[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘ఉద్వేగపు అంచుల్లో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నా గుండెల్లో తడి ఆరిపోదెప్పుడు
ఆ తడి నా అనుమతినడగదెప్పుడు
అప్పుడప్పుడు నన్ను ఖాతరు చేయక
కంటి ఆనకట్టలు దాటి పెల్లుబుకుతుంది.
ఓసారి చిన్న నీటి చెలమలా మెదిలి.. కదిలి
మరొక్కసారి ఉప్పొంగే నదిలా ఎగిసి పారి
నాలో నేనేమిటో నాకే చెప్పక చెబుతుంది.
నాకే తెలిసీ తెలియని నన్ను ఆవిష్కరిస్తుంది.
మానవత్వం అక్కడ నేపథ్యమైనప్పుడు
మానవ సంబంధాలు అంతర్లీనమైనప్పుడు
ఏదైనా కానీ ఆ దృశ్యం నా కంట పడ్డప్పుడు
మరుగునున్న నా మనసు చలించునెప్పుడు.
చిత్రం! చలన చిత్రమై నన్ను స్పందింపజేస్తుంది.
చిత్తం సజల కెరటమై నన్ను ముంచి తేలుస్తుంది
అనుభూతి చెంది నా మనసు భారమై పోతుంది
చల్లగాలికై వేచి చూసే భారపు మొయిలవుతుంది.
వెచ్చని మేఘాన్ని పూనిన ఆ వినీలాకాశంలా
కంపిస్తూ వదనం భావావేశానికి లోనవుతుంది.
చెలియకట్టలు దాటి రాబూనే లవణ కెరటంలా
ఉద్వేగం ఉత్పేరకమై నయనంలో వానవుతుంది.
నలుగురిలో కన్నీరు బాగుండదేమోనని
నన్ను నేనెంతగా వారించుకున్నా..
నా ప్రమేయానికెక్కడ వీలుంది?
నీవది కాదు, ఇది సుమా అంటూ..
సానుభూతిని చూపు నిలువుటద్దంలా
మంది ముందు నన్ను ఆవిష్కరిస్తుంది.
నాలో నేనుని నేను దాచుకోవడమింకా
విఫల యత్నమే అవుతుంది!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.