[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
401.
మరణశయ్యపై నున్నాడీ రోగి యని తెల్సియు, యాతడు
మరణించు వరకును యుపచరించక యుందుమే నిర్లిప్తత!
స్థిరము కాదీ లోకమైనను, ఉండునంత వరకైనను
పురుష ప్రయత్నము వీడదగునె – మంకుతిమ్మ!
402.
సర్వఘాతకుడని జముని నిందింప దగునె! భువికతడె
సర్వోపకారి, యాతడూరకుండిన వృద్ధుల వృద్ధి యభివృద్ధి గాదె;
సర్వస్థళంబుల ఎడనెడ వృద్ధులే యుండ; నవ యువతకు
పర్వగ తావెక్కడిది? – మంకుతిమ్మ!
403.
రతన రతనముల మధ్య హారంబున ఎడమ నుండు రీతి,
వెల్తురుల నడుమ చీకటి యడగి యుండు రీతి
విత్తు విత్తునకు మధ్య ఎడమ నుండు రీతి; జనన మరణ
పొత్తునకు నంతియె ఎడమ – మంకుతిమ్మ!
404.
దేవతలన్ సృజించి మరిచిన నేమి? దైవత్వము శాశ్వతము,
దివసములు, నెలలు గడచిపోయిన నేమి? కాలము శాశ్వతము
జీవికి మరణము వచ్చి పోవు – జీవసత్వమది శాశ్వతము
భావింప కేవలమవి – సత్త్వమును తెలియుము – మంకుతిమ్మ!
405.
పరస్పర మోహపాశంబున స్త్రీ పురుషులు కట్టువడక
పరంబుపై ధ్యానంబు నిలప, మాయను యంకుశంబుగ
పరగ జేసె నా పరబ్రహ్మ; యాత్మను హెచ్చరించి, పక్వంబు జేయ,
అరయ యది యాతని లీల గాదె – మంకుతిమ్మ!
406.
నరనారీ వ్యామోహంబు చేత వంశంబు లేర్పడి, సంఘంబు లాయె
పేరుపేరున ఊర్లు, రాష్ట్రంబుల్వెలసె వేరు వేరుగ;
అరయ తటాక మొకటైన ఏర్పడు అలలు వేరు వేరు
సారమింతియె సంసారంబున – మంకుతిమ్మ!
407.
నీతిరీతులు, కులగోత్రంబు లేర్పడె సంసారంబు వలన
యంతన్ నిల్వక రాజ్య, మఠ, ధర్మసంస్థలును ఏర్పడె
అంత వెన్వెనుక మమతానురాగంబులున్ అంకురించె
ఆత్మ వికసన మయ్యె – మంకుతిమ్మ!
408.
ఒకరినుండి ఇంకొకరికి, సంతతి నుండి సంతతికి
ఒక అల నింకొక యలను నెట్టు రీతి, తపాలు నందించు
నౌకరు వోలె ముందుకు సాగుచున్నది మానవ ధర్మము నిలు
వక, యుగ యుగము నుండి – మంకుతిమ్మ!
409.
పరము నెఱుగ జేసిన మానవ యతనమది బృహత్కార్యమే
యరయ; కాన్పించు యాతని స్వభావ యుద్గమము: ఎన్నో
నిరాశల, యన్నెన్నో సాహసముల, ఎన్నో భంగపాటులు బొందె,
పరగ అనుభవైక వేద్యమది – మంకుతిమ్మ!
410.
జనపదములు, రాజ్య సామ్రాజ్యములు, గురు
స్థానములు, ధర్మములు, భాషలు, విద్యలన్నియు
కనుమరుగై పోయినవి కాల ప్రవాహంబున
మానవత యది నిల్చియున్నది – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084