[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
761.
గోచరింప సాధ్యమగుచు నున్నవి దృశ్యంబులు కట్టెదుట;
లోచనంబు లవి వీపున నుండెనేని సాధ్యంబయ్యెడిదే!
ప్రాచీనంబున్ మరచి స్వతంత్రించి నిర్వహింపుము; సా
రించుము నీ దృష్టి ముందునకు – మంకుతిమ్మ!
762.
పుడమిపై నడయాడిననేమి, దృష్టి మేరునగంబు జేరనుండవలె,
చెడక; దృష్టి చెదరెనా, నడక యది దారితీయు నరకంబునకు,
కడు దూరంబైన నేమి? కాళ్లు తొట్రిలి కుంటువడిన నేమి?
వడిగ జేరుదువు నీ యూరువాని నాత్మ దలచి – మంకుతిమ్మ!
763.
మేరు నగంబునకు గలవు నూరారు శిఖరంబులు;
దారులును నుండనోపు నూరారు; మజిలీలును నూరారు;
చేరుము నీవును తోటి యాత్రికులతోడి స్నేహమరసి
మేరువే నీకిచ్చు బలము – మంకుతిమ్మ!
764.
ధన్యుడా మాలవాడ నందుడు; గాంచెనొక నాడాతడు కల,
స్వర్ణ సభ యందున శివుని తాండవ నృత్యంపు కల
అన్యచింతలన్ పోద్రోలి, ఆ నృత్యంబుపై నిలిచెనా కల
చిన్మయంబు జేరె యాతని యాత్మ – మంకుతిమ్మ!
765.
తనకు రుచించినదే రామునకు రుచియని తలచె,
తను తృప్తి చెందె తన రాముడు సంతృప్తి జెందగ,
తనదగు దైవాత్మ భావంబున పరవశించె
ధన్యురాలు శబరి – మంకుతిమ్మ!
766.
ఘనమది రామసేవయె యని యెంచి యా ఘన తత్త్వంబునకై
మనంబున దివారాత్రంబుల నెంచి యెంచి, వేరొక చింత లేక
తన జీవితంబును ముడుపుగ బెట్టి కృతకృత్యడాయె; ఆ
హనుమంతు నుపదేశమిది – మంకుతిమ్మ!
767.
క్షణ క్షణమునకు, దినదినంబునకు, శునకమది ఎటులో
తన జీవనంబు సాగించు, ఆనాడు లభించిన దానితోటి;
మనుజుడు ప్రాప్తంబైన లేశంబుతోడ తనివి జెందవలె;
శునకోపదేశమిది – మంకుతిమ్మ!
768.
గతి ఏది నాకని యంగలార్చు వారె యందరున్
హితమేది జగమునకని చింతించు వారెవరు? హిత
మతి తోడుత విశ్వంపు హితమరసి, స్వార్థంబున్ మరచు
పథమది మోక్షమునకు – మంకుతిమ్మ!
769.
విందు భోజన మొక రోజు, ఉపవాసమింకొక రోజు
ఎందులేని పనిభారమొకరోజు, పూర్తి విశ్రాంతి యొకరోజు
పొందుగ రెండునున్ నుండిననే సుఖకరంబగు జీవనము
అందమగునే ఒంటి కాల్నడక – మంకుతిమ్మ!
770.
నేత్రములవి రెండైనను గాంచెడి దృశ్యమొక్కటె;
కరములు రెండైనను నెరవేర్చు కార్యమొకటే;
అరయ ద్వైతంబునం దద్వైతంబు; అద్వైతంబున ద్వైతంబు
బెరసిన పరమాత్ముని లీల ఇది – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084