[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
తెలుగు ‘వెలుగు’:
నా కళ్లు అటూ ఇటూ ఆశగా చూస్తున్నాయి. అక్కడంతా యూనివర్శిటీ అమ్మాయిలు, అబ్బాయిలు – రకరకాల డ్రెస్సుల్లో కనబడుతున్నారు. కానీ నన్ను ప్రేమగా పలకరిస్తూ, నిత్యం నడిపించేది.. ఏది ఎక్కడ? కనిపించదే. ఎక్కడ దాక్కున్నదో.. వెతికి పట్టుకోవాలి. ఎందుకో చాలా తపనగా ఉంది. ఎలాగైనా చూసి తీరాలి. సరిగా అర్థం చేసుకోవాలి.
అంతలో ఒక అమ్మాయి నా వైపు చూస్తూ, పలకరింపుగా నవ్వింది. నేను నవ్వాను. కానీ నా చూపు మాత్రం నలు దిశలా తిరుగుతోంది. అంతలో లైబ్రరీ సహాయకుడు కనిపిస్తే అడిగాను. ఎక్కడుందో వివరంగా చెప్పాడు. అంతే, నడకలో వేగం పెంచాను. మెట్లు ఎక్కాను. మలుపు తిరిగాను. ఒక గదిలోకి ప్రవేశించాను. ఒక మూల.. అదిగో, అక్కడ కనిపించింది.
కొత్త మలుపు:
జీవితంలో కొన్ని మలుపులు చిత్రంగానే ఉంటాయి. తెలుగు భాష కారణంగా నాలో కొత్త వెలుగు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. దారి తప్పిన మనిషిని సరైన బాటలోకి తెలుగు భాష నన్ను నడిపిందేమో. కాలేజీ విడిచి పెట్టిన తర్వాత పూర్తిగా సైన్స్ సబ్జెక్ట్ మీదనే దృష్టి పెట్టాను. సైన్స్ లెక్చరర్ అవుదామన్నదే నా ఆశ.. ఆశయం. కానీ విధి నన్ను మరో వైపుకు లాగింది. ఉన్నట్లుండి జర్నలిస్ట్ అవతారం ఎత్తాను. ఈ మధ్యలో తెలుగు భాష పట్ల ఆసక్తి పెరగడానికి కొన్ని సంఘటనలు కారణమయ్యాయి. వాటిలో ప్రధాన మైనది, UPSC పరీక్షకు ప్రిపీర్ అవడం. లైబ్రరీలకు తరచు వెళ్ళడం. అన్ని సబ్జెక్ట్స్ మీద ఎంతో కొంత విషయ జ్ఞానం ఉండాలి. అప్పటి వరకు సైన్స్ పరిధి దాటని నేను ఇప్పుడు హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ, తెలుగు.. ఇలా అన్నింటి పట్ల ఆసక్తి పెంచుకోవడం మొదలెట్టాను. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన అంశాలను సేకరిస్తూ, వాటిని విశ్లేషిస్తూ వ్యాసాలు వ్రాసి పేపర్స్ పంపేవాడిని. వాటిలో కొన్ని ప్రచురితమయ్యాయి.
నేను వైజాగ్లో ఉన్నప్పుడు మొదటి సారిగా ఆంధ్రా యూనివర్శిటీ లైబ్రరీకి వెళ్ళాను. అది చాలా పెద్దది. చదవాలన్న ఆసక్తి ఉండాలే కానీ పుస్తకాలకు కొదవు లేదక్కడ. లైబ్రరీలో అనేక వింగ్స్ ఉన్నాయి. ఒక్కో వింగ్లో ఒక్కో అంశంమీద పుస్తకాలను చాలా పొందికగా అమర్చారు. పుస్తకాలను తీసుకుని హాయిగా కూర్చుని చదవుకునే వీలుంది. అక్కడక్కడా బారుగా ఉన్న బల్లలు, వాటిని ఆనుకునే కూర్చీలు బోలెడు ఉన్నాయి. చదువుకుంటూనే నోట్స్ వ్రాసుకోవడానికి అనువుగా ఉంది ఆ ప్లేస్. లోపలకు అడుగుపెట్టగానే అనేక పుస్తకాలు ఆకర్షిస్తుంటాయి. ఆకాశంలో నక్షత్రాల్లా మిళమిళా మెరిసిపోయే రంగురంగుల కొత్త పుస్తకాలు కొన్ని.. రంగు వెలిసినవి ఇంకొన్ని. కొత్త పుస్తకాలు నూతన వధూవరుల్లా అందంగా కనబడుతున్నాయి. ‘చూశావా మా అందం.. చందం’ అన్నట్లు ఠీవీగా బుక్ రాక్స్లో నిలబడి ఉన్నాయి. మరి కొన్ని మధ్యవయస్సున్న మనుషుల్లా గుంభనంగా ఉన్నాయి. ఇంకొన్ని మరీ పాతవి. పుస్తకం మీద చేయి వేస్తే చాలు అట్ట ఊడి వచ్చేలా ఉన్నాయి. అయినా అవి – ‘రండర్రా, నా దగ్గరకు రండర్రా, ఎన్నో జ్ఞాపకాలు నా పుటల్లో దాగి ఉన్నాయి. కదిలిస్తే తరాల అంతరాలు తొలిగిపోయేలా కబుర్లు చెబుతాను, రండి.. నన్ను దగ్గరకు తీసుకోండి. నా అనుభవ సారాన్ని అందుకోండి’ – అన్నట్లు చూస్తుండేవి. కానీ ఎందుకో తెలియదు కానీ చాలా మంది నవయువత వీటి జోలికి పోవడం లేదు. కొత్త పుస్తకాల మోజులో పాత వాసనలు పట్టించుకోవడం లేదేమో. నాకెందుకో ముసలి పుస్తకాలను చూస్తే జాలి వేసింది. ఎవ్వరూ పట్టించుకోకపోతే ఇవి ఏమవుతాయి? కొన్నాళ్లకు బుక్ రాక్స్ నుండి తప్పుకుంటాయి. కనుమరుగైపోతాయి.
