వసంత ఋతువు ఆగమనంతో
పచ్చగా ప్రకృతి మెరుస్తుంటే
కోయిలమ్మలు కమ్మని మావిచిగురులు తింటూ
హాయిగా ‘కుహు.. కుహూ..’ రాగాలు ఆలపిస్తుంటే
అరుదెంచె ఆనందాల వేడుక ఉగాది పండుగ!
పెద్దలు పిల్లాపాపలు ఆలయాలకు చేరుకున్న శుభవేళ
పంచాంగ శ్రవణాలు.. వేదపండితుల ఆశీర్వచనాలు..
ఎన్నో కోలాహలాల మధ్య తెలుగు వాళ్ళంతా ఒక్కటై జరుపుకునే
ముచ్చటైన సంబరాల సంగమం ఉగాది పండుగ!
జీవితం ‘షడ్రుచుల సమ్మేళనం’
తెలుగింటి మహిళలు తయారు చేసిన
ఉగాది పచ్చడి అందించే ఘనమైన సందేశం!
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని
యుగారంభ సూచికగా ఉగాదిని భావిస్తారు!
నూతనంగా ప్రారంభించే ఏ పనైనా
విజయవంతం కావాలంటే
ఉగాది రోజున ప్రారంభించడం తెలుగు వారి సాంప్రదాయం!
నూతన సంవత్సరం ఆరంభమయ్యే తొలిరోజు ఉగాది!
తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ ఉగాది!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.