[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
41
సంక్రాతి సంబరాల్లో మునిగి తేలుతున్న జనం
చక చకా పసందైన పిండి వంటలు
చక్కగా ఆరగించిరి విందు
చక్రాలాకారంలో గాలి పటాలు
42
చిట్టి పొట్టి చిన్నారులం మేము
పొట్టి పొట్టి దుస్తుల్లో వెలిగి పోతున్నాం
గట్టి గట్టిగా చిందులేస్తున్నాం సంతోషంతో
మొట్టి మొట్టి ఊరుకోబెట్టిన తల్లులు
43
రాము రామంటూనే వొచ్చారు ప్రేక్షకులు
పోము పోమంటూనే పోతున్నారు వెను వెంటనే
తాము చూసిందల్లా చాలింక
మేము నిష్క్రమించుచున్నాము ఇంతటితో
44
తూచి తూచి మాట్లాడుతున్న వక్త
కాచి కాచి వడబోసిన వాళ్లతో నిలవలేడు
చూచి చూచి విసిగి పోయిన ప్రేక్షకులు
లేచి వెళ్లి పోతున్నారు
45
కాముని సూటి సూటి బాణాలతో
సోముడు మత్తెక్కి పోయాడు
రాములక్ష్మికి వెంటనే వశమయ్యాడు
ఝాము రాత్రి కాడ వెళ్లి రాములక్ష్మిని కలిసాడు
46
చక్రాల్లాంటి కళ్ళు చక్కటి అభినయముతో
చాకచక్యంగా నటిస్తూ
వంకలు వంకలు తిరుగుతున్న వనిత
చక చకా చప్పట్లు కొట్టిరి జనము
47
కంచు కోట బద్దలు కొట్టి శత్రువులు
మించిన ఉత్సాహంతో లోపలచేరి
ఎంచి ఎంచి వున్నసంపదను దోచిరి
కాచుకొన్న సైనికులను బంధించి
48
బోసి నోటి పాపాయి పాలకోసం ఏడ్చి ఏడ్చి
కసిగా కసిగా పాల కోసం ఎదురు చూచి
పసిడిగిన్నెలోని పాలు త్రాగేసె
ముసి ముసి నవ్వులతో
49
శరణం అయ్యప్ప ఘోషతో హాలు మారు మ్రోగింది
చరణాలు పాడి పాడి
కరచానాలతో భక్తి పరాకాష్ఠ నందుకుంది
తర తమ భేధాలుండవని
50
మంత్రం ఒక్కటే పని చేయదు తంత్రం లేకుండా
తంత్రాలతోనే అసలు పని
కంత్రీ గాళ్ళు రెండింటితో నమ్మిస్తారు
చిత్తుగా మోసపోతారు అమాయకులు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.