నేను నీ కవిత్వపు విషయం కావాలని
కోరుకోవటం లేదు..
నీ కవిత్వ పుటల మధ్య –
బుక్మార్క్ని అవ్వాలని వుంది..!
ఒకే భావంలో కుదించుకుని
ఓ పేజీలో నిక్షిప్తమై పోవాలని లేదు..
నీ వేళ్ళ నులి వెచ్చని స్పర్శతో
ప్రతీ పేజీని పరామర్శించాలని వుంది..!
ఒకే సందర్భానికి శీర్షికనై మెరవాలని లేదు..
అన్ని రసాలతో నీ హృదయాన్ని
మురిపించాలని వుంది..!
కళ్ళను పరిగెట్టిస్తూ చదివించాలని లేదు..
అనుభూతిస్తూ ఆస్వాదించేందుకు
విరామం అవ్వాలని వుంది..!
తామరాకుపై నీటి బొట్టుని అవ్వాలని లేదు..
చదివేసిన గతానికి చదవాల్సిన భవితకీ మధ్య వారధిని అవ్వాలని వుంది..!
ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.