[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
61
కాలమే నిర్ణయించు జరగబోవు పనులను
అలవోకగా సాగిపోవు కొన్ని
బలవంతంగా జరుగును మరి కొన్ని
ఇలలో జరుగును ఈ విధంగా
62
బిడ్డ రూపు, ఆరోగ్యం తల్లి తండ్రులవే
వడపోసి వెతికినా రూపు కానరాదు కొందరిలో
చెడు వ్యసనాలతో ఆరోగ్యం పోవు
కడకు మిగులు ప్రాణం
63
వరుడు శోభనం గదిలో ఎదురు చూపులు
చారడేసి కన్నులతో వధువు
మూరెడు మల్లెలతో చేరె
బారెడు ప్రొద్దెక్కినా లేవనివ్వదు ఆ మత్తు
64
కొంపలో కొన్ని వస్తువులు కావాలి
బంపర్ ఆఫరని వస్తువులు కొన్న భార్య
చెంప చెళ్లుమనిపించాడు భర్త
రంపపు కోతలాంటి బాధ భార్యకు
65
కారు చౌకగా వస్తువులు అమ్ముచున్నారు
బారులు తీరిన జనం
వేరుగా లైన్లు, స్త్రీలకు పురుషులకు
కోరుకున్నవి దొరకక కొందరు నిరాశ
66
కవులెందరో విచ్చేసిరి సభకు
చెవులకింపుగా పద్యాలు చదివిరి
లవ లేశమైనా కదలని ప్రేక్షకులు
చివరిగా పాటతో సభ ముగిసె
67
వింత వేషాలతో తిరుణాల
కాంతలూ వేసిరి వేషాలు
చెంతనున్న దుకాణాలలో తినుబండారాలు
ఎంతో చక్కగా నిర్మించిన ప్రభల ఊరేగింపు
68
కవిత్వంలో పటుత్వం వున్నప్పుడే రాణించేది
భవిష్యత్తులో నిలిచి ఉండేది
పేవలంగా ఉంటే పాఠకులిష్టపడరు
కేవలం అది పదాల కూర్పే
69
కారు మబ్బులు కమ్ముకున్నాయి
వరుణుడు తన ప్రతాపం చూపించాడు
దారులన్నీ నీటితో నిండిపోయె
కారులన్నిటినీ నీటి ప్రవాహం తీసుకు పోయే
70
కారు చీకట్లు కమ్ముకున్నాయి
బోరు బోరున విలపించిన పిల్లలు
అరుపులకు మేల్కొనిన తల్లి తండ్రులు
చిరు దివ్వెలు వెలిగించి ఓదార్చిరి
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.