[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
రామం దశరథాత్మజమ్-2
ఇతర అస్త్రాల గురించి..
1. బ్రహ్మశీర్షాస్త్రం: లేదా బ్రహ్మ శిరోనామ అస్త్రం.
ఇది బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమైన ఆయుధం అని చెప్తున్నారు. బ్రహ్మాస్త్రం, ఇదీ ఒకటేనా కాదా అన్నది తేల్చటం కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారి పోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం శ్రీరాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని చెప్పి, అర్జునుడికి అందించాడు. అశ్వత్థామ కథ తెలుసు కదా.
2. బ్రహ్మండాస్త్రం:
ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. ఈ ఆయుధం కొనపై, బ్రహ్మ యొక్క ఐదు తలలు ఉంటాయి. ఇది బ్రహ్మాస్త్రం, అలాగే బ్రహ్మశీర్షాస్త్రం, ఈ రెండింటి శక్తీ కలిపి ఉంటుంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని విడిచిన తరువాత, దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ప్రయోగించబడిన వారు రక్షింపబడే అవకాశమే లేదు. ఈ ఆయుధం, ద్రోణాచార్యుడి వద్ద ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, ధర్మం కోసం పోరాడుతున్నందున, వారిపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుడిని కోరడంతో, ఆయన దానిని ప్రయోగించలేదు.
3. నారాయణాస్త్రం:
ఈ అస్త్రం, శ్రీహరికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రం ప్రయోగింపబడింది. ఆ సమయంలో మహాస్త్ర మహిమో ఏమోగానీ, ప్రకృతి అంతా అల్లకల్లోలమయి పోయింది. గగనాంగణంలోకి ప్రవేశించిన నారాయణాస్త్రం, రకరకాల ఆయుధాల రూపంలో, వేల కొలది మహాగ్ని జ్వాలలతో, పాండవపక్షాన ఉన్న సైన్యాల పై విజృంభించసాగింది. దానిని కన్నెత్తి చూడలేని వారి సైన్యాలు, ఘోర ఆర్తనాదాలతో పరుగులు తీశాయి. ధర్మరాజు ఆందోళనకు అంతులేకుండా పోయింది. అప్పుడు శ్రీ కృష్ణుడు, యోధులందరినీ వాహనాల మీద నుంచి కిందకి దూకమనీ, ఆయుధాలు వదిలేసి తలలొంచుకుని నిలబడమనీ, సూచించాడు. శ్రీ కృష్ణ భగవానుడి ఆదేశానుసారం, అందరూ నిరాయుధులై, నారాయణాస్త్రాన్ని తప్పించుకున్నారు. వేల ఆయుధాల సమాహారమైన నారాయణాస్త్రాన్ని ఎదిరించడం, ఎవరి తరమూ కాదు. దాని నుండి తప్పించుకునే మార్గం, శరణాగతి చేయటం మాత్రమే. పైకి లొంగినట్లు కనిపించినా, మానసికంగా వేరే ఆలోచనలు ఉంటే ఈ అస్త్ర ప్రభావం తప్పించుకోవటం అసాధ్యం.
4. పాశుపతాస్త్రం:
ఈ అస్త్రం కలిగినవారు ఇద్దరు మాత్రమే పురాణేతిహాసాలలో మనకు కనిపిస్తారు. ఒకరు రావణుని పుత్రుడు మేఘనాధుడు, మరోకరు పాండవమధ్యముడు అర్జునుడు. ఈ పాశుపతాస్త్రం పొందడం కోసం, అర్జునుడు కుడికాలి బొటన వేలిపై నుంచుని, చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో, పరమేశ్వరుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని సైంధవుడి శిరస్సు అతడి తండ్రి చేతిలో పడేలా చేసేందుకు వాడాడని కథనం. More like a missile.
గత ఎపిసోడ్ లో చూసిన సూర్యాస్త్రము, భార్గవాస్త్రమూ దాదాపు ఒకటే. వైష్ణవాస్త్రం, నారాయణాస్త్రము.. కొన్ని మౌలిక భేదాలు ఉన్నవి. ఇవి కాక సమ్మోహనాస్త్రం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి వాడకం వలన బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇవి కాక అనేకరకాల మంత్రపూరితంగా ప్రయోగించ వలసిన అస్త్రాలు ఉన్నాయి. ఆ అస్త్రాలన్నీ శ్రీరాముడు దాదాపు ఎరిగి ఉన్నవే.