ఎఱ్రావు – పాత పుస్తకం:
అడవిరావులపాడులో మాకు చాలానే ఆవులుండేవి. వాటిలో ఎఱ్ఱావుని మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే అది చాలా నెమ్మదిగా నడిచేది. నడకలో మిగతా ఆవులకంటే బాగా వెనుకపడేది. అన్ని ఆవులు ఇంటికి చేరిన కాసేపటికి నిదానంగా చేరేది. తానెవ్వరికీ పోటీ కాదన్నట్లుగా ఉండేది. గడ్డి త్వరత్వరగా తినాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. పడుకోవాలన్నా లేవాలన్నా చాలా సేపు పట్టేది. మిగతా ఆవులకు భిన్నంగా ఉండటంతో ఈ ఆవు నాకు బాగా గుర్తుండిపోయింది. దాని సంతానం చాలానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటి పశు సంపద అంతా దాని చలవే. దాని కొమ్ములు ఎప్పుడైనా ఊడిపోతాయా అన్నట్లు కదులుతుండేవి.
ఓ సారి అమ్మని అడిగాను..
‘అమ్మా, దాని కొమ్ములు ఎందుకనే అలా ఊగిపోతున్నాయి. ఎందుకని అది మిగతా ఆవుల్లా నడవలేకపోతున్నది..’
‘అది ముసలిదైపోయింది కదరా..’
‘అంటే బామ్మ లాగా అయిపోయిందా?’
‘అవున్రా’
‘మరి నువ్వు కూడా ముసలి దానివి అయిపోతావా అమ్మా?’ – ఈ ప్రశ్నలోనే గొంతులో కాస్తంత కంగారు ధ్వనించింది.
‘నేనూ ముసలిదాన్ని అయిపోతాను. కంటి చూపు తగ్గుతుంది. నడుము వంగిపోతుంది. కర్ర సాయం లేకుండా నడవలేను. పళ్లు ఊడిపోతాయి. నా పని చేసుకోవడమే నాకు కష్టమవుతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ..’
ఏమిటో అమ్మ ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉంది. ఆమె చూపు నా మీద లేదు. శూన్యంలోకి చూస్తున్నట్లుంది. అప్పటి దాకా చదువుతున్న పుస్తకం అమ్మ చేతుల్లో నుంచి జారి క్రింద పడిపోయింది. అది చాలా పాత పుస్తకం. జారి క్రిందపడగానే అట్ట ఊడిపోయింది. కొన్ని పేజీలు రాలిపోయాయి. ఎండుటాకుల్లా. పుస్తకం పుటల్లో నుంచి ఏదో వాసన కూడా వస్తున్నది. స్కూల్ పుస్తకాలు కొత్తవి నాన్న కొని ఇంటికి తీసుకువచ్చినప్పుడల్లా ఆ పుస్తకాల్లో నుంచి కమ్మటి వాసన వచ్చేది. ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇదేమిటీ, వెగటు పుట్టిస్తున్నదేం? పుస్తకం పాత పడితే ఇలాంటి వాసనే వస్తుందా? అంటే.. ఈ పుస్తకం కూడా ముసలిదైపోయిందా..? అడుగుదామని అమ్మ వైపు చూశాను. కానీ అమ్మ నన్ను పట్టించుకునేలా లేదు. ఏదో చెబుతునే ఉంది. ఆ మాటలు నేను గతంలో విన్నవి కావు. అర్థం కాక బుర్ర గోక్కున్నాను.
అమ్మ చేతిలో ఈ పుస్తకం చాలా సార్లు చూశాను. ఏ మాత్రం తీరుబడిగా ఉన్నా గూట్లో పెట్టిన ఈ పుస్తకం తీసి చదువుకునేది. కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. పరధ్యానంలోకి వెళ్ళడం, పుస్తకం జారి పడటం నేను చూడలేదు. అందుకే ఆ పుస్తకం అట్ట మీద ఉన్న అక్షరాలు చదివాను.
భ గ వ ద్గీ త.
ఇది హిందువులకు పరమ పవిత్ర గ్రంథమని నాకప్పుడు తెలియదు. కానీ సినిమాల్లో అప్పటికే చూశాను. శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేయడం, అది అయ్యాక అర్జునుడేమో జోరుగా యుద్ధం చేయడం. నేను నెమ్మదిగా ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. పుస్తకం అట్ట మీద శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్న బొమ్మ కలర్లో ఉంది. రంగు మాత్రం బాగా వెలిసిపోయింది. పుస్తకంలో ఏమున్నదన్న విషయం కంటే అది పాతపడిపోయిందన్న దిగులు ఎక్కువైంది.
ఎఱ్ఱావు,
బామ్మ,
పాత పుస్తకం,
రేపు అమ్మ,
తర్వాత..??
నాకెందుకో భయం వేసింది.
అమ్మ చెప్పిన మాటల్లో ఒకటి అర్థమైంది. రేపు నేను కూడా ముసలాడినైపోతాను. అమ్మని చూస్తే ఎప్పుడూ భయం వేయలేదు. కానీ ఇలా మాట్లాడుతున్న అమ్మని చూస్తే మాత్రం ఆ క్షణం భయం వేసింది.
భగవద్గీత పుస్తకాన్ని జాగ్రత్తగా చేతుల్లో పట్టుకుని అమ్మని ఒకే ఒక్క ప్రశ్న అడిగాను.
‘అమ్మా, ఇందులో ఏముంది?’
