[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
సర్వశ్రేష్ఠః-2
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశమ్।
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥1॥
ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవమ్।
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥2॥
కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగమ్।
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥3॥
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యమ్।
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥4॥
మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగమ్।
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥5॥
తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపమ్।
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహమ్॥6॥
(శ్రీ అహోబల నృసింహ స్తోత్రమ్)
జీవం పుట్టుక, పెరుగుదల, మరణం అన్నవి జీవరసాయన చర్యల ఫలితమా?
అవును అంటే అవును. కాదు అన్నా అవును అనే చెప్పాలి. కానీ, ఈ జీవరసాయన చర్యలకు మూలకారణం వెతకాలి. అవి పరమాణువుల ద్వారా జరిగేవి కదా?
పరమాణువులు రసాయన చర్యల్లో పాల్గొనగలగటానికి ప్రధాన కారణం ఎలక్ట్రాన్లు. ఆ ఎలక్ట్రాన్లయినా, ఇతర పరమాణు ప్రాథమిక కణాలైనా అవి అవిచ్ఛిన్నం కాదు. వాటి వెనుక ఉన్నది గతంలోనే చూసి ఉన్నాము. ఎంత వెతికినా, ఎంత శోధించినా, ఎక్కడో ఒకచోట మానవ మేధకు హద్దు ఎదురౌతూనే ఉంటుంది. ఆ హద్దో, గతంలో చెప్పుకున్న నియంత్రణలో లేనిదే ఎన్నో లెక్కలు తేలక వాటిని వదిలేసి indeterminate forms అని వదిలేశారు. అలాగే అవాయు జీవుల గురించి శాస్త్రాలలో ఏమి చెప్పారు అనేది కూడా పరిశీలించాల్సిన విషయం. ముందు ముందు చూడాలి.
67.ప్రాణః — ప్రాణ స్వరూపుడు. జీవనము. చైతన్యము.
ఈ జీవ చైతన్యము అనే దాని గురించి పరిశోధనలు కొన్ని జరిగాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాము.
నిజానికి జీవితమంటే ఏమిటి?
మనిషి తల్లి గర్భంలో జీవం పోసుకుని, తొమ్మిది నెలల ప్రయాస తరువాత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి, చిన్న పిల్లవాడిగా, బాలుడిగా, యువకుడిగా, మధ్యవయస్కుడిగా (ప్రౌఢ), వృద్ధుడిగా రూపాంతరం చెంది మరణం వరకూ అనేకానేక అనుభవాలను, సంఘటనలనూ అనుభవిస్తూ చివరకు మరణాన్ని కౌగిలించుకోవటం.
మనిషి చనిపోవటమనే ప్రక్రియను తీసుకుంటే జీవం అనే ప్రక్రియను నిర్ధారించవచ్చు. జీవానికి మూలం శక్తి. మరణం జీవశక్తిని కోల్పోపోయినప్పుడు సంభవించే మరొక పరిణామం. శ్వాస తీసుకోవటం ద్వారా, తినటం ద్వారా, వీటిని త్రాగటం ద్వారా మనిషి తన జీవక్రియలను కొనసాగించగలుగుతూ, శక్తిని రూపాంతరం చెందిస్తూ తన ఉనికికి కారణమైన జీవాన్ని, అభివృద్ధి చేసుకుంటున్నాడు.
భౌతిక శాస్త్రవేత్త అయిన ష్రోడింగర్ పై విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ వ్యయాలను గమనించాడు. పరిసరాల నుంచీ శక్తిని ఒక వివిక్త వ్యవస్తకు (isolated system) అందనట్లయితే కొంతసేపటి తరువాత స్థానచలనము ఆగిపోతుంది. ఈ స్థితినే మనం ఈక్విలిబ్రియమ్ (సమతుల్య స్థితి) అంటాము. నిజానికి ఒక బ్రతికి ఉన్న జీవి ఈ డిజార్డర్ లేదా అచేతన స్థితిని ఎలా తప్పించుకుంటుంది? అదే మనమింతకు మునుపు చెప్పుకుమ్నట్లు జీవ క్రియ అనే శక్తి రూపాంతర ప్రక్రియ ద్వారా ఇది సాధ్యమవుతుంది. తన పరిసరాల నుంచీ శక్తిని గ్రహించటం ద్వారా ఒక క్రమానుగత జీవక్రియలను పోగుచేసుకుని (ప్రోది చేసుకుని) జీవం అనేది మనుగడలో ఉంటుంది. ష్రోడింగర్ ఈ ప్రక్రియను మరికాస్త ముందుకు తీసుకుని వెళుతూ జీవికి తన శక్తి క్షీణతను తప్పించుకుంటూ జీవాన్ని నిర్మించుకునే స్థితి జీవులలో ఒక సంక్లిష్ట, సమస్యాత్మక విధానంగా అగుపిస్తుంది.
