[బుకర్ ప్రైజ్ గెల్చుకున్న, కాజువో ఇషిగురో రచించిన ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]
మనిషి తాను నమ్మిన కొన్ని సిద్ధాంతాలను, విలువలను లేదా జీవన విధానాన్ని ఆచరిస్తూ తన జీవితాన్ని గడిపేస్తాడు. క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తులు తాము ఏ నియమాలను జీవన ప్రమాణాలుగా ఎంచుకున్నారో వాటిని గుడ్డిగా ఆచరిస్తూ జీవించేస్తారు. చాలా సందర్భాలలో తాము నమ్ముకున్న విలువలే వారి జీవితాలను నిర్వీర్యం చేస్తాయి. జీవితపు మలి సంధ్యలో తాము కోల్పోయిన ఆనందాలు, త్యాగం చేసిన కోరికలు ఇవన్నీ గుర్తుకు వచ్చి వారిని బాధిస్తాయి. పైగా తాము దేని కోసం జీవితాలను అర్పించామో అవి అర్ధరహితమని తెలిసాక మనిషి మనసులో కలిగే నిరాశలోని విషాదం ఏ భాషకూ అందనిది. తాము నమ్మినవన్నీ అవాస్తవాలని, భ్రమలని అర్థం అయి, జీవితాన్ని పూర్తిగా వాటికే అర్పించేసి మలి సంధ్యలోని ప్రవేశించిన మానవ జీవితాలలోని విషాదం అతి భయంకరం. దాన్ని లోతుగా చర్చించిన పుస్తకం ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’.
సిద్ధాంతాల కోసం జీవించాలి అనుకునే వ్యక్తులు ఎక్కడా రాజీపడని మనస్థత్వంతో జీవిస్తారు. ఇది వారిని కటువుగా మారుస్తుంది. చాలా సందర్భాలలో వారిలో సున్నితత్వం లోపించి కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. జీవితంలో తమ చుట్టు ఉన్న మానవ సంబంధాలని తృణీకరిస్తారు. అన్నిటికన్నా జీవితంలో సిద్దాంతాలు ముఖ్యం అని నమ్మి మిగతావాటన్నిటినీ వెనక్కు నెట్టేస్తారు. అలా జీవించిన తరువాత జీవితపు ఆఖరి ఘట్టంలో తాము నమ్ముకున్న సిద్దాంతాలలో లోపాలున్నాయని వాటి కోసం అమూల్యమైనవాటిని వదిలేసుకున్నాం అనే అవగాహన కలిగితే, అప్పుడు జీవితాన్ని పునఃనిర్మించుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. అప్పటిదాకా కఠినంగా జీవించిన జీవిన విధానం వారిని ఓ స్థాయికే పరిమితం చేసేస్తుంది. దాన్ని దాటుకుని వాళ్లు ముందుకు రాలేరు. అన్నిటిని అందరినీ కోల్పోయి ఒంటరయిన స్థితి అది. దేశభక్తి కోసం, దేశ సేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం, కొన్ని ఆశయాల కోసం మానవ సంబంధాలను కాదనుకుని మొండిగా జీవించిన గొప్ప ఆదర్శవాదుల జీవితాలు ఇలాంటి స్థితికి చేరడం మనకు చాలా సందర్భాలలో అర్థం అవుతుంది. వారి నిబద్ధతకు వారిపై గౌరవం ఉన్నా వారి కఠిన వైఖరి తెలిసిన తరువత దాన్ని దాటుకుని వారి ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నం ఎవరూ పూనుకుని చేయలేరు. కుదేలయిన వారి సిద్ధాతాల నడుమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారు చేసే ప్రయత్నం అత్యంత విషాదమైన స్థితి.
