Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-82

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ

గుణలీలాస్వరూపైశ్చ మితిర్యస్య న విద్యతే।
అతోఽవాఙ్మనసా వేద్యః శ్రీరామః శరణం మమ॥6॥

కర్తా సర్వస్య జగతో భర్తా సర్వస్య సర్వగః।
ఆహర్తా కార్య జాతస్య శ్రీరామః శరణం మమ॥7॥

వాసుదేవాదిమూర్తీనాం చతుర్ణాం కారణం పరమ్।
చతుర్వింశతి మూర్తీనాం శ్రీరామః శరణం మమ॥8॥

నిత్యముక్తజనైర్జుష్టో నివిష్టః పరమే పదే।
పదం పరమభక్తానాం శ్రీరామః శరణం మమ॥9॥

మహదాదిస్వరూపేణ సంస్థితః ప్రాకృతే పదే।
బ్రహ్మాదిదేవరూపైశ్చ శ్రీరామః శరణం మమ॥10॥

శ్రీ రామాయణం దీర్ఘ శరణాగతిగా పేర్కొనబడింది పూర్వాచార్యుల చేత. ఇతిహాసమైనా కావ్యమని కూడా పేరుపొందింది. శ్రీరామ చంద్రమూర్తికి మాత్రమే అంకితమైన ఇతహాసం శ్రీ రామాయణం.

అలాంటి ఇతిహాసమంటూ ఏమీ లేదు శ్రీకృష్ణుడికి. మహాభారతం ఇతిహాసమైనా, శ్రీకృష్ణభగవానుడు అందులో నాయకుడైనా, అది పరిశీలనగా చూస్తే భీష్ముడి కథ. భీష్మ చరితమ్.

మరి ఆయన కథ మనకు ఎక్కడ పూర్తిగా తెలుస్తుంది? శ్రీమద్భాగవతంలో అంటారా? భాగవతం పురాణం. పురాణాల కథలు సంకేతాలు ప్రధానంగా. అంతా ఐతిహ్యంగా తీసుకొనలేము. పైగా భాగవతం అన్ని పురాణాల లక్షణాలను పుణికి పుచ్చుకుంది.

అవి..

  1. సర్గము (సృష్టి)
  2. ప్రతిసర్గము (లయము/ప్రళయము)
  3. వృత్తి (వ్యాపారము)
  4. రక్షా (పరిపాలన)
  5. అంతరము (మన్వాదుల కాలము)
  6. వంశము (వంశాదుల విషయము)
  7. వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు)
  8. సంస్థా (స్థితి)
  9. హేతువు (కారణము)
  10. అపాశ్రయము (ఆశ్రయ విషయాలు)

ఈ పదీ పురాణ లక్షణాలు.

అంటే ఇందులో ప్రధానంగా కేవలం శ్రీకృష్ణుడి గురించే ఉండదు. కృష్ణభక్తి ప్రధానాంశమే అయినా సృష్ట్యాది వర్ణనలు, మునువుల చరిత్ర, రాజ వంశాల పరంపరలు, భాగవతుల జీవిత గాథలు వీటికి కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. అష్టాదశ పురాణాలలో శ్రీమద్భాగవతం మాత్రమే ఇతిహాసం అనే పదం వాడటానికి సరితూగుతుంది. కారణం శ్రీకృష్ణుని చరిత్ర మహాభారతంతో ముడిపడి ఉంది.

ద్రౌపదీ స్వయంవరంలో మొదట కనుపిస్తాడు. అన్న బలరాముని తోడుగా.

తరువాత పాండవులను గుర్తిస్తాడు అందరికన్నా మొదట.

భగవంతుడే భక్తులను గుర్తిస్తాడు మొదట. భక్తులు భగవానుని గురించి, ఆయన వైశిష్ట్యాన్ని తెలుసుకుంటారు కానీ ఆయనను అన్ని సందర్భాలలో గుర్తించ లేరు. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కారణమేమిటంటే ఆయనను మాయ అంటదు. మనలను మాయ కమ్ముకుని ఉంటుంది. ద్వైతం ప్రకారం భగవానుని మనం దాస భావనతో మాత్రమే తెలుసుకొనగలము. మాయ తొలగితే, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపుడు అంటుంది అద్వైతం. విశిష్టాద్వైతం ఆ మాయ తెలగించుకోవటానికి గురువు అనే వెలుగు దారి చూపుతాడు అంటుంది. చేయి పట్టుకుని నడిపిస్తుంది.

