[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


మాధవమ్ మధుసూదనమ్-4
ఓమ్ ఇతి ఙ్ఞానమాత్రేణ రోగాజీర్ణ నిర్జితా।
కాల నిద్రాం ప్రపన్నోస్మి త్రాహి మాం మధుసూదన॥1॥
(శ్రీ శుక విరచిత మధుసూదన స్తోత్రం)
73. మాధవః – మా ధవః – శ్రీమహాలక్ష్మి (మా)కి భర్త. మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు. సకల విద్యా జ్ఞానములకు ప్రభువు. పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు. మధు (యాదవ) వంశమున పుట్టినవాడు. తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు). మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
74. మధుసూధనః – మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు. బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
శ్రీహరి యోగనిద్ర గురించి మనకు తెలిసిందే. అలా ఆయన యోగనిద్రలో ఉండగా, ఒకనాడు శ్రీహరి రెండు కర్ణస్రవం (గులిబి) నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ గారు ప్రత్యక్షం కాక తప్పలేదు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా ఇమ్మని బ్రహ్మను ప్రార్థించారు.
“పుట్టినవానికి మరణం తప్పదు. కనుక ఆ వరం ఇవ్వడం అసాధ్యం,” అని ఆయన చెప్పగా వారు, “అలా అయితే, మేము ఎపుడు మరణించాలని కోరుకుంటామో, అపుడే మాకు మరణం వచ్చేట్లుగా వరము అనుగ్రహించండి,” అని వారు పితామహుని ప్రార్థించారు. దానికి ఆయన ‘తథాస్తు’ అని దీవించి అంతర్థానం అయ్యాడు.
‘స్వచ్ఛంద మరణం’ అనే వరం పొంది యుక్తితో విజయం సాధించామని, తమకు మరణం కావాలని తామే కోరుకోవడం అసంభవం కనుక, తాము మృత్యువును జయించినట్లే అని విఱ్ఱవీగి, మధుకైటభులు మిగిలిన ఆయురారోగ్యాలతో ప్రవృత్తి ఉన్నవారి లాగానే విజృంభించి లోకాలను అల్లకల్లోలం చేయసాగారు. అన్ని లోకాలపై దండయాత్రలు చేస్తూ ఆ యా లోకాల వాసులను ఇబ్బంది పెట్టారు. సజ్జనులను బాధిస్తూ, లోకకంటకులై ప్రవర్తించారు.
ఒకనాడు మదుకైటభులు బ్రహ్మ గారి మీదే దండెత్తారు. ప్రళయకాలంలో అంతా జలమయం కాగా, మహావిష్ణువు నాభికమలం నుండి ఆవిర్భవించిన బ్రహ్మను సమీపించి (అంటే ఎంతకాలం వారి పీడన సాగిందో గమనించాలి), వరగర్వంతో మధుకైటభులు “బ్రహ్మదేవా! చేతనైతే మాతో యుద్ధం చెయ్యి, లేకపోతే, నీ ఓటమిని అంగీకరించి, మాకు లొంగిపో, ఈ పద్మాన్ని విడచి పారిపో” అని హెచ్చరించారు.
వారితో పోరాడలేని బ్రహ్మ, పద్మనాళంలో దూరి, ఐదువేల సంవత్సరాలు ప్రయాణం చేసి, శ్రీమహావిష్ణువును చేరుకున్నాడు. యోగనిద్రలో ఉన్న శ్రీమహవిష్ణువును చూచి, నిద్రాదేవిని పరిపరి విధాల ప్రార్థించాడు. శ్రీమన్నారాయణునికి మెలకువ వచ్చింది. కన్నులు తెరచిన విష్ణువు సంగతి తెలుసుకునే లోగానే మధుకైటభులు బ్రహ్మను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు.
“మీరిద్దరూ మాతో యుద్ధం చేయండి!” అని బ్రహ్మ, విష్ణువులను ఒత్తిడి చేశారు.
విష్ణువు మధుకైటభులతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు ఆలసట తీర్చుకుంటూ వంతులు వారీగా యుద్ధం చేయసాగారు. ఎన్నాళ్ళు యుద్ధం జరిగినా, విష్ణువు ఆ రాక్షసులను జయించలేకపోయాడు. వారు సామాన్యులు కారని, తనతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా బ్రతికినవారు ఏ వరం అండగా విజృంభించారో గ్రహించాడు. తన యోగమాయను వారిపై ప్రసరింపజేశాడు.
