[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
531.
శాశ్వత వికసిత క్రమంబులు కొన్ని, ముకుళితంబులు కొన్ని, ఈ
విశ్వంబున నర్తించు చున్నవి పౌరుషోన్నతి కొఱకు
స్వస్వరూపంబులన్ ప్రతిబింబించు పరమాత్మ యాట, యాతని
హృష్యద్విలాసపు యాట – మంకుతిమ్మ!
532.
కట్టడపు క్రమమున్ తెలియగలదే ఇటుక
గట్టిగ నిల్వదేని కూలిపోవు గోడ
సృష్టి కోటిలో నీవొక ఇటుక, సొట్టగ నిల్చినన్
పెట్టు తిందువు నీవు – మంకుతిమ్మ!
533.
పురుషుడు స్వతంత్రుడో, దైవవిధి పరవశుడో?
బరగ రెండింటిని గలిగి, బాహువుల పగది నున్నాడో?
దిర్పుచు, మడచు బాహువులు శరీర మందున;
నరుడు మిత శక్తియుతుడు – మంకుతిమ్మ!
534.
వీచు గుణము సాజము గాలికి, సహింపదు అడ్డగించ
వీచు ధాటికి నెదురైన వాటిన్ పొరలాడించు అడ్డగింపకున్న,
ఎంచగ నరుని స్వాతంత్ర్యమునకున్ నుండవలె హితము మితము
హెచ్చుకారాదది – మంకుతిమ్మ!
535.
కట్టెదుట నున్న ఆనకట్టను ఢీకొట్టు వరద నీరు
కట్ట లేకున్న ఊరిని ముంచి వేయదే!
కట్టడి సేయవలయు నరుని పౌరుష నదిని
ఎట్టయిన; హానిని అడ్డగించ – మంకుతిమ్మ!
536.
కుసుమ మది యుండు పదిలంబుగ, దానిన్ వృక్షంబు బిగిబట్టగ,
కుసుమ వాసనల గొనిపోవు అనిలంబు నల్దిక్కులకున్; నరుని
కుశలతా సౌరభము లిట్లు యప్రయత్నంబునన్ పరిఢవిల్లవలె
యశస్సు వడయ – మంకుతిమ్మ!
537.
సూర్యచంద్రులకొక పథమును, భూ వరుణుల కొక గతియు
మరుదగ్నులకును మితి నిర్దేశించిన యా దక్షుడు
నరుడు తన దారిని తానే నిర్దేశించుకొనగ నేల
నూరుకొనెనొ తెలియరాదు – మంకుతిమ్మ!
538.
నా చెమట నీటనే మునిగి తేలుచు స్వతంత్రుడనై, నా
ఇచ్ఛ మేరకు నేనుండెదనని యొకడు; పుణ్యతీర్ధంబుల, నా
ఇచ్ఛ మేరకు మునిగి తేలెదనని మరి యొకడు; ఎవడి
ఇచ్ఛ వాడిది – మంకుతిమ్మ!
539.
జీవన తత్త్వము పట్టువడదు కేవల బుద్ధి తర్కమునకు;
ఎవరు పరిశోధింతురో బుద్ధి ఋజుత్వంబును? స్ఫురించు
నేవేళనో విద్యుల్లత వోలె తనకు తానే మనంబున,
అవ్వేళకు వేచియుండవలె – మంకుతిమ్మ!
540.
నరుని వివేక మది కేవలము వర్షపు నీరము కాదు;
చెరువు నీరమది ఊరు నీటి కలుషిత మిశ్రణమే,
ధరపు రసవాసనలా యాకసపు నిర్మల నీరంబుల
చెరుపు గాదె – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084