[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
631.
మైగప్ప జలతారు చేలాంచలమో, కుచేలమో;
భోగంపు టన్నమో, తిరిపెంపు యంబలమో, ధనిక పేద
వర్గంబులు కొకటియే మానసంరక్షణకు, కుక్షింభరత్వమునకు
పగనసూయ లేలనో ఈ విషయంబున – మంకుతిమ్మ!
632.
బధిరత్వంబు దప్పునే కర్ణకుండలములు ధరించినంత!
వ్యాధిగ్రస్తమై శుష్కంచకుండునే చర్మము మృష్టాన్నంబు తినినంత
పేద ధనిక వర్గ విచక్షణ శూన్యమీ భువికి, రెండునున్ సమములే
ఆ ధర్మనిర్ణయము సమవర్తిది – మంకుతిమ్మ!
633.
నుదుటి వ్రాతల చెఱపన్ సాధ్యమే యెవ్వరికేని? పరి
శుద్ధులుగ జేయనసాధ్యము; పూర్వంపు కర్మశేషంబులు
ఛిద్రంబు గావలె, కర్మశేషంపు పొరలన్నియున్ తొలగిపోవలె,
పెద్దలు జెప్పిన మాటలివి – మంకుతిమ్మ!
634.
అరివీరుల తుడిచివేయవచ్చు రణంబున, ప్రతిపక్షముల
నరికట్ట వీలగు రాజకీయ తంత్రబున క్షుద్ర
కార్పణ్య దన్యాయపు వ్రాతలటులే మిగిలియుండు, వాటి
చెఱుప వీలుగాదెవరికైన – మంకుతిమ్మ!
635.
గుద్దలి చేతబట్టి కొండగుట్టల కనుమల చదును జేయ
సాధ్యమే! దొంగచాటుగ వచ్చు ముప్పును నివారించునే ఓషది!
యుద్ధ తాపముపశమింప వీలగునే శాంతి వచనముల చేత
సిద్ధముగ నుండుము సహనము వహించి – మంకుతిమ్మ!
636.
వేనవేల యుక్తుల సాహసంబుల నీ వొనర్చిన కార్యంబుల
కెనలేని ఫలితంబులు నీ పౌరుషంబునకు దక్కినన్,
కానరాని ఇడుములవి పొంచి నిన్ ఇరుకున బెట్టు,
పునః మిగిలి పోవునవి; తాల్మి వలయు – మంకుతిమ్మ!
637.
కలిమి లేముల యంతరమది స్వల్పము; ఒప్పుతప్పులకున్
తెలివికిన్, తెలివి లేమికిన్ యంతరమది స్వల్పమే,
ఏలనీ యంతరముల చర్చ? మరణమన్నింటిని
కలిపివేయు, చింతించనేల – మంకుతిమ్మ!
638.
నమ్మక ముంచుము దేవుడిపై, నమ్మి చెడినవారు లేరందురు,
నమ్మరేలనో మరి దుఃఃఖభాజనులు; కోర్కెలు లేనివారికేల
నమ్మకంపు బెడద, దాక్షిణ్యమేల, విరక్తుడవై
నెమ్మది నుండుము – మంకుతిమ్మ!
639.
అనుభమింపుము నీదైనదాని మోహవశుండు గాక
అనుభవించు తరి జాగరూకుడవై గర్వంబు వీడుము
కానగరానివి, కనుల గన్పడు నవెన్నియో గలవు, అనుభవించము
అన్నింటినిన్ మోహంబు విడనాడి – మంకుతిమ్మ!
640.
మరువ వలదు, ఈ బ్రహ్మపురిని నీవొక బిచ్చగాడివని
సిరి ఎంత కల్గిననేమి, పరిజనము లెందరున్న నేమి; తోడె
వ్వరున్ రారు, దాంభికంబు విడనాడి, నీకు నీవే సేవకుడివై
చరించుము పరదేశి వోలె – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084