దీన్ని కాజువో ఇషిగురో ఈ నవలలో చూపించిన విధానం మనసును పిండేస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర పేరు స్టీవెన్స్. ఇతను డార్లింగ్టన్ హాల్ అనే ఓ పెద్ద ఇంట్లో బట్లర్. లార్డ్ డార్లింగ్టన్ ఆ ఇంటి యజమాని. ఇతను ఇంగ్లండ్లో గొప్ప రాజకీయ పలుకుబడి ఉన్న వాడు. ఆ ఇంట్లో ఎందరో గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు, ఇంగ్లండ్ దశను మార్చగల మేధావులు ఎన్నో చారిత్రిక చర్చలకు కలుస్తూ ఉంటారు. అలాంటి ఇంట ఓ బట్లర్గా గొప్ప క్రమశిక్షణతో తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు స్టీవెన్స్. ఒక చిన్న స్పూన్ కూడా ఉండవలసిన చోటు కాక మరో చోట ఉండడం స్టీవెన్స్ ఇష్టపడడు. యజమాని పట్ల ఎంతో గౌరవం, తన పరిది దాటి ప్రవర్తించని వ్యక్తిత్వం స్టీవెన్స్ది. యజమాని ఇష్టాలకు తూచ తప్పకుండా కట్టుబడి ఉండడం తన బాధ్యతగా భావిస్తాడు స్టీవెన్స్.
ఆ ఇంట్లో హౌస్ కీపర్గా పని చేస్తూ ఉంటుంది మిస్ కెంటన్. మంచి పనిమంతురాలు, ఆత్మగౌరవం మెండుగా ఉన్న స్త్రీ ఆమె. ఆ ఇంటి నిర్వహణలో భాగంగా స్టీవెన్స్, మిస్ కెంటన్ కలిసి పని చేయవలసి ఉంటుంది. అందుకని వారిద్దరూ తరుచుగా ఒంటరిగా కలుసుకోవలసి వస్తుంది. స్టీవెన్స్ దృష్టిలో ఒక ఇంటిలో పని చేస్తున్న స్త్రీ పురుషులు తమ పరిధి దాటి ప్రవర్తించకూడదు. ఎవరినీ కూడా పరిధి దాటి వాళ్ళు ఇష్టపడకూడదు. వారి కర్తవ్యం, ఆ ఇంటి నిర్వహణలో ఏ లోపం లేకుండా చూడడం మాత్రమే. మనసు దారిలో నడిస్తే తమ వృత్తికి ద్రోహం చేసినట్లు అందుకని ఎటువంటి ప్రేమ, ఇష్టం జోలికి వెళ్లకుండా తమ పనిని శ్రద్దగా నిర్వహించగలిగినవాడే నిజమైన బట్లర్. అతనే గౌరవానికి అర్హుడు. ఇది నమ్ముతాడు కాబట్టే స్టీవెన్స్ మిస్ కెంటన్ తనపై చూపే ప్రేమను గుర్తించడానికి ఇష్టపడడు. ఆమె ఎంత ప్రయత్నించినా తన మనసు తలుపులు తెరవడు. కఠినంగా వృత్తి తప్ప మరో విషయం తనకు తెలియనట్లే ప్రవర్తిస్తాడు. నవల మొత్తం కూడా స్టీవెన్స్ గతం చెబుతూ ఉండగా సాగుతుంది.