ఇక శ్రీరామావతారమే కాకుండా శ్రీకృష్ణావతారంలో కూడా శ్రీహరి తన ధనుర్విద్యా పాటవాన్ని ప్రదర్శించాడు. కానీ ఎక్కువగా సుదర్శన చక్ర ప్రయోగం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ తన పరతత్వ ప్రదర్శనమే ఎక్కువ. నారాయణుడి ప్రధానాయుధమైన సుదర్శన చక్రం.
78. మేధావీ – అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు. సర్వజ్ఞుడు.
సర్వ ధర్మాలు తెలసిన వాడు. ధర్మము అంటే సామాన్య ధర్మమే కాదు. విశేష ధర్మము కూడా. వాటికి తోడు ధర్మ సూక్ష్మములు కూడా. ధర్మము, ధర్మాచరణ చేయగలిగిన వారు చాలామంది ఉండేవారు. కానీ, ఈ ధర్మాచరణలో ఏర్పడిన ఆటంకాలకు లేదా ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు కావాలంటే ధర్మసూక్ష్మం తెలియాలి. Micro level management.
ఆ ధర్మ సూక్ష్మం ఒకటి మనకు వాలి ఉదంతంలో కనిపిస్తుంది. శ్రీరాముడంతటి వీరుడు ఒక వానరుడిని చెట్టు చాటు నుంచీ కొట్టటమా? దీని వల్లే శ్రీకృష్ణావతార పరిసమాప్తి కాలంలో కాలికి బాణం తగలటం అనే సంఘటన జరిగిందని అంటారు. కానీ అది సరైనది కాదు. వాలి విషయంలో అధర్మం జరుగలేదు. సూక్ష్మంగా చూస్తే అది ధర్మమే!
వాలి ఆక్షేపణలు
“రామా! ఎటువంటి పని చేసావు! ఇంకొకడితో యుద్ధం చేస్తూ కనీసం నీ వైపు తిరగకుండా ఉన్న నన్ను మరుగున ఉండి చంపావు. ఇది నీకు తగిన పనేనా?
యుద్ధం చేస్తున్న సమయంలో నువ్వు సుగ్రీవుడి పక్కన లేవు. కనీసం కనబడలేదు. అందువలన వేరొకరితో యుద్ధం చేస్తున్న నన్ను కొట్టవు అనుకున్నాను. కాని నీవు అధర్మానికే తెగబడ్డావు.
నవ్వు జటలు కట్టుకుని, వల్కలాలూ కృష్ణాజినం ధరించి సత్పురుషుడి వేషం వేసుకున్న పాపాత్ముడివని, నివురుగప్పిన నిప్పువనీ గ్రహించలేకపోయాను. సుక్షత్రియకులంలో పుట్టావు. శాస్త్రాభ్యాసం చేసి సంశయాలన్నీ తీర్చుకుని ధర్మచిహ్నాలు ధరించావు. ఇటువంటి క్రూరకర్మకు పూనుకోవడం నీకు తగునా?
గురువులవద్ద విన్న రాజధర్మం ఒక్కసారి గుర్తుచేసుకో. నిగ్రహం, అనుగ్రహం, నీతి, వినయం – వీటిని పాటించడం రాజధర్మం. వీటిలో ఒకదానితో ఒకటి సంకరం కాకూడదు. రాజు ఈ నియమాలకు లోబడి బ్రతకాలి. కానీ నీకు ఆ ధర్మం మీద గౌరవం లేదు.
రాజా! సామం, దానం, ఓర్పు, ధైర్యం, ధర్మం, సత్యం, పరాక్రమం, అపకారం చేసిన వాణ్ణి దండించడం – ఇవి రాజుకు ఉండవలసిన గుణములు. వీటిలో దేన్ని పాటించడానికి నన్ను చంపావో చెప్పగలవా?
నేను అరణ్యాలలో ఉండేవాడిని. నీ దేశంలోగాని, నీ నగరంలో గాని ప్రవేశించలేదు. నీ రాజ్యంలో ఏ అపరాధమూ చెయ్యలేదు. నన్ను శిక్షించే అర్హత నీకు లేదు.
నువ్వు నరుడివి. అందులో సుక్షత్రియ వంశంలో జన్మించిన వాడివి. రాజువు. నేనా వానరుణ్ణి. నేను అడవిలో దొరికే దుంపలూ, కాయలూ తింటాను. అది నీ ఆహారం కాదు. ఒకరికి కావలసిన ఆహారంగాని, ధనంగాని, వస్తువాహనాలుగాని ఇంకొకరి వద్ద ఉంటే, దానికి ఆశించి యుద్ధం చేస్తారు. నా తిండి వేరు. నీ తిండి వేరు. నా దేశం వేరు. నీ దేశం వేరు. నా వద్దనున్నది ఏది ఆశించి నన్ను చంపావు?