అమ్మ సమాధానం చెప్పలేదు. కానీ నావైపు ప్రేమగా చూస్తూ నా చేతుల్లోని పుస్తకాన్ని అందుకుని కళ్లకు అద్దుకుంది. అమ్మకు ఇష్టమైనది కనుకనే నేనూ ఆ పుస్తకాన్ని ప్రేమించడం మొదలు పెట్టాను.
సద్గురువు:
అప్పటి నుంచి భగవద్గీత పుస్తకాన్ని ఎప్పుడు చూసినా, ఏదో అమూల్యమైన వస్తువుని చూసినంత సంబరం కలిగేది. కాస్త పెద్దయ్యాక, చదవడం తెలిశాక – భగవద్గీత పుస్తకం తెరిచాను. కానీ అందులోని శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి. కేవలం అక్షరాలు మాత్రమే తెలుగు. చదవగలను. కానీ అర్థం తెలియదు. అర్థం తెలియకుండా ఎంత చదివితే ఏం లాభం? ఈ రకం ఆలోచనలే భగవద్గీత శ్లోకాలకు అర్థం చెప్పే పుస్తకాలు ఏవైనా ఉన్నాయా..? అన్న వెతుకులాటకు దారి తీసింది.
కోరినది.. దరి చేరినది:
ఆంధ్రా యూనివర్శిటీ లైబ్రరీలోకి అడుగు పెట్టగానే నా కళ్లు అటూ ఇటూ వెతుకుతున్నాయి. నేను చూడాలనుకున్నది, కోరుకున్నది అప్పుడు కనిపించింది. అందీ అందనట్లుగా ఉంది. అతి కష్టం మీద చేతికి చిక్కింది. అది భగవద్గీత శ్లోకాలకు తెలుగులో అర్థం చెప్పే పుస్తకం. చాలా పాతదైపోయింది. పుస్తకం పై అట్టను ప్రేమతో నిమిరాను. దుమ్ము నిదానంగా దులిపాను. ఓ మూల కూర్చుని చదవడం మొదలుపెట్టాను. తెలుగు అనువాదం చాలా బాగా వ్రాశారు. అయినా చాలా చోట్ల నేనే సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాను.
ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరుకుతున్నట్లే అనిపించింది. గజిబిజి జీవితాలకు మార్గం చూపే మహా గ్రంథంలా కనిపించింది. కర్తవ్యాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ – దేవుడు అవునో కాదో నాకు తెలియదు. కానీ ఆయన సద్గురువు.
జ్ఞాన గవాక్షం:
నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఘంటసాల మాష్టారి భగవద్గీత ఆడియో విడుదలైంది. అది మా ఇంటికి చేరినప్పటి నుంచి అనేక సార్లు విన్నాను. ఆత్మ, జీవాత్మ, కర్తవ్యం, కర్మ.. వంటి మాటలకు అర్థం ఎంతో కొంత తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పుస్తకం చదువుతుంటే కాంతి రేఖలు మరింతగా ప్రసరించినట్లు, వేయి సూర్యుల వెలుగు ప్రకాశించినట్లు అనిపించింది. శ్లోకాలు అర్థమవుతుంటే వాటి సారం తెలుసుకుంటుంటే జ్ఞాన గవాక్షాలు తెరుచుకుంటున్న భావం పెరిగింది.
సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతుండటంతో అన్ని సబ్జెక్స్ మీద ఆసక్తి పెరిగింది. కొన్ని విపరీతంగా ఆకర్షించాయి. అందులో ఒకటి తెలుగు సాహిత్యం. ప్రబంధ సాహిత్యం మొదలు విప్లవ సాహిత్యం వరకు అన్నీ చదవడం మొదలుపెట్టాను. ఒక్కో పుస్తకం చదువుతుంటే తెలుగు భాష పట్ల మక్కువ పెరగ సాగింది. బహుశా ఈ మక్కువే, ఎంఏ తెలుగులో పట్టా అందుకున్న అమ్మాయి అని తెలిసినందువల్లనే ఇంట్లో పెద్దలు చెప్పిన ఒక సంబంధం వైపు ఆకర్షితుడినయ్యేనేమో. అలా మన్నవ గిరిధర రావు గారి పెద్దమ్మాయి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకున్నానేమో. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే వింతగానే అనిపిస్తుంటాయి. మరి కొన్ని నవ్వు పుట్టిస్తుంటాయి.
తూర్పూ – పడమర:
నేను చదివింది సైన్స్.
ఆమె చదివింది తెలుగు.
నేను ఎమ్మెస్సీ చేసింది బొంబాయిలో,
ఆమేమో ఎంఏ, నాగార్జునా యూనివర్శిటీలో.
ఆమె తూర్పు.
నేను పడమర.
అయినా, తెలుగు భాష మమ్మల్నిద్దరినీ కలిపింది. అదేదో సినిమాలో కృష్ణమ్మ ఇద్దరినీ కలిపినట్లు..
‘నువ్వా దరిని
నేనీ దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’
అందుకే ఈ పాట గుర్తుచేసుకుంటూ ఉంటాము.
