[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
251
బ్రతికున్నంత వరకు మనసుకు బాధే
అత్యాశ, ఆవేశ, కావేశాలతో
శత విధాల నిర్మలంగా వుంచుకోవాలి
అంతే జీవితం సుఖమయమౌతుంది
252
మనసే కారణం జీవితం ఒడిదుడుకులకు
ఎన్నడూ ఆవేశ, కావేశాలు కూడదు
కనుక అదుపులో ఉంచాలి
చిన్ననాటి నుండే అలవడాలి
253
దాన ధర్మాల అగత్యం?
పనులు లేక బీదవారైనందుకా?
పనులు కల్పించాల్సిన ప్రభుత్వ ఉదాసీనతా?
అన్నీ కలిపి బీదవారుగా మారటమా?
254
కొందరు ప్రజల సొమ్ము స్వాహా చేయటానికే పుట్టారేమో
మందభాగ్యులైన వారిని మోసం చేయటం
ముందంజలో వుంటారు కొందరు
అందరూ మోసపోరు
255
పేరు మార్చుకున్నంత మాత్రాన
వీరులై పోతారా, భాగ్యవంతులు ఔతారా?
కోరిన కోరికలన్నీ తీరుతాయా?
తీరని సమస్యలన్నీ సమసిపోతాయా?
256
రుద్రాక్షతో శుభాలు?
క్షుద్ర పూజలతో ఆరోగ్య సమస్యలు తీరేనా?
భద్రకాళీ పూజలతో శక్తి లభించేనా?
వేద మంత్రాల పూజలతో సమస్యలన్నీ తీరేనా?
257
ఆకాశమంత మనసు ఇరుక్కుపోయింది తలలో
లోకమంతా సంచరించు
ఏకాగ్రత వుండనే ఉండదు
చక చకా ఆలోచించు, నిర్ణయం ఆలస్యమే
258
ద్రాక్ష గుత్తుల్లాంటి ఊపిరితిత్తులు
దీక్ష బూని జీవాన్ని రక్షించు
లక్ష సార్లైనా పనికి విసుగు చెందవు
లక్ష్యంతో పని చేసి రక్తాన్నిశుద్ధి చేయు
259
కన్ను యెంత చిన్నదైనా రెప్పల్లోనే
దాని చూపు మాత్రం సుదూరమే
కనే దృశ్యాలన్నిటిని మెదడుకు అందజేస్తుంది
తాను మాత్రం దేన్నీ గుర్తుంచుకోదు
260
అన్నీ తనలోనే ఇముడ్చుకున్న తల
కొన్నైనా చేయగలదని ధీమా
కన్ను కొన్ని వైపులు చూచుటకు సహకరిస్తుంది
దేని విశిష్టత దానిదే
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.