[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
191
కోరికలు ఎక్కువైనప్పుడు
తీరిక లేక సతమతమౌతారు
తీర్చుకునే సమయమూ, సందర్భమూ రావాలి
ఖర్చులెక్కువైనా తీర్చుకోక తప్పదు
192
మూడు ముళ్ళతో పెళ్లి బంధం
ఏడడుగులతో సంసారం మొదలు
కడు సుకుమారంగా సంసారం సాగు
ఏడాది తిరిగేసరికి కేర్ కేర్ మని పాప
193
మూడు ముదనష్టం
ఏడు ఏడుపుకే కదా
నడుమ వచ్చేనాలుగు, అయిదు ఆరు మంచివేగా
కడు వివరంగా ఆలోచించితే అన్ని అంకెలు మంచివే
194
పుట్టుట గిట్టుట కొరకేగా
తట్టుకొని నిలబడే వాళ్ళు
పట్టుమని పది కాలాలపాటు వుండే వాళ్ళు ఎందరో
చిట్ట చివరికి నిర్యాణంతో సరి
195
సున్నా విలువ ఒంటరిగా ఉంటే శూన్యమే
దేని ప్రక్కనన్నాచేరితేనే విలువ
వెనుక భాగాన చేరితే విలువే లేదు
సున్నా కూడా విలువైనదే
196
ఒకటెప్పుడూ మొదటి స్థానమే
చక చకా పనులు మొదలు పెట్టటానికి
వంకలు పెట్టకుండా ప్రారంభించ వచ్చు
చాకచక్యంగా పని పూర్తి అగు
197
రెండు ద్వితీయ స్థానమేగా
కడు సునాయాసంగా సాగిపోవు పనులు
ముడులెన్నడూ వుండనే వుండవులే
తడుముకోకుండా అన్ని పనులు నెరవేరు
198
మూడు తృతీయ స్థానమే
చెడు జరుగునని మానవుల నమ్మకము
గడ్డు సమస్యలు వస్తాయని భయం
తడుముకోకుండా ప్రారంభించు, జయం చేకూరు
199
నాలుగు ఉన్నత స్థానం
కలుషితాలు యేమి వుండవు
పలు పనులు ఆరంభానికి మంచిదే
నలుగురు మెచ్చుకునే విధంగా పనులు పూర్తవుతాయి
200
ఐదు పంచమ స్థానం
లేదు ఏ దోషం ఈ అంకెతో యే పనికైనా
వద్దని అనుకోవాల్సిన పని లేదు
కాదు కూడదని ఆలోచించాల్సిన పని లేదు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.