పాటల పెట్టె రేడియో:
అవును, ఈ సినిమా కవులు చాలా చిత్రంగా పాటలు వ్రాస్తుంటారు. కాలేజీలో చదివి రోజుల్లోనే తెలుగు పాటల పట్ల మక్కువ పెరిగింది. పాత పాటలు, కొత్త పాటలు చాలానే వినేవాడ్ని. పాటలోని రాగంతో పాటుగా సాహిత్యం మనసుకు పట్టేసేది. తెలుగు భాష పట్ల మక్కువ పెరగడానికి సినిమా పాటలు కూడా ఓ కారణం. సినిమా చూస్తున్నప్పుడు పాట వింటే అది అంతగా బుర్రకెక్కేది కాదు. కానీ విడిగా వింటున్నప్పుడే నోటికి వచ్చేసేది. ఈ రేడియా వాళ్లున్నారే, వీళ్లు బహు చతురులు. జనరంజని పేరిట ఓ కార్యక్రమం పెట్టి రోజూ శ్రోతలు కోరుతున్నారంటూ బోలెడు తెలుగు పాటలు వినిపించేవారు. అవి మనసుకు హద్దుకునేవి. ఎంతగా అంటే, ఇంట్లో ఏ పనిచేస్తున్నా పాట నోట్లో నుంచి వస్తుండేది. మా ఊర్లో రెండు సినిమా థియేటర్లు ఉండేవి. రోజుకు మూడు ఆటలు వేసే వారు. ప్రతి షోకి ముందు థియేటర్ వాళ్లు బయట లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వినిపించేవారు. ఊరు చిన్నది కావడంతో దాదాపుగా ఆ పాటలు ఊరంతా వినబడేవి. ఇలా ఇటు రేడియో, అటు మైకుల్లో పాటలు.. మొత్తంగా పాఠాల కంటే పాటలే ఎక్కువగా మనసులోకి దూరేవి. ఆ రోజుల్లో ఎక్కువ పాటల్లో మ్యూజిక్ రొద ఉండేది కాదు. సంగీతం శ్రావ్యంగా ఉండటంతో సాహిత్యం కూడా బాగానే బుర్రకెక్కేది. ఏ పదం ఏ సందర్భంలో వాడుతున్నారో తెలుస్తుండేది.
పంతులమ్మ – పద్యాలు:
హైస్కూల్ చదివే రోజుల్లో తెలుగు పాఠాలు చెప్పడానికి ఓ పంతులమ్మ వచ్చేవారు. ఆమె తన తీయటి గొంతుతో పద్యాలు ఆలపిస్తూ, వాటి అర్థాలు చెబుతుంటే ఎందుకో తెలుగు పట్ల ఆకర్షితుడయ్యేవాడని. అసలు చిన్నప్పటి నుంచి హరికథలు, బుర్రకథలు, నాటకాలు చూశాను. పద్యాలు నన్ను బాగా ఆకర్షించేవి. భక్త ప్రహ్లాద సినిమా చాలా చిన్నప్పుడు చూసేసి, అందులోని పద్యాలను పాడటానికి ప్రయత్నించాను. ఇంట్లో వాళ్లు మెచ్చుకోవడంతో గర్వంగా ఫీలయ్యేవాడిని. పెద్దయ్యాక పోతన గారి పద్యాలే ఇవి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ప్రహ్లాదుడు పసివాడు కాబట్టే అలాంటి వాడు పాడే పద్యాలు కూడా లేత లేత పదాలతోనే ఉండాలని పోతన అలా వ్రాశారేమో. మరి కొన్ని చోట్ల ఎంతో గంభీరంగా వ్రాశారు. ఉదాహరణకు నరసింహావతరణం ఘట్టంలో పోతన వ్రాసిన వర్ణన ఎప్పుడు విన్నా ఒళ్లు జలదరిస్తుంటుంది. నరసింహ స్వామి వారి రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించారు. నా చిన్నప్పుడు మేము మంగళగిరిలో ఉన్నాము. నరసింహస్వామి వారికి అలంకారాలు వేసినప్పుడనుకుంటా స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవించే ఘట్టాన్ని ఓ రోజు ఆలయంలో ప్రదర్శించేవారు. పెద్ద శబ్దంతో స్తంభం విచ్చుకునేది. వెలుగులు చిమ్ముతూ నరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపించేవారు.
నరసింహ స్వామి ఆవిర్భావ వర్ణన:
శ్రీహరి ఎక్కడైనా ఉంటాడని ప్రహ్లాదుడు అనగానే హిరణ్యకశిపుడు తన ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపిస్తూ ఇందులో ఉంటాడా నీ హరి? అని ఎద్దేవగా ప్రశ్నిస్తాడు. ఉంటాడు, చూసుకో అంటాడు ప్రహ్లాదుడు. దీంతో కోపంతో, ఎర్రబడిన కళ్లతో తన చేతిలోని గదతో స్తంభాన్ని కొడతాడు. స్వామి వారి ఆవిర్బావ సంఘటను పోతన గారు ఎంత గంభీరంగా వ్రాశారో చూడండి. ఈయనేనా లేత లేత పదాలతో పద్యాలు వ్రాసిందని అనిపిస్తుంది. ఓ సారి చదవండి..
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని…
ఇలా సాగుతోంది పోతన గారి రచన. ఇది చదివినప్పుడల్లా నా కళ్ల ముందు మంగళగిరి నరసింహస్వామి ఆవిర్భావ సన్నివేశం కనబడుతుంటుంది.
తెలుగులో వార్తా యజ్ఞం:
తెలుగు దినపత్రికల్లో పనిచేయడం, జర్నలిజమే వృత్తి కావడంతో తెలుగు భాషలోనే అనేక వార్తలు, వ్యాసాలు వ్రాయవలసి వచ్చింది. దీంతో తెలుగు భాష పట్ల మరింత మక్కువ పెరిగింది. జర్నలిజంలో ఉంటూ నిత్యం తెలుగులో రచనలు చేయడమన్నది ఓ యజ్ఞంలా సాగింది. నాలుగు దశాబ్దాల నుంచి ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంది. మీడియాలో రూపాలు మారవచ్చు. పత్రిక వదిలేసినా వెబ్ పత్రికలు, టివీ సంస్థల్లో పనిచేసినా తెలుగు మాట్లాడటం, వ్రాయడం నా వృత్తిలో భాగం అయిపోయింది. సరిగా ఈ టైమ్ లోనే సోషల్ మీడియా ఎంటరైంది. చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందిన మీడియా ఇది. చివరకు వికృత పోకడలు పోతుండటం చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నది. అయినా తెలుగు భాష అభివృద్ధిలో దీన్ని కూడా ఉపయోగించుకోవాలన్న తపన ఎక్కువైంది.
