[‘సన్నాయి అప్పన్న’ సినిమాలోని ‘అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
గ్రీష్మ ఋతువులో ఎండలు మండిపోవటం, వర్షఋతువు రాగానే వాతావరణం చల్లబడి వానలు కురియటం, శరదృతువులో వెన్నెల కాయటం.. ఇలాంటి మార్పులు అన్నీ ఋతువుల యొక్క ధర్మం. అలాగే మనిషి జీవితంలో కూడా వివిధ దశలలో ఆయా దశలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం తర్వాత యవ్వనం వస్తుంది. బాల్యంలో ఆటపాటలు ఎంత సహజమో, యవ్వనంలో స్త్రీ పురుష ఆకర్షణ అంత సహజం. మనసులు కలిసి మనువుల దాకా దారితీయటం అనేక సినిమాలలో, కథలలో చూస్తూ ఉంటాము.
అప్పన్న సన్నాయి వాయిస్తూ ఉంటాడు. వాసంతి ఒక డాన్సర్. ఇద్దరూ పోటీ పడతారు. తన నాట్యానికి అనుగుణంగా అప్పన్న సన్నాయి వాయించాలని ఛాలెంజ్ చేస్తుంది వాసంతి. ఆ పోటీలో తనే ఓడిపోతుంది. అతడి ప్రతిభకు ఆమె ఆకర్షితురాలైతే; ఆమె అందానికి, మంచి మనసుకు అతను ఆకర్షితుడవుతాడు. ఇద్దరిలో ప్రేమ చిగురించి ప్రణయగీతం పాడుకుంటారు ఇలా..
‘సన్నాయి అప్పన్న’ (1980) చిత్రంలో ఆత్రేయ రచించిన గీతం ఇది. జి.కే.వెంకటేష్ సంగీత నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించగా శోభన్ బాబు, జయప్రద అభినయించారు.
“అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం
మధురం మనోహరం ప్రణయం”
మనసులు ఆనందంగా ఉంటే సమయం వేగంగా గడిచిపోతున్నట్లు ఉంటుంది. విచారంగా ఉంటే భారంగా గడుస్తున్నట్లు ఉంటుంది. ఆనందం అనేది మనుషులు జీవించటానికి ఔషధం లాంటిది. ఇక్కడ నాయికా నాయకులు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు కనుక సమయం ఆనందంగా వేగంగా గడచిపోతున్నది. ఈ ప్రణయం ఎంతో మనోహరమైనది, మధురమైనది అదే మన జీవనాదం అంటున్నారు. అందుకు దోహదపడే అంశాలు ఏమిటి అంటే..
“అపురూప రూప శిల్పం నీ నవ్య సోయగం
మధుమాస కుసుమ తల్పం నీ మృదుల మానసం
మకరంద మంజులం నీ నిత్య స్నేహశీలం”
ఆమె ఆకారం అందమైన శిల్పం లాంటిది. రోజురోజుకూ కొత్త కొత్త సోయగాలతో కనిపిస్తున్నది అతడి కళ్ళకు. మధుమాసం అంటే వసంతం. వసంతంలోని పూలపానుపు వంటిది మృదువైన నీ మనసు అని ఆమె అన్నది. ఇక్కడ స్త్రీ పురుషుల మనస్తత్వాలలోని తేడాను చెబుతున్నాడు కవి. పురుషుడు స్త్రీలోని సౌందర్యాన్ని చూస్తే, స్త్రీ అతడి మనసుని చూస్తుంది. దుష్యంతుడు శకుంతల సౌందర్యాన్ని చూసీ చూడటం తోనే ముగ్ధుడు అవుతాడు. ‘ఎవరీమె? దేవకన్యా? దేవకన్య ఇంత ఠీవీగా ఉండదు. వనకన్యా? వనకన్య నారచీర కట్టదు. రతీదేవా? రతీదేవి మన్మథుడిని విడిచి రాదు కదా!’ అనుకుంటాడట. శకుంతల మాత్రం ‘ఈయన ఆకారం, భుజాలు చూస్తుంటే చక్రవర్తి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చారో?’ అని మనసు తెలుసుకోవాలని అనుకుంది గానీ ఆయన సౌందర్యం చూసి మోహభ్రాంతిలో పడలేదు అని చెబుతాడు పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ‘శృంగార శాకుంతలం’ కావ్యంలో. అలాగే ఈ పాటలో కూడా స్త్రీ పురుషుల ఆలోచనలను చెబుతున్నాడు గీత రచయిత. తర్వాత, మకరందం అంత తియ్యగా ఉంటుంది నీతో స్నేహం అనే ముగింపుకు వస్తారు ఇద్దరూ. ఆమెని ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు నాయకుడు.
