[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘తొలిప్రేమ చిగురించిన వేళ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనాటి మన తొలి కలయిక
బహు విచిత్రమే కదా!
అటు వైపు ఓసారి
ఇటువైపు మరోసారి
నీ చూపులతో గిలిగింతలు పెడుతూ
నా హృదయాన్ని భలేగా గాయం చేశావు!
నీ చూపుల కోలాటంతో
సహజసిద్ధమైన ప్రేమ
నా అంతరంగంలో వెల్లువెత్తి..
నీ మాటల్లో కోపాన్ని గాక
నీ ఎద లోపలి ప్రేమ భావనను
నాకు ఇట్టే తెలియజేసింది!
నీ పెదాలపై గలాటా రుసరుసలు కనిపించినా
నీ కళ్ళల్లో ప్రేమ మతాబులు విచ్చుకోవడాన్ని
నా హృదయ నేత్రాలు చూశాయి ప్రేయసీ!
నా చూపుల బాణాలు
నీ గుండె లోతులను గాయం చేస్తోంటే
భయం.. కోసంతో కూడిన ప్రేమ
నన్ను నిలువెల్లా ఆక్రమించిన వేళ..
నేనలా నీ కళ్ళల్లో మునిగేపోయాను.
నీ కన్నులు వెదజల్లిన కాంతిరేఖలు
నా చూపులకు ఎరగా మారి
ఒకింత ఆందోళనుకు గురైపోయాను కానీ..
అసలైన ప్రశాంతత అక్కడే లభించింది నాకు!
ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం
నీ సహజ అభరణాలుగా
నిరంతరం నీ మనసును అంటిపెట్టుకొనిన వేళ
నా మనసు తెలిసి కూడా
నన్ను దూరంగా పెట్టావు!
అయినా.. చెలీ..!
నా మనసుతో నీ మనసు ఢీకొని
తీయని గాయాలెన్నో చేసింది!
నీ ప్రేమ లభించని నా జీవితం
పరిపూర్ణం కాదు కదా సఖీ!
నీ కోపతాపాలను ఓర్పుతో భరించి
నిలువెత్తు ప్రేమలో మునిగిపోయాను!
నీవు పెట్టిన ప్రేమ పరీక్షలో
విజయతీరాలను చేరి..
గొంతెత్తి ప్రేమ గానం చేస్తూ
వినీలాకాశంలో విహరించాను!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.