Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-81

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రమాణం బీజమవ్యయమ్

స సర్వం సిద్ధిమాసాద్య హ్యంతే రామపదం వ్రజేత్।
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ॥1॥

విశ్వస్య చాత్మనో నిత్యం పారతంత్ర్యం విచింత్య చ।
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ॥2॥

అచింత్యోఽపి శరీరాదేః స్వాతంత్ర్యేణైవ విద్యతే।
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ॥3॥

ఆత్మాధారం స్వతంత్రం చ సర్వశక్తిం విచింత్య చ।
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ॥4॥

నిత్యాత్మగుణసంయుక్తో నిత్యాత్మతనుమండితః।
నిత్యాత్మకేలినిరతః శ్రీరామః శరణం మమ॥5॥
(బృహత్ బ్రహ్మసంహితాంతర్గత అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రమ్)

అనుత్తమః – అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు. శ్రీరాముడు కావచ్చు. శ్రీకృష్ణుడు కావచ్చు. ఆ పరమాత్మకు చెందిన ఏ రూపమైనా, ఏ అవతారమైనా.. ఆ యా కాలాలకు అంతకు మించిన ఉత్తమమైనది మరొకటి ఉండదు. రామాయణ కాలంలో స్రీరాముని మించిన వారు ముల్లోకాలలోనూ లేరు. భారత/భాగవత దశమస్కంధ కాలంలో శ్రీకృష్ణుని మించిన వారు లేరు. ఏ లెక్కన చూసినా కూడా.

ఇతరావతారాలు ముందు చెప్పినట్లే ఎదురు లేనివి. కానీ, శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు ఇతిహాసాలకు చెందినవి కనుక కాస్త ప్రాధాన్యం హెచ్చు. ఈ నేలపై నడయాడిన వారు మానవ రూపాలలో. అయినా ఇంతకు ముందర చవిచూసినట్లు (రామం దశరథాత్మజమ్ 1-7) పరతత్వాన్ని ప్రదర్శిస్తూనే.

ఇక్కడో విచిత్రమైన విషయం మనం గమనించాలి.

శ్రీరామావతారంలో బ్రహ్మగారు రావణ సంహారానంతరం సీతాగ్నిప్రవేశం తరువాత ఏతెంచి, “స్వామీ! నీవే పరబ్రహ్మవు,” అని కీర్తిస్తాడు. ఇతరేతర దేవతలు కూడా అదే విషయాన్ని స్పష్ట పరుస్తారు.

కానీ ఎక్కడా రాముడు తాను పరబ్రహ్మను అని కానీ, కనీసం విష్ణుమూర్తి అవతారాన్ని కానీ చెప్పుకోడు ఒప్పుకోడు.

చాలా తేలికగా నేను దశరథ మహారాజు తనయుడను. నా పేరు రాముడు.

అంతే! ఇంకేమీ చెప్పడు.

ఆయనకు రామం దశరథాత్మజమ్ అని చెప్పుకొనుటలో ఉన్న ఆనందం వేరే పేరుతో పిలుస్తే రాదు. వంశాన్వయంగా రాఘవుడని చెప్పిన బాగే.

నాగపాశ బద్ధుడైన సందర్భంలో సాక్షాత్ గరుత్మంతుడు వచ్చి పాశ విముక్తుడిని చేసిన సందర్భంలో వచ్చినవాడు వైనతేయుడు అని తెలియదా? లేదు. తెలిసినా తెలియనట్లే మిన్నకుంటాడు. లేదా గుర్తుపట్టడు.

అందుకు నీవెవరని అడుగుతాడు. దానికి ఆ వినీతా సుతుడి సమాధానం.. నేను నీకు చాలా కావాల్సిన వాడిని. ఆ వివరాలు తరువాత తెలుస్తాయి అనేసి సెలవు తీసుకుని వెళ్తాడు. తన ప్రభువు దగ్గర నుంచీ. కానీ రాముడు ప్రభువు కాదు. అంటే అక్కడ మానవ తత్వాన్ని చూపించుటయే ప్రాధాన్యం.

అలాగే ఇతర ఋషుల ఆశ్రమాలలో కూడా ఎవరన్నా దేవతలు ఉన్నా కూడా వారు రాముని రాకను గ్రహించి వేరే దారిగుండా వెళ్ళి పోతారు. ఎందుకంటే వచ్చేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. కనబడితే నమస్కరించాలి. అలా చేస్తే మానవతత్వం దాటి భగవత్తత్వం బైట పడుతుంది. బ్రాహ్మగారు ఇచ్చిన వరం ప్రకారం ఆ భగవత్తత్వం రూపుదాల్చిన వ్యక్తి చేత రావణుడు హతమవ్వడు.

నిజానికి శ్రీమన్నారాయణుడు అనుకుంటే రావణ సంహారం ఒక లెక్క కాదు. బ్రహ్మ గారి వాక్కుని నిజం చేయటానికి ఆయన వరం వృథా అయ్యి అసత్య దోషం రాకుండా ఉండేందుకు పడిన శ్రమ. తనవారికోసం ఆ పరమాత్మ చూపిన దయ అది.

అదే శ్రీకృష్ణావతారంలో ఇంకో రకంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు తన లీలావిలాసాలతో జగతిని రంజింపజేస్తుంటే, ఆయన పరబ్రహ్మ తత్వాన్ని మరచి అటు ఇంద్రుడు, ఇటు పితామహుడు (చతుర్మఖ బ్రహ్మ) ఆయనను పరీక్షించాలనికుని భంగ పడతారు.

ఒకవైపు దేవతల విషయమే ఇలా ఉంటే ఇక సామాన్య మానవులకు ఆయన తత్వం అర్థమౌతుందా? అందుకే ఆయనను భగవానుడిగా పూజించిన వారు ఎంత మంది ఉన్నారో ఆయన్ను సాధారణ గొల్లవానిగా చూసిన వారు అంతేమంది ఉన్నారు. దానికి తోడు ఆయన పరమాత్మ స్వరూపాన్ని చూసిన వారిని, ఎఱిగిన వారిని కూడా ఆయన మాయ చేత తమ్ముడిలా చేసి మార్పునకు గురిచేస్తాడు. యశోద విషయం తెలిసిందే కదా.

తల్లివి నీవే తండ్రివి నీవే! లో మూడవ ఎపిసోడ్ అయిన “దామోదరాయ నమః – ద్వైత లోపం” చూడండి.

శ్రీరామ శ్రీకృష్ణ తత్వాలలో ఉన్న తేడాలు మనకు యుగ లక్షణాలను కూడా పట్టి ఇస్తాయి. చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసుకుంటుంటే.

ఆ వివరాలు తెలుసుకుంటే మనకు అనుత్తమః (81) నుంచీ ప్రజాభవః వరకూ ఉన్న నామాల తత్వ రహస్యాలు అర్థమౌతాయి.

వాటిని సవివరంగా తెలుసుకుందాము.

(సశేషం)

Exit mobile version