“శరదిందు హాసవాసం నీ పల్లవాధరం
శతకోటి తారహారం నీ రమ్యలోచనం
ఘననీల జలధరం నీ ముగ్ధ లలిత హృదయం”
చిగురాకుల వంటి నీ అధరాలు చూస్తుంటే శరత్కాలం లోని చంద్రుడు నవ్వుతూ అక్కడే కొలువున్నాడేమో అనిపిస్తుంది అన్నాడు నాయకుడు. అందుకే ‘ఆమె నవ్వుతుంటే వెన్నెల విరిసినట్లు ఉన్నది’ అని వర్ణిస్తారు కథల్లో. ఆమె అందమైన కనుదోయి చూస్తుంటే శతకోటి నక్షత్రాలు హారంలా వంపు తిరిగి ఉన్నాయేమో అన్నట్లు ఉన్నాయి అని నాయకుడు చెబుతున్నాడు. అతడి సున్నితమైన, ముగ్దమనోహరమైన హృదయం ఘనమైన నీలిమేఘం లాంటిదట. సంస్కృతంలో నీలి అంటే తెలుగులో నల్లని అని అర్ధం. నల్లమబ్బుకు కొద్దిగా చల్లగాలి తగిలినా వర్షిస్తుంది. అలాగే మృదువైన అతని మనసు కూడా కొంచెం పులకించినా ప్రేమ వర్షిస్తుంది అని ఆమె భావన. తర్వాత చరణంలో ఇలా చెబుతున్నారు.
“గతజన్మ సుకృత ఫలితం మన నయన సంగమం
అమరానుభూతి గీతం మన ప్రేమజీవనం
హిమశైల సుందరం రమణీయ ప్రణయ సదనం”
‘మన ఇరువురి కళ్ళు కలిసి మనసులు ముడిపడటం గతజన్మలో చేసుకున్న పుణ్య ఫలం’ అని ఆమె అంటే, మన ప్రేమజీవితం స్వర్గలోక నివాసంలా మర్చిపోలేనిది అని నాయకుడు అన్నాడు. మన ప్రేమ జీవన మందిరం హిమాలయ శిఖర సౌందర్యం లాంటిది అని నాయిక అన్నది. హిమవత్పర్వతం ఎక్కువగా మంచుతో కప్పబడినా అత్యంత సుందరమైనది. అక్కడ గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు విహరిస్తూ ఉంటారట. అక్కడ జ్యోతిష్మతి తీవెలు అనే ఒక రకమైన పూల తీగలు ఉంటాయి. అవి నూనె దీపాలలాగా వెలుగుతూ చీకటిలో దారి చూపిస్తూ ఉంటాయి. పగటి పూట సింధూరం అనే ధాతువులు ఎర్రని కాంతి వెదజల్లుతూ ఉంటాయి. అవి చూసి ‘సంజవేళ అయింది, ఇంకా అలంకారం కాలేదే!’ అని అప్సరసలు హడావిడి పడుతూ కాళ్ళకు వేసుకోవలసిన అందెలు చేతులకు, నడుముకు పెట్టుకోవలసిన ఒడ్డాణం చేతులకు పెట్టుకుని పొరపాటు పడుతూ ఉంటారట. ఇది కుమారసంభవం కావ్యంలో కాళిదాసు వర్ణన. అదేవిధంగా హిమశైలం అంత సుందరమైనది మన ప్రణయ కావ్యం అని ఈ పాటలో నాయకుడి భావం.
ఒకప్పుడు మన కుటుంబాలలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళే ఎక్కువగా జరుగుతూ ఉండేవి. సినిమాలు, నవలలు ప్రేమకు పెద్దపీట వేసి, యువతీ యువకులలో ప్రేమభావన రేకెత్తించేవి. యద్దనపూడి సులోచనారాణి అయితే మనుషులను విశ్వప్రేమికులుగా చిత్రీకరించింది. వారికి కులమత భేదాలు, బీద గొప్ప తారతమ్యాలు, చదువుకున్న చదువురాని తేడాలు ఏమీ లేవు. మనసులు కలవటమే ప్రాధాన్యం. ఇప్పుడు అయితే ఎక్కువ శాతం ప్రేమ పెళ్లిళ్ళే జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ప్రేమించటానికి అర్హత వయసు రావటం ఒక్కటే! మనసుతో సంబంధం లేకపోవటం వలన ఇవి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోతున్నాయి. ప్రేమపెళ్ళి చేసుకున్నవారు జీవితాంతం కలిసి ఉండాలని, విడిపోవటానికి వీల్లేదనీ చట్టం చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అందుకు ఒప్పుకోకపోతే నిజమైన ప్రేమ కాదన్నమాట!
సరే, మళ్ళీ పాట విషయానికి వస్తే ‘సన్నాయి అప్పన్న’ చిత్రంలోని ఈ పాటలో శోభన్ బాబు, జయప్రద నటించారు. చక్కటి చీరకట్టుతో, పొడవాటి జడలో పూలమాలతో, చంపకు చారడేసి కాటుక కళ్ళతో సాంప్రదాయబద్ధంగా సౌందర్యరాశిలా ఉన్నది జయప్రద ఈ పాటలో. నిండు చంద్రుడు యాభై ఏళ్ల క్రితం ఆహ్లాదం కలిగించాడు, ఇరవై ఏళ్ల క్రితం ఆహ్లాదం కలిగించాడు, ఇప్పుడూ అంతే! అలాగే శోభన్ బాబు కూడా పున్నమిచంద్రుడులా ఉన్నాడు ఈ చిత్రంలో. ఆకారాలకు తగినట్లుగా చక్కటి అభినయంతో కూడిన పసిడికి పరిమళం అబ్బినట్లున్న మధురమైన గీతం ఇది.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.