[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
491.
కడలి నీటిని మట్టికుండ యందున, దినకరుని
వేడిమి గవాక్షమందున నింపుకొని, ఐశ్వర్యవంతుడ నేనని
కడు సంబరపడు బడుగు మానిసి; అల్పసంతోషపు భక్తియె
కడు శక్తి నిచ్చు భక్తునకు – మంకుతిమ్మ!
492.
ఆచమన, అర్ఘ్య పూజానైవేద్యంబులు విహితంబులు;
ఎంచగానివి బహిరంతరైక్యంబుల నొకటిసేయు నియమంబులు,
అంతరంగ శక్తిని బహిరంగ శక్తితోడ మేళవింపజేయు తంత్రమిది,
ఇంతటి స్వభావంబులె సరిగాదె – మంకుతిమ్మ!
493.
బహుజనులు కైమోడ్చిన తీర్థంబుల, క్షేత్రంబుల
మహిమ లుండునే యను సంశయంబు వలదు; దేవదేవుని
విహిత స్థలమిదియెనని నిర్దేశించిన వారెవరు?
మహిమ యున్నచోటే యాతని స్థలము – మంకుతిమ్మ!
494.
హరిభజన సేయు వారిలో భయము నుండి పుట్టు భక్తి,
వరంబుల్ వేడు నెపంబున పుట్టు భక్తి యది ఎంతటిదో!
అరయ సంతోషానురాగంబుల నిజ భక్తి కల్గిన వారెందరో;
పరమాత్మ నాకర్షించు భక్తియె, భక్తి – మంకుతిమ్మ!
495.
అరుణోదయ కాంతి ప్రభల, గిరిశృంగోన్నతుల
ఆర్ణవంపు విస్తారంబుల తిలకించ కలుగు అద్భుతా
శ్చర్యంబుల కంటె, కలుగు మేలగు పరమాశ్చర్యంబు
పరమేష్ఠి రూపమును గనినంత – మంకుతిమ్మ!
496.
పరమేష్ఠి పురాతన సృష్టి యది వెరగు పుట్టించు మనలోన,
వెరగు పుట్టించి, మైమరపించి, మూకవిస్మితుల జేయు; అ
వ్వెరగు పరవశింప జేయు మన చిత్తంబుల; వరంబిది
పరమాత్మ నర్చింప – మంకుతిమ్మ!
497.
సుతను పెంచి, పెద్ద జేసి, ధన కనక వస్తు సమేతంబుగ
ఇతర గృహంబునకు ధారవోతువు, ప్రతిఫల మపేక్షింతువే,
ప్రతిఫల మది వేరేల, సుకృతమది, వేరొండు ప్రతిఫలమేల
హితకార్యమది, మనః పరివర్తనకు – మంకుతిమ్మ!
498.
ఘన సంగీత మది చెవుల విందుసేయ, కుక్షి నింపదు
పున్నమి చందురుని కాంతి కనులవిందు, గాదెల నింపదని,
వాణిజ్య సరుకుగ చూడబోకు ప్రకృతి సోయగముల
పొంగారు ఆత్మానందమే లాభము – మంకుతిమ్మ!
499.
దేవళంబులన్ జరుగు భజన పూజ ప్రసాదంబులవి, మన
జీవనంబునకున్ యలంకారంబులు; కావవి వ్యర్థంబులు,
జీవనోద్ధారకము లవి, అల్ప లౌకిక మనోభావముల నుండి
ఆవలకున్ గొనుపోవునవి – మంకుతిమ్మ!
500.
భోగించుటకు, సాధారణ మానవుడా భగవంతుడు? ఆ
భోగ వస్తువులు – పూలు, ముడుపులు, నగలు యాతనికేల?
భాగ్యవంతుడతడు, యాతని కింపైనదేదో, నద్దాని సమర్పింప
భాగ్యమది మనకు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084