[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
481.
పుట్టుక ముందును చీకటి, గిట్టిన వెన్కను చీకటి, నడుమ
అట్టిట్టు కొట్టుకలాడు జీవనము; కొందరికి చీకటి శూన్యము,
గుట్టది మరికొందరికి, కానరాని చీకటి భూతమది
దిట్టతనాన జీవనంబు సాగింపుము – మంకుతిమ్మ!
482.
కుడి ఎడమల గుహలు, నడుమన్ కొండగుట్టలు కోనలు
ఎడనెడ నుండ, బెబ్బులి రానేరదని నమ్మి విహరింతువే! కడు
సంశయాత్మక జీవనమిది, జాణతనంబునన్
దృఢ నిశ్చయంబున్ సాగిపోవలె – మంకుతిమ్మ!
483.
గాలి తోడ పోరాడనేమి ఫలము? ఆయాసమె ఫలము;
మూల సత్త్వమెరిగి అభ్యసించిననే దొరకు ఫలము
మేలగు పురుష ప్రయత్నమునకు తోడగు దైవయత్నము
తాలిమి తోడ జీవనంబు సాగింపవలె – మంకుతిమ్మ!
484.
చీకటిన్, దేనినో గని బెదరిన శునకము, ఎచ్చటోనున్న
యొక సఖున కోసమై మోర ఎత్తి మొఱుగు లాగున,
ఒక సఖుని బాసటకై యంగలార్చెదము, ఆ యత్నమే
అకళంక భక్తి – మంకుతిమ్మ!
485.
విశ్వసింపడు తండ్రి, విశ్వసించె ప్రహ్లాదుడు
విశ్వసింపని వానికిని, విశ్వసించిన వానికిన్ దర్శనమిచ్చి, ఆ
విశ్వవ్యాప్తి స్తంభముననో, బింబంబుననో నిర్వురకు; అర్ధ
విశ్వాసమున నీవు శ్లేషమున బడిన మక్షికమవు – మంకుతిమ్మ!
486.
తన కంటెను, యఖిల భూతముల కంటెను
అనుభవంపు వెన్క, సృష్టి యనెడి నీడ వెన్క
సనాతన మదేదో దాగియున్నదని విశ్వసించు నరుడు; యాతని
మనమున దాగిన గొప్పతనము గాదె – మంకుతిమ్మ!
487.
నరులు వోలె సురలును కాలంబు చెల్లి కనుమరుగై పోయిరి
భరత ఖండంబున, ఐగుప్త, యనవ దేశంబులందును,
సురనామము లసంఖ్యాకము లవి; సత్యమిది
అరయ అలలనేకములు అబ్ధి యొక్కటే – మంకుతిమ్మ!
488.
జీవి, వేడనొల్లని యెడ, దైవంబును చింతించు వారెవ్వరు?
దైవంపు యునికి గుట్టుగా లేకున్న, జీవి వెదకు దేని కొరకు?
జీవాత్మ పరమాత్మ పరస్పరాన్వేషణ లేకున్న
లావణ్య మెక్కడిదీ సృష్టి యందు – మంకుతిమ్మ!
489.
కనులు లేని యెడ దినకరు డేల? దినకరుడు లేని యెడ
కనులేల? అన్యోన్య సహకారమే సార్థకత జీవనమునకు;
ఎన్నగ సంబంధ మిదియె, ఆత్మకున్ జగదాత్మకును
వహ్నికి, నిప్పురవ్వకు గల సంబంధమిది – మంకుతిమ్మ!
490.
మానవ యంతరంగ విశేషంబుల, బాహ్యలోకాద్భుతంబుల
యనన్య విశేషార్థంబుల దెలియ శ్రమించి దెల్పిరి, యుపాయముల
నెన్నియో మన పూర్వీకులు తేటతెల్లంబుగ, నెల్లరకున్; వాటిన్
గణింపక అపహాస్య మేల చేయ మూఢుడవై – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084