[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
591.
యుద్ధరంగమే ఈ జీవనంబు దలప; అయిన నిది వినోదంపు పోరు;
మొదలు తుదిలేని నిరంతర చిత్ర లీల; గెలుపు ఓటమి లేని పోరు,
ఆద్యంతము లెరుగని కడవరకు సాగెడు పోరు
నిది సరస సమరమే తెలియ – మంకుతిమ్మ!
592.
విధి బలం బొక పక్షంబున నీ సమర మందున,
బుద్ధి వివేకపు ప్రీతి యనురాగంబు లింకొక పక్షంబున,
అధిక ప్రీతి యనురాగముల పంచు పురుషునకే గెలుపు,
అదియ యతని విజయము – మంకుతిమ్మ!
593.
ఓటమి పాలై తి ననియు, చచ్చితి నని వాపోకు,
ఒట్టిపోయె నా సత్వమని పరితపించ బోకు,
గట్టిగ ఎంచి చూడు మృత్యువది కడలి కెరటాల వలె పడి లేచు,
గట్టి నమ్మకముంచు రేపటి యందు – మంకుతిమ్మ!
594.
బిడువే లేని ఈ జీవిత విపణి సరుకులకు
కడ ఏది?ముగియ వవి లాభ నష్టముల పద్దులు,.
కడయగునే ఆనాటి లెక్కలు ఆనాడే!
వీడు లాభంపు ఆతురత – మంకుతిమ్మ!
595.
ఎన్నగ ప్రాజ్ఞులెవ్వరున్ నీ విజయంబుల లెక్కగొనరు,
ఎన్ని పోరాటంబులు సల్పితి వెన్ని భారంబుల మోసితివని
ప్రశ్నింతురు; గణన నీ పౌరుషంబునకే, నీ విజయంబులకు గాదు:
దిన దినపు సాము గరిడి ఇది – మంకుతిమ్మ!
596.
ఎదుటి జెట్టిని సాముగరిడిని గెలువలేకపోయిన నేమి?
నీ దేహపటుత్వంబు తరుగునే! హెచ్చగుగాని; వర
మది తక్షణంబు వడయకున్న వ్యర్థనుగునే పూజ! పరి
శుద్ధమనంబే యొక వరము – మంకుతిమ్మ!
597.
విత్తనము, వర్షము వోలె; యత్నము ,దైవ యోగంబును మనకు;
యుక్తంబుగ రెండు నున్ గలసిన సమృద్ధియగు పంట,
యత్నలోపంబైనను, దైవమనుకూలింపక పోయినన్
వ్యర్థమగు మన కృషి – మంకుతిమ్మ!
598.
బ్రతుకొక కదనమని బెదరి , వీడి పలాయనము
చిత్తగించెడి వాడు, విధినోటి కబళంబు గాడె,
ధృతి చెడక, ఎడద నుక్కుగ జేసి, యతనము వీడకున్న
అతి సులభుడగు విధి – మంకుతిమ్మ!
599.
చక్రంబును తిప్పనివ్వు విధిరాయని తన ఇచ్చ మేరకున్,
వక్రమార్గంబున గ్రహ నక్షత్రంబులు చలించి నిమ్ము,
వక్ర౦బుగ నీ కర్మయు, దైవమును పరిహసించినన్,
సక్రియ స్థిర చిత్తుడవై యుండుము – మంకుతిమ్మ!
600.
బ్రతుకు జటకా బండి, విధి దాని సాహేబు, నీ
వాతని యశ్వము, మన పయనమెచట కో తెలిరాదు,
యాతని ఇచ్చ, ఎచటకు గొనిపోవునో! మంటపమునకో, మసణ మునకో!
గతి తప్పి పడిన, యాతడే రక్ష మనకు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084