ఏయులో ప్రసంగం:
ఆంధ్రా విశ్వకళాపరిషత్ (ఏయు) తెలుగు డిపార్ట్మెంట్ వారు మాతృభాషాదినోత్సవం రోజున సదస్సు ఏర్పాటు చేసి నన్ను కూడా విశిష్ట అతిథిగా ఆహ్వానించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘తెలుగు భాషా వికాసం – సోషల్ మీడియా పాత్ర’ అన్న అంశంపై ప్రసంగం
ఈ సందర్భంగా నేను తెలుగు భాష – సోషల్ మీడియా పాత్ర అన్న అంశంపై పరిశోధనాత్మక వ్యాసం సమర్పించాను. ఇదే అంశంపై ప్రసంగించాను. సరే, సందర్భం వచ్చింది కనుక, పాఠకులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను.
తెలుగు భాషాభివృద్ధి – సోషల్ మీడియా పాత్ర:
WhatsApp, Facebook వంటి సోషల్ మీడియా సమాజాన్ని శాసిస్తున్న రోజులువి. ఎంతో వేగంగా సమాచారం వ్యాప్తి చెందుతున్న రోజులు వచ్చేశాయి. క్షణాల్లో భావజాలాలు ఖండాలు దాటిపోతున్నవి. ఇది ఒక్కోసారి ప్రమాదకారి కూడా. తప్పుడు, అసభ్య సమాచారం క్షణాల్లో వ్యాప్తి చెందడం వల్ల సామాజిక విలువలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ముప్పు వాటిల్లవచ్చు. రాజకీయ కుట్రలకు దారితీయవచ్చు. కానీ ఏ సమాజమైనా సమగ్ర అభివృద్ధి సాధించడంలో సాంకేతిక పురోభివృద్ది యొక్క పాత్రని కూడా మరచిపోలేం కదా. సోషల్ మీడియా ఓ అస్త్రం లాంటిది. దీన్ని మంచికి వాడితే చెడు నశిస్తుంది. అదే చెడు ప్రచారానికి ఉపయోగిస్తే సమాజంలో మంచి కనుమరుగవుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఒకటే. మనం వాడే స్వభావం, పరిస్థితులను బట్టి దాని రూపం మారుతుంటుంది. ఈ ప్రకృతి కూడా అంతే. గాలి, నీరు, అగ్ని.. అన్నీ అవసరమే. కానీ అవే ఒక్కోసారి ప్రళయం సృష్టిస్తుంటాయి. మనిషి నేర్పుగా తన అవసరాలకు తగ్గట్లుగా, తగినంతే వాడుకోవాలి. సోషల్ మీడియా కూడా అంతే. సోషల్ మీడియా ఒక ప్రక్క చెరుపు చేస్తున్నా, అదే వేదికను ఉపయోగించుకుంటూ మంచి పనులు విస్తారంగా చేపట్టాలి. అందులో ఒకటి తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియాను వాడుకోవడం.
సమాజం – మాతృభాష – సాంకేతిక వికాసం ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోతున్నాయి. అందుకే తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియా పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సోషల్ మీడియా ఈ రోజున ఎప్పటి నుంచో ఉన్న సమాచార మాధ్యమాల కంటే ఎన్నో రెట్లు అధికంగానూ ఎంతో వేగంగానూ దుసుకుపోతున్నది. సోషల్ మీడియా అంటే ఏమిటీ? సరళంగా చెప్పుకోవాలంటే మనలో చాలా మంది ఉపయోగిస్తున్న వాట్సప్, యుట్యూబ్, వెబ్ సైట్స్, ఫేస్బుక్, ఇంటర్నెట్ రేడియో, అంతర్జాల ఆధారిత ఛానెల్స్ వంటివి. ఐదారేళ్ల క్రిందటి వరకు వీటిలో కొన్నింటి పేర్లు మనం వినలేదు. ఉదాహరణకు వాట్సప్ పేరు మనలో చాలా మందికి ఏడెనిమిదేళ్ల క్రిందటి తెలిసిండక పోవచ్చు. మొదట్లో వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపని వారు కూడా ఈ రోజున వాట్సప్, ఫేస్బుక్ వంటివి నిత్యం చూసే స్థితికి చేరారు. వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంట్లో మన పిల్లలే మనకు శిక్షకులు. వారు ‘ఇలా చూడాలి, అలా చేయా’లని నా బోటి వారికి గైడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా చూడటం పట్ల ఆసక్తి పెరిగ్గానే అది అక్కడితో ఆగదు. మనలోని ఆలోచనలను అందులో నిక్షిప్తం చేయాలన్న తపన మొదలవుతుంది. ఈ తపనే 60 దాటిన పెద్దల్లో కూడా, వారి వయసు వెనక్కి లాగుతున్నా మనసు ముందుకు పరిగెట్టేలా చేస్తోంది. ఆ వయసులో సాంకేతిక అంశాల పట్ల అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న సాంకేతిక విషయజ్ఞానం అందిపుచ్చుకోవడానికి ఈ తరహా తపనే కారణమవుతున్నది. ఈ తపనతోనే వయో వృద్ధులు సైతం సోషల్ మీడియాని తమకు అనుకూలంగా ఎలా వాడుకోవచ్చునో తెలుసుకుంటున్నారు. ఇందులో పండితుల నుంచి పామరుల వరకు ఉన్నారు. ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి తొంగిచూడటం వరకు వెళ్ళాక. మనం కూడా తెలుగులో మన భావజాలాన్ని నలుగురికీ పంచాలన్న తపన కలుగుతుంది. సరిగా అప్పుడు ప్రధానంగా అడ్డు వచ్చే సమస్య తెలుగులో టైప్ చేయడం ఎలా అన్నది. 