పోనీ వేటాడానని సమర్థించుకుంటావా? నా మాంసంగాని, చర్మంగాని, ఎముకలుగాని, గోళ్ళుగాని సత్పురుషులకు పనికి రావు. అందువలన నన్ను వేటాడకూడదు.
శీలవంతురాలైన స్త్రీకి దుష్ప్రవర్తనగల భర్త ఉన్నా ఆమె అనాథ వంటిదే. నేడు నువ్వు భూమికి భర్తవైనా నీ దుర్మార్గ ప్రవర్తన వలన యీ భూమి అనాథగానే ఉండిపోతుంది.
సుగ్రీవుడి నుంచి ఏది ఆశించి అతణ్ణి ఆశ్రయించావో, ఏది అశించి అతణ్ణి మెప్పించడానికి నన్ను చంపావో ఆ ప్రయోజనంకోసం నన్నే ఆశ్రయిస్తే అది యీ పాటికే సిద్ధించి ఉండేది.
రాజును చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, గోవును చంపినవాడు, దొంగ, నిష్కారణంగా ప్రాణులను చంపాలనుకునే వాడు, వేదం ప్రమాణం కాదనే నాస్తికుడు, వీరంతా నరకానికి పోతారు.
చాడీలు చెప్పేవాడు, లోభి, నమ్మిన మిత్రుణ్ణి చంపినవాడు, గురువు భార్యతో అక్రమసంబంధం ఉన్నవాడు వీరందరూ నరకానికి పోతారు.
నన్ను నిష్కారణంగా దొంగదెబ్బతీసి క్రూరంగా చంపావు. నువ్వూ నరకానికి పోతావు. నువ్వు చేసిన పని మంచిదే అని నువ్వు ఇంకా అనుకుంటుంటే నిన్ను నువ్వు ఎలా సమర్ధించుకుంటావో చెప్పు.”
అలా మాట్లాడుతూండగా వాలి రామబాణం దెబ్బకు క్రమంగా కాంతి తగ్గిన సూర్యుడిలా నీరంతా వర్షించిన మేఘంలా అయిపోయాడు.
శ్రీరాముడు ఏ ఉద్వేగమూ లేకుండా వాలికి సమాధానం చెప్పాడు.
వాల్మీకి మహర్షి రచించిన శ్రీరామాయణం కిష్కింధా కాండలో 16,17 సర్గలలో వాలి ఆక్షేపణలు, శ్రీరాముని సమాధానాలు కనిపిస్తాయి. ఇవి రెండూ కలిపి చదివితే రాముని ధర్మజ్ఞత అర్థమవుతుంది. దర్మసూక్ష్మమంటే అవగతమౌతుంది.
ధర్మసూక్ష్మాలు తెలిపే శ్రీరాముని సమాధానం
“వానరరాజా! ధర్మం గురించి సంశయం వస్తే పెద్దలను అడిగి తెలుసుకుని ఆపైన మాట్లాడాలి. ఇలా పరుషంగా మాట్లాడకూడదు.
సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది. విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టమైనది.
॥చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః, జాత్యస్ధ ఇవ జాత్యక్షైర్మన్తయన్ ప్రేక్షసే ను కిమ్॥
పుట్టుగుడ్డివాడు మరికొందరు పుట్టుగుడ్డివాళ్ళతో ఆలోచించి ఏం చూడగలడు? అలాగే చపలుడివైన నువ్వు మరి కొందరు చపలురితో ఆలోచించి ధర్మం గురించి ఏం తెలుసుకోగలవు?
ధర్మార్ధకామాల గురించి, లోకమర్యాదను గురించి తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఫలితం అనుభవించ వలసివస్తే నన్ను నిందిస్తున్నావు. నిన్ను చంపడం అధర్మమని వాపోతున్నావు. ఎందుకు చంపానో చెప్పమంటున్నావు..
నిన్ను చంపడం ధర్మమే. అది ఎలాగో విను.
నీ దేశం వేరు, నాదేశం వేరు అన్నావు. నా దేశంలో ఏ అపరాధమూ చెయ్య లేదన్నావు. కొండలతోనూ, మహాపర్వతాలతోనూ, మైదానాలతోనూ, చిట్టడవులతోను, ఘోరారణ్యాలతోనూ, జనపదాలతోనూ, నగరాలతోనూ కూడిన చతుస్సముద్ర పరివేష్టితమైన యీ భూమండలమంతా మహాపరాక్రమవంతులైన మా ఇక్ష్వాకువంశీయులదే. ఇదంతా మా రాజ్యమే. మనుష్యులను, మృగాలను, పక్షులను నిగ్రహించడం, అనుగ్రహించడం మా అధికారంలో ఉన్నాయి. నువ్వు మా రాజ్యంలోని అరణ్యంలో నివసిస్తున్నావు. మారాజ్యంలో అమలులో ఉన్న ధర్మాన్ని పాటించాలి.