ఒక అభౌతిక, అధిప్రాకృతిక శక్తి ఆ బ్రతికున్న జీవికి ఆపాదించబడి జీవాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. దీన్నే మన ద్రష్టలు ఆత్మగా గుర్తించారు. క్వాంటమ్ అనగా కణ మరియు తరంగాలు ఏకకాలంలో ఉనికిలో ఉండటం. ఇంతకుముందు కణము అంటే పదార్థంగా, తరంగమంటే శక్తిగా శాస్త్రవేత్తలు వర్ణించారు. కానీ ఇప్పుడు కణము అనే దానికి పూర్తి అర్థాలు మారిపోయాయి. ఆధునిక శాస్త్రవిఙ్ఞానం ప్రకారం ఈ విశ్వమంతా శక్తితోటి విస్తరించి ఉంది.
మనం చూస్తున్న ఘన పదార్థంలో ఎలక్ట్రాన్స్ అత్యంత వేగంతో పరిభ్రమించటం వల్ల ఆ వస్తువు స్థిర పదార్థమై ఉంటుంది. నిజానికి ఈ సృష్టిలో స్థిరంగా ఉన్న వస్తువంటూ ఏమీ లేదు. అత్యంత సూక్ష్మంగా గమనించినట్లయితే దానిలో ఉన్న కణాల పరిభ్రమణ వేగం మన మెదడు ఆ ఖాళీ సముదాయాన్ని గ్రహించటానికి తీసుకునే సమయం కంటే ఎక్కువ అవటం వల్ల అది పదార్థంగా మనకి అనిపిస్తుంది. నిజానికది శక్తి తరంగాల యొక్క ప్రవాహమే. దీనినిబట్టీ జీవి మరియు జీవానికి మూలమంతా అత్యంత సూక్ష్మ స్థాయిలో శక్తిగానే గ్రహించవలసి ఉంటుంది. అందుకే Life is energy.
ఉపనిషత్తులలోని ఒక అద్భుతమైన కథ (దీనిని మనం చాలాసార్లు, చాలా రూపాల్లో చూసే ఉంటాము) జీవశక్తి గురించి వర్ణిస్తుంది. మానవ శరీరంలోని అవయవాలు అన్నిటి మధ్య ఒకరోజు ఎవరు గొప్ప అనే విషయం మీద వాగ్వివాదం జరిగింది. గుండె, ఊపిరితత్తులు, కాలేయం, ప్రేవులు… మేమంటే మేము గొప్పని వాదించుకోసాగాయి. ఈ తతంగమంతా చూస్తున్న ప్రాణం మెల్లిగా జారుకోసాగింది. ప్రాణం జారిపోతున్న కొద్దీ తమ పనితీరు నెమ్మదించటం గమనించిన అవయవాలన్నీ, ప్రాణం యొక్క గొప్పతనాన్ని గుర్తించి మాకందరికన్నా నువ్వే గొప్ప అని అంగీకరించాయి.
పై కథలో ప్రాణం అనేది ఒక జీవశక్తిగా ఉండి శరీరంలోని సమస్త అవయవాలను, నాడులను నియంత్రిస్తుంది. మన ప్రాచీన ఋషులు ప్రాణాన్ని ఒక శక్తిగానే గుర్తించారు. కానీ, అది భావనాత్మకత కలిగి ఉండదు. అందువల్ల అది రూపం మార్చుకొనలేదు.
మనస్సు శరీర అంతర్గత అవయవాలను, మరియు ప్రాణశక్తిని నియంత్రించేదిగా ఉంటుంది. మనస్సు ద్వారా కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, కోరిక, సంకల్పం, అనుమానం, విశ్వాసం, చంచలత్వం, సిగ్గు, వివేకం, భయం ఇవన్నీ మనస్సు నుంచి జనిస్తున్నవే.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దానిని పరిశీలిస్తే..
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్॥6.6॥
మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.
పశ్చిమ దేశాల తత్వంలో మనస్సు అనేది మెదడు చేత నియంత్రించబడుతుంది. మెదడులోని న్యూరాన్ల కదలికలననుసరించి ఆలోచనలు రూపుదిద్దుకుంటాయని పాశ్చాత్య తత్వవేత్తలు వాదిస్తారు (వాదించారు). భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మెదడు అనేది ఒక కేజీన్నర బరువు ఉన్న పదార్థంగా పరిగణించబడుతుంది.
మనస్సు అనేది ప్రాథమిక ప్రేరణగా ఉంటూ మెదడులోని సూక్ష్మాతి సూక్ష్మమైన కణాల కదలికలకు కారణమౌతుంది. భారతీయ తత్వంలో మనసును కూడా భౌతిక జగత్తుకు చెందిన పదార్థంగా పరిగణిస్తాం. కానీ, ఇది ఘన స్థితిగా కాక సూక్ష్మశక్తిగా అర్థం చేసుకోబడుతుంది. శరీరం ఘన స్థితిలో, మనసు సూక్ష్మ స్థితిలో భిన్నంగా వ్యక్తమౌతూ వీటికతీతంగా శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది.
మనస్సు మరియు ప్రాణశక్తీ రెండు కూడా శుద్ధ చైతన్యం యొక్క రూపాంతరాలే. మనస్సు తానని తాను శుద్ధ చైతన్యని మామూలు ఆలోచనా స్థితులలో గుర్తించలేదు. చైతన్యం ఇతర వస్తువులతో, విషయాలతో సంపర్కం చెందినప్పుడు మాత్రమే అది గమనంలో (మనుగడలో) ఉంటుంది.