1990వ దశకంలో కంప్యూటర్ల సాయంతో తెలుగు భాషలో సైతం అక్షరాల రూపకల్పన జరిగింది. నా మటుకు నేను ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేసే రోజుల్లో 90 దశకం చివరి రోజుల్లో తెలుగులో కంప్యూటర్ కీప్యాడ్ పైనే వాక్యాల నుంచి వ్యాసాలు టైప్ చేయడం మొదలెట్టాను. అంతకు ముందు వరకు తెలుగు టైప్ రైటర్లు అందుబాటులో ఉండేవి. కంప్యూటర్ శకంలో వాటి అవసరం తగ్గిపోయింది. తెలుగు అక్షరాలను కంప్యూటర్ కీ ప్యాడ్ మీద టైప్ చేయడం కోసం అనేక ఫాంట్లు, పద్ధతులు రూపుదాల్చాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫాంట్లు తయారు చేయడంలో పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. వాడకందారులు సునాయంసంగా తెలుగులో టైప్ చేయగలగడం మొదలైంది. ఇంటర్నెట్. దీన్నే మనం అంతర్జాలం అంటున్నాము. కంప్యూటర్ దగ్గర కూర్చుని తెలుగులో రాసిన వ్యాసాన్నో లేదా ఇతర అంశాలనో నలుగురికి పంచిపెట్టడంలో ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. మన భావజాలాన్ని మన మాతృభాషలోనే ఇతరులకు పంచిపెట్టడం ఈ యుగంలో ఎంతో సులువైంది. ఒక్క బటన్ నొక్కితే చాలు క్షణాల్లో మనం అందించే సమాచారం యావత్తూ ప్రపంచమంతటికీ చేరిపోతున్నది. ఈ సౌకర్యం రావడం తెలుగు భాషాభిమానులమైన మనందరికీ ఒక వరం. ఒక అదృష్టం. మొబైల్ ఫోన్. దీన్ని చరవాణి అని మనం పిలుచుకుంటున్నాము. ఇది కూడా అక్షరబద్ధమైన మన ఆలోచనలను అత్యంత వేగంగా చేరవేయడంలో సహకరిస్తున్నాయి. వాట్సప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల యాప్ల సాయంతో ఇంటర్నెట్ అనుసంధానంగా స్మార్ట్ ఫోన్లు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తెలుగు భాషా వికాసం గురించి, దాని వ్యాప్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కచ్చితంగా ఈ మొత్తం సాకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దోహదపడిన మహనీయులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. సరే చక్కటి అవకాశాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భాషాభిమానులమైన మనం ఏం చేయాలి? ఈ విషయం కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాలోకి ప్రవేశించగానే మనకు అనేక వయసులవారికి తగ్గట్టుగా అనేకానేక అంశాలు కనబడుతుంటాయి. లేదా వినబడుతుంటాయి. మనం ఏం చేయాలంటే, వయసులవారీగా వారిని ఆకట్టుకునేటట్లు తెలుగు భాషలో అంశాలను చేరవేయాలి. ఉదాహరణకు ఐదేళ్ల లోపు పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయిలో కోకోమిలన్ వంటి సంస్థలు, ఊహకూడా తెలియని పిల్లలకు ఇంగ్లీష్ లేదా ఇతర భాషల పట్ల పరోక్షంగా అవగాహన కల్పిస్తున్నాయి. తెలుగులో ఇలాంటి సంస్థలను వేళ్లతో లెక్కించవచ్చు. వీటి సంఖ్య పెరాగాలంటే వాటిని మనమంతా ప్రోత్సహించాలి. ఇంటి గుట్టు చెప్పకూడదుకానీ, మన పిల్లలకు ఇంగ్లీష్ రైమ్స్ చిట్టి బుర్రల్లోకి ఎక్కించడంలో ఉన్న శ్రద్ధ తెలుగు పాటల ద్వారా బుజ్జాయిల్లో ఊహాశక్తి పెంచడానికి ఏ మాత్రం శ్రద్ధ పెడుతున్నాం, చెప్పండి. తెలుగు అక్షరాలు నేర్పడం, పదాలు సరిగా పలికేలా చూడటం తల్లిదండ్రులు, ఇంటి పెద్దల పాత్ర. కానీ వారు ఏమేరకు ఈ పాత్రను సరిగా పోషిస్తున్నారో ఆలోచించాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది. పాఠశాలకు వెళ్ళే పిల్లల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మరింత సమాచారం అందించాలి. ఇంగ్లీష్ చదువు ఎలాగో పాఠశాలల్లో నేర్పుతుంటారు. అందుకే ఇంట్లో తెలుగు భాష యొక్క సౌందర్యం, తెలుగు మాట్లాడటంలోని ఆనందం , తెలుగు రుచిలోని కమ్మదనం ఏమిటో పిల్లలకు చెప్పాలి. ఇందుకు అవసరమైన సమాచారం అందరికీ పంచడానికి సోషల్ మీడియా దోహదపడుతుంది. అలాగే మిగతా వయస్సుల వారికీ తెలుగు భాష వైభవం అర్థమయ్యేలా మనమంతా కృషి చేయాలి. ఈ దిశగా మరింత శ్రద్ధ పెట్టాలి. మనలో చాలా మంది ఈపాటికే చూసే ఉంటారు. హిందీ నేర్చుకోవడం ఎలా? ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవడం ఎలా? వంటి అంశాలతో అనేక వీడియోలు చూడగలుగుతున్నాము. అలాగే తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడటం ఎలా? ఎక్కడ మనం తరచు తప్పులు చేస్తుంటాము? వంటి విషయాలపై పరిశోధన చేస్తున్న వారు వీడియోలను సోషల్ మీడియా ద్వారా లక్షలాదిమందికి చేర్చే పని వేగవంతం కావాలి. వీడియోల మాటేమో కానీ ఫేస్బుక్ వంటి వాటి ద్వారా ఇప్పటికే కొంత మంది తప్పులు లేకుండా తెలుగు మాట్లాడటం, వ్రాయడం ఎలా అన్న అంశాలపై వివరణలు ఇస్తూ పోస్ట్లు పెడుతుడటాన్ని నేను గమనించాను. వారికి ఈ సందర్భంగా అభినందనలు. తెలుగు భాషలోని అందాలను చాటిచెప్పే మరో అంశం పాటల సాహిత్యం. ముఖ్యంగా తెలుగు సినిమా పాటల్లో భాషా మధురిమలు అన్న అంశంపై కూడా అనేక మంది పరిశోధనలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా నా సంపాదకత్వంలో నడుస్తున్న ఛానెల్ 5ఏఎంలో ఘంటసాల శత జయంతి సందర్భంగా వంద రోజుల పాటు వంద కార్యక్రమాలను దేశ విదేశాల్లోని గాయకులతో అందించడం జరిగింది. అలాగే అన్నమాచార్య జయంతి సందర్భంగా వారోత్సవం, మహా శివరాత్రి నాడు రోజంతా గంటగంటకీ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల సోషల్ మీడియా తెలుగు అభిమానులకు మరింత చేరువ అవుతుందన్నది నా నమ్మిక. అలాగే, తెలుగు నిఘంటువులు ఇంటర్నెట్ ఆధారిత వెబ్ సైట్స్లో లభిస్తున్నాయి. అటు ఇటుగా తెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాలు, అంశాలు అంతర్జాల ఆధారితంగా నేడు లభ్యమవడం ముదావహం. తెలుగులో ఆదికవి నన్నయ్య నుంచి నేటి కవుల వరకు వ్రాసిన అనేకానేక పద్యాలు, కవితలు, కథలు, నాటికలు, నాటకాలు, ఇంకా అనేక తెలుగు కళారూపాలకు సోషల్ మీడియా చక్కటి వేదికగా నిలిచే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే కొంత మంది తెలుగు భాషా వైభవాన్ని, పద్యం రూపంలోనో వచన రూపంలోనో ఇంకా ఇతరంగానో పంచిపెడుతున్నారు. వీరంతా ఏమీ ఆశించి చేయడంలేదు. కేవలం వారి మనో ఆనందం కోసమో లేదా భాష పట్ల ఉన్న అభిమానంతోనూ చేస్తున్నారు. అలాంటి వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు తలెత్తే ప్రశ్నలకు సమాధానం కోసమో లేదా ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాల కోసమో లేదా వినోదం కోసమో ఇలా ఏదో అవసరం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన గురువు, ఇది మనకు అనుభవ సారంగా తగు సలహాలు చెప్పే ఓ అత్త, ఓ అమ్మ, ఓ గైడ్, ఓ సలహాదారుడు, ఓ ఫ్రెండ్. సోషల్ మీడియాని సరిగా ఉపయోగించుకుంటే ఇప్పుడు చెప్పిన వీళ్లంతా కనిపిస్తారు. పలకరిస్తారు. మనకో మార్గం చూపడానికి మేమున్నామని వెన్నుతడతుంటారు. పుంఖాను పుంఖాలుగా వస్తున్న సమాచారానికి ప్రామాణికత ఏమిటన్న ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. దీనికి ఓ నిర్ణీత వ్యవస్థ సమీప కాలంలో రావచ్చేమో. వేచి చూద్దాం. ఇదంతా వింటుంటే మనకేం అనిపిస్తోంది? సోషల్ మీడియాను త్రోసిపుచ్చి తెలుగు భాషా వికాసం గురించి మాట్లాడుకోవడం ఇక కుదరదనేగా. నిజమే, తెలుగు భాషా, సంస్కృతిని ఈ తరం వారికి చేరవేయడంలో ఇప్పటికే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఇది చాలదు. చేయవలసింది ఇంకా ఉన్నది. సాంకేతిక యుగంలో ఉన్న మనకు మరో అద్భుతం ఆవిష్కృతమైనది. అదే AI గా పిలుచుకునే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్. కృత్రిమ మేథా సాధనాలను ఉపయోగించుకుంటూ తెలుగు భాషా వికాసానికి దోహదపడటంలో మన వంతు కృషి చేయవచ్చు. ప్రస్తుతానికి AI వినియోగం కొత్త అనిపించవచ్చేమో కానీ, అతి త్వరలోనే తెలుగు భాషా వికాసానికి ఇది కూడా ఉపయోగపడుతుందన్న నమ్మకం నాకుంది. సాంకేతిక రంగం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. కృత్రిమ మేథ తర్వాత ఇంకా ఏమి రాబోతున్నాయో ఇప్పుడు మన ఊహకు కూడా అందని విషయం. అయితే, ఎన్నైనా రానియనివ్వండి తెలుగు భాష వికాసానికి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చన్న స్పృహ మనలో ఉంటే చాలు. ఆయుధం చేతబూనిన ప్రతి వ్యక్తి సమాజానికి నష్టం కలిగిస్తాడనుకోకుడదు. అదే ఆయుధం ధరించి మానవాళికి మంచి జరిగే పనులూ చేయవచ్చు. సోషల్ మీడియా కూడా ఓ ఆయుధం లాంటిదే. దీని వల్ల చెరుపు ఎక్కువగా జరిగిపోతుందని కలవరపడటం కంటే, అదే ఆయుధాన్ని