నవల ప్రారంభంలో స్టీవెన్స్ డార్లింగ్టన్ హాల్లో కొన్నేళ్ళుగా పని చేస్తూ ఉంటాడు. అది 1956 వ సంవత్సరం. ఆ యిల్లు చేతులు మారి అమెరికన్ అయిన మిస్టర్ ఫారాడే అధీనంలోకి వస్తుంది. ఫారడే సాంప్రదాయన ఇంగ్లండ్ జీవన విధానాన్ని ఆచరించే వ్యక్తి కాదు. యజమాని నౌఖరుల మధ్య ఇంగ్లీషు దొరలలో ఉండే ఆ కఠినమైన దూరాన్ని ఇతను పాటించడు. అందుకే జీవితాంతం ఆ ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని స్టీవెన్స్ని కొంత కాలం సెలవు తీసుకుని దేశం చూసి రమ్మని చెబుతాడు. అప్పుడే స్టీవెన్స్కు మిస్ కెంటన్ నుండి ఓ ఉత్తరం అందుతుంది. ఆమె ఇరవై ఏళ్ళ క్రితం డార్లింగ్టన్ హాల్లో హౌస్ కీపర్గా పని చేసి తరువాత వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అన్నేళ్ళ వివాహం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని, తాను ఒంటరిగా జీవించాలనుకుంటున్నానని ఆమె ఆ ఉత్తరంలో రాస్తుంది. దీనితో ఇప్పుడు మిసెస్ బెన్గా మారిన అలనాటి మిస్ కెంటన్ జీవితంలో సంతృప్తిగా లేదని ఆమె తిరిగి డార్లింటన్ హాల్కు హౌస్ కీపర్గా వస్తే ఆమెకూ తన యజమానికీ కూడా మేలు జరుగుతుందని అనుకుంటాడు స్టీవెన్స్. డార్లింగ్టన్ హాల్లో మంచి పనివాళ్లు లేరు. దానితో అక్కడ పని తీరు దెబ్బతింది. మిస్ కెంటన్ చాలా మంచి హౌస్ కీపర్ కాబట్టి ఆమె మళ్లీ అక్కడికి వస్తే బావుంటుందని స్టీవెన్స్ అనుకుంటాడు. ఆమె ఉండే ఊరికి తానే స్వయంగా యజమాని ఇచ్చిన కారులో బయలుదేరతాడు.
అలా దారిలో వెళుతూ తన గతంలోకి జారుకుంటాడు స్టీవెన్స్. మిస్ కెంటన్తో తాను కలిసి పని చేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ తాను ఎంత నిబద్ధతతో పని చేసేవాడో చెప్పుకుంటాడు. నవల మొత్తంలో కూడా స్టీవెన్స్ అతి క్రమశిక్షణతో ఆచి తూచి మాట్లాడే వ్యక్తిగానే మనకు గతాన్ని వినిపిస్తూ ఉంటాడు. కాని ప్రతి సందర్భంలో అతని క్రమశిక్షణ కారణంగా దెబ్బతింటున్న అతని మానవ సంబంధాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిస్ కెంటన్ అతన్ని ప్రేమిస్తుంది. తన మనసు అతనికి తెలపాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కాని ఆ అవకాశం స్టీవెన్స్ ఆమెకు ఇవ్వడు. అతనికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాని పని తప్ప మరి దేన్నీ చూడడానికి ఇష్టపడడు. అలా ఉండడం తన వృత్తి ధర్మం అని నమ్ముతాడు. లార్డ్ డార్లింగ్టన్ నాజీ సమర్థకుడు. అతను ఇంట్లో యూదు పనివారిని అన్యాయంగా పని లోనించి తీసేస్తూ ఉంటే స్టీవెన్స్ అడ్డు చెప్పడు. ఆ ఇంట్లో అన్ని చోట్ల తిరుగుతూనే తనకు అనవసరం అన్న విషయాన్ని అతను చూడడు, వినడు. ఎదురుగుండా ఏం జరుగుతున్నా తనకు సంబంధించిన విషయం కానప్పుడు దాని గురించి పట్టించుకోడు. మిస్ కెంటన్ తోనూ అదే వైఖరి అవలంబిస్తాడు. ఆమె ఎన్నో సార్లు స్టీవెన్స్ ప్రవర్తనకు గాయపడుతుంది. ఇవన్నీ స్టీవెన్స్ మనసు గ్రహించినా అవేమీ పట్టనట్లు ఉంటాడు అతను.