మానసిక వృత్తులన్నీ అంతకించిపోయినప్పుడు ఒక చైతన్యం మాత్రమే మనుగడలో ఉంటుంది. ఈ స్థితిలో మనస్సు మాయమౌతుంది. మేఘాలు తొలగినప్పుడు సూర్యునిలా, మనస్సు మాయమైనప్పుడు సంపూర్ణ సత్యం అవగతమౌతుంది. దీనిని అంతర్గత ధ్యానం ద్వారా అనుభూతి చెందుతాం.
మనసు బాహ్య విషయాలతో సంపర్కం చెందుతూ వృత్తులలో మునిగనంత కాలం ఈ సత్యం మనసుకు అందని ద్రాక్షగానే ఉంటుంది. ఈ శుద్ధ చైతన్య స్థితిలోవిభజన రేఖలన్నీ మాయమైపోతాయి. కాబట్టి ఇది ప్రయోగశాలలో నిరూపించటం సాధ్యం కాదు. కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం.
కంప్యూటర్నే ఉదాహరణగా తీసుకుంటే అది మనిషి మెదడుకన్నా ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. కానీ దానిని మనిషే ప్రోగ్రామ్ చేయాలి. అప్పుడు మాత్రమే దాని వల్ల ఏదైనా ఉపయోగం. కంప్యూటర్లో హార్డువేర్ లాగానే మన స్థూల శరీరం అనుకుంటే సాఫ్టువేరు మన మనసు బుద్ధి. కంప్యూటర్లో ఉండే Cache మన నమ్మకాలు, వాసనలు.
వీటన్నిటికీ అతీతంగా ఉంచిన ఆత్మ విషయం పూర్తిగా మరొక స్థాయి. ఇది మానవ చేతనకు గమ్యస్థానం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఉన్న అభిప్రాయాలన్నీ క్వాంటమ్ థీరీ సమూలంగా మార్చి, తూర్పు దేశాల తత్వాన్ని శాస్త్రీయమని అంగీకరించటానికి దోహద పడింది.
ప్రాణం అనేది శరీరాన్ని జీవనంలో ఉంచటానికి అవసరం. ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయటానికి బేటరీ ఎంత అవసరమో, శకీరానికి ప్రాణం కూడా. అదే విధంగా బేటరీ అనేది ఆలోచించలేదు. అలాగే ప్రాణం కూడా. అందుకని మనసు ప్రాణానికి మార్గ నిర్దేశం చేస్తుంది. వాస్తవానికి మనసు కూడా స్వయం ప్రకాశకం కాదు. మనలోని చైతన్యం యొక్క మార్గనిర్దేశకత్వంలో పనిచేస్తుంది. ఏదైతే మార్పును పొందదో అదే శుద్ధ చైతన్యం. విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులన్నిటినీ నడిపించే రహస్య శక్తి ఇదే. ఇదే మన యొక్క నిజ స్వరూపం.
68. జ్యేష్ఠః — పూర్వులకంటే, వారి పూర్వులకంటే, పెద్దవాడు. తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
ఆండాళ్ చెప్పిన పెరియాయ్ కూడా.
జ్యేష్ఠ శ్రేష్ఠః అని రెండిటిని కలిపి సత్యసంధ తీర్థులవారు ద్వైత వ్యాఖ్యానంలో తీసుకున్నారు.
॥గుణైః కాలేని వా వృద్ధతమః, ప్రశస్యతమః॥ – గుణములచేత, కాలము చేత మిక్కిలిగా వృద్ధడైన వాడు. ప్రశంసింపదగిన వారిలో శ్రేష్ఠుడు.
అనేక బ్రహ్మలకు ఆయన తండ్రి. అనేకానేక జీవులకు ఆయన తల్లి, తండ్రి. ఆ విశ్వశక్తి పితామహుడని పిలువబడే బ్రహ్మగారికన్నా అత్యంత ప్రాచీనుడై వెలుగొందుతున్నాడు. వృద్ధః అన్న దానిని వార్థక్యానికి ప్రతీకగా తీసుకోరాదు. అత్యంత ప్రాచీన అనే అర్థం కొంత వరకూ పొసగుతుంది. కానీ, ఆయన అనాది. ఆది.
అంతూపొంతూ అంతుబట్టనివాడు. అలాంటి వాడి నుంచీ అన్నీ వచ్చాయి. కనుక ఆయన జ్యేష్ఠః. కచ్చితంగా ఆయన నుంచీ వచ్చినవి శ్రేష్ఠమయినవే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ కార్యములు ఇంతకాలం నిరవధికంగా సాగుతూనే ఉన్నాయి. కనుక ఆయన, ఆయన సృష్టి శ్రేష్ఠమైనవి.
ఇదే విషయాన్ని దాదాపు ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్పారు.
ఈ వరుసలో వచ్చే మూడు నామములను కూడా వివరంగా పరిశీలించాలి.
పరాశర భట్టర్ ఏమని చెప్పారో చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య