Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-89

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-7

ర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేసిన రోజులు, ఆనాటి అర్జునుడి భావోద్వేగాలు, అభిమన్యుని మరణం, తీవ్రోద్వేగంతో అర్జునుడు సంశప్తకులను ఎదుర్కుంటూనే సైంధవుడిని పరమాత్మ సహాయంతో సంహరించటం..

సత్యరథః చ సత్యవర్మా సత్యవ్రతః చ సత్యేషుః సత్యకర్మా చ।

ఏతే పంచ సహోదారాః దశసహస్రరథాః సమాగతాః॥

సహ దశసహస్రరథైః ఇతరైః చ సమాగతాః।

అర్జునం హంతుం ఆయాతాః సంశప్తకాః యుద్ధకాంక్షిణః॥

అర్జునుడు సంశప్తకులతో మూడు రోజుల పాటు యుద్ధం చేశాడు – 12వ, 13వ, మరియు 14వ రోజులు. ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు యుద్ధం కొనసాగింది.

ఈ మూడు రోజులు అర్జునుడి ధర్మ యుద్ధాన్ని, అతని శౌర్యాన్ని, మరియు అంతర్గత భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.

ఇక సంశప్తకుల విషయానికి వస్తే వారి సంఖ్య ఎంత అన్నది పూర్తిగా వ్యాస మహాభారతం చదివితేనే కానీ తెలియని విషయం. ఎంతోమంది పెద్దలు వారికి దొరికిన మహాభారత వెర్షన్లను బట్టీ చెప్పారు. నేను వీలైనంత పరిశోధించి (నా ఆయానికి తగినట్లు, మన శీర్షికకు తగిన రీతిలో) ఈ విషయాన్ని గ్రహించాను.

అర్జునుడు సంశప్తకులను ఎంతమందిని చంపాడు? 14,000 అనే సంఖ్యకు శ్లోక సాక్ష్యం

సమాధానం:

కర్ణపర్వంలో (అధ్యాయము 53) అర్జునుడు 14,000 మంది సంశప్తక యోధులను చంపినట్లు స్పష్టమైన శ్లోకం ఉంది:

చతుర్దశ సహస్రాణి యోధానాం అర్జునః స్వయం।

గదాశక్తిభిరుద్యుక్తాన్ జగాన సమరే తదా॥

అర్థం:

“గద, (కర్ణుని వద్ద ఉన్న లాంటి) ఇతర శక్తి ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న 14,000 మంది యోధులను, అర్జునుడు స్వయంగా ఆ సమరంలో సంహరించాడు.”

ఈ శ్లోకం అర్జునుడి శౌర్యాన్ని మాత్రమే కాక, సంశప్తకుల ప్రతిజ్ఞల వ్యర్థతను కూడా ప్రతిబింబిస్తుంది. వారు ధర్మాన్ని ఎదుర్కొనలేక, అర్జునుడి చేతిలో నాశనం అయ్యారు.

ఇక్కడ చూడండి 14,000 అనే సంఖ్య. శ్రీరాముడు కూడా 14,000 మంది ఖరదూషణాదులను సంహరించాడు. రావణుని ఎదుర్కునే ముందు. అదే విధంగా తన ప్రధాన ప్రత్యర్థిగా లోకులు భావించే కర్ణుడిని ఎదుర్కునే ముందు 14,000 మంది సంశప్తకులను నిర్జించాడు.

కాకపోతే నరుడైన అర్జునుడి ప్రక్కన నారాయణుడైన శ్రీకృష్ణుడే ఉన్నా అర్జునుడికి ఒక పూర్తి రోజు పట్టింది. అంటే సూర్యోదయమైన సమయం నుంచీ సూర్యాస్తమయానికి మునుపు యుద్ధాన్ని నిలిపివేసే సమయం వరకూ. సుమారుగా 10 గంటల సమయం. మధ్యలో అవసరార్థం వచ్చే విరామాలను గ్రహించగలిగితే. లేకపోతే కనీసం 12-13 గంటల సమయం.

