక్క శక్తి వలన ఆమె తిరిగి మామూలు మనిషిగా అందరిమధ్య తిరుగుతున్నారు. అంటే మన కర్మ మనం ఆచరించుకుంటూ పోతే మనలను రక్షించే బాధ్యత భగవంతుడే చూసుకుంటాడు. ఇది ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇందులో మామూలుగా అయితే మధ్యతరగతి వాళ్ళకి ఇన్నేసి ఆపరేషన్ లు అంటే కష్టం కానీ ప్రభుత్వం యొక్క ఖర్చుతోనే ఇదంతా జరిగాయి అని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గర్వంగా చెప్పగలుగుతున్నారు.
‘ధర్మో రక్షతి రక్షితః’
ఇతర ప్రవృత్తులు
అమ్మవారి ప్రత్యక్షప్రసారం వ్యాఖ్యానం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు, విజయనగర రాజవంశీకుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో 2017సం.లో మొదటిసారిగా అమ్మవారి ప్రత్యక్ష ప్రసారంలో బ్రహ్మశ్రీ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరమ్ వ్యాఖ్యానం వాజి ఛానెల్ వారు ఏర్పాటు చేశారు.
మైత్రీ మీడియా లో శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం
తరువాత 2018సం.నుండి ‘మైత్రి’ మీడియాలో జరుగుతోంది. కరోనా సమయంలో కూడా ఆగకుండా నిర్విఘ్నంగా ఈనాటి వరకూ జరుగుతోంది. ఇటువంటివి అమ్మవారి కృపతోనే జరుగుతాయని విశ్వాసము.
టీవీలో పంచాంగ శ్రవణం చేస్తున్న డా. కట్టమూరి చంద్రశేఖరం గారు
కౌముది పరిషత్తులో అవధానంలో 50 సంవత్సరాలుగా అవధాన యాత్ర చేస్తున్న శ్రీ చంద్ర శేఖర గారు భువన విజయం దృశ్యం
భువనవిజయం నాటకం వ్రాయాలని చంద్రశేఖరమ్ గారికి ఎప్పటినుంచో కోరిక. అమ్మవారి ఉత్సవాలలో నాటకం రాయడం జరిగింది. కొందరు నటులుగా తెలుగు పండితులను ఎంపిక చేసారు. మొత్తం 45 పద్యాలలో వారు స్వంతంగా వ్రాసినవి 25 పద్యాలు. వీరికి సహాయకులుగా సుధాకర్ గారు మంత్రిగా వేస్తున్నారు. రచన, దర్శకత్వం, కృష్ణదేవరాయలుగా శేఖరమ్ గారే వేస్తున్నారు. ఇప్పటికీ మూడు ప్రదర్శనలు ఇచ్చారు. ఒకటి అమ్మవారి ఉత్సవాలలో రెండవది విశాఖ కళాభారతిలో, మూడవది శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో.
విశాఖపట్నం శ్రీ కళాభారతిలో భువన విజయం వేసిన దృశ్యం
చంద్రశేఖరమ్ గారి రచనలు ఒక పరిశీలన
సద్గురు మహిమ: శ్రీమతి అండ్ శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరమ్ రాజరాజేశ్వరీ దంపతులకు శ్రీ సూర్య సదనములో శ్రీ శార్వరీనామ సం. మార్గశీర్ష బహుళ పంచమి భానువారం 03-01-2021 నాడు 60 మందితో ఉచిత సామూహిక ఉగ్రరథ, భీమరథ శాంతి చేయు శుభసమయంలో సద్గురువుల చేతులమీదుగా రామాయణ విశేషములతో వెలువడిన గ్రంథరాజము ‘శ్రీ సద్గురు మహిమ’ ఇందులో గురు మహిమ, రామాయణ విశేషాలు ఉన్నాయి.
