[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
651.
మౌనంబున, దొరకిన యంబలి ద్రావి తనివి జెందు
మాననీయుడు; శునకపు ఎంగిలి ఓగిరంబున కాశపడునే!
జ్ఞాని, తారతమ్య వివేకముతో చరించు, కలత జెందడు
మానుము నీవును కలతలన్ – మంకుతిమ్మ!
652.
బోనంపు ఆతురత కంటె, కనకంపు ఆతురత తీక్షణము
కనకంపు ఆతురత కంటె కనకాంగిని పొందెడి ఆతురత మిన్న
కనకాంగి పొందు కంటె, పేరు ప్రతిష్ఠల దాహంబె తీక్షణము
ఎన్నగ నీ దాహము ఆత్మను కలుషితంబు జేయు – మంకుతిమ్మ!
653.
ఇంటనో, మఠంబునందునో, సభలోనో, సంతయందునో
అటుగాక యడవి యందునో, శ్మశానమందునో, ఇంకెచటనో
పటుతరంబుగ పేరు ప్రతిష్ఠల కాశపడు, ఆత్మకు
చేటయినను లెక్కింపడు నరుడు – మంకుతిమ్మ!
654.
పేరు రావలె, పేరు రావలెనని గసపోసుకొనుటేలనయ్య!
ఎరుగవే నీవు, నీ కాలము చెల్లిన తరి కసవులో కసువై పోదువు; నీ
పేరు నెవరుచ్చరించెదరు? తాపత్రయమేల పేరు కొఱకు
మరచిపోవగ వేడుమీ ధరను – మంకుతిమ్మ!
655.
బియ్యపు గింజను అన్నంబుగ వండనేర్చిన ఆద్యుడెవరు?
వాక్యంబు వ్రాయ యక్షరంబుల కనిపెట్టిన ఆద్యుడెవడు
విద్యలెన్నియో నేర్పిన వారి లెక్కలు లేవు నియ్యిలను; నీ
కార్యంబల్పము, దక్కునే యశస్సు – మంకుతిమ్మ!
656.
పేరొందుట యన్న యదేమి? ఇతరులు నిన్నుబ్బించు మాటలే గాదె!
వేరొండు అధిష్టాన పీఠంబు నీకేల నీ బ్రహ్మపురిని,
అరయన్ నీ వింకను శిశువవు, పశువవు, లేత యాకువి; వేరు
దలపక కశ్మలంబుల నూడ్చుము చీపురువై – మంకుతిమ్మ!
657.
సిరిని వడయుటకున్, స్త్రీని వడయుటకున్ ఎన్నెన్నో
పరమ నీచపు దారుల నన్వేషించి సాగుదురు జనులు,
బిరుదులన్ వడయుటకును, పేర్గాంచుటకున్, వలసినన్ని
దురిత గుణంబులవెన్నో – మంకుతిమ్మ!
658.
పడి లేచుచు, జగడమాడి ఓటమి పాలైనను మరి మరి
పడి ఓడినన్, కలహంబుల రేపి, తానె ప్రసిద్ధుడనియు
కడు సంరంభంబున, ఉద్ధరించెద నేనని ప్రగల్భముల బల్కు
వాడు; ఎంత పట్టున యుద్ధరించునో – మంకుతిమ్మ!
659.
శృంగభంగము తథ్యము దురభిమాని కొకదినంబున, దేవ
సంఘంబూరక యుండునే మట్టి గరిపింపక గర్వోన్నతుల
భంగంబు జేయు సందర్భంబును జోడించు విధిరాయడు
భంగపాటు తప్పదు – మంకుతిమ్మ!
660.
గర్వభంగంబు గావింపడే గరుడ వాహనుడు గరుడునకు
పార్థుని యహంకార మడగింపడే పార్థసారథి నాడు
దర్పంబు జూపు వారి గర్వంబు నణచివేయు విధిరాయడు;
శిరసు వంచి నమ్రత జూపుటే యుత్తమము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084