ఆ ఇంట్లో జర్మనీ సానుభూతిపరులందరూ కలుస్తూ ఉంటారు. రెండవ ప్రపంచ యుద్దానికి దారి తీసే నిర్ణయాలు ఆ ఇంట జరిగే చర్చల మధ్య దేశ రాజకీయ ఉద్దండులు తీసుకుంటుంటారు. ఇన్ని తన కళ్ళ ముందే జరుగుతున్నా స్టీవెన్స్ వాటిని మనసుకు ఎక్కుంచుకోడు. యజమాని సేవ ఒక్కటే తన ధర్మంగా నమ్మి పని చేసుకుంటూ వెళతాడు. అలాంటి విషయాలను పట్టించుకోవడం తన వృత్తి ధర్మానికి విరుద్ధం అన్నది అతని వాదన.
స్టీవెన్స్ తండ్రి కూడా బట్లర్ గానే జీవించాడు. అతని క్రమశిక్షణ స్టీవెన్స్కు ఆదర్శం. అయితే వయసు పై బడి మరో చోట పని చేయలేక విలియం స్టీవెన్స్ డార్లింగ్టన్ హాల్కే చేరతాడు. వయసు సహకరించక పోవడంతో ఇక్కడ చేసే కొన్ని పనుల్లో అతను వెనుకబడిపోతాడు. ఇది గమనించి స్టీవెన్స్ తండ్రి బాధపడతాడని తెలిసి కూడా ఆయనని ముఖ్యమైన విధుల నుండి తప్పిస్తాడు. తన అవసరం అక్కడ లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ పెద్దాయన మానసికంగా కృంగిపోతాడు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా తండ్రి గదిలోకి వెళ్ళి ఓ పది నిముషాలు గడిపే సమయం ఉండదు స్టీవెన్స్కి. ఆ పెద్దాయన అదే ఇంట్లో మరణిస్తాడు. తండ్రి మరణాన్ని దృవీకరించడానికి వచ్చిన డాక్టర్తో ముందు ఆ ఇంట్లో కాళ్ళ వాపుతో బాధపడుతున్న అతిథిని చూడమని పురమాయిస్తాడు స్టీవెన్స్. తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా క్రింద జరిగే విందులో ఏ తేడా రానివ్వడు. స్టీవెన్స్ ఆ విందులో తని పని తాను చేసుకుంటూ ఉంటాడు. అతని కళ్లలో బాధ ఇతరులకు కనిపించినా దాన్ని బైటపడనివ్వక ఆ రోజు ఆ ఇంట్లో అతిథులందరినీ తృప్తి పరుస్తాడు స్టీవెన్స్. పైగా ఇది తన వృత్తి నిబద్దతకు పరీక్షగా తీసుకుని తాను ఆ పరీక్షలో గెలిచానని గర్వపడతాడు. స్టీవెన్స్ తండ్రి శవం పక్కన మిస్. కెంటన్ మిగతా పనివారే ఆ రోజంతా వంతులు వేసుకుని కూర్చుంటారు.
లార్డ్ డార్లింగ్టన్ మిత్రుడు కొడుకు మిస్టర్ కార్డినల్. ఇతను డార్లింగ్టన్ రాజకీయ నమ్మకాలను వ్యతిరేకిస్తాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొని అక్కడ మరణిస్తాడు. ఇలాంటి ఎందరో యువకుల హత్యకు లార్డ్ డార్లింగ్టన్ నమ్మిన సిద్దాంతాలు కారణం అని స్టీవెన్స్కు అర్థం అయినా అవి తనలాంటి బట్లర్ పట్టించుకోవలసిన విషయాలు కావని, తన యజమానికి అన్ని వేళలా సేవ చేయడమే తన ధర్మమని కళ్ళ ముందు కనిపించే నిజాలని పరిస్థితులను మెదడుకు చేరనియ్యకుండా మర మనిషిగా కాలం గడుపుతాడు. అయితే ఈ పరిణామాలన్నిటినీ అనుభవించి ఆ దుఖంతో మరణించిన యజమాని ఆఖరు రోజులు అతనికి అప్పుడప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి.