గరివిడి సూర్యసధనంలో ఉగ్రరథ భీమరథ పూజా సమయంలో 108 కలశలు ముత్తైదువులతో
ముందుగా సంక్షిప్త రామాయణము, బాల రామాయణమునకు తెలుగు పద్యములు తేటగీతిలో కూర్చినారు. రెండవ భాగములో వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్రము లోని 24 అక్షరములకు 24వేల శ్లోకములో వాల్మీకి రామాయణంగా వ్రాసారు. ఇంతవరకు అందరికీ తెలుసు కానీ రామాయణంలోని 24 శ్లోకములు ఒక దగ్గర చేర్చి అవి రామాయణంలో ఏకాండలో ఎన్నో అధ్యాయంలో ఎన్నవ శ్లోకముగానో చెప్తూ ఆ శ్లోకం యొక్క భావమును కూడా తెలియజేస్తూ గాయత్రి రామాయణమును సూక్ష్మంలో మోక్షంగా మనకు సంక్షిప్తంగా అందించారు. మూడవ భాగంలో ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం రామాయణంలో శ్రీరాముడు యుద్ధకాండలో 107 వ సర్గలో అగస్త్య మహాముని ద్వారా ఆదిత్య హృదయము గురించి విని, మూడుసార్లు జపించి, రావణసంహారము చేశారు అందువలన ఆరోగ్యం కోరుకునే అందరూ దీనిని తప్పక పఠించవలసినదిగా కోరుతూ ఆదిత్య హృదయము యొక్క శ్లోకాలను భావముతో పాటు ఇక్కడ ఉంచారు. నాలుగవ భాగంలో సద్గురు మహిమను తెలియజేస్తూ అనేక శ్లోకంలో వాటి భావములు తెలియజేస్తూ తనకు గురుకృప ఎప్పుడు ఎలా కలిగింది అనే విషయాలను తన అనుభవాలతో రంగరించి అందరకు అందించారు. ఐదవ భాగంలో రామాయణములో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్యవిశేషాలను శ్లోకాలు భావాలు సహితంగా క్లుప్తంగా ఏడు పేజీలలో మనకు అందించారు.
‘శ్రీ రామచిలుక’: శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి 17-07-2022 ఆదివారం నాడు చంద్రశేఖరమ్ గారి 71వ జన్మదిన సందర్భంగా వారి గురుదేవులైన శ్రీ సద్గురు శ్రీకృష్ణయాజి గారి దివ్య ఆశీస్సులతో ఆవిష్కరింపబడినది ‘శ్రీ రామచిలుక’.
గతించిపోయిన కాలంలో నుండి అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొని వారి చరిత్రను ఒక చారిత్రక నవలగా మలచడం అనేది సాహసమే కావచ్చు కానీ వారి గురువుల యొక్క కటాక్షంతో’శ్రీరామచిలుక’ పేరుతో మొల్ల జీవితాన్ని గురించి రాసి అందరినీ మెప్పించగలిగారు. తన గురుదేవులైన శ్రీ కృష్ణయాజి గారి ఆశీస్సులతో మనకు అందించారు.
మైథిలి: పౌరాణిక నవల శార్వరీ నామ సంవత్సర నిజ ఆశ్వయుజ శుద్ధ విదియ 18-10-2020వ తేదీ సామ్రాజ్య పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా వెలువరించారు. పరిపూర్ణ శ్రీ రామావతారంలో శ్రీరామునికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో సీతాదేవికి కూడా అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే రావణ సంహారం కోసమే సీతాదేవి అవనిజగా జన్మించింది వాల్మీకి మహర్షి ఒకచోట అంటారు. ‘సీతయాశ్చరితం మహత్’ ఎంతోమంది ఎన్నో విధాలుగా రామాయణాన్ని రచించి అఖండ ప్రజానీకానికి అందించారు. ఈ మైథిలి నవలలో అమ్మవారు పుట్టడం దగ్గర నుండి అవతార సమాప్తి వరకు వ్రాయడం జరిగింది. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలలో రామకథని రచిస్తే చంద్రశేఖరమ్ గారు 24 ప్రకరణాలలో మైథిలి నవలను రచించారు. 29-04-2020న ప్రారంభించి, 22-05-2020 నాటికి పూర్తి అయింది. అంటే ఇంత తొందరగా పూర్తి చేయడం అనేది భగవత్కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఈ గ్రంథాన్ని తన గురువులందరికి అంకితం చేశారు.
ఈ పుస్తకానికి ముందు మాటలు సత్యాన్వేషణ పేరుతో బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణశర్మ శ్రీ విద్యా సౌరశక్తి పీఠం శ్రీ సూర్య సదనం గరివిడి; ఆప్త వచనం పేరుతో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, శారదాపీఠం, విశాఖపట్నం; నవలాశేఖరం పేరుతో శ్రీమతి కోలవెన్ను మలయవాసినిగారు, విశ్రాంత ఆచార్యులు, విశాఖపట్నం. ఉరోని పేరుతో కథా సంవిధాన చక్రవర్తి రావి.ఎన్.అవధానిగారు నవల గురించి అద్భుతంగా పరిచయం చేసారు.
శ్రీమతి ధవళ హేమ కామేశ్వరి గారు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వర్ణచిత్రాలుగా వేశారు. ఈ చిత్రాలను ఎక్కువమంది ప్రజలు వీటిని వీక్షించడానికి అనువుగా వేయి సం.ల పురాతన ఆలయమైన శ్రీ మన్నారు రాజగోపాలస్వామి మందిరంలో ఉంచారు. అందులో కొన్నిచిత్రాలను వారి అనుమతితో ఈ గ్రంథంలో నవల ముఖచిత్రంలోనూ ప్రత్యేకంగా ఒక 15 వర్ణ చిత్రాలను పుస్తకంలో ఇమిడ్చారు.
