[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
471.
సౌందర్య రసపోషకులే భువిని యనేకు లెన్నగా
మందిర శిల్పులు, యాంత్రిక నిపుణులున్, రాజనీతిజ్ఞులు
ఉద్యోగులు, విజ్ఞానులు, జన బాంధవ్య పోషకులు, వీ
రందురున్ సౌందర్య స్రష్టలు – మంకుతిమ్మ!
472.
సుందరతర కవితలల్లు కవులు, పరతత్త్వ బోధకులు
విధ విధ గీత వాద్య నృత్య గీతకళావిదులు, నవ్య
విధుల మనసున కుల్లాసపరచు లలితా కళాపోషకు
లందరున్ సౌందర్యము నాస్వాదింప జేయు వారలె – మంకుతిమ్మ!
473.
పారిజాతంబున్ జూచి నిట్టూర్చి తన పదలాలిత్యలన్
పారిజాతాపహరణ కావ్యంబు రచించి తృప్తి జెందె నొక కవి:
పారిజాత వృక్షంబున్ పెకలించి తెచ్చి నాటె యుద్యాన వనంబున
శౌరి, ధీరులకే సాధ్యమిది – మంకుతిమ్మ!
474.
పతనంబైన దాని పునః ప్రతిష్ఠ సేయుటే మృత్యుంజయత్వము
శుద్ధి సేయుగాదె ధరను నభము మరి మరి వర్షించి
కోతలైన తరి పంట ఫలము మరి మరి ఫలంబు నీయదే
పతనమైన గృహంబును పుననిర్మింపుము – మంకుతిమ్మ!
475.
గౌరవించు జీవనమును, నీ యాత్మ సామర్థ్యంబును
వేరెవరిదో ఈ జగమని నిర్లక్ష్యత వలదు, ఖేదంబును వలదు
గురి సాధించు తరి విఘ్నంబుల తోడి పోరాడి జయించు
దారి యది యాత్మోన్నతకి – మంకుతిమ్మ!
476.
పరమేష్ఠి నందనోద్యానమీ జగము, భావ బుద్ధి బలంబుల
మరవక సేయుము కృషి, పరమేశు సేవ యది యని భావించి
దొరకు ఫలంబుల జనుల హృదయంబులు సంతసించు
అరయ నదియ భగవత్సేవ – మంకుతిమ్మ!
477.
భావమదేది యంకురించునో విరిసిన గులాబిని జూచినంత
ఆవేదనయో? సంతసమో? కంటక యుతమైన యా మొక్కకు
పూవది కిరీటమై వెలుగొందు – మబ్బులలోన కాంతిరేఖ వోలె
జీవనంపు సారమింతియె – మంకుతిమ్మ!
478.
నేలను చదును చేసి, ఎరువు నీరమందించి తోటమాలి
పలు కంటకముల సంకటములన్ సైరించి పెంపు జేసిన గులాబి
మేలుగ హసించి, నశించు మరు నిముషంబున; దాని చిరునవ్వు
చాలు తోటమాలికి తృప్తి నిచ్చు – మంకుతిమ్మ!
479.
సత్యమన్న నేమి సైనికుని జీవనంబున?
కత్తి పట్టుటయే యాతని వృత్తి ధర్మ మరయ,
భుక్తి, సుప్తి, విభవంబు లాతని కవి మిథ్య
సార్థకత తోటి చేయు కార్యమే సత్యము – మంకుతిమ్మ!
480.
క్లేశంబులు వేనవేలున్నను యాశ యది మరిమరి యంకురించు
వేసడపు మాటలెన్ని వినినన్ మేలైన మాటలవి గురుతుండిపోవు
ఆశ నశించినన్, చెలువైనదాని వీక్షింప అక్షి నషేక్షించు
మాసిపోదు ఎన్నటికిని ఈ జీవన స్వభావము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084