చేతబూని తెలుగు భాషా వికాసానికి ఉపయోగించే ప్రక్రియను విస్తృత పరచాలి. వేగవంతం చేయాలి. సాంకేతిక పరికరాలను సృష్టించడమన్నది సాంకేతిక విద్యనార్జించిన వారి పని. మనకు ఈ అంశంతో సంబంధం లేదు. ఆవిష్కృతమైన సాంకేతిక పరికరాలను మనకు వీలుగా ఎలా ఉపయోగించుకోవాలన్నది తెలిస్తే చాలు. ఏ సాంకేతిక పరికరమైనా దాని తయారీదారుడు వాటిని వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకునే తయారుచేస్తాడు. అంటే యూజర్స్ ఫ్రెండ్లీగానే ఏ టెక్నికల్ టూల్ అయినా ఉంటుంది. మనలో కొంత మంది – ‘ఇదంతా కొత్త పద్ధతి. మాకు అలవాటు లేని వ్యవహారం. మేము వాటికి దూరం’ అనుకోవచ్చు. కానీ ఒక సారి వాడటం మొదలుపెడితే ‘అరే, ఇంత సులువా’ అనుకోవడం ఖాయం. అందుకు కావల్సిందల్లా సరైన సంకల్పం చెప్పుకోవడమే. 80ఏళ్లు పైబడిన వారు కూడా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా వారికి నచ్చిన అంశాలను చదవ గలుగుతున్నారు. చూడగలుగుతున్నారు. అలాగే అక్షరాలు నేర్వని పసిపాప కూడా సోషల్ మీడియా తెరిచి తనకు కావలసిన వీడియో చూడాలనుకుంటున్నది. తెలుగు భాషా వికాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి అందుకు కీలక పాత్ర పోషించే సోషల్ మీడియాను విస్మరించ వద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే విశిష్ట సేవలందిస్తున్న వారిని ప్రభుత్వం కూడా గుర్తించాలి. అసలు మీడియా, సోషల్ మీడియా అంటూ విడివిడిగా చూడకుండా సమభావంతో చూడాలి. ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సమాజంలోని చెడుకి ఉపయోగపడుతున్న ఈ సాంకేతిక పరికరాలతోనే సమాజంలో మంచిని పెంచడానికీ పంచడానికీ మనం నడుం బిగించాలి.
ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో సత్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ – అధికార భాషా సంఘం నుంచి “తెలుగు భాషారత్న జీవన సాఫల్య” పురస్కారం అందుకుంటున్న రచయిత తుర్లపాటి
మొత్తానికి తెలుగు వెలుగు నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవనసాఫల్య పురస్కారం అందుకునేలా చేసింది. అందుకే తెలుగు తల్లికి నమస్కరిస్తూ ఈ భాగ రచన ఆమెకు అంకితం చేస్తున్నాను.
(మళ్ళీ కలుద్దాం)
శీ తుర్లపాటి నాగభూషణ రావు రచయిత, సీనియర్ జర్నలిస్ట్. తెలుగు భాషాభిమాని. కృష్ణా జిల్లా (ప్రస్తుత ఎన్టీ ఆర్ జిల్లా) అడవి రావులపాడు గ్రామంలో 1957లో కనీసం కరెంట్ సౌకర్యం లేని పల్లెలో పుట్టి మిడిమిడి చదువులతోనే అంచలంచలుగా ఎదిగారు. 1980లో సైన్స్లో మాస్టర్ డిగ్రీ పొంది, అనంతరం జర్నలిజం పట్ల ఆకర్షితులై అనేక పత్రికలు, టివీ సంస్థల్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. తెలుగు భాష పట్ల మక్కువతో వందలాదిగా విశిష్ట రచనలు చేసి పలువురి ప్రశంసలందుకున్నారు.
అదిగో హరివిల్లు (ఆకాశవాణి రూపకం), గంగ పుత్రుల వ్యథ, ఇస్లామిక్ కట్టడాలలో హిందూ శిల్ప శైలి (పరిశోధనాత్మక కథనం), గ్రామదేవతల పుట్టుక – సామాజిక అవసరాలు, క్రికెటానందం, నరుడే వోనరుడైతే (ఆకాశవాణి హాస్య నాటిక), సెలవుపెట్టి చూడు (ఆకాశవాణి హాస్య నాటిక), ఒక్క క్షణం (ఆకాశవాణి రూపకం), పంచతంత్రం (పంచ భూతాలు – పర్యావరణం), మంచి పాటలు – మనసులోని మాటలు, నిప్పు రవ్వ (డాక్యుమెంటరీ), బరువుల బాల్యం (ఆడపిల్లల వ్యథలు), బాలికలతో మరణమృదంగం, సూట్కేస్ (ఆంధ్రప్రభ కథ), తెలుగు భాషా పరిణామక్రమం – సోషల్ మీడియా పాత్ర (పరిశోధన పత్రం), చిదంబర రహస్యం – ఒక వినూత్న కోణం (పరిశోధనాత్మక రచన), భారత దేశ స్వాతంత్ర్యోద్యమం – తెలుగు తేజం పింగళి వెంకయ్య (పరిశోధన పత్రం), 90 ఏళ్ళ టాకీ: తెలుగు సినిమాకు పట్టాభిషేకం – ఒక పరిశీలన (రాబోయే రచన) ముఖ్యమైన రచనలు.
శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ షిర్డీ సాయిబాబా, గిరీశం, శ్రీ రాఘవేంద్ర స్వామి – ఏకపాత్రలు రచించి, పాత్రలు పోషించారు.
ఓపెన్ హేమెర్ – చీకట్లో పరివర్తన – ప్రత్యేక కథనం.
40 ఏళ్ళుగా అనేక విశిష్ట రచనలు చేసి అనేక పురస్కారాలను, ప్రశంసలను అందుకున్న తుర్లపాటి అనన్య సేవలకు గుర్తింపుగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.