హేమ కామేశ్వరి గారు వేసిన రామాయణం చిత్రాలు
కాళికా స్తుతి శార్వరీ నామ సంవత్సరం మార్గశిర బహుళవిదియ 31-12-2020న శ్రీ సూర్య సదనము గరివిడిలో శ్రీ సద్గురు జ్ఞాన బోధ విశ్వశాంతి మందిరము ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరణ చేశారు. కాళికాస్తుతిగా పేరుపొందిన ఈ గ్రంథంలోని 10 శ్లోకాలు కాళిదాస దశ శ్లోకీగా ప్రచారంలో ఉన్నవి. పూజలు ప్రతిష్టలు జరిగినప్పుడు స్వాధ్యాయంలో వీటిని ప్రవచిస్తూ ఉంటారు. ఇది అశ్వధాటిలో వ్రాయబడిన శ్లోకాలు చదువుతున్నప్పుడు కూడా పరుగు తీస్తుంటే ఏ విధమైన శబ్దం వస్తుందో అదేవిధమైన శబ్దం వస్తుంది. అందువలన వీటి అర్థాలు భావాలు ఏమిటి? అని తెలుసుకోవాలని జిజ్ఞాసతో శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారి వద్ద భావాలు తెలుసుకొని ఈ గ్రంథం వ్రాసారు.
ఈ పది శ్లోకాల యొక్క పదఛేదము, అన్వయక్రమము, ప్రతిపదార్థము, భావము, విశేషంశాలు ముఖ్యంగా లలితా సహస్రనామాలతో వీటిని కొంతవరకు అన్వయిస్తూ అమ్మవారి దయతో రాయడం జరిగింది. ఈ గ్రంథాన్ని మాతృతుల్యులు, గురుపత్ని అయిన శ్రీమతి వేమకోటి శుభలక్ష్మిగారికి అంకితం ఇవ్వడం జరిగింది.
శ్రీముఖ లింగ క్షేత్ర మహత్యం- కావ్యానుశీలనము ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథము.
శ్రీముఖలింగ క్షేత్రము ఉత్తరాంధ్ర ప్రాంతంలో వంశధార నదీతీరంలో వివిధ తీర్థాలతో కూడిన క్షేత్రంలో ప్రతిష్టింపబడిన స్వయంభూ శివలింగం ఐదు ముఖాలతో ఉండడం వలన ఇక్కడ ఈశ్వరుని పంచముఖేశ్వరునిగా పిలుస్తారు. కావ్యాన్ని వివిధ కోణాలలో నిశితంగా ప్రమాణబద్ధంగా పరిశోధించి, గ్రంథ రచన చేయడం వలన విద్వదామోదం పొందినది.
‘నందనవనం’ దేశభక్తి సైనికుడి గురించి ఎన్నో విషయాలు చదువుతాము. కానీ చంద్రశేఖరమ్ గారు సైనికులపై 15 పద్యాలు వ్రాసారు. 1991 లో వాటిని ఆకాశవాణి రేడియో ద్వారా వినిపించారు. తరువాత తాను రాసిన ‘నందనవనం’ అనే పుస్తకంలో ఆ పద్యాలనుచేర్చారు. అంతేకాదు ఆ పుస్తకాన్ని సైనికులకు అంకితం ఇచ్చారు.. ఆ సందర్భంగా అమరవీరుల సంస్మరణార్థం విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ ఐ.ఏ.ఎస్.గారికి వారి శక్తి మేరకు 40,000 రూపాయిలు సైనిక నిధికి విరాళంగా ఇచ్చారు. ఇది కదా! దేశభక్తి అంటే.
అమరవీరుల సంస్కరణ కోసం సైనిక నిధికి 40, 000రూ.లు విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ హరి జవహర్లాల్ కి అందిస్తున్న దృశ్యం
ముద్రిత గ్రంథములు
కథలు ఆంధ్రభూమి డైలీలో కొన్ని వచ్చాయి ఆదివారం సెంటర్ స్ప్రెడ్ లో ప్రచురింపబడ్డాయి. ఇవి ప్రింట్ అయినవి. ఇవి కాక మరికొన్ని ఉన్నాయి ఒక డజన్ కథలు వ్రాసారు. అభినందన సంస్థ నిర్వహించిన ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ‘తువ్వాలు’ సంచికలో ప్రచురితమై, వినిపించే కథలలో అనేకమంది ప్రశంసలు పొందింది.
మొత్తం ప్రింట్ అయిన పుస్తకాలు 23.
- 1978 సుబోధిని వ్యాకరణం మొదటిది ఇది పదివేల కాపీలు వేయించగా, ఈమధ్య మరల రీప్రింట్ అయ్యాయి. చిన్నపిల్లలకు వ్యాకరణంపై భయాన్ని పోగొట్టిన పుస్తకము.
