Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాసంతగీతం

[డా. మైలవరపు లలితకుమారి గారు రచించిన ‘వాసంతగీతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

కులు రాలే శిశిఋతువుకి
వీడుకోలు పలుకుతూ
అవనిని అందాలతో నింపాలని
ఎర్రని చిగురులు చీరంచుగా
ఆకుపచ్చని పట్టు చీర కట్టుకొని
ఆనందంతో ఆమని వచ్చింది
విరిసిన పువ్వులు చుక్కలై మెరియ
తరువులన్నీ వయ్యారాలు ఒలుక
మావిచిగురులు మేసిన కోకిల స్వామి
చిటారు కొమ్మను ఊయల లూగుతూ
షడ్జమస్వరంలో రాగాలాపన చేస్తుండగా
పెద్దముత్తయిదువ చిలుక పేరంటాలుగా
వేవెలుగుల సూరీడు మేలుకొలుపు పాడ
నింబకుసుమాలు అక్షతలు కాగా
నీలగగనమే ఆతపత్రమై భాసింప
విరగబూసిన గున్నమావి మాకును
ప్రేమతోపెనవేసుకున్న మాధవీలతను
చూసిన వసంతుడు
పంచబాణాల చెరకు విల్లు సవరింప
పులుగుపిట్టలు పెండ్లిపాటలుపాడ
పండితుల పంచాంగ శ్రవణాలతో
గ్రహగతుల గమనాలను చెబుతుండగా
కవి కోకిలల కవి సమ్మేళనాలతో
పగటి వెలుగులు మించుతుండగా
మల్లెల సౌరభాలు ప్రకృతిని
సుగంధ భరితం చేయుచుండగా
ఆలయాలు వేదపఠనాలతో
మారుమ్రోగుచుండగా
షడ్రుచుల మేవింపులతో
ఆనందగీతికలు పాడుతూ
విశ్వావసు నామ వత్సరమునకు
వాసంతగీతం పలుకుదాం.

Exit mobile version