గమనించండి. హనుమానుడికి మొదట శ్రీరాముడు ఒక ఉత్తమ వంశానికి చెందిన రాజకుమారుడు. ఎన్నదగిన వీరుడు. తన రాజు అయిన సుగ్రీవుడికి ఉపయోగపడగలడు అన్న ఆశ/నమ్మకం. అంతే. మన సినిమాల్లో చూపిన విధంగా శ్రీరాముని చూసిన వెంటనే హనుమానుడు దాసోహం అనలేదు. కానీ శ్రీరాముడు హనుమానుని గురించి తొల్త చూసిన వెంటనే సరైన అంచనా వేస్తాడు. అతని పాండిత్యం, విద్య, వానరులలో అతనికున్న వైశిష్ట్యం. ఆ పైన సుగ్రీవుడు ఎక్కువగా హనుమానుని మీద ఆధారపడటం గమనించి, తాను కూడా హనుమానుని ఆ విధంగా గుర్తిస్తాడు. కానీ హనుమానుడికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తే కానీ, శ్రీరాముని పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించలేదు. కానీ, విద్యావినయ సంపన్నుడు కాన గౌరవ మర్యాదలు తగిన విధంగా ప్రదర్శిస్తాడు.

ఉదాహరణకు, మైత్రి అనంతరం సుగ్రీవుడు ఒక చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి తను కూర్చునే కొమ్మ ప్రక్కన ఉంచి, శ్రీరాముని సగౌరవంగా దాని మీద ఆసీనుని కావిస్తాడు. లక్ష్మణుడిని గుర్తించడు. మాయ. కానీ శ్రీరాముని అంతటి వాని దగ్గర అంత చనువు, స్నేహం ఉన్నాయంటే లక్ష్మణుడు తప్పకుండా రాముని అంతటి వాడే అని గ్రహించిన హనుమ ఇంకొక కొమ్మను తెచ్చి లక్ష్మణుడికి వేస్తాడు. దీని గురించి ఇంకొక చోట మరింత వివరంగా చూడగలము.

అలాంటి అంజనా సుతుడు క్రమంగా సుందరకాండలో సీతాన్వేషణ చేస్తుండగా లంకలో, అశోకవనంలో ప్రవేశానికి మునుపు..

నమోస్తు రామాయ సలక్షణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై।

నమోస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యో
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః॥

అని ఇతర దేవతలతో సమానంగా గుర్తిస్తాడు. గౌరవిస్తాడు.

ఆ తరువాత సీతామాత దర్శనం జరిగాక స్వరం మారుతుంది. ఇలా ప్రకటన చేస్తాడు.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః॥

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః।

అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥

సీతను చూశాక హనుమకు శ్రీరాముని మీద గౌరవం రెట్టింపౌతుంది. ఆ పైన అమ్మతో మాట్లాడాక, ఆమెకు శ్రీరామునిపై గల భక్తి, అభిమానము, గౌరవము, ప్రేమ, అనురాగమూ చూశాక హనుమానునికి శ్రీరాముడు పరబ్రహ్మ కాగలడని అవగతమౌతుంది. ఆ పైన లంకా దహనంలో సీతమ్మకు ఏమీ కాకపోవటం, ఆమె ప్రభావం వల్లే తనను అగ్ని బాధించకపోవటం చూశాక, అంతటి సాధ్వి శ్రీరామునికి కట్టుబడి ఉండటం.. హనుమను శ్రీరాముడే పరబ్రహ్మ కావచ్చని నిర్ధారణకు వచ్చేలా చేస్తాయి. అవతార పరమార్థమూ అర్థమౌతుంది.

ఆయనే అనుత్తముడు (81). ఆయనే దురాధర్షః = తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు (82). దీనిని గురించి మరొక సందర్భంలో మరింత రమ్యంగా తెలుసుకొనగలము.

ఇదే విషయం శ్రీకృష్ణుడి పరంగా ఇప్పుడు పరిశీలిద్దాము.

ఆలోగా ఒకసారి మొదటి మూడు ఎపిసోడ్లను చూడండి. అక్కడ చాలా విశేషాలు కనబడతాయి మనకు. ఈ నామాల గురించి.

(సశేషం)

Exit mobile version