- 1986 కవిరాజు మూడు ఏకపాత్రల పుస్తకము
- 2000 విభావగణపతి గణపతి ప్రార్ధనలు వ్యాఖ్యానము వివాహ రజతోత్సవ కానుక
- 2001 సుందర గీతామృతము సుందరకాండ 30 కీర్తనలలో సద్గురువుల షష్ట్యబ్ది పూర్తి కానుక
- 2005 అవధానపర్వం 25 సం.ల అవధాన యాత్రలో జరిగిన అవధాన విశేషాలతో
- 2005 ప్రబంధమండలి 9 ప్రసిద్ధ గ్రంథముల పరిచయం. ఈ పుస్తకం కూడా రీ ప్రింట్ అయింది.
- 2010 మా తెలుగు తోట 56 కవితలతో బాలల గీతాలు
- 2011 సుందరసచ్చిదానందం శ్రీశ్రీగణపతిసచ్చిదానందస్వామి జీవితచరిత్రపై మధుర గీతములు
- 2011 హరివిల్లు సత్య ఉత్సవ అభినందన సంచిక
- 2014 కవిరాజు శ్రీనాథుడు చారిత్రక నవల
- 2017 ఆంధ్రమహాభారతము-మానవసంబంధాలు పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథం
- బృహత్ సత్రయాగ సందర్భముగా ఆవిష్కరించబడిన తొలి గ్రంథము
- 2015 శ్రీరామ కథామృతము వాల్మీకి రచనకు వచనము సద్గురువులకు 75 వ జన్మదిన కానుక
- 2016 అవధాన యజ్ఞం లో నిర్వహించబడిన 35 అవధానాల విశేషాలు
- 2017 శ్రీముఖ లింగ క్షేత్ర మహత్యం- కావ్యానుశీలనము ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథము
- 2018 నందనవనము ఖండకావ్యం పద్యాలు సద్గురువుల 77వ జయంతి కానుక
- 2020 మైథిలి పౌరాణిక నవల శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక వార్షికోత్సవ కానుక
- 2020 కాళికా స్తుతి కాళిదాస దశ శ్లోకికి వ్యాఖ్యానం
- 2021 సద్గురు మహిమ గురు మహిమ రామాయణ విశేషాలు
- 2022 శ్రీరామచిలుక చారిత్రక నవల
- సూర్యదేవర సుప్రభాతం అనువాదం 71వ జన్మదిన కానుక
- 2023 నవనీత మానస చండి మాత దేవి మహత్యం 72వ జన్మదిన కానుక
పొందిన పురస్కారములు బిరుదులు
- 1992లో రాష్ట్ర ప్రభుత్వము చే ఉత్తమ అధ్యాపక అవార్డు
- 1994లో బొబ్బిలి శ్రీ కళాభారతి వారిచే అవధాన భారతి బిరుదు
- విజయనగరంలో విజయ భావన కౌముది పరిషత్తు
- పార్వతీపురం శ్రీ సూర్య పీఠం సాహితీ మిత్ర విజ్ఞాన వర్ధిని
- బరంపురం ఆంధ్ర భాషాభి వర్ధిని మొదలైన అనేక సంస్థల ద్వారా సన్మానాలు
- టీవీలోని పద్యాల తోరణంలో ప్రథమ బహుమతి
- జన్మభూమి రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో బహుమతి
- విశాఖపట్నం శ్రీ కామేశ్వరి పీఠం వారిచే మహాకామేశ్వరి పురస్కారం
- శ్రీసూర్యసదనం గరివిడిలో సద్గురుకృష్ణయాజిగారి చేతులమీదుగా సువర్ణకుండల,ఘంటాకంకణం
- జగద్గురు శ్రీశ్రీశ్రీ పూరి శంకరాచార్య వారి ముఖంలో సద్గురువులచే గండపెండెర సన్మానం
- 2016న సద్గురు కృష్ణయాజి గారి చేతులమీదుగా శత అష్టావధాన సామ్రాట్ బిరుదు
- తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమాఖ్య వారిచే విలంబీ నామ సంవత్సర ఉగాది పురస్కారం
- విజయనగరం శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ వారిచే వికారి నామ సంవత్సర ఉగాది పురస్కారం
- శ్రీవిద్య సౌరశక్తి పీఠం గరివిడిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారిచే స్వర్ణ కంకణ సన్మానం 2023లో
- 2025 లో కౌముదీ పరిషత్తు వారిచే 50 సంవత్సరాలుగా అవధానాలు చేస్తున్నందుకు అవధాన సామ్రాట్ బిరుదు పొందారు.
(ఇంతటి మహోన్నత వ్యక్తిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ, మళ్ళీ నెల మరో గురువు పరిచయం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.