ఈ రాజ్యంలో ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేలా పితృపితామహుల నుంచీ మేము కాపాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. తన రాజ్యంలో అధర్మం ఎక్కడా తలెత్తకూడదని భరతుడు ఆదేశించాడు. మేమే కాదు. అనేకమంది రాజులు భరతుడి ఆదేశానుసారం ధర్మపరిరక్షణ చేస్తున్నారు. మేమిద్దరమూ రాజాజ్ఞను పాటిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాము.
శ్రేష్ఠమైన మా ధర్మాన్ని మేము పాటిస్తూ భరతుడి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా ధర్మాతిక్రమణం చేసారా అని పరిశీలిస్తాం. అదీ మాకు తోచినట్లు కాదు. శాస్త్రానుసారంగా ధర్మవిచారణ చేస్తాం. ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్షిస్తాం. నువ్వు ధర్మాతిక్రమణం చేసావు. రాజదండనకు గురయ్యావు.
ధర్మమార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, అన్నగారు ఈ ముగ్గురూ తండ్రులే అని తెలుసుకోవాలి.
అలాగే కన్నకొడుకు, గుణవంతుడైన శిష్యుడు, తమ్ముడు ఈ ముగ్గురూ తనకుమారులే అని భావించాలి.
కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురుని గాని, తోడబుట్టిన సోదరినిగాని తమ్ముడి భార్యనుగాని పొందేవాడిని శిక్షించాలని శాస్త్రం చెప్తోంది. నువ్వు ధర్మమార్గం తప్పావు. మేము రాజాజ్ఞప్రకారం ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన నీకు ఈ శిక్ష విధించక తప్పదు. ఇది మా కర్తవ్యం.
ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే, అతడు నువ్వు చేస్తున్న పాపకార్యం గురించి నలుగురిమధ్య చెప్పాడు. అది విని నీకు మరణదండన అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రకారమే నిన్ను వధించాను.
ఒక సన్యాసి నువ్వు చేసిన పాపం వంటిదే చేస్తే, సన్యాసి కదా అని మా పూర్వుడైన మాంధాత చక్రవర్తి అతణ్ణి శిక్షించకుండా వదిలేసాడు. అతణ్ణి వదలినందుకు ఆ పాపం మాంధాతకు చుట్టుకుంది.
ఇక నిన్ను చాటుగా ఉండి చంపానన్నావు. వానరరాజ్యానికి రాజువైనా నువ్వు వానరుడివే. మానవులు జంతువులను వలలతోను, ఉచ్చులతోను, చిత్రమైన శబ్దాలు చేసి, ఇంకా అనేక కపట ఉపాయాలతోను బంధిస్తారు. ఇది తప్పు కాదు. రాజులైతే ఏకంగా మాటువేసి వేటాడుతారు. నువ్వు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా, మరొకడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే. నిన్ను చాటుగా ఉండి చంపవచ్చు.
జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు. అనేక తరాలుగా అనుసరిస్తున్న ధర్మమార్గంలో నియమంగా నడిచే నన్ను దూషించడం నీకు తగదు.”
రాముడి మాటతో వాలికి కనువిప్పు కలిగింది.
“రామా! నువ్వు చెప్పినదే సత్యం, ధర్మస్వరూపాన్ని ఇంత స్పష్టంగా నువ్వు తప్ప ఇంకొకరు తెలుసుకోలేరు. కార్యాకార్యాలను విశ్లేషించడంలో నీకు ఎవరూ సాటిరారు. కార్యం చేసినవారిని రక్షిస్తావు. అకార్యం చేసిన వారిని శిక్షిస్తావు.” అతడి గొంతు క్షీణించడం మొదలు పెట్టింది. వణుకుతున్న గొంతుకతో మెల్లగా రాముణ్ణి ప్రార్ధించాడు. చివరికి రామ పాదాలను ఆశ్రయించి తన ప్రాణాలను వదిలాడు.
ఇక్కడే కాదు, శ్రీరాముడు మేధావి అని చెప్పేందుకు, ఈ సన్నివేశాన్ని అనుసరించి వచ్చే తార శ్రీరామ తత్వాన్ని గ్రహించటం కూడా మరొక విశేషమైన వ్యాఖ్యానమే. దాని గురించి, త్రిమతాచార్యుల వ్యాఖ్యలు చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య