[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
691.
యథేచ్ఛగా విహరించు విహంగమునకు గుర్తు చేయు దాని గూడు
యథేచ్ఛగా తిరుగనీయక పశువును కట్టియుంచు పలుపుతాడు
బద్ధుడై యుండవలె నరుడొక తత్త్వమున కెల్లప్పుడున్
కాదేని తెగిన గాలిపటమే నరుని స్థితియు – మంకుతిమ్మ!
692.
పుస్తక పఠనంబున, వాదంబున, కుశలత్వంబున యలవడదు పర
తత్త్వము; కావలె దానికొక యంతః చక్షువు చిరకాలపు మమతా
తత్వపు పొర ఛిద్రమయినపుడు గాని కన్నులవి తెరవబడవు; పరతత్త్వ
సత్యమపుడు గోచరమగు – మంకుతిమ్మ!
693.
ఇంద్రియాతీత విషయములు పట్టువడునే ఇంద్రియముల చేత!
ఇంద్రధనుసును చేదోటి తోటి దింప సాధ్యమే దలప!
సందృశ్యమాన యాత్మ తోటి యాత్మ పెనవేయవలె గాని, సతత
ఇంద్రియముల నిగ్రహించి, అలసత్వము వీడుము – మంకుతిమ్మ!
694.
బంధనములనెల్ల త్రెంచుకొని దాటి వరద నీరమది
సంద్రము జేరి సంభ్రమించు; జీవనమును యంతియే
ఇంద్రియ బంధనముల నుంచి ముక్తుడైన తరి
సందర్శనమగు ఈశ్వరానుభూతి – మంకుతిమ్మ!
695.
ద్వంద్వమయంబైన ఈ లోకంబును, త్రినేత్రుండు, ని
ర్ద్వంద్వంబుగ, తన అక్షి ద్వయంబున గాపాడు;
ఇంద్రియాతీత దర్శనమునకు గావెలె వేరొక యక్షి, యా
సంధానమును నేర్వుము – మంకుతిమ్మ!
696.
సమరమున పోరు యోధుడును, సంద్రమును ఈదు ఈతగాడును
తమ తమ గురి ముట్ట నెంచుదురె గాని వేరొండు దలంతురే?
తమను తాము మరచి సాగుదురు ఆవేశంబున, ఆ
తమకమే మోక్షసాధనము – మంకుతిమ్మ!
697.
ఉత్తమ మైనదని తోచినంత మాత్రమున నేమి ప్రయోజనంబు!
ఉత్తమ ప్రవృత్తిగ యయ్యది భావంబున తిరంబున నుండకున్న;
ఎత్తరి నైన మరల మరల నద్దాని యనుష్టించవలె, భంగంబయినన్
యత్నంబు జేయవలె మరల మరల – మంకుతిమ్మ!
698.
తడబడక, తొట్రిలక, పడుచు గాయంబు జేసికొనక
నడక నేర్చుకొను శిశువుంగలదే? నీతి మార్గమున
నడచు నపుడును తొట్రిలి, క్రిందబడి, మైదడవికొనుచు
పడు పాట్లు పడువారె నందరును – మంకుతిమ్మ!
699.
ఎన్ని మార్లు తపమొనరించి, భంగపాట్లు పడియెనో!
బన్నము లవెన్ని వడసి బ్రహ్మ ఋషి యాయెనో కౌశికుండు
ఎన్ని క్లేశములు, సంకటము లెన్ని మరి మరి యనుభవించినను
యత్నము వీడక నుత్తమగతి నొందవలయు – మంకుతిమ్మ!
700.
పూర్వ జన్మపు వాసనల తోడ మన వివేచన పోటి పడగ
పూర్వజన్మ కర్మంబులవి మన వివేచనాశక్తికి మీరియుండు,
సర్వ కర్మ ఫలంబు లధిగమించగ, ధీశక్తి చేత,
ఈశ్వరానుగ్రహంబు చేత మీర వీలగు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084