“నా వల్ల (గత బ్రహ్మ గారు) స్వచ్చంద మరణాన్ని వరంగా పొందారు తండ్రీ తమంతట తాము మరణిచాలని వారు కోరుకుంటే గాని, వారికి మరణం రాదు. కనుక, నీవు వారిని యుధ్దానికి ఆహ్వానించు. అంతకు మించి వేరు మార్గము లేదు,” అని బ్రహ్మగారు చెప్పారు.
లీలామానుషవిగ్రహుడైన పరమాత్మ చిరునవ్వు నవ్వి, “వారి సంగతి నేను చూస్తాను,” అని బ్రహ్మ గారితో అన్నాడు.
“మీ పరాక్రమానికి మెచ్చాను. మీకొక వరం ఇస్తాను. కోరుకోండి,” అంటూ వారిని యోగమాయా పరవశులను చేశాడు.
వరగర్వంతో ఆ రాక్షసులు విష్ణువును హేళన చేశారు. “మా చేతిలో ఓటమిని పొందిన నువ్వు మాకు వరమిచ్చే దేమిటి? మేమే నీకొక వరాన్ని అనుగ్రహిస్తాం. కోరుకో!” అని అహంకరించారు
అందుకోసమే చూస్తున్న అచ్యుతుడు, “అలా అయితే, నా చేతిలో మీరిద్దరూ మరణించేట్లుగా వరమివ్వండి,” అని అడిగాడు.
అప్పుడు మధుకైటభులు తమ తొందరపాటుకు చింతించినా, ‘సరే!’ అనక తప్పలేదు. “అలాగే నీ చేతిలో మరణిస్తాం. వరమిస్తున్నాం కాని, ఈ సముద్ర జలంపై యుద్ధం ఎలా సాగుతుంది? ఎక్కడైనా భూమిని చూపించు. భూమిపై యుద్ధం చేసి మమ్ములను సంహరించు,” అన్నారు. ఈ వంకతో తప్పించుకుందామని వాళ్ళ దురాలోచన.
అపుడు విష్ణువు తన తొడను పెంచి, సముద్రజలంపై విస్తరింప చేసి, తన ఊరువునే భూమిగా వారిని భ్రమింపచేసి (ఊసులు నుంచీ భూమిని సృష్టించాడు ఇంకొక కథనం), మధుకైటభులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు.
మధుకైటభుల శరీరాలలోని మేదస్సు ఆ ప్రదేశమంతా వ్యాపించడం వల్ల “మేదిని” అని, విష్ణువు ఊరుభాగం చేత పరివ్యాప్తమైనందువల్ల “ఉర్వి” అని భూమికి పేర్లు వచ్చాయి. రాక్షసుల రక్తమాంసాదులతో నిండినందువల్ల భూమికి ఆనాటి నుండి “అభక్ష్య” అనే పేరు కూడా వచ్చింది.
పితామహుని ద్వారా స్వచ్ఛంద మరణం వరంగా పొంది కూడా, సత్ర్పవర్తన లేక, వరబల గర్వితులై దురాగతాలు చేసి లోకకంటకులైన మధుకైటభులు అహంకారముతో విఱ్ఱవీగి, తమ మరణాన్ని తామే కోరితెచ్చుకున్న వారయ్యారు.
సర్వజగద్రక్షుకుడైన విష్ణువునకు కూడా అలసట కలగడం, ఆ ఇద్దరు రాక్షసులనూ వధించ లేకపోవడం ఆయన చూపిన లీలావిలాసం తప్ప వేఱు కాదని గ్రహించాలి.
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః।
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్॥
75. ఈశ్వరః – సర్వులనూ పాలించి పోషించువాడు. అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండా, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
76. విక్రమీ – విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు. అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
77. ధన్వీ – (శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
78. మేధావీ – అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు. సర్వజ్ఞుడు.
79. విక్రమః – బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి). పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
80. క్రమః – సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ – పద్ధతి). సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ – కదలిక). అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ – సంపత్తు). సంసార సాగరమును దాటించువాడు (క్రమణ – ఈదుట).
81. అనుత్తమః – అంతకంటే ఉత్తమమైనది మరొకటి లేదు.
82. దురాధర్షః – తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
83. కృతజ్ఞః – నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తుల ననుగ్రహించువాడు. పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్థ మోక్షములను ప్రసాదించువాడు. సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
84. కృతిః – తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
85. ఆత్మవాన్ – సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు. తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
ఈ ఈశ్వరః అన్న నామమునకు అనేకానేక విశేషార్థాలు ఉన్నాయి. వాటిని తెలుసుకునే ముందు మధుసూదన అన్న నామమునకు ఉన్న కొన్ని ప్రామాణిక అర్థాలను అవగతం చేసుకోవాలి. చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య