ఇప్పుడు గతాన్ని తలచుకుంటూ ఆ ఇంటి బైట ప్రపంచాన్ని చూస్తున్న స్టీవెన్స్కు లార్డ్ డార్లింగ్టన్ రాజకీయంగా చేసిన తప్పులు అర్థం అవుతూ ఉంటాయి. ఇవన్ని తనకు ముందే తెలిసినా అతని మనసు వాటిని ఒప్పుకోదు. ఇప్పుడు బైటి ప్రపంచంలోని మనుషులని గమనిస్తూ లార్డ్ డార్లింగ్టన్ పట్ల వారిలోని ఉదాసీనతను అనుభవిస్తూ అతని మనసు నిజాలని ఒప్పుకుంటూ ఉంటుంది. ఆయన మరణించీ కొంత కాలం అయింది. ఇంగ్లండ్ లోనూ పరిస్థితిలు మారాయి. పాత జీవన విధానం మారుతూ ఉంది. 1930లో మిస్ కెంటన్తో తాను జీవించిన రోజులు అతనికి గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పాఠకులకు మిస్ కెంటన్ పట్ల స్టీవెన్స్లో ఉంది ప్రేమ అని అర్థం అవుతుంది. కాని ఈ విషయం స్టీవెన్స్ కు మాత్రం ఇంకా అర్థం కాదు.
ఈ నవలలో ప్రధానంగా గమనించవలసింది రచయిత శైలి. ప్రధాన పాత్రతోనే కథ చెప్పిస్తూ అతను ఒప్పుకోని నిజాలని మనకు అర్థం అయేలా ప్రస్తావిస్తూ, స్టీవెన్స్ పాత్ర అంతే మొండిగానూ కఠినంగానూ ఉండడం గమనిస్తే రచయిత శైలి మనల్ని అబ్భురపరుస్తుంది. పైగా స్టీవెన్స్ చెప్పె కథలో స్టీవెన్స్ మనన్సు, అతను మొండిగా అంగీకరించలేని విషయాలు పాఠకులకు చాలా సులువుగా అర్థం అయిపోతూ ఉంటే, స్టీవెన్స్ పట్ల సానుభూతి కలుగుతుంది.
కొన్ని ఊర్లు దాటుతూ చివరకు స్టీవెన్స్ మిస్. కెంటన్ ఉన్న ఊరికి వెళతాడు. అతను ఉన్న హోటల్కే ఆమె వచ్చి కలుస్తుంది. తన జీవితంలో సంతోషం లేని మాట నిజమే అని, కాని తాను ఇప్పుడు తన భర్తను ప్రేమించడం నేర్చుకున్నానని తన కూతురు తల్లి కాబోతుంది అని తాము ఇప్పుడు ఆ సంతోషంలో ఉన్నామని ఆమె చెబుతుంది. ఇది విన్న స్టీవెన్స్ ఆమె తిరిగి డార్లింగ్టన్ హాల్కు రాదని అర్థం చేసుకుంటాడు. కాని ఇదంతా తాను బట్లర్గా విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నాననే నమ్ముతాడు తప్ప తన మనసులో ఆమె పట్ల ఉన్న ప్రేమ, ఆమె తిరిగి డార్లింటన్ హాల్కు రావాలన్న కోరిక వెనుక ఆమె తిరిగి తన జీవితంలోకి రావాలనే కోరిక ఉందని ఒప్పుకోవడం అతనికి అప్పుడు కూడా సాధ్యం కాదు.
