[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
131
ఆశ లేని జీవితం వృథా
వశం గాని ఆశలు అంతే
సంశయం లేదు ఆశే నడిపించు జీవితాన్ని
ఆశ అంతటి పాత్ర పోషించుచున్నది జీవితంలో
132
రోడ్డు శూలకు వినాయక ప్రతిమ
అడ్డుకోగలదా అనుకోని ప్రమాదాలను
మూఢ నమ్మకాలతో ప్రజలు
బడ బడా చేతురు ఇలాంటి పనులు
133
ఏ దేవుడు ఆపగలడు ప్రమాదాలను
పదే పదే మ్రొక్కుకున్నా కాపాడాడా
తదేక దీక్షలో వున్నా కూడా కాపాడలా
ఏ దేవుడైనా రక్షిస్తున్నాడా?
134
మనసుకు లేదు ముసలితనం
ఏనాడైనా యవ్వనే
దాని ఆలోచనలు వయసు పెరిగే కొద్దీ వృద్ధి చెందు
కాన మనస్సును ప్రశాంతంగా వుంచుకోవాలి
135
పోరు బాటతో పోయేదేముంది
కరుణించి యజమాని జీతాలు పెంచెను
కోరుకున్నది లభించె ఉద్యోగులకు
తరుణం చూచుకొని పనిలో చేరిరి
136
పచ్చని పైరు
వెచ్చని సూర్య కిరణాలతో పంట వృద్ధి
మంచ మీదున్న కూలీని చూచి పిట్టలు పరుగు
మంచి పంటలని ఇచ్చె భూమాత సమృద్ధిగా
137
ఏనాటి బంధమో గ్రహాలది సూర్యునితో
ఎన్నాళ్ళు సాగునో ఎవరికెరుక
ఏనాడైనా అదుపు తప్పితే యేమగునో?
అన్ని గ్రహాలు కలసి పోవచ్చు
138
మచ్చ లేని పచ్చదనం
వెచ్చని కిరణాలతో సూర్యుడు కాపాడు
పచ్చదనం చూస్తే యెంత ఆనందమో మానవులకు
మచ్చుకైనా లేదు లోపం ఇందులో
139
పైరు పంటలు, భూమి అలిగితే
కోరుకున్న ధాన్యం దొరక్క ఇబ్బంది
నోరు మెదిపేందుకు ఏమి ఉండదు
వరుణుడు, భూమి కరుణించితేనే ఆనందం
140
జీవితం ఎప్పుడు ఏవిధంగా జరుగునో
ఎవరికి తెలుసు
చావు పుట్టుకల రహస్యమూ అంతే
లేవు ఏ ఆధారాలు వీటిని నిర్ణయించుటకు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.