[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
181
కోయ దొరలు కోస్తారు కోతలు
మాయ మాటలతో నమ్మిస్తారు
శయన మందిరము వున్న చోటు నుండి మార్చండి
భయము వలదు అన్నీ సర్దుకుంటాయి
182
వింత పదాలతో అర్ధం లేని కవిత్వం
యెంతో శ్రద్దగా వ్రాసాడు
కొంత మంది ఐనా చదవాలిగా
అంతా చదివాక ఏ అంశం మీద వ్రాశాడో అర్ధం కాలా
183
ఆకాశంనుండి నక్షత్రాలు రాలుచున్నవి
చక చకా కొంగులలో పట్టుకొనిరి
టక టకా నగలు తయారు
వంక బెట్టకుండా భామలు ధరించిరి
184
చిన్ననాటి జ్ఞాపకాలు యెంతో ఆనందం
కన్న వాళ్ళ మురిపాలు, ప్రేమలు
అన్నీ, ఇన్నీ అని చెప్పలేము గదా
ఎన్ని గుర్తు చేసుకున్నా అంతా ఆనందమే
185
ఎన్ని గుళ్ళు తిరిగినా లభించే పుణ్యమెంత?
కొన్ని గుళ్ళు మిగిలి ఉండవచ్చు
అన్ని పుణ్యాలతో జీవితం ధన్యమేనా!
కానీ నేత్రానందం తప్పకవచ్చు
186
మమతానురాగాలతో సాగు సంసారం
తమ తమ ధర్మాలను చక్కగా పాటించెదరు
కమ్మటి భోజనాల తోనూ
నమ్మలేని విధంగా సాగు జీవితం
187
కొంప కొల్లేరౌతుంది సఖ్యత లేనప్పుడు
కోప తాపాలు ప్రక్కన పెట్టి
ఆపక పొతే అంతే సంగతులు
శాపంగా మారవచ్చు సంసారంకి చివరికి
188
ముక్తి కావాలని వేయి దేవుళ్ళకు మ్రొక్కుతూ
భక్తి భావంతో మెలిగే భార్య
ముక్తి మార్గం లేనే లేదని
భక్తి లేని భర్తతో సాగేనా సంసారం సుఖంగా?/సరిగ్గా?
189
సూర్యునికి మేఘానికి దోబూచులాట
మారు మారు అడ్డం వస్తూ సూర్యునికి
కోరుకున్న కిరణాలను భూమి చేరకుండా
పోరు సాగు చుండె ఇద్దరికీ
190
కంచి కామాక్షి మధుర మీనాక్షి
మంచి కనులున్న దేవతలేగదా
కొంచమైనా దయగల తల్లులేగదా
అంచలంచెలుగా దయ చూపు దైవాలేగా
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.