[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
711.
ధర కోసల, పరబ్రహ్మయే రఘువరుండు,
భరతుని వోలె అనువర్తనా పరులమే మనము;
దొరకొనరించు సేవయే మన సంసారపు నిర్వహణము;
హర్షమొదవ సాగింపుము సంసారము – మంకుతిమ్మ!
712.
నాసికా యుచ్ఛ్వాస నిశ్వాసంబులవి సహజముగ జరుగునట్లు
వాసిగ నీ మంగళ కార్యము మవగతముగాగ,
ఆశించక, నిస్వార్థంబుగ సంకల్పించిన పుణ్యకార్యములన్నియున్
వసివాడక సహజంబుగ జరిగిపోనిమ్ము – మంకుతిమ్మ!
713.
చేయదగిన కార్యంబుల చక్కగ జేయుము జుగుప్సకు లోనుగాక;
చేయుము లోకహిత దృష్టి మనమున నింపి, లోకధర్మమును పాలించి,
చేయుము ప్రతిఫల మాపేక్షించక, గతమున్ గూర్చి చింతించక
ధ్యేయంబు విడనాడక – మంకుతిమ్మ!
714.
పరిమితంబైన ఆశయు, మైమరపించు సుఖంబులందు
విరక్తియు, లోకవ్యవహరంబులయందు మితానురక్తత, సత్యాసత్య
పరీక్షణానుమతి తత్త్వంబరయ నీ నాలుగు
పరమ శ్రేష్ఠంబులు – మంకుతిమ్మ!
715.
తెగడక, అపరాధిన్ క్షమించెడి గుణంబును;
తెగువన్ విధి నెదురించు ధీర గుణంబును; గెలుపున
పొంగకుండు గుణంబు; ఓటమిన్ క్రుంగకుండుటయు నను నీ
నాల్గు తపంబులరయ తక్కినవేల – మంకుతిమ్మ!
716.
మృతుడి సంసారపు గోల శవవాహకులకేల? వాడి
సతి కన్నీరు మున్నీరై ఏడ్చుగాక; అప్పిచ్చిన వాడు నోటికి
చేతికి పని కల్పించుకొనుగాక; స్థిరచిత్తంబున చితిగట్టి
మోతురు వల్లకాటికి; చిత్తంబు స్థిరంబుగ నుంచు – మంకుతిమ్మ!
717.
అన్నా రారా! తమ్ముడా రారా! యని గోడుగోడున ఏడ్వనేల?
ఎన్నగ నీ శవంబును నీవే తీసుకుపోవలె రుద్రభూమికి;
అన్నా! నీ ఒడలే చితి; నీ జగడంబులే సమిధ లరయ,
మన్నే తర్పణము నీకు – మంకుతిమ్మ!
718.
తన శిలువను తానే మోసెగద ప్రభువు ఏసు! తెలియవే,
అన్నా! నీ కర్మంపు భారమును నీవే మోయవలె; తప్పదు
ఖిన్నుడవు గాక, పెదవి బిగించి, మోయుము శవభారంబును
వెన్నున మోసి నడువుము – మంకుతిమ్మ!
719.
తలపాగలోని మురికి, నీ పంచె ముడుతలలోని చిరుగుల
ఇలలోని యందరికి తెలియజేతువే! రజకునకు గాక;
పలు విధంబులగు నీ ఇక్కట్లు, చింతల నీయందే ఇముడ్చుకొనక
పలువురకేల వాటిని విస్తరింప – మంకుతిమ్మ!
720.
నిత్యనూతన మీ జీవనము; గతం గతః; అహితమది;
నిత్యము నూతన రసముల విరజిమ్ముచును, మాటల
చేతల, నడతల, చూపుల నూతనత్వము బెంచిన
అత్యంత శ్రేష్ఠమై బరగు నీ జీవనము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084