స్టీవెన్స్ని మిస్. కెంటన్ బాగా అర్థం చేసుకుంటుంది. అతనికి తనపై మనసులో ప్రేమ ఉందని ఆమెకు తెలుసు అందుకే వివాహం చేసుకోబోయే ముందు అతనికి తన పరిస్థితి తెలియజేస్తుంది కూడా. డార్లింగ్టన్ హాల్లో ఉన్నప్పుడు మిస్. కెంటన్తో పూర్వ పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు తారసపడతాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఆమె ఈ విషయం చూచాయగా స్టీవెన్స్కి చెబుతుంది. కాని స్టీవెన్స్ దానికి స్పందించడు. ఆ డార్లింగ్టన్ హాల్లో హౌస్ కీపర్గా చివరి దాకా జీవించాలని ఆమెకు ఉండదు. తనకో జీవితం ఉండాలన్నది ఆమె కోరిక. స్టీవెన్స్ ని ఆమె ప్రేమిస్తుంది. ఎన్నో విధాలుగా ఆ విషయం అతనికి తెలియపరుస్తుంది. కాని స్టీవెన్స్ తన వృత్తి ధర్మం అంటూ కేవలం బట్లర్ గానే ప్రవర్తిస్తాడు తప్ప తానో మనిషిని అన్న సంగతి మర్చిపోతాడు. చివరిదాకా పెదవి బిగపెట్టుకుని, మనసు మూసుకుని జీవిస్తాడు స్టీవెన్స్. అతనింక ఎప్పటికీ వివాహం గురించి ఆలోచించడని అర్థం అయి మనసు చంపుకుని తనను ప్రేమిస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుంటుంది మిస్ కెంటన్. కాని అతనితో ఆనందంగా ఉండలేకపోతుంది. స్టీవెన్స్కి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. అందులో విషాదం అతనికి అర్థం అవుతూనే ఉన్నా చివర్లో కూడా ఉద్యోగం కోసం ఆమెతో అవసరం ఉన్నట్లు అతను ప్రవర్తిస్తాడు తప్ప ఆమెపై తనకున్న ప్రేమను ప్రకటించడు. తానూ ఒప్పుకోడు. అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మిస్. కెంటన్ ఇరవై సంవత్సరాల తరువాత తనను చూడడానికి ఉద్యోగం నెపంతో వచ్చిన మిత్రుడితో తాను తన భర్తతో కలిసి ఉండబోతున్నానని అతన్ని ప్రేమించడం నేర్చుకున్నానని చెప్పినప్పుడు స్టీవెన్స్కు తన ఒంటరితనం, తన గత జీవితం లోని నిష్ప్రయోజత్వం అర్థం అవుతాయి.
తన ప్రయాణంలో, స్టీవెన్స్ ఇతర వ్యక్తులను కలుస్తాడు. వారంతా శ్రామికులు. వారి ఆలోచనలు స్టీవెన్స్ ఆదర్శాలను, విలువలను సవాలు చేస్తాయి. మారుతున్న యుద్ధానంతర సామాజిక పరిస్థితిలు అతనికి అప్పుడు అర్థం అవుతాయి. కారు ఆగిపోతే ఓ చిన్న ఊరిలో స్టీవెన్స్ రాత్రి గడపవలసి వస్తుంది. అక్కడ వామపక్ష భావాలున్న హ్యారీ స్మిత్, గౌరవం అంటే ప్రజాస్వామికంగా జీవించడం అని, ఒకరి నమ్మకాల కోసం మరొకరు నిలబడటం అని వాదిస్తాడు. వృత్తినిపుణత కోసం ఒకరి స్వంత భావాలను అణచివేయడం తప్పని అతను చెప్తాడు. ఇది స్టీవెన్స్లో కొత్త ఆలోచనలకు బీజం వేస్తుంది.
