[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు’ అనే కథాసంకలనాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ కస్తూరి రాజశేఖర్.]
థ్రిల్లింగ్ – చిల్లింగ్ కథా సంకలనంలో తనదైన డిక్షన్ పటిమతో 65 కొసమెరుపు కథలని కొసరి కొసరి వడ్డించారు రచయిత కస్తూరి మురళీకృష్ణ!
తెలుగు సాహితీ యవనిక మీద థ్రిల్లర్, హారర్, అబ్సర్డ్ వంటి కథల్ని సమీక్షించాలంటే పూర్వరంగావలోకనం తప్పనిసరి. ఎందుకంటే, రచయిత సమంజసంగా వాపోయినట్లు, తెలుగు సాహిత్యానికి కట్టుబాట్ల కంచెలు కట్టేసి ప్రపంచ సాహిత్యంతో బాటు పయనించకుండా ఫక్తు కుటుంబ ఫార్ములా కథల్ని మన మీద నెట్టేసి తెలుగు కథని నిలబెట్టేశారు చాలాకాలం! ఆ మహానుభావులంతా ఒకప్పుడు చందమామ కథల్లో దయ్యాలు, బేతాళ కథలు రగ్గు కప్పుకుని వణుకుతూ చదివి ఆనందించిన వాళ్ళే! అప్పటి కాలంలో సాహితీ స్రష్టలు ఒకరిద్దరు సస్పెన్స్ కథల ప్రయోగాలు చేసినా, వాటిని సాహిత్యానికి అపభ్రంశంగా నిర్ణయించేసి, దానిలో సామాజిక స్పృహ లేదని నిరసించి దాదాపూ బూతు సాహిత్యం సరసన నిలబెట్టేసి వెలివేసిన సాహితీ ప్రక్రియలు హారర్, థ్రిల్లర్ కథలు!
1953 లోనే శామ్యూల్ బెక్కెట్ రెండు పాత్రలతో waiting for Godot అనే అబ్సర్డ్ నాటకాన్ని ప్రదర్శించి సృజనాత్మకతకున్న హద్దుల్ని చెరిపేశాడు. 1959 నాటికే రాడ్ సెర్లింగ్ వంటి వాళ్ళు The Twilight Zone వంటి క్లాసిక్ ఆంథాలజీ తో థ్రిల్లర్, హారర్ కథాంశాలతో టి.వి. సీరీస్ నిర్మించి ప్రపంచ వీక్షకుణ్ని అలరిస్తే, మన తెలుగు పాఠకుడు 1980 దశకంలో కూడా, స్పై థ్రిల్లర్ నవలని క్లాసు పుస్తకాల మధ్యలో పెట్టుకుని చదవాల్సి వచ్చిన పరిస్థితి గమనిస్తే, మనం సృజనాత్మకతకి ఎంత దూరమైపోయామో అర్థం అవుతుంది.
ఆధునిక తెలుగు నవలా యాత్రలో ఎన్. ఆర్. నంది, యండమూరి, స్పై థ్రిల్లర్ కథలతో షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు, హారర్, సస్పెన్స్ కథలకి స్టార్ ఇమేజ్ తెచ్చి సకుటుంబ సపరివారపత్రికలలో చోటు సాధించారు. అలాగే కథా ప్రపంచంలో అపరాధ పరిశోధన పత్రిక, కొసమెరుపు కథలతో మల్లాది వంటి వాళ్ళు సస్పెన్స్ కథకు కొత్త సొబగు చేకూర్చారు.
ఈ కాలంలో ఒక ప్రక్క OTT ప్లాట్ఫామ్, ఇతర చానెళ్లలో ఇతర భాషా కథలు హారర్, థ్రిల్లర్ కథాంశాలతో అట్టుడికి పోతుంటే, మన తెలుగు చానెళ్లు అత్తాకోడళ్ళ డెయిలీ సీరియల్స్ స్థాయిలోనే మ్రగ్గిపోతున్నాయి.
అలాంటి పరిస్థితిలో వార్త దినపత్రిక సంపాదకులు రచయితని ప్రోత్సహించి ఈ కథల్ని ప్రచురించి గొప్ప సాహసమే చేశారు. థ్రిల్లర్, హారర్ ప్రధాన జోనర్లుగా అందులో ఎన్నో ఉప కథాంశాలని తీసుకుని వెన్ను జలదరించేలా తాజా కథల్ని మజాగా మలిచారు రచయిత. సస్పెన్స్ కథా ప్రియులకు కిక్కు ఎక్కించే కథలు ఇస్తూనే అందులోనే మానవతా దృక్పథాన్ని పోపుపెట్టి వడ్డించారు రచయిత. ఈ తరహా కథల్లో సామాజిక స్పృహ ఉండదనే సాంప్రదాయక వాదుల పిడివాదాన్ని ఓడించేశారు.
ప్రతి కథకీ అనూహ్యమైన ముగింపు ఇచ్చారు రచయిత. ‘రామాపురం టోల్ గేట్’, ‘పార్వతి పిలుపు’ వంటి కథలు హారర్ జోనర్లో రాసినవిగానే కనిపిస్తాయి. కానీ అంతకు మించిన సందేశం ఉంది ఆ కథల్లో. ‘కాకికేం తెల్సు సైకో ఎనాలిసిస్’ అన్న శ్రీశ్రీ మాటలకు అంతకంటే ఎక్కువే తెలుసు అన్నట్లుగా ‘పగబట్టిన కాకి’ కథ చెబుతుంది. Co-incidental గా జరిగే రెండు సంఘటనల్ని ముడిపెట్టి చెబితే ఎంత భయానకం అవుతుందో ‘ప్రాక్టికల్ జోక్ కథ’ లో తెలుస్తుంది. నిజాయితీ ఉన్న రచయితలని exploit చేసే పబ్లిషర్లకు ఎలాంటి శిక్ష ఉంటుందో ‘అంతు చూసిన అక్షరాలు’ కథ చెబుతుంది. జాంబీ జోనర్లో చెప్పిన కథలు మనిషి-మృగం, నాలుగు తలలు. కానీ మనిషిలోని భిన్న భావాల్ని రూపుకట్టి చూపించారు రచయిత. సైన్స్ ఫిక్షన్ కథలు – ‘పొరపాటు-గ్రహాపోటు’, ‘ప్రయోగ ఫలితం’ వంటి కథలు పైత్యం తలకెక్కి మనిషి చేస్తున్న అప్రాకృతిక చేష్టలని ఎత్తి చూపుతాయి. భ్రూణహత్యల పాపం ఎలా చంపుతుందో ‘వెంటాడిన పాపం’ చెబుతుంది. ముందు యుగం దూతలం – నవయుగ నిర్మాతలం అంటూ విద్యార్థి దశలో రాజకీయ ప్రభావాల మత్తులో చదువు వదిలేసి సమాజం కోసం త్యాగం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడే యువత దుస్థితి ని చూపిస్తుంది ‘ఎక్స్పైరేషన్!’.
‘వహ్ కౌన్ హై తేరా’ కథ వలస జీవుల వ్యథార్త గాథతో మన కళ్ళు తెరిపిస్తుంది. ఏదో గొప్ప జీవితం ఉందన్న పిచ్చి ఆశతో పల్లె వాడు పట్నం వచ్చేసరికి, అక్కడేమీ లేదని తెలుసుకున్న పట్నం వాడు విదేశాలకి వెళ్ళటం అన్న విషయం కనువిప్పు కలిగిస్తుంది! అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కథ కనుమరుగైపోయిందని బాధపడేవాళ్ళకి ‘నాకు దయ్యం కావాలి’ కథ కామెడీ కాలక్షేపాన్నిస్తుంది. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమను కోవోయ్ అనే withdrawal సైకాలజీకి పరాకాష్ట ‘జలవిలయ వేళ’!
అబ్సర్డ్ కథ – ‘మొలిచే చేయి’, యండమూరి ‘థ్రిల్లర్’ నవలని గుర్తుచేస్తుంది. ఈ తరహా కథల్లో వుండే ఉత్సుకత బాగా పోషించారు రచయిత ‘సంగీత ద్రోహి, ‘అతడి రూపం-అయ్యింది శాపం’ వంటి కథల్లో! ‘ఆ ఇల్లు’ కథ work from home అనే జీవన విధానంలో సంఘ జీవనం ఎలా ఉంటుందో హారర్ని జోడించి చెప్పారు రచయిత!
ఎన్నుకున్న జోనర్ వినూత్నంగా హారర్, థ్రిల్లర్లు అయినా రచయిత తన సామాజిక బాధ్యత, తాత్విక చింతన మర్చిపోలేదు. మనిషి ఎలా ఉంటున్నాడు, జీవితం యొక్క తత్వ సారం ఏమిటో సరైన చోట సరిగ్గా చెప్పారు.
‘జీవితం విలువ తెలిసేవరకూ జనన, మరణాలకు అతీతంగా ఇలా ఉంటాం. జీవితం విలువ తెలిసిన తర్వాత మళ్ళీ జన్మిస్తాం’(pg 286),
‘మనిషి తన క్షణ కాల జీవితంలో తన భావనలు శాశ్వతం అనుకుంటాడు.. విశ్వపుటనంతత్వాన్ని ఆస్వాదించే అవకాశాల్ని కోల్పోతాడు’(pg 276),
‘మనిషి ఇతరుల తోడు కోరటం బలహీనత. ఇతరులు తన వెంట ఉన్నారనుకోవటం భ్రమ’(pg 251),
‘ఊపిరి ఉన్నంత కాలం మనిషి జీవిస్తున్నట్టు. ఊపిరి ఆగిపోతే మనిషి మరణించినట్టు. ఈ రెంటి నడుమ ఉంటే మనిషి మరణించినట్టూ కాదు-జీవిస్తున్నట్టూ కాదు’(pg 231),
‘కనబడనివి చూడగలగటం ఎంత గొప్ప వరమో, అంత పెద్ద శాపం!’(pg 172),
‘అతడి అనుభవం అతడికి సత్యం. నాకు అసత్యం. ..కాబట్టి అతడు పిచ్చివాడని తీర్మానించడం సబబా?’ (pg 168),
‘తన తోటి జీవుల ఆనందంతో తన ఆనందం ముడిపడి ఉంటుందని గ్రహించటమే అసలైన జ్ఞానం’(pg 166),
‘జీవితం ఒక ప్రశ్న. సమాధానం వెతకాలి . మరణం ఒక సమాధానం. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’(pg 163),
‘చీకట్లో బెదిరించి, భయపెట్టినవన్నీ వెలుతురులో, హాస్యాస్పదమవుతాయి’(pg 88).
రచయిత రచనా పాటవం ప్రతి కథలోనూ కనిపిస్తుంది ‘అగ్ని వెలుతురు వేడితో కాలుస్తుంది. ఈ అగ్ని చీకటిలో చల్లదనంతో గడ్డ కట్టిస్తుంది అనిపిస్తుంది’(pg 9),
‘శ్మశాన నిశ్శబ్దమా? సమాధి శాంతమా?’ (pg 21),
‘ఎదురుచూడటం శిక్ష అయితే, ఏం జరుగుతుందో తెలియకుండా సమాచారం కోసం ఎదురు చూడటం ఇంకా భయంకరమైన శిక్ష లాంటిది’ (pg 29),
ఫ్యాను వేగంగా భూమిని చేరాలన్న ఆత్రంతో కిందకు దూసుకువస్తోంది’ (pg 273),
‘నీరు.. నిప్పు.. వేర్వేరు. కానీ నాల్కలు సాచి విస్తరించే విధానం చూస్తుంటే రెండూ ఒకటే అనిపిస్తున్నాయి’ (pg 231),
‘నువ్వు నా దానివి అవటం ఒక కల. ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తెరవాల్సిందే . కల విరగాల్సిందే..’ (pg 218),
‘ఒక్కసారి తాను ‘ఫోజు’లో నిలబడిన తర్వాత తాను వారికి స్త్రీ కాదు’ (pg 128)
‘ఆమె శరీరంలో ప్రవహించేది రక్తం కాదు. ‘భయం’ అనిపించింది’ (pg 181).
‘గాలి భయంకరంగా గావుకేకలు పెడుతూ వీస్తోంది’(pg 70),
‘అక్కడ కొమ్మల నడుమ కొమ్మ అయిన అత్యంత సుందరమైన కొమ్మను చూశాను’(pg 66).
అక్షరాలతో విజువల్ ఎఫెక్ట్ తెస్తాడు రచయిత – ‘అల నాపై విరుచుకుపడింది’ (pg 251).
రచయిత లాజికల్ థింకింగ్ని తెలియజెప్పే మాట – ‘అయినా.. ఎవ్వరూ ఉండని ఈ ఇంటికి కరెంటు బిల్లు ఎవరు కట్టి ఉంటారు?’ (pg 201).
భావావేశంలో కొండొకచో దారి తప్పినట్లనిపించినా తప్పుదారి కాదనిపిస్తూ రచన సాగుతుంది – రెండు ఆత్మలు కలిసి బయటకు నడిచినప్పుడు ‘వారిని పంచభూతాలు తమలో కలిపేసుకున్నాయి ‘(ఆత్మకు పాంచభౌతిక శరీరం ఉండదు కదా?) (pg 210),
‘మనుషులకు చీకటి అంటే భయం. అందుకని.. (?) (pg 296),
‘కానీ మానవులకన్నా ముందు మానవులపై (?) ఈ మార్పు ప్రభావం చూపుతోంది’ (pg 254).
ఇలా అక్కడక్కడా ముద్రారాక్షసాలు ఉన్నా రాక్షసత్వం లేని కథలే అన్నీనూ!
మరి ఇంత బాధ్యతా యుతంగా రచన చేసి రేపటి హారర్, థ్రిల్లర్ కథాప్రపంచానికి పటిష్ట పునాదులు వేసిన రచయితని వదిలేసి ఛాందస వాదరీతుల దగ్గరకు వెళ్లిపోదామా? లేక క్రొత్తదనానికి ఆసరా ఇస్తూ కథల్లో ఏం చెప్పారో వెళ్ళి చూద్దామా? రచయితే ఒకచోట వ్రాసినట్టు – ‘వెళ్లిపోదామా? వెళ్ళి చూద్దామా?’ (pg 349)
ఈ సంపుటంలో ఎన్నో మైలు రాళ్ళు ఉన్నాయి.. మేలు రాళ్ళు కూడా! కథలు చదువుతూ కథాత్మ లోకి తొంగిచూడాలే కానీ, పంచతంత్రాన్ని మించి జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి.
ఈ కథల్లో – సైన్స్ ఉంది. సస్పెన్స్ ఉంది. హారర్ ఉంది. హ్యూమానిటీ ఉంది. ఫిలాసఫీ ఉంది. Pragmatism ఉంది. అన్నింటినీ మించి – మనసు ఉంది. మానవత్వం ఉంది. వెరశి మనిషి జీవితం ఉంది. సమాజం ఉంది. సామాజిక స్పృహని తట్టి లేపే మృదుభావాలున్నాయి.
ఇన్ని పార్శ్వాలతో డెత్ బెడ్ మీద ఉన్న పాపభీతికి ప్రాణవాయువుని ఇస్తూ అక్షర చికిత్స చేస్తున్నాడు రచయిత. అక్షరం అతని ఆయుధం. కస్తూరి అంటే పరిమళం కాదు – పరమాణు యుద్ధం!
***
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 352
వెల: ₹ 250/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
సాహితీ బుక్స్, చుట్టుగుంట,
విజయవాడ. 9849992890
ఆన్లైన్లో:
https://www.amazon.in/Thrilling-Chilling-Kathalu-Kasturi-Muralikrishna/dp/B0DWXSQMTR
హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కస్తూరి రాజశేఖర్ వృత్తిరీత్యా -విశ్రాంత యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రా బ్యాంక్) చీఫ్ మేనేజర్. ప్రవృత్తి రీత్యా రచయిత, అనువాదకులు.
ఎం. ఏ. (తెలుగు), ఎం.ఎస్. (పబ్లిక్ రిలేషన్స్), ఎం.ఎస్ సి. (గణితం) విద్యార్హతలు. ప్రస్తుతం ఎం. ఏ. (సైకాలజీ) చేస్తున్నారు.
అనువాదకునిగా – నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ వారికి అనువాద/ప్రూఫ్ రీడింగ్ సేవలందించారు. జోతిరావు ఫూలే చరిత్ర, భక్త్ ఖాన్ అనువదించారు. ఈనాడు ఆదివారం పత్రికకు ఎన్నో సిండికేట్ ఆర్టికల్స్ అనువాదం చేశారు.
పి. దినకర రావు గారి ‘Ramblings’ ఇంగ్లీష్ కవితా సంపుటి తెలుగులోకి అనువాదించారు.
వీరి కథలు ఈనాడు ఆదివారం పత్రిక, విపుల (అనువాద కథలు), చతుర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ఓ సారి చూడండి అంతే.. whatsapp ప్రసారభారతి సంచిక’ నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ఎక్కడ ఉన్నా.. ఏమైనా..’ బహుమతి పొందింది
వీరి నవల ‘చక్రవ్యూహం’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో 3వ బహుమతి పొంది 28 వారాల పాటు ధారావాహికగా ప్రచురితమైనంది.
నాటక రచనలు:
– ఆమె త్యాగం (చలం గారి కథకు నాటక రూపం – అజో విభో కందాళం సంస్థ వారి కథా నాటికల పోటీలో ప్రదర్శింపబడింది.)
– నాతిచరామి (న్యూ ఢిల్లీ – శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారు నిర్వహించిన జాతీయ నాటక పోటీలలో 2వ బహుమతి)
– త్వమేవాహం (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో 8 బహుమహతులు), తిరుపతి మహతి స్టేడియం, మరెన్నో వేదికల పైన ప్రదర్శింపబడింది.
– శతమానం భవతి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో జ్ఞాపిక )
– సర్వేజనా సుఖినోభవంతు (హైదరాబాద్ BHEL నాటక పోటీలో ఉత్తమ బాల నటుడు బహుమతి)
– పారిజాతం (డిసెంబర్, 2022 – న్యూ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, జనవరి, 2023 – హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ, జనవరి , 2023 – విజయవాడ లలో ప్రదర్శింపబడింది)
– పరంపర (రస రంజని వారి ఆధ్వర్యం లో 26-10-2023న శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారిచే ప్రదర్శింపబడింది)
– గురుభ్యోనమః
ఇవి కాక, ఈనాడు అదివారం పత్రిక కోసం పుస్తక సమీక్షలు చేశారు. యండమూరి రచనల సమీక్షా వ్యాసానికి బహుమతి పొందారు. 2016 బాంకాన్ సమావేశ పత్రాల ముద్రణలో సహాయ సేవలందించారు. డా. బి. కామేశ్వర రావు వ్రాసిన ‘ఆనంద విజయం’ (బెర్ట్రాండ్ రస్సెల్ ఆంగ్ల రచన – ది కాంకేస్ట్ అఫ్ హ్యాపీనెస్కు అనువాదం) కు; సీహెచ్ శ్రీనివాస శాస్త్రి వ్రాసిన ఇంగ్లీష్ రచన – the unanswered questions కు, కొండపల్లి సనత్కుమార్ రచించిన ‘శ్రీ సాయి బాబా చరిత్ర’ (ఇంగ్లీష్)కు సంపాదకత్వ బాధ్యలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్ house magazine ‘magicart’ సంపాదక మండలి సభ్యులు.
ఎన్నో కవితలు రాశారు. ‘కాల ధర్మం’ ప్రసిద్ధి చెందిన కవిత. ఆల్ ఇండియా రేడియోలో కవితా శ్రవణం. అభినందన పంచరత్నాలు వగైరాలు.
‘పడమటి ఉషస్సు’ అనే లఘుచిత్రానికి కథ, మాటలు అందించి, నటించారు. Kasturi Dreamworks అనేది వీరి యూట్యూబ్ ఛానెల్.
పలు తెలుగు ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈనాడు – ఆదివారం, విపుల, చతుర పత్రికలకు సబ్ ఎడిటర్గా వ్యవహరించారు. ఫోన్: 9848378034