ప్రక్కన నారాయణుడే ఉన్నా నరుడైన అర్జునుడికి ఇంత సమయం పట్టింది. వీరాధివీరులైన ఖరదూషణాదులను సంహరించటానికి శ్రీరామునికి 72 నిముషాలు మాత్రమే పట్టింది.

శ్రీరాముడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని చెప్పేందుకు.

అందుకే ఆయన ధన్వీ.

ఆ నామము ఆయనకే ఒప్పింది.

వాల్మీకి మహర్షి వర్ణించిన విధానం కూడా ఒకసారి చూద్దాము.

శ్రీరాముని విలువిద్య ప్రతాపం ఖరదూషణుల యుద్ధంలో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా వర్ణించారు. ఇది అరణ్యకాండలో చోటుచేసుకున్న ఘట్టం. శూర్పణఖ అవమానాన్ని ప్రతీకారంగా తీసుకున్న ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు మరియు పద్నాలుగు వేల రాక్షస సైన్యంతో రాముని ఆశ్రమాన్ని చుట్టుముట్టి యుద్ధానికి దిగారు. రాముడు ఒక్కడే వారందరితో యుద్ధం చేసి, తన విలువిద్యతో వారిని సంహరించాడు.

వాల్మీకి వర్ణన – శ్లోకాలు (దేవనాగరి మరియు తెలుగు లిపిలో)

1. రాముని బాణ ప్రయోగం

దేవనాగరి:

स तु क्रुद्धो धनुष्पाणिः शरानादाय वीर्यवान्।

चिक्षेप परमक्रुद्धः खरस्य च बलं प्रति॥

తెలుగు లిపి:

స తు క్రుద్ధో ధనుష్పాణిః శరానాదాయ వీర్యవాన్।

చిక్షేప పరమక్రుద్ధః ఖరస్య చ బలం ప్రతిః॥

అర్థం:

శ్రీరాముడు కోపంతో తన విల్లు పట్టుకుని, అత్యంత శక్తివంతమైన బాణాలను తీసి, ఖరుని సైన్యంపై ప్రయోగించాడు.

2. రాక్షసుల సంహారం

దేవనాగరి:

चतुर्दश सहस्राणि राक्षसानां यशस्विनाम्।

एकेन रामेन तदा निहतानि समरे प्रभो॥

తెలుగు లిపి:

చతుర్దశ సహస్రాణి రాక్షసానాం యశస్వినాం।

ఏకేన రామేన తదా నిహతాని సమరే ప్రభో॥

అర్థం:

పద్నాలుగు వేల మంది రాక్షస యోధులు, శ్రీరాముని చేత ఒక్కరోజులోనే యుద్ధంలో సంహరించబడ్డారు.

3. దూషణుని సంహారం

దేవనాగరి:

तस्य चापं शरैः छित्त्वा भुजौ चास्य समाहितः।

जघान राघवः क्रुद्धो दुषणं समरे प्रभो॥

తెలుగు లిపి:

తస్య చాపం శరైః ఛిత్త్వా భుజౌ చాస్య సమాహితః।

జఘాన రాఘవః క్రుద్ధో దూషణం సమరే ప్రభో॥

అర్థం:

రాముడు దూషణుని విల్లు నాశనం చేసి, అతని రెండు చేతులను నరికి, యుద్ధంలో సంహరించాడు.

విలువిద్య ప్రతాపం – వర్ణన

ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడో, దాన్ని విల్లుకు సంధిస్తున్నాడో, సంధించిన బాణాన్ని వదులుతున్నాడో తెలియదని, ఆయన చేయి మాత్రం ఒక చక్కంలా తిరుగుతోందని అంటాడు వాల్మీకి మహర్షి.

(సశేషం)

Exit mobile version