స్టీవెన్స్ లార్డ్ డార్లింగ్టన్ కు తాను దశాబ్దాలుగా చేసిన నిస్వార్థ సేవ లోనూ, మిస్ కెంటేన్ ప్రేమను గుర్తించక తాను కోల్పోయిన అవకాశాల గురించి ఆలోచిస్తాడు. నిజానికి అతను ఓ గొప్ప బట్లర్. గొప్ప నిబద్ధతతో వృత్తికి న్యాయం చేసిన వ్యక్తి. కాని చివర్లో అతనో ఒంటరివాడు. గొప్పతనం ముసుగులో జీవితాన్ని కోల్పోయిన సామాన్య మానవుడిగా మాత్రమే మిగిలిపోయాడు. నవల ఆఖరున మిస్. కెంటన్ను వదిలి వెళ్లిపోతూ ఒంటరిగా ఓ బెంచిపై కూర్చున్న స్టీవెన్స్కి ఓ వృద్ధుడు పరిచయం అవుతాడు. అతనితో సంభాషిస్తూ తన గతం పట్ల తనలో జనియించి అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు స్టీవెన్స్. దానికాయన జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే అందరికీ అలాంటి భావమే కలుగుతుందని, గడిచిపోయిన కాలాన్ని గురించి కాక ప్రస్తుతం జీవితంలోని మలి సంధ్య వైపు చూడమని. రోజంతంటిలో సాయంత్రం అందమైనదని. తాము జీవితంలో అలాంటి అందమైన సాయంత్రంలోనే నిలిచి ఉన్నామని, దాన్ని ఆస్వాదించమని చెబుతాడు. స్టీవెన్స్కు జీవితం అర్థం అవుతుంది. ఇక్కడ ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ అనే ఈ శీర్షిక పాఠకులకు అర్థం అవుతుంది. మిగిలి ఉన్న రోజు అదే మన చేతిలో ఉన్నది. దాన్ని జీవితం నేర్పిన పాఠాల ఆధారంగా మనం మనకు కావల్సిన విధంగా మలచుకుని జీవించగలగాలి తప్ప కోల్పోయిన గతం జ్ఞాపకాలలో మిగిలిపోకూడదు. మనుషులందరూ ఎదో ఓ రీతిలో చాలా వాటిని కోల్పోతూ జీవిస్తున్న వారే. మన మార్గం అర్థరహితం అని తెలిసాక మిగిలి ఉన్న కాలాన్ని ఆ అనుభవంతో సరిచేసుకోవడం ఒక్కటే మనం చేయగలిగింది. ఈ సత్యం తెలుసుకున్నాక స్టీవెన్స్ తన తిరుగు ప్రయాణం మొదలెడతాడు. అదే డార్లింగ్టన్ హాల్కు అదే వృత్తిలోకి. కాని ఇప్పుడు కాలం నేర్పిన అనుభవంతో జీవించడానికి సిద్ధపడుతూ.
1989లో ఈ నవలకు బుకర్ బహుమతి లభించింది. తమ వ్యక్తిగత భావోద్వేగాలను తొక్కిపెట్టే మనుషులు జీవితంలో కోల్పోయే అనుభూతులను ఎత్తి చూపుతుంది ఈ నవల. బ్రిటీష్ వ్యవస్థలో జీవన విధానంలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. బ్రిటీష్ జీవన శైలిపై సంధించిన బాణం ఈ రచన అని కొందరు విశ్లేషకులు ఈ పుస్తకాన్ని ప్రస్తావిస్తారు. ఆంథోనీ హాప్కిన్స్, ఎమ్మా థాంప్సన్ లతో ఈ కథను అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. ఎనిమిది ఆస్కార్ నామినేషన్లను పొందిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగానూ, స్టీవెన్స్ పాత్రలో నటించిన ఆంథోనీ హాప్కిన్స్ ఉత్తమ నటుడిగానూ, మిస్. కెంటన్ పాత్రను పోషించిన ఎమ్మా థామ్సన్ ఉత్తమ నటిగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే కు కూడా ఆస్కార్లు అవార్డులు గెలుచుకుంది ఈ కథ.
***
Author: Kazuo Ishiguro
Publisher: Faber & Faber
Pages: 272
Price: ₹599
https://www.amazon.in/Remains-